
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసులో, తనను పుణేకు తరలించేందుకు హైదరాబాద్లోని కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ విరసం వ్యవస్థాపకుల్లో ఒకరైన వరవరరావు హైకోర్టును ఆశ్రయించారు.
తనను పుణేకు తరలించేందుకు హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీచేసిన ట్రాన్సిట్ ఉత్తర్వుల్ని కొట్టివేయాలని వరవరరావు తన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్రావు విచారించి ప్రతివాదులైన మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న తనకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుల్ని అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల్ని చికిత్సకోసం పంపాలని తెలంగాణ రాష్ట్ర పోలీసుల్ని ఆదేశించారు. విచారణ ఈనెల 26కి వాయిదా పడింది.