
సర్కారు టీచర్.. ప్రైవేట్కు ప్రచారం
- సొంత పాఠశాల ఫ్లెక్సీలు కడుతూ దొరికిన సారు
- బడిబాట ప్రారంభం రోజే నిర్వాకం
సిరిసిల్ల రూరల్: ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించాలని కోరాల్సింది పోయి తనకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలకు ప్రచారం నిర్వహిస్తున్నాడు. అదీ కూడా ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ముష్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ భగవాన్కు సిరిసిల్లలో ఒక ప్రైవేట్ పాఠశాల ఉంది. తన భార్యను కరస్పాం డెంట్గా పేర్కొంటూ మొత్తం వ్యవహారాన్ని తానే నడిపిస్తుంటాడు.
ముష్టిపల్లి, రాజీవ్నగర్లోని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు రావాలని శనివారం ప్రచారం నిర్వహి స్తూ గ్రామంలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా గ్రామస్తులు సెల్ఫోన్లో ఫొటోలు తీశారు. దీంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు. కృష్ణభగవాన్ను వెంటనే సస్పెండ్ చేయాలని సర్పంచ్ గొల్లపల్లి బాలగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు బుర్ర మల్లికార్జున్, విద్యా కమిటీ చైర్పర్సన్ లావణ్య తది తరులు ఎంఈవో రామచందర్రావుకు ఫొటోలను జతపరిచి ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయునికి ఎంఈవో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఉపాధ్యాయుని తీరుపై నివేదిక అందించాలని డీఈవో ఆదేశించారు. ఈ విషయంపై కృష్ణభగవాన్ను ‘సాక్షి’ సంప్రదించగా, తాను ప్రచారం నిర్వహించలేదని, వార్తా రాయొద్దని కోరడం కొసమెరుపు.