Varavara Rao
-
హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్. వేణుగోపాల్తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్నగర్లోని ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు ఎల్బీ నగర్ శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును గతేడాది సెప్టెంబర్ 15న కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేసియా టౌన్షిప్లో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ దీపక్రావుతో ఎన్. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో వేణుగోపాల్ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘాల ఖండన వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ మన్సూరాబాద్: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్.వేణుగోపాల్ ఎన్ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్ ఫోన్ను సీజ్ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
వరవరరావు హైదరాబాద్కు వెళ్లొచ్చు
ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల తో సంబంధాల కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటికొచ్చిన విప్లవకవి వరవరరావు హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మంజూరుచేసింది. ఎడమ కంటికి చికిత్స నిమిత్తం డిసెంబర్ 5–11 తేదీల మధ్య హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం జడ్జి రాజేశ్ కటారియా ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్కు వెళ్లాక ఎక్కడ ఉండేది, చిరునామా, ఫోన్ నంబర్, షెడ్యూల్ తదితర సమగ్ర వివరాలను ముందుగానే ముంబైలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణ అనుమతిని దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. -
విప్లవాగ్ని జ్వలితుడు
తలవంచని విప్లవ కవిగా, పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్నారు వరవరరావు! 1957–2017 మధ్య కాలంలో ఆయన రాసిన సుమారు 50 కవితలను పెంగ్విన్ రాండమ్ హౌస్ ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించింది. ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం’ వైపు పయనిస్తున్న ‘వరవర’కు తగిన గౌరవం. ‘‘లోకంలో మేధావులనుకుంటున్నవారు సహితం పిరికిపందలుగా ఉంటారు. అలాంటి పిరికి పందలకన్నా మనోధైర్యంతో, దమ్ములతో బతకనేర్వడం అతి అరుదైన లక్షణంగా భావించాలి.’’ – ‘వికీలీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రపంచ దేశాలపై అమెరికా నిరంతర కుట్రలను బహిర్గతం చేసినందుకు జీవిత మంతా కష్టాలను కాచి వడబోస్తున్న మహాసంపాదకుడు, ప్రపంచ పాత్రికేయ సింహం... జూలియన్ అసాంజ్. అలాంటి ఒక అరుదైన సింహంగా, తలవంచని విప్లవ కవిగా ఈ క్షణం దాకా పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్న కవి వరవరరావు! దఫదఫాలుగా దశాబ్దాలకు మించిన జైళ్ల జీవితంలో ఆయనను (1973లో తొలి అరెస్టు మొదలు) 25 కేసులలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇబ్బందులు పెట్టారు. అలాంటి విప్లవకవి వరవరరావు తెలుగులో 1957–2017 మధ్య కాలంలో రాసిన సుమారు 50 కవితలను ఎంపిక చేసి... కవి, సాహితీ విమర్శకులు, మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమాలకు నిరంతరం చేయూతనందిస్తున్న పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్, నవలాకారిణి, కవయిత్రి మీనా కందసామి ఇండియాలోని సుప్రసిద్ధ పెంగ్విన్ రాండమ్ హౌస్ కోరికపై అందజేసిన గ్రంథమే ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’! సర్వత్రా ‘సామ్యవాద రంకె’ వినిపించిన వరవరరావు 1972 లోనే: ‘దోపిడీకి మతం లేదు, దోపిడీకి కులం లేదు దోపిడీకి భాష లేదు, దోపిడీకి జాతి లేదు దోపిడీకి దేశం లేదు తిరుగుబాటుకూ, విప్లవానికీ సరిహద్దులు లేవు’ అని చాటుతూనే, తనను శత్రువు కలమూ, కాగితమూ ఎందుకు బంధించాయో తెగేసి చెప్తాడు: ‘ప్రజలను సాయుధులను కమ్మన్నందుకు గాదు/ నేనింకా సాయుధుణ్ణి కానందుకు’ అన్నప్పుడు జూలియన్ అసాంజ్ చేసిన హెచ్చరికే జ్ఞాపకం వస్తుంది. అంతేగాదు, ‘వెనక్కి కాదు, ముందుకే’ అన్న కవితలో ‘వరవర’: ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం దాకా పయనించే ఈ కత్తుల వంతెన మీద ఎంత దూరం నడిచి వచ్చావు – ఇంకెంత దూరమైనా ముందుకే సాగు’ గాని వెనకడుగు వెయ్యొద్దని ఉద్బోధిస్తాడు! ధనస్వామ్య రక్షకులైన పాలకుల దృష్టిలో ‘ప్రజాస్వా మ్యా’నికి అర్థం లేదని– ‘పార్లమెంటు పులి కూడ /పంజాతోనే పాలిస్తూ సోషలిజం వల్లించుతూనే / ప్రజా రక్తాన్ని తాగేస్తుంద’నీ నాగుబాము పరిపాలనలో / ప్రజల సొమ్ము పుట్ట పాల’వుతున్న చోటు – ‘జలగల్ని పీకేయందే – శాంతి లేదు/ క్రాంతి రాద’ని నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. ‘జీవశక్తి’ అంటే ఏమిటో కవితాత్మకంగా మరో చోట ఇలా స్పష్టం చేస్తాడు: ‘అన్ని రోజులూ కన్నీళ్లవి కావు / అయినా ఆనంద తీరాలు ఎప్పుడూ తెలియకుండా / దుఃఖం లోతెట్లా తెలుస్తుంది? ఆ రోజులూ వస్తాయి / కన్నీళ్లు ఇంద్రధనుస్సులవుతాయి నెత్తురు వెలుగవుతుంది / జ్ఞాపకం చరిత్ర అవుతుంది బాధ ప్రజల గాథ అవుతుంది!’ జైలు జీవితానుభవాన్ని సుదీర్ఘ అనుభవం మీద ఎలా చెప్పాడో! ‘జైలు జీవితమూ అంగ వైకల్యం లాంటిదే నీ కంటితో ఈ ప్రపంచాన్ని చూడలేవు నీ చెవితో వినలేవు, నీ చేయితో స్పృశించలేవు నీ ప్రపంచంలోకి నువ్వు నడవలేవు నీవుగా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు ఎందుకంటే – అనుభూతి సముద్రం పేగు తెగిన అల ఇక్కడ హృదయం!’ ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రజా కార్యకర్తలపైన, పౌరహక్కుల నాయకులపైన యథాతథంగా హింసాకాండ అమలు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా, అనేక రకాలుగా వికలాంగుడైన ప్రజా కార్యకార్త ప్రొఫెసర్ సాయిబాబానే కార్పొరేట్ శక్తుల కన్నా ప్రమాదకరం అన్నట్టుగా పాలకులు వ్యవహ రించడం ఏమాత్రం క్షంతవ్యం గాదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఏఐ కోర్టును అడగండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షరతులతో కూడిన మెడికల్ బెయిల్పై విడుదలైన విప్లవ రచయిత వరవరరావు హైదరాబాద్కు వెళ్లాలంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం కోర్టు విచారించింది. వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు -
విరసం నేత వరవరరావుకు సాధారణ బెయిల్
-
నేడు వరవరరావు పిటిషన్పై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్–ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వడానికి బోంబే హైకోర్టు ఏప్రిల్ 13న నిరాకరించింది. ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ విచారిస్తుంది. 83 ఏళ్ల వయసున్న వరవరరావు నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్నారు. -
Varavara Rao: శాశ్వత బెయిల్పై సుప్రీంకు వరవరరావు
సాక్షి, న్యూఢిల్లీ: బీమా కోరేగావ్ కేసులో నిందితుడు వరవరరావు శాశ్వత బెయిల్ పిటిషన్పై ఈ నెల 11న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రస్తుతం మెడికల్ బెయిల్పై ఉన్న వరవరరావు.. శాశ్వత బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను ఏప్రిల్ 13న బాంబే హైకోర్టు తిరస్కరించింది. విచారణ సమయంలో.. హైదరాబాద్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్నూ తోసిపుచ్చింది. అయితే.. మూడు నెలల పాటు మెడికల్ బెయిల్ పొడిగించింది. ఈ తరుణంలో బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాల వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్మనెంట్ బెయిల్ ఇవ్వలేం
ముంబై: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో తనకు పర్మనెంట్ మెడికల్ బెయిల్ ఇవ్వాలన్న హక్కుల నేత వరవరరావు (83) విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి తాత్కాలిక మెడికల్ బెయిల్పై ఉన్న ఆయన దాన్ని మరో ఆర్నెల్ల పాటు పొడిగించాలని, ముంబైలో కాకుండా హైదరాబాద్లో ఉండేందుకు అనుమతించాలని, విచారణ పూర్తయేదాకా పర్మనెంట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ ఎస్బీ శుక్రే, జీఏ సనప్లతో కూడిన బెంచ్ పేర్కొంది. అయితే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునేందుకు వీలుగా బెయిల్ను మూడు నెలలు పొడిగించింది. వీవీలో పార్కిన్సన్ లక్షణాలు కన్పిస్తున్నాయని ఆయన తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన్ను ఉంచిన తలోజా జైల్లో వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సదుపాయాలపై ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖ ఐజీని ఆదేశించింది. -
సుధా భరద్వాజ్.. జైలు నుంచి విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్(60) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. మూడేళ్లకు పైగా ఆమె జైలు జీవితం గడిపిన ఆమెకు బాంబే హైకోర్టు డిసెంబర్ 1న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కండీషన్తో పాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ అప్పీల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, రూ. 50 వేల పూచీకత్తుతో సుధా భరద్వాజ్ను విడుదల చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. (Nagaland Firing: డ్రెస్ మార్చి, మృతదేహాల దగ్గర ఆయుధాలు పెట్టబోయారు) -
వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో లింకు కేసులో మధ్యంతర బె యిల్పై ఉన్న విప్లవ కవి వరవరరావు(82)కు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నవంబర్ 18వ తేదీ వరకు తలోజా జైలు అధికారులకు ఆయన లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వరవరరావు వేసిన పిటిషన్పై విచారణను వచ్చే నెలకు వా యిదా వేసింది. అనారోగ్య కారణాలతో తలోజా జైలులో ఉన్న వరవరరావుకు బాంబే హైకో ర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది. బెయిల్ను పొడిగించాలంటూ ఆయన వేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్పై ఉండగానే హైదరాబాద్ వెళ్లాలన్న వినతిపై వేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. -
వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరవరరావు తన బెయిల్ను పొడగించాలని విజ్ఞప్తి చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు శుక్రవారం ఈ పిటిషన్ను విచారించింది. ఈ క్రమంలో వరవరరావు బెయిల్ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా వరవరరావు కోర్టు తనకు ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని.. ఫలితంగా తాను కుంటుంబానికి దూరంగా ఉంటున్నానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 84 ఏళ్ల వయసులో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్ట్ విధించిన ఏ ఒక్క షరతును తాను ఉల్లంగించలేదని వరవరరావు కోర్టుకు తెలిపారు. (చదవండి: ఒకరి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే) ముంబై హాస్పిటల్స్లో చికిత్స చేయించుకోవాలంటే తన లాంటి వారికి చాలా కష్టం అవుతుందన్నారు. తన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే తన కుటుంబం దగ్గరికి వెల్లేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వరవరరావు వాదనలు విన్న కోర్టు ఈ నెల 25న ఆయనను సరెండర్ కావాలని ఆదేశించింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు గత 4 సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నారు. చదవండి: భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు! -
వరవరరావు బెయిల్ పొడిగింపుపై 6న విచారణ
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 6 దాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 5న తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ బెయిల్ను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ వరవరరావు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 6న విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. అప్పటిదాకా వరవరరావుపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఎన్ఏఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్సింగ్ స్పందిస్తూ.. ఈ నెల 6దాకా వరవరరావుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
వరవరరావు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి వరవరరావుకు స్వేచ్ఛ లభించింది. శనివారం రాత్రి 11.45 గంటలకు ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి వరవరరావు బయటికి వచ్చారని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భీమా కోరేగాం కేసులో ముంబైలోని తలోజా జైల్లో రెండున్నరేళ్లుగా ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. కొద్దినెలల కింద ఆయన తీవ్ర అనారోగ్యం బారినపడటంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో శనివారం వరవరరావును విడుదల చేశారు. అయితే బెయిల్ ఇచ్చేటప్పుడు బాంబే హైకోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన ముంబై పరిధిలోనే ఉండాలి. దీంతో ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశం లేదు. -
వరవర రావుకు బెయిల్
ముంబై/ సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుకి ముంబై హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. ఎల్గార్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2018 ఆగస్టు 28న వరవర రావుని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా వరవర రావుకు తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఆయన భార్య హేమలత వరవరరావు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. 82 ఏళ్ళ వరవరరావు వయసు, అతని తీవ్ర అనారోగ్య పరిస్థితి, తలోజా జైలులో ఆయనకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పైటేల్ల ధర్మాసనం బెయిల్ మంజూరుచేసింది. ‘ఉపశమనం ఇవ్వదగిన కేసు ఇది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వవచ్చు. తక్షణమే ఆయన్ను విడుదల చేయండి’అని కోర్టు ఆదేశించింది. హైకోర్టు జోక్యంతో గత ఏడాది నవంబర్లో వరవరరావుని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 1న వాదనలు ముగిశాక బెయిల్ అంశాన్ని కోర్టు రిజర్వ్లో ఉంచింది. ప్రస్తుతం ముంబై నానావతీ ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. వరవరరావుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంపై మూడు వారాల పాటు స్టే విధించాలంటూ, ఎన్ఐఏ తరఫున వాదిస్తోన్న అడిషనల్ సోలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే, వరవరరావుకి బెయిలు మంజూరు చేస్తూ షరతులను కోర్టు విధించింది. వరవరరావు ఎన్ఐఏ కోర్టు పరిధిలో ముంబైలోనే ఉండాలని ఆదేశించింది. రూ.50వేల వ్యక్తిగత బాండు, అదే మొత్తానికి రెండు ష్యూరిటీలు సమర్పించాల్సిందిగా కోర్టు సూచించింది. తన సహనిందితులతోనూ, ఈ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారెవరితోనూ వరవరరావు సంబంధాలు నెరపరాదని కోర్టు చెప్పింది. వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫోన్లు చేయరాదని కోర్టు సూచించింది. 15రోజులకు ఒకసారి పోలీసులకు వరవరరావు వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలి. అన్ని కోర్టు విచారణలకు హాజరుకావాలని, కోర్టు సమన్లకు స్పందించాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో వరవరరావుని కలిసేందుకు సందర్శకులను అనుమతించబోమని, ఆయన పాస్పోర్టుని ఎన్ఐఏ కోర్టులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి మీడియా ఎదుట ప్రకటనలు చేయడాన్ని కోర్టు నిషేధించింది. వరవరరావుని కలిసేందుకు న్యాయవాదులకు, కార్యకర్తలకు అనుమతివ్వాలని వరవరరావు తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఆరునెలల వ్యవధి ముగిశాక ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరుకావాలని, లేదా బెయిలు పొడిగింపునకు హైకోర్టుకి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: విరసం నేత, విప్లవ కవి వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కొరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక షరతులతో ఆరునెలల మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే (ముంబైలోనే) ఉండాలని, అలాగే గత ఎఫ్ఐఆర్కు దారి తీసిన కార్యకలాపాలు చేయగూడదంటూ షరతులు విధించింది. దీంతో వరవరరావు ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులకు భారీ ఊరట లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన భర్తకు బెయిల్ ఇవ్వాలన్న వరవరావు భార్య పిటీషన్పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపడం సరికాదని భావించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు రావు విచారణకు హాజరుకావాలని, అయితే భౌతిక హాజరునుంచి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఉత్తర్వుపై మూడు వారాల పాటు స్టే విధించాలని కోరిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఇటీవల కరోనా సోకడంతోపాటు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త వరవరావును బెయిల్పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత బొంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు ఓకే!
ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విప్లవ కవి వరవరరావును జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు సుముఖంగా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవరరావు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను డిశ్చార్జ్ చేయవచ్చని నానావతి హాస్పటల్ వర్గాలు గతవారం కోర్టుకు తెలిపాయి. డిశ్చార్జ్ అనంతరం ఆయన్ను నవీ ముంబైలోని తలోజా జైలుకు పంపాల్సిఉంటుంది. అయితే ఇందుకు బదులుగా ఆయన్ను జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది దీపక్ ధాకరే చెప్పారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన కుటుంబసభ్యులు ప్రొటోకాల్స్కు లోబడి ఆయన్ను కలవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం తరఫు ఈ సడలింపులకు ఓకేఅని, మిగిలిన అంశాలు ఎన్ఐఏ పరిధిలోనివని చెప్పారు. వరవరరావు పట్ల మానవీయ ధృక్పధాన్ని అవలంబించాలన్న కోర్టు సూచన మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఎన్ఐఏ న్యాయవాది అనిల్ సింగ్ వాదిస్తూ, రావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు సుముఖమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అప్రస్తుతమైన అంశమని చెప్పారు. బెయిల్ ఇవ్వండి వరవరరావును బెయిల్పై విడుదల చేయాలని ఆయన భార్య తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. జైల్లో సరైన వైద్యసదుపాయం లేకుండా ఆయన్నుంచడం రావు ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. జైల్లో ఉన్నవారికి ఆరోగ్య సదుపాయాలు అందించకపోవడం క్రూరత్వమన్నారు. తలోజా జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం మరలా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నట్లు నానావతి ఆస్పత్రి వర్గాలిచ్చిన రిపోర్టును న్యాయమూర్తులు గుర్తు చేశారు. డిశ్చార్జ్ అనంతరం జైల్లోకి మరలా వెళితే ఏమవుతుందో ఎవరూ చెప్పలేరని ఇందిరా వాదించారు. అందువల్ల కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే రావు బెయిల్కు ఎన్ఐఏ అభ్యంతరాలు చెప్పవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన్ను హైదరాబాద్ పంపితే తిరిగి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఎన్ఐఏ అభ్యంతరం చెప్పవచ్చని తెలిపింది. ప్రభుత్వాన్ని పడదోయడానికి యత్నించారన్నదే ఆయనపై అభియోగమని గుర్తు చేసింది. తాము బెయిల్ అడుగుతున్నది ఆరోగ్యకారణాలపై కనుక, ఎన్ఐఏ అభ్యంతరాలు వర్తించవని, అలాగే ఆయనపై అభియోగాలు నిజం కాదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రధాని హత్య గురించిన ఉత్తరం కనుగొన్నట్లు ఎన్ఐఏ చెబుతోందని, ఎవరైనా అలాంటి ఉత్తరాలు కంప్యూటర్లలో దాచుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కట్టుకధలన్నారు. కావాలంటే కఠిన నిబంధనలతో కూడిన బెయిల్నైనా మంజూరు చేయాలని కోరారు. అయితే రావుకు అన్ని రకాల వైద్యసాయం అందించేందుకు తాము కృషి చేశామని ధర్మాసనం గుర్తు చేసింది. ఉపా చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ ఇవ్వాలంటే పలు అభ్యంతరాలుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా మానవహక్కులపై పలు డిక్లరేషన్లను ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. రావు బెయిల్ పిటీషన్పై వాదనలు కొనసాగనున్నాయి. -
వరవరరావు పరిస్థితి విషమం
ముంబై: ‘ఎల్గార్ పరిషత్’ కేసుకు సంబంధించి జైళ్లో ఉన్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవర రావును తక్షణమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జమ్దార్ల ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. దాంతో వరవర రావును ప్రత్యేక కేసుగా పరిగణించి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చి, 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో వరవరరావును చూసేందుకు ఆసుపత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావు నవీముంబైలోని తలోజా జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవర రావును తలోజా జైలు ఆసుపత్రి నుంచి తక్షణమే నానావతి ఆసుపత్రికి మార్చి, మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. వరవరరావు ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు మరణశయ్యపై ఉన్న ఒక 80 ఏళ్ల వ్యక్తికి తలోజా జైళ్లోనే చికిత్స అందిస్తామని ఎలా చెప్తారు?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రి అయిన నానావతి హాస్పిటల్లో వరవర రావు చికిత్సకు అయిన ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. చికిత్సకు అయ్యే ఖర్చును వరవర రావే భరించాలన్న ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే వాదనను.. వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర జైసింగ్ తోసిపుచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించలేకపోవడానికి డబ్బులు లేవన్న కారణాన్ని ప్రభుత్వాలు చూపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఉటంకించారు. ఆమె వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ‘ప్రస్తుతం ఆయన మీ కస్టడీలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మీ కస్టడీలో ఉన్నట్లుగానే భావించాలి. అందువల్ల చికిత్స ఖర్చును మీరే భరించాలి’ అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో, ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే రాష్ట్ర హోం మంత్రిని ఫోన్లో సంప్రదించారు. అనంతరం, వరవరరావుకు 15 రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కోర్టుకు తెలిపారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని, భవిష్యత్తులో ఈ తరహా కేసులకు దీన్ని ఉదాహరణగా చూపకూడదని అభ్యర్థించారు. ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను.. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దానికి, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగాలను నమోదు చేయాల్సి ఉందని ఎన్ఐఏ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ సమాధానమిచ్చారు. అభియోగాల నమోదుకు ఇంకా కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకంటే ఆ అభియోగాలన్నీ ప్రాథమికంగా కంప్యూటర్ సాక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయని వరవరరావు తరఫున జైసింగ్తో పాటు వాదనలు వినిపించిన ఆనంద్ గ్రోవర్ కోర్టుకు వివరించారు. చనిపోతే ఎవరిది బాధ్యత? విచారణ ఇలాగే కొనసాగితే వరవరరావు జైళ్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఇందిర జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు పారిపోకూడదనే ఉద్దేశంతోనే విచారణ ఖైదీలను జైళ్లో పెడతారని, కానీ, మానసికంగా దుర్బలమై, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వీవీ పారిపోయే అవకాశమే లేదని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన చనిపోతే ఎవరిది బాధ్యత? ఆసుపత్రిలో ఆయనకేమైనా అయితే, అది కస్టోడియల్ మరణమే అవుతుంది’ అని స్పష్టం చేశారు. జైళ్లో సహచరులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా వరవరరావును చూసుకుంటున్నారని, కానీ, వారు వైద్యంలో శిక్షణ పొందినవారు కాదని కోర్టుకు వివరించారు. ఆసుపత్రిలో ఉండగా, వరవరరావుకు చేసిన వైద్య పరీక్షలపై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అవి తప్పై ఉండొచ్చని, వాటిపై ఆయన వయసు 54 ఏళ్లు అని ఉందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్న లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. నానావతి హాస్పిటల్లో జరిపిన వైద్య పరీక్షల నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. కోర్టుకు తెలియజేయకుండా ఆయనను ఆసుపత్రి నుంచి పంపించేయవద్దని ఆదేశించింది. వీవీ భార్య హేమలత వేసిన రిట్ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్ను కోర్టు విచారించింది. ఆయనను నానావతి ఆసుపత్రికి మార్చే అంశానికే బుధవారం నాటి వాదనలను పరిమితం చేద్దామని కోర్టు సూచించడంతో, బెయిల్ పిటిషన్పై వాదనలు జరగలేదు. విచారణను డిసెంబర్ 3కి కోర్టు వాయిదా వేసింది. -
వరవరరావుకు ఊరట
ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హైకోర్టు బుధవారం అనుమతించింది. దీంతో 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో వరవరరావుకు చికిత్స అందించనున్నారు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం వరవరరావును కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంది. కాగా ఎల్గార్ పరిషత్ కేసులో జైలులోఉన్న తెలుగు కవి వరవరరావు ఆరోగ్యంపై బొంబాయి హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వివరణ ఇచ్చింది. వరవరరావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని వివరించింది. అయితే, వరవరరావుకు న్యూరలాజికల్ సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యులున్నాయని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. దీంతో, అన్ని వైద్య పరీక్షలను నిర్వహించి, సమగ్ర వైద్య నివేదికను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరవరరావు ప్రస్తుతం తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. చదవండి: వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత రచయిత వరవరరావు (80)కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త నవరవరావును బెయిల్పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్నా తన భర్త ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తలోజా జైలులో అమానవీయ పరిస్థితుల్లో వరవరావు మగ్గుతున్నారని ఆమె వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన హక్కులను ఉల్లంఘనకిందికి వస్తుందన్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. -
వివి ఒక లెజెండ్
‘కవిత్వం దాచనక్కరలేని నిజం ప్రభుత్వం అక్కరలేని ప్రజ అమృతం అక్కరలేని జీవితం’ ‘నా కవిత్వం ఒక బాధాతంత్రీ ఒక క్రోధతంత్రీ తెగినట్లు కన్నీటిని వెలిగించేవి చూపులే అయినట్లు ప్రవహిస్తూనే వుంటుంది రుధిరాక్షర నదిగా’ – వి.వి. ఒక పోరాట జీవితాన్ని, అరవైఏళ్ల పోరాట జీవితాన్ని ఒక పేజీ కాదు రెండు పేజీల్లోకి కుదించటం సాధ్యమా– ఒక పుస్తకంలోకి వడకట్టడం సాధ్యమా– అసాధ్యం– impossible. రేఖామాత్రంగానో– ఛాయామాత్రంగానో చూయించవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కవిత్వ వ్యక్తిత్వాన్ని అద్దంలో చూయించినట్టు చూయించవచ్చేమో– కానీ మొత్తం జీవితాన్ని, తాననుభవించిన దుఃఖాన్ని వేదనని agonyని, ఏకాంతాన్ని, ఏకాంతమథనాన్ని– ఆ solitary movementలో– తాను చూసిన infernoని– స్వర్గనరక కూడలిని పట్టుకోవటం ఎంత కష్టం. అసాధ్యమైనదాన్ని సాధ్యం చేయటానికి మనుషులు సృజనలోకి దిగుతారు. ప్రపంచంలోని ఏ కవీ నన్ను భయపెట్టలేదు. ఏ కవి ముందూ నేను బెరుకు ఫీలవలేదు. కాని వరవరరావు గారి ముందు కొంత జంకు, కొంత బెరుకు– శిఖరం ముందు నిల్చున్నట్టు ఫీలవుతాను. అది నిత్య సమరశీలమైన, రాజీలేని జీవితానుభవం– కారణం. ఇంకొక కవి వరవరరావులా జీవించగలడా– అనుభవించి ఆచరించగలడా– ఒక ఉక్కు నిర్ణయం నిశ్చయం కావాలి. ఆశయానికీ ఆచరణకీ మధ్య దూరం చెరిగిపోవాలి. వేణుగోపాల్ రాసినట్టు– దూరాన నుంచొని దిశానిర్దేశం చేసే మేధావి సిద్ధాంతకర్త గాదు వరవరరావు. ఆశయం రూపొందించి ఆచరణలో ఇన్నాళ్లు అగ్రభాగాన వున్నారు. మందితోనే, మందిలోనే వున్నారు. ఆశయం గాదు ఆచరణ భయపెడుతుంది– వరవరరావు Lovely person - A bit reticent- కాస్త బిడియస్తుడు, కాస్త సిగ్గరి, గొప్ప ప్రేమికుడు. ఎప్పుడో ఎక్కడో ఆయనకి షేక్హ్యాండ్ ఇచ్చినాకు రాసుకున్నా ‘ఆత్మ అరచేతిలోనూ దొరుకుతుందని’. ఒక విద్యుత్ ప్రవహిస్తుంది. నిన్ను ఉత్తేజభరితుణ్ణి చేస్తుంది, నిన్ను సచేతనుణ్ణి చేస్తుంది. బహుశా ప్రపంచంలోని గొప్ప వ్యక్తులంతా, మహత్తర మూర్తులంతా ఇంతేనేమో– తల చుట్టూ కనపడని కాంతిచక్రాలు తిరుగుతున్నట్టు. మొదట ఎక్కడ చూశాను? గుర్తు లేదు. కాని లీలగా ఒక రూపం– పంచె కట్టుకుని నడుస్తున్న రూపం– బహుశా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో అనుకుంటా. మిత్రులతో నడుస్తున్నారు. ‘సృజన’ జడ్చర్ల నుంచి వస్తున్న రోజుల్నించి పరిచయం, అప్పుడే ఒక ఉత్తరం రాసిన గుర్తు, ఆ తొలిరోజుల పిచ్చి కవితనొకదానిని సృజనలో అచ్చేశారు. రెండోసారి నారాయణగూడలోని శ్రీపతి రూంలో– శ్రీపతి ఒక అద్భుత కథకుడే కాదు, వ్యక్తి కూడా. ఎంత మందిని నిశ్శబ్దంగా తనలోకి లాక్కున్నాడు. ఎంతమంది దోవలు మార్చాడు! ఈ యాభై అరవై సంవత్సరాల్లో– ఎన్నిసార్లు దగ్గరగా దూరంగా సభల్లో బయటా కలిసాను. కలిసిన ప్రతిసారి ఒక కొత్త కలయిక. నూతనోత్తేజం. నిజంగా జీవించినవాడి జీవితం జీవిస్తున్నవాడి జీవితం అలానే వుంటుంది. ఎక్కడో ఒక సభలో అన్నారు: ఈ కవిత్వం కంటే ఇంకేదైనా ప్రజలకు మేలు చేస్తుందనుకుంటే ఉపయోగపడుతుందనుకుంటే– అదే చేస్తాను. నేనూ వున్నా ఆ సభలో– నేనన్నాను ‘నాకు కవిత్వమే సర్వస్వం, కవిత్వం దాటి ఏమీ లేదు– For me word is an action’. ఇప్పుడనిపిస్తుంది– అది Lame justification. ఇప్పుడు వరవరరావు ఎక్కడున్నారు– నేనెక్కడున్నాను– మనలో చాలా మంది ఎక్కడున్నాం– అది తేడా. అది ఆశ్చర్యం గొలిపే అగ్నిస్పర్శ. ఒక గొప్ప రాజకీయ కుటుంబంలో పుట్టిపెరిగిన వరవరరావులో, కవిత్వంలో రాజకీయం ఒక రక్తప్రసరణ. నెహ్రూ రాజకీయ అభిమానిగా మొదలైన వరవరరావు పరిణామం అనూహ్యం కాదు. సహజం. ఇప్పుడు ఆయన ఉండాల్సిన చోట వున్నాడు. దేశ రాజకీయ పరిణామాలు ప్రపంచ రాజకీయ పరిణామాలు అంతర్భాగం చేసుకున్న వరవరరావు జీవితం, కవిత్వం భిన్నమైనవే. ఆయన గురించి లోకానికి తెలియనిదేముంది– He is an open book – ఎవరో అడిగారు ‘మార్క్సిజం ఏం చేస్తుంది’ అని– వేరే విషయాలు పక్కనపెడితే– అది నిన్ను నిర్భయుణ్ణి చేస్తుంది. దేన్నైనా ఢీకొనే శక్తి, ఎదిరించి నిలబడే శక్తి నీకు ప్రసాదిస్తుంది. ఆయన్ని చూసినప్పుడల్లా– నాకు Tennyson, Ulyssesలోని వాక్యాలు గుర్తుకొస్తాయి– That which we are, we are; one equal temper of heroic hearts made weak by time and fate, but strong in will to strive, to seek, but not to yield. ఆయన ఏకైక గొప్ప పొలిటికల్ పొయెట్. ఎంతోకొంత ప్రతి కవీ పొలిటికల్ కవే. ఇది తిట్టు గాదు, రాజకీయాన్ని కవిత్వం చేయటం– రాజకీయ వెలుగులో వచ్చిన పరిణామాలను మార్పులను ఘటనలను కవిత్వం చేయటం మామూలు విషయం కాదు. వరవరరావు general poet కాదు. సచేతనుడైన గొప్ప ఆర్ద్ర హృదయం గల రాజకీయ కవి. మానవ ప్రవృత్తిని మానవ స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి ఎత్తి చూపటం కవిత చేయటం ఒక సవాలు. అరవైఏళ్లుగా మెలకువతో, కవిత్వమూలం చెడకుండా చేస్తున్నారు. ‘ఊరేగింపు’ దగ్గర నుంచి ‘కఠినవాడు’ దాకా ఏ కవితైనా తీసుకోండి– కవిత్వ నిర్మాణ సూత్రాలకు భిన్నంగా వుండదు– లోలోపల తొలుచుకుంటూ విస్తృతి చేసుకుంటూ వెడుతుంది. నాకు బాగా గుర్తు– విరసం ఇరవైఏళ్ల మహాసభ అనుకుంటా– రాణాప్రతాప్ హాల్లో జరిగింది. జనంలో నేవున్నాను – అకస్మాత్తుగా ‘ముక్తకంఠం’ కవిత్వసంపుటి ఆవిష్కరించి మాట్లాడమన్నారు. చదవటం సంగతి పక్కనపెడితే ఆ పుస్తకాన్ని ఎన్నిసార్లు చేతితో నిమురుతూ అనుభవిస్తూ అనుభూతి చెందానో చెప్పలేను. తన సుదీర్ఘయాత్రలో– ఎంత అశాంతిని ఎంత ఘర్షణని ఎదుర్కొన్నారో చెప్పడం కష్టం. ఈ సంక్షోభభరిత, సంఘర్షణాయుత జీవితం మొత్తం కవిత్వం చేసే process ఆయన కనుగొన్నారు. ఒక పదిహేను కవితాసంపుటుల కవిత వుంది, వేలవేల పేజీల వచనముంది. ఒక రకంగా అరవై సంవత్సరాల జీవితాన్ని చరిత్రను రికార్డ్ చేశారు. ఆయన కవిగా జీవించని క్షణాలు తక్కువే. ఆయన ఉపన్యాసం ఒక గొప్ప కవిత. ఉపన్యాసాన్ని emotional గా charge చేయటం ఆయన విశిష్టత. ఆయన రాజకీయవాదా– కవా– సంపాదకుడా– అధ్యాపకుడా– ఉపన్యాసకుడా– అని ఎవరన్నా అడిగితే– వీటన్నింటి సమాహారం ఆయన. వేయంచుల కత్తిలా మెరుస్తుంటాడు, ముళ్లగదలా వలయాలు వలయాలు చుడుతూ మనల్ని సంభ్రమంలో ముంచుతాడు. ఆయన ‘సముద్రం’ గొప్ప కావ్యం. సమాజానికి సముద్రానికి అభేదం చెబుతూ సాగిన గొప్ప కవిత. ఆయన ఊరకుండడు– ప్రభుత్వం state ఊరకుండదు. వరవరరావు అంటే stateకి సమాజానికి, stateకి వ్యక్తికి మధ్య ఘర్షణ. ఇది నిరంతరం కొనసాగుతుంది. మనిషిలో గొప్ప లాలిత్యం వుంది, లాలిత్యం కాఠిన్యంగా మార్పు చెందే సందర్భాలూ కవిత్వంలో చూస్తాం. హేమ గారి మీద తొలిరోజుల్లో రాసిన ప్రేమ కవిత– సన్నజాజులు చదవండి– ఎంత గొప్ప ప్రేమికుడో, ఎంత సౌందర్యవాదో, ఎంత మృదుస్వభావో– అవన్నీ ఇప్పుడు సమాజగతంగా అంతర్లీనమయ్యాయి. అటువంటి గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం– సెలబ్రేట్ చేయండి– వరవరరావు కవిత్వాన్ని పఠించి పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి. He is a Legend. కె.శివారెడ్డి గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం. వరవరరావు కవిత్వాన్ని పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి. -
సుప్రీం కోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వరవరరావు భార్య హేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ని విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ముంబయి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. వరవరరావుకు చికిత్స అందజేస్తున్న హాస్పిటల్లో సౌకర్యాలను కూడా ముంబై హై కోర్టే పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వరవరరావు బెయిల్ అప్పీల్ను సరైన సమయంలో విచారించాలని సుప్రీం కోర్టు, ముంబయి హైకోర్టుకు సూచించించింది. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
వరవరరావుకు బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో అరెస్టయి, ముంబై జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ కవి, 81 ఏళ్ళ వరవరరావుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన భార్య పెండ్యాల హేమలత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయనను నిరవధికంగా కస్టడీలో ఉంచటం అమాన వీయం, క్రూరత్వమని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను అతిక్రమించడమేనని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. 2018 నవంబర్లో జ్యుడీషియల్ కస్టడీకి వెళ్ళేనాటికి 68 కేజీల బరువున్న వరవరరావు ఇప్పుడు 50 కేజీల బరువున్నారని, ఆయన 18 కేజీల బరువు తగ్గారని, వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారని వెల్లడించారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు, కోవిడ్ ప్రబలిన తరువాత తలెత్తిన ఇబ్బందుల కారణంగా వరవరరావుకి నిరంతర పర్యవేక్షణ అవసరమౌతోందని హేమలత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తెలిపారు. -
వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!) ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించింది. ఎన్ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన
సాక్షి, అమరావతి : విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరావును విడిపించాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాయడం తన వ్యక్తిగత నిర్ణయం అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ ట్వీట్ చేయడం బాధాకరం అన్నారు. దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని భూమన కోరడం సమంజసం కాదని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా సునీల్ దియోధర్కు భూమన ఆదివారం లేఖ రాశారు. ‘ప్రధాని మోదీ పట్ల నాకు అపార గౌరవం, ప్రేమ ఉంది. నేను లేఖలో కోరింది అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల వరవరావు పట్ల జాలి చూపించమని, అంతే కానీ వరవరరావు భావాజాలాన్ని అంగీకరించి కాదు. భారతదేశపు సనాతన ధర్మాన్ని, విలువలను గౌరవిస్తా. హింసా మార్గాన్ని ఏ మాత్రం సమర్థించను. నా వ్యక్తిగత అభిప్రాయానికి సీఎం జగన్తో మీరు ముడిపెడుతూ ట్వీట్ చేయడం బాధాకరం. శత్రువును చంపడం కాదు.. క్షమించడం పెద్ద శిక్ష అని నమ్ముతా’అని లేఖలో భూమన పేర్కొన్నారు. కాగా, భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కొన్ని రోజుల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. అయితే ఆ లేఖ తన వ్యక్తిగత నిర్ణయం అని, దానిలో పార్టీకి సంబంధం లేదని భూమన అప్పుడే స్పష్టం చేశారు. అయితే దీనిపై మళ్లీ విమర్శలు రావడంతో భూమన వివరణ ఇచ్చారు. -
వీవీని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై : భీమా కొరేగావ్ కేసులో నిర్భంధంలో ఉన్న విప్లవ రచయిత వరవరరావును(వీవీ) కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ప్రస్తుతం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసేందుకు బాంబే హైకోర్టు వారికి అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు, ఆస్పత్రి ప్రొటోకాల్కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు వీవీ ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు) కాగా, భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వీవీ ఏడాదిన్నరగా తలోజా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వీవీని కలిసేందుకు తమకు అనుమతించాలని.. ఆయన తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంఘాలు కూడా ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
25న రాష్ట్ర బంద్కు మావోల పిలుపు
సాక్షి, హైదరాబాద్ : ప్రజాకవి, విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఉపా, ఎన్ఐఏ కేసులను ఎత్తేయడంతోపాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ దళాలను వెంటనే వెనక్కి పిలవాలని లేఖలో డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలో కార్యకలా పాలు ఉధృతం చేసేందుకు రాష్ట్ర కమిటీతోపాటు 12 ఏరియా కమిటీలను మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆసిఫాబాద్లో దాదాపు 15 మంది యువతను దళంలో చేర్చుకున్నారని, ఆదివాసీలు ఉన్న అన్నిప్రాంతాల్లోనూ రిక్రూట్మెంట్ జరిగి నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు మావోయిస్టు పార్టీ వేసిన కమిటీలు, వారి వివరాలు.. రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం ఏడుగురు సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా హరిభూషణ్ అలియాస్ యాప నారాయణను ఎన్నుకున్నట్లు సమాచారం. పుల్లూరి ప్రసాద్, బండి ప్రకాశ్, దామోదర్, భాస్కర్, సాంబయ్య, కంకణాల రాజిరెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు పర్యవేక్షణలో రాష్ట్ర కమిటీ పనిచేస్తుందని, దీని ఆధీనంలో 12 ఏరియా కమిటీలు పనిచేస్తాయని తెలిసింది. ఏరియా కమిటీలు 1. కంకణాల రాజిరెడ్డి నేతృత్వంలో జయశంకర్ జిల్లా మహబూబాబాద్ జిల్లా, వరంగల్– పెద్దపల్లి ఏరియా కమిటీ. 2. రీనా అలియాస్ సమే– ఏటూరునాగారం– మహదేవ్పూర్ ఏరియా కమిటీ. 3. ఉంగి– వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ. 4. మంగు నేతృత్వంలో ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ. 5. అడెల్లు భాస్కర్ సారథ్యంలో మంచిర్యాల కొమ్రంభీం జిల్లా కమిటీ. 6. లింగమ్మ– మంగీ ఏరియా కమిటీ. 7.వర్గేష్ – ఇంద్రవెల్లి ఏరియా కమిటీ, 8. నరసింహారావు– చెన్నూరు–సిర్పూర్ ఏరియా కమిటీ. 9. సమ్మక్క అలియాస్ శారద– చర్ల శబరి ఏరియా కమిటీ. 10. రమాల్– మణుగూరు ఏరియా కమిటీ. 11.సాంబయ్య – భద్రాద్రి కొత్తగూడెం– ఈస్ట్ గోదావరి డివిజనల్ కమిటీ. 12. బడే చొక్కారావు అలియాస్ దామోదర్– తెలంగాణ యాక్షన్ కమిటీ. -
వీవీ ఆరోగ్యంపై వాస్తవ నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత వరవరరావు(వీవీ) ఆరోగ్యపరిస్థితిపై దాపరికం లేకుండా వాస్తవ నివేదికను వెంటనే తమకు అందజేయాలని ఆయన కుటుంబసభ్యులు సోమవా రం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గత వారం రోజుల్లో ఆయన్ను తలోజా జైలు నుంచి వివిధ ఆస్పత్రులకు తరలించి కేవలం కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని తెలిపారన్నారు. నానావతి ఆస్పత్రిలో చేర్చక ముందే ఆయన తలకు కుట్లుపడ్డాయని అక్కడి వైద్యులు గుర్తించారని వీవీ భార్య హేమలత, కుమార్తెలు సహజ, అనల, పవన పేర్కొన్నారు. వీవీ తనంతట తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని కోరారు. -
నానావతి ఆస్పత్రికి వరవరరావు
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును పోలీసులు నానావతి ఆస్పత్రికి తరలించారు. శనివారం రోజున ఆయనను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించాలని, అందుకయ్యే ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో, కరోనా వైరస్ బారిపడిన ఆయనను శనివారం అర్ధరాత్రి సమయంలో నానావతి హాస్పిటల్కు తరలించినట్లు సెయింట్ జార్జ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. (మౌనం ఒక యుద్ధ నేరం) కాగా.. మహారాష్ట్రలోని తలోజా జైలులో భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా వరవరరావు ఏడాదిన్నరగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ముంబయిలోని జేజే ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ ఆయనకు జరిపిన కోవిడ్ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయనకు కోవిడ్ చికిత్సను అందించడానికి ముంబైలోని నానావతి ఆస్సత్రికి తరలించారు. (‘వీవీ విడుదలకు జోక్యం చేసుకోండి’) -
‘వీవీ విడుదలకు జోక్యం చేసుకోండి’
తిరుపతి సెంట్రల్: నిర్బంధంలో ఉన్న అభ్యుదయ రచయిత వరవరరావు(వీవీ) విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం లేఖ రాశారు. అనారోగ్యంతో వీవీ ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చమ్మగిల్లుతోందన్నారు. తనకు లభించిన గురువుల్లో ఆయన కూడా ఒకరని తెలిపారు. 46 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ బాధితులుగా వెంకయ్య, తనతో పాటు వరవరరావు కూడా జైల్లో గడిపిన రోజులను గుర్తు చేశారు. రాజకీయ సిద్ధాంతాల్లోనూ, జన క్షేమం కోసం ఎవరి భావాలు వారివే అయినా మనుషులుగా అంతా ఒక్కటే అని పేర్కొన్నారు. -
మౌనం ఒక యుద్ధ నేరం
‘‘చిన్నప్పుడు మా అమ్మ నాకో కథ చెప్పింది / ఇంటి ముందు కుంపట్లోనో వంటింట్లో దాలిలోనో ఉన్నట్లుగానే / ప్రతిమనిషి గుండెలో నిప్పు ఉంటుంది’’ అంటారు ప్రసిద్ధ కవి వరవరరావు. ‘నిప్పు–మనిషి కనుగొన్న న్యాయం’ అని నమ్మిన వ్యక్తి ఆచరణ ఎట్లా ఉంటుందో ‘వివి’ని చూస్తే తెలుస్తుంది. మనిషి మనిషి గుండెలో నిప్పు చల్లారకుండా తన హృదయం, మేధస్సు, శ్రమ, ప్రతిభలతో నిలువెత్తు జ్వాలై ఎగసినవాడు, ఈ రోజు భీమా కోరేగావ్ కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నవీ ముంబై జైలులో ఉన్నారు. భారతదేశం గర్వించదగ్గ మేధావి, కవి, ఉపన్యాసకుడు, ప్రజాస్వామికవాది అయిన వరవరరావుని ఈ కేసులో ఇరికించి ఏడాదిన్నర దాటింది. పుణే నుంచి ముంబై తలోజా జైలుకి మార్చడం తప్ప కేసులో ఎటువంటి పురోగతి లేదు. నేరారోపణ ప్రక్రియ పూర్తి కాలేదు. కేసు విచారణకి రాలేదు. బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాజకీయ ఖైదీల కేసులలో వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు కూడా ఇవ్వడం లేదు. కూర్చునేందుకు కుర్చీ, పడుకోటానికి మంచం కూడా ఇవ్వకుండా శరీరాన్ని హింస పెడుతూనే ఉన్నారు. వయసును, కరోనా విపత్తును, ఖైదీలతో కిక్కిరిసిన జైళ్లను దృష్టిలో ఉంచుకొని వివి, తదితర భీమా కోరేగావ్ అండర్ ట్రైల్ ఖైదీలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి విడుదల చేయమని పౌర సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా నెలరోజుల నుండి అనారోగ్యానికి గురయిన వరవరరావుని విడుదల చేయమని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పదే పదే బెయిల్ నిరాకరిస్తున్నారు, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందించడం లేదు. శరీరంలో తగ్గుతున్న సోడియం నిల్వల స్థాయికి సరైన వైద్యం అందించకపోవడంతో తనవాళ్ళను గుర్తించలేని, పొంతన లేని మాటలు మాట్లాడే స్థితిలోకి ఆయనను తెచ్చింది ప్రభుత్వం. ఫాసిస్ట్ రాజ్యానికి మానవీయత కాదు కదా రాజ్యాంగ బద్ధత అనేది కూడా ఏ మాత్రం లేదని ఇటువంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వివికి కోవిడ్ పాజిటివ్ అని తేలటం మరీ ఆందోళన కలిగిస్తున్నది. తమ కస్టడీలో ఉన్న మనిషి ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యం – చట్టబద్ధం, నైతికం కాదు. కేసు విచారణ ముగిసి, తీర్పు రాకుండానే విడుదల చేయడం చట్టబద్ధం కాకపోవచ్చు. కానీ ఇపుడున్న విపత్తు పరిస్థితుల్లోనూ వయసు రీత్యానూ ఆయన బెయిలు మంజూరు విషయంలో కాలయాపన చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. వరవరరావు ఆరోగ్యం విషయంలో ఇప్పటికైనా తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తక్షణం ఆయనను కోవిడ్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించి నిపుణుల పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో చికిత్స అందజేయాలి. వైద్యరంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కనుక మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించేలా సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలి. ప్రతి ఒక్క మనిషికి ఉన్నట్లుగానే వివికి కూడా ఆరోగ్యంగా, గౌరవంగా జీవించే హక్కు ఉన్నదని గుర్తించాలి. తెలంగాణ చారిత్రకత పట్ల ఎంతో గౌరవాన్ని ప్రకటించే ముఖ్యమంత్రి కేసీఆర్కి, చరిత్రాత్మక వ్యక్తి అయిన వివిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేసు తెలంగాణ పరిధిలోనిది కాకపోయినా వివి రక్షణ విషయంలో కలగజేసుకుని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం ఇప్పుడు అవసరమైన సందర్భం. ఆరు దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వివి వేసిన ముద్ర అనితరసాధ్యం. వివి విడుదలను కోరడం, దాని కోసం పోరాడడం అంటే అది ఒక వ్యక్తి కోసం చేసే పోరాటం కాదు. సుదీర్ఘ కాలం ప్రజాక్షేత్రంలో తమ జీవితాలను పణం పెట్టి, అసమాన త్యాగాలకు, సాహసాలకి సిద్ధపడినవారు, వ్యక్తులుగా కాక ప్రజల ఆశలకి, ఆశయాలకి ప్రతీకలుగా మారతారు. అటువంటి ప్రతీక అయిన వరవరరావుకి హాని తలపెట్టడం, అక్రమ నిర్బంధాలకి పాల్పడటం ద్వారా అటువంటి స్ఫూర్తిని దెబ్బతీయడం ఫాసిస్ట్ ప్రభుత్వాల లక్ష్యం. అందుకే వివి తదితర రాజకీయ ఖైదీల విడుదల కోసం మైనార్టీ స్వరాలైనా సరే.. గట్టిగా నినదిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో అటు నాగపూర్ అండా సెల్లో అనేక తీవ్ర ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న మరొక కవి, మేధావి, అనువాదకుడు, అధ్యాపకుడు అయిన సాయిబాబా విషయంలో అత్యవసర ఆరోగ్యపర చర్యలు చేపట్టడం ఇపుడు చాలా అవసరం. కోవిడ్ హానికి అనువుగా ఉన్న నాగపూర్ జైలు వాతావరణం నుండి ఆయనను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది. జైళ్లు పరివర్తన కేంద్రాలు అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చెప్పే మాట. అవి మనదేశ మానవ వనరుల విధ్వంస కేంద్రాలు కాకూడదు. వివి, సాయిబాబా తదితరుల క్షేమం పట్ల అంతర్జాతీయంగా వస్తున్న విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. ఇందుకోసం ఎవరికి చేతనైన స్థాయిలో వారు కృషి చేయాలి. వరవరరావు స్వయంగా చెప్పినట్లుగా – ‘‘నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వెంటాడుతుంటే ఊరక కూర్చున్న /నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’’ కాత్యాయనీ విద్మహే, కె.ఎన్. మల్లీశ్వరి – ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక -
వీవీని కాపాడండి: హృదయం చెమ్మగిల్లుతోంది
సాక్షి, తిరుపతి : ముంబైలోని తలోజా జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి కోరారు. ఈ మేరకు ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకు శనివారం బహిరంగ లేఖ రాశారు. అనారోగ్య సమస్యతో పాటు, ప్రాణాంతక కరోనా వైరస్ బారిపడిన వరవరరావు విడుదలకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. శరీరం మంచాన కట్టుబడి 81 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. (ఆయన ప్రాణాలు కాపాడాలి) ‘వృద్య శల్యం శరీరంలో ఉన్న వరరరావు ప్రాణాలు కాపాడాలని ఉపరాష్ట్రపతిని కోరుతున్నా. వరవరరావు నిర్బంధం, అనారోగ్యము గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనలు అంకుర్బావ దశలో నాకు లభించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులు. 46 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు (వెంకయ్య నాయుడు), నేను (భూమన కరుణాకర్రెడ్డి) 21 నెలల పాటు ముషీరాబాద్ జైల్లో వున్నప్పుడు వరవరరావు మన సహచరుడు. సహచర్యం, భావాజాలం కాదు, కానీ జైల్లో కలసి ఉన్నాం. రాజకీయ సిద్ధాంతాల్లోను జనక్షేమంకై నడిచే మార్గాల్లో ఎవరి భావాలు వారివి. కానీ మనం మనుషులం. మానవతా దృక్పధంతో స్పందించి వరవరరావు విడుదలకు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. (వరవరరావుకు కరోనా పాజిటివ్) కాగా ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని కోరారు. మరోవైపు వరవరరావు కరోనా సోకడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
వీవీ ప్రాణాలు కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విజ్ఞప్తిచేశారు. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలని కోరారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడే బెయిల్ ఇచ్చి ఉంటే ఆయనకు కోవిడ్ సోకేది కాదన్నారు. వెంటనే ఆయనను విడుదల చేసి డాక్టర్లు, కుటుంబసభ్యుల సంరక్షణలో హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), డీజీ నర్సింహా రావు, బి.వెంకట్ (సీపీఎం), కె. గోవర్థన్. కె.రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), ఉపేందర్ రెడ్డి (ఎంసీపీఐ–యూ), సీహేచ్ మురహరి (ఎస్యూసీఐ–సీ),డి.రాజేశ్ (లిబరేషన్) పాల్గొన్నారు. ప్రజాసంఘాల ర్యాలీ విరసం నేత వరవరరావుతోపాటు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని పీడీఎస్యూ, పీవోడబ్లు్య, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్, ప్రజా సంఘాలు శుక్రవారం విద్యానగర్ నుంచి హిందీ మహావిద్యాలయ వరకు ర్యాలీ నిర్వహించాయి. పీవోడబ్లు్య జాతీయ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ వరవరరావు, సాయిబాబాలకు కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుత రామారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి. అనురాధ, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్, నగర అధ్యక్షుడు రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వరవరరావుకు కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై : ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్ బారినపడ్డారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. (జైలులోనే చంపుతారా?) దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును బెయిల్పై విడుదల చేయాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన విడుదలను కోరుతూ మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సైతం వామపక్ష పార్టీలు లేఖలు రాశాయి. కనీసం ఆయన్ని కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించాలని ప్రజాసంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి, అమానుషంగా జైలులో దీర్ఘ కాలం నిర్బంధించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు) -
జేజే ఆస్పత్రికి వరవరరావు తరలింపు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి వరవరరావును నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వరవరరావు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం ఆస్పత్రిలో చేర్పిస్తారా.. లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి, అమానుషంగా జైలులో దీర్ఘ కాలం నిర్బంధించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాత్కాలిక బెయిల్ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది ఆర్.సత్యనారాయణ్ అయ్యర్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వరవరరావుకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూన్ 26న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్, వరవరరావు మెడికల్ రికార్డులను అందజేసేలా నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. -
వరవరరావును తక్షణమే ఆస్పత్రికి తరలించండి
ముంబై: బీమా కోరేగావ్ కేసులో అరెస్టై విచారణ ఖైదీగా నిర్బంధంలో ఉన్న విప్లవ కవి పి.వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్ సహా పలువురు ఆక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారేలా వ్యవహరించడం సరికాదని.. ఓ వ్యక్తిని అలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టమని ఏ చట్టం చెప్పదని పేర్కొన్నారు. ఇది ఎన్కౌంటర్ కంటే తక్కువేమీ కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ మేరకు రొమిలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, సోషలిస్టు సతీశ్ దేశ్పాండే, మానవ హక్కుల కార్యకర్త మజా దారూవాలా మహా సర్కారు, జాతీయ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ‘‘అన్నీ తెలిసి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ వ్యక్తికి వైద్య చికిత్స అందించేందుకు నిరాకరించి.. ఆ వ్యక్తి ప్రాణాలకు హాని కలిగేలా వ్యవహరించడం ఎన్కౌంటర్కు మరో రూపంలా పరిణమిస్తుంది. కాబట్టి పి. వరవరరావుకు తక్షణమే సరైన చికిత్స అందేలా భారత రాష్ట్రం చర్యలు తీసుకోవాలి. గత 22 నెలలుగా వరవరరావు విచారణకు అన్ని విధాలులగా సహకరిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించేలా పరిస్థితులను కల్పించమని చట్టంలో లేదు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం ఆయనకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో 2018 నవంబర్లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్రలోని పుణేలో గత ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు ఆయనను తరలించారు. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుతో జైలు అధికారులు తనతో ఫోన్లో మాట్లాడించారని, వీవీ మాట్లాడిన తీరు పొంతన లేకుండా ఉందని, మాట మొద్దు బారిపోయిందని ఆయన సహచరి హేమలత ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. వరవరరావుకు వెంటనే బెయిలు మంజూరు చేసి ఆయనకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.(జైలులోనే చంపుతారా?) -
జైలులోనే చంపుతారా?
సాక్షి, హైదరాబాద్: నవీ ముంబైలోని తలోజా జైలులో విచారణ ఖైదీగా నిర్బంధంలో ఉన్న ప్రముఖ విప్లవకవి పి.వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని ఆయన సహచరి హేమలత, కుమార్తెలు సహజ, అనలా, పావన విజ్ఞప్తి చేశారు. 79 ఏళ్ల వరవరరావు తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్నా చికిత్స అందించకుండా జైలులోనే చంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత మే 28న జైలులో వరవరరావు స్పృహ కోల్పోవడంతో జేజే ఆస్పత్రికి తరలించారని, సోడి యం, పొటాషియం లెవల్స్ బాగా పడిపోయాయని కోర్టుకు ఆస్పత్రి నివేదించిందని వెల్లడించారు. 3 రోజు లకే ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఎన్ఐఏ తిరిగి జైలుకు తరలించిందన్నారు. జూన్ 24న, ఆ తర్వాత జూలై 2న వరవరరావు తమతో జైలు నుంచి ఫోన్ చేసి బలహీనమైన గొంతుతో అసంబద్ధంగా హిందీలో మాట్లాడారని వెల్లడించారు. చివరిసారిగా శనివారం ఆయన తమకు ఫోన్ చేసినా తీవ్ర అనారోగ్యం వల్ల సరిగ్గా మాట్లాడలేక పోయారని తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, పొంతన లేకుండా మాట్లాడారని హేమలత, కుమార్తెలు కన్నీరుమున్నీర య్యారు. వరవరరావు 8 ఏళ్ల వయస్సులో తండ్రిని, 30 ఏళ్ల కింద తల్లిని కోల్పోయారని, అయితే తన తండ్రి, తల్లి అంత్యక్రియలకు వెళ్తున్నావు కదా అని ఫోన్లో తనను అడిగారని హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి ఘటనలకు సంబంధించిన భ్రమల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోడియం, పొటాషి యం లెవల్స్ పడిపోవడంతో మెదడు దెబ్బతింటుండడం వల్లే తమ తండ్రి మతిస్థిమితం కోల్పోయినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, నడవలేకపోతున్నారని, ఒకరి సహాయం లేకుండా మరుగుదొడ్డికి వెళ్లలేకపోతున్నారని, పళ్లు తోముకోవడం కూడా కష్టంగా ఉం దని సహచర ఖైదీ పేర్కొన్నట్టు తెలియజేశారు. ఒకరి ప్రా ణాలను తీసే హక్కు ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించలేదని వీవీ బావమరిది వేణుగోపాల్ పేర్కొన్నారు. -
వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: భీమాకోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలంగాణ పౌరసమాజం కోసం, రాజ్యాంగం ఇచ్చిన పౌరహక్కుల సాధన, భావ ప్రకటన కోసం, పేదల కోసం ఉద్యమిస్తున్న వరవరరావుకు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహం అవుతుందని భట్టి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: బీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న వరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు శిక్షించిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారని, ఉరి శిక్ష వేసిన వారికి కూడా ఆరోగ్యం బాగోలేకపోతే ఉరి వాయిదా వేస్తారు. అలాంటిది రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యమ నేతను అక్కడి ప్రభుత్వాలు, పోలీసులు పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. -
వరవరరావుకు సీరియస్
సాక్షి, హైదరాబాద్: విప్లవ కవి పి.వరవరరావు ముంబైలోని తలోజ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని ఆయన కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. మహా రాష్ట్ర– ముంబై–తలోజ జైలులో విచా రణ ఖైదీగా ఉన్న వరవరరావుతో జైలు అధి కారులు తనతో ఫోన్లో మాట్లా డించారని, వీవీ మాట్లాడిన తీరు పొంతన లేకుండా ఉందని, మాట మొద్దు బారిపోయిం దని ఆయన సహచరి హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. వీవీ ఆరోగ్యం బాగా చెడిపోయిందని ఆయన పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ తీసుకుని తనతో చెప్పాడని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరవర రావును ఆస్పత్రికి పంపించి చికిత్స అందించే ఏర్పాట్లు చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ సీఎం కేసీఆర్కు శనివారం లేఖ రాశారు. వీవీ బెయిల్పై విడుదలై, తన కుటుం బంతో కలసి ఉండి, సరైన చికిత్స పొందేవిధంగా సీఎం కేసీఆర్ తగిన సహకారం అందిం చాలని విజ్ఞప్తి చేశారు. వీవీకి తక్షణమే వైద్య సదు పాయం అందేలా చర్యలు తీసుకోవా లని చాలామంది కవులు, సాహితీ వేత్తలు సామాజిక మార్గాల్లో సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. -
విషమంగా వరవరరావు ఆరోగ్య పరిస్థితి
-
వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు మహారాష్ట్రలోని తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ను కొద్దిరోజుల క్రితం కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు. -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్ పిటిషన్ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. (వరవరరావుకు తీవ్ర అస్వస్థత) ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు. (వరవరరావు కేసు: ఎఫ్బీఐకు హార్డ్డిస్క్!) -
వరవరరావుకు బెయిల్ ఇప్పించండి
సాక్షి,హైదరాబాద్: జూన్ 2న వరవరరావు(వీవీ) బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ఆయనకు షరతులతో కూడిన బెయి ల్కు అవకాశం ఇవ్వాలని వీవీ భార్య, కుమార్తెలు కేంద్ర హోంశాఖ సహా య మంత్రి కిషన్రెడ్డికి పంపిన ఓ వినతి పత్రంలో కోరారు. వీవీతో పాటు ప్రొఫెసర్ సాయిబాబాకూ బెయిల్ మంజూరు చేయించాలని కోరారు. వరవరరావు విడుదలకు చొరవ తీసుకోవాలని తెలంగాణ ప్రముఖ రచయితలంతా శనివారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కవులు దేవిప్రియ, అంపశయ్య నవీన్, నందిని సిద్ధారెడ్డి, గొరటి వెంకన్న తదితర 27 మంది లేఖ రాశారు. వీవీ విడుదల కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, కేంద్ర హోంమంత్రి అమిత్షా, కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డిలతో మాట్లాడి ఆయన జైలు నుంచి బయటకు వచ్చేలా సహకరించాలని కోరారు. ఇక అక్రమ నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయాలని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆదివారం నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. వరవరరావును విడుదల చేయాలి: ఎమ్మెల్యే రామలింగారెడ్డి పౌరహక్కుల నాయకుడు వరవరరావును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే 18 నెలలు జైల్లో ఉన్న ఆయనకు మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. వరవరరావు వయసు, ఆరోగ్యంతో పాటు ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. -
నాన్నను వెంటనే విడుదల చేయాలి: పవన
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్టై మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు వెంటనే తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి జైల్ నుండి విడుదల చేయాలని, తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలని ఆయన కూతురు పవన కోరారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హైదరాబాద్ పోలీసులు తమకు పాసులు ఇస్తామంటున్నారు. కానీ, కోర్టు అనుమతి ఉంటే మాత్రమే మా నాన్నని కలవగలం. కోర్టు అనుమతి కోసం పిటిషన్ వేశాం. అనుమతి ఇస్తేనే ముంబైకి వెళ్లి కలుస్తాం. నాన్నతో వీడియో కాల్ చేయించాలి. మూడు రోజుల నుండి ఆయన ఆరోగ్యం బాగాలేదు. తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు చీఫ్ జస్టిస్కి లెటర్ రాశాము. జైళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు ఆందోళనగా ఉంది’’ అని అన్నారు. ( జీవించే హక్కు వీరికి లేదా? ) కాగా, వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మూడ్రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ తండ్రిని చూసేందుకూ అనుమతినివ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. పలువురు రచయితలు, ప్రజా సంఘాలు కూడా వరవరరావును విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. -
వరవరరావుకు తీవ్ర అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. వరవరరావును ఆసుపత్రికి తరలించిన విష యాన్ని పుణేలోని విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ అధికారులు హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసు స్టేషన్కు శుక్రవారం సాయంత్రం సమాచారమం దించారు. ఇదే విషయాన్ని చిక్కడపల్లి పోలీసులు వరవరరావు కుటుంబసభ్యులకు చేరవేశారు. వరవరరావు అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి వెళ్లేందుకు అనుమతినిచ్చినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. వరవరరావు కుటుంబ సభ్యుల ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించి సమన్వయం చేసే బాధ్యతను డీసీపీ స్థాయి అధికారికి అప్పగించినట్లు కమిషనర్ తెలిపారు. 2018 నవంబర్లో అరెస్టు..: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లోనే వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడు దల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు సహజ, అనల, పవన మూడ్రోజుల క్రితం మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖ రాశారు. తమ తండ్రిని చూసేందుకూ అనుమతినివ్వడం లేదని లేఖలో పేర్కొన్నారు. పలువురు రచయితలు, ప్రజా సంఘాలు కూడా వరవరరావును విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. -
వరవరరావుకు అస్వస్థత!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. వరవరరావు అనారోగ్య సమాచారాన్ని చిక్కపడపల్లి పోలీస్ స్టేషన్కు అందించినట్టు పుణె పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు, ఎల్గార్ పరిషద్– మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో వరవరరావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వరవరరావును ఉంచిన జైల్లోని కొందరు ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక ఖైదీ మరణించినట్టు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధుడైన తమ తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని వరవరరావు ముగ్గురు కూతుర్లు పి.సహజ, పి.అనల, పి.పవన మహారాష్ట్ర గవర్నర్కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తప్పుడు అభియోగాలతో తమ తండ్రిని జైల్లో వేశారని వాపోయారు. కొవిడ్-19 కారణంగా తలోజా జైలులో ఒక ఖైదీ మరణించాడన్న వార్త తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని లేఖలో వారు పేర్కొన్నారు. (చదవండి: జీవించే హక్కు వీరికి లేదా?) -
జీవించే హక్కు వీరికి లేదా?
సమాజానికి రాజకీయం అవసరం. నలుగురు కూడి ఓ సమస్యకు పరిష్కారం వెతికే అద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలోచనలుంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. వాటిలో తార్కి కత ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రాయాలు, విభేదాలు కూడా ఉంటాయి. ఈ సంఘర్షణలోంచే భిన్న రాజకీయ దృక్పథాలు ఉత్పన్నమవుతాయి. విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది, అది పరిసరాలను, ప్రాంతాలను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. ఎలా రూపాంతరం చెందాలనేది అక్కడి ప్రజల విశ్వాసాలు, అవసరాలు, ఆకాంక్షలను బట్టి ఉంటుంది. ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజద్రోహమే పాలకులకు ఎప్పుడూ ప్రజా విశ్వాసాలు మూఢంగా ఉండాలి. రాజభక్తిని ప్రదర్శించే విధంగానే ఉండాలి. అంతే కానీ అవి బలమైన భావజాలంగా మారొద్దు. రాజ్యహింసను, దోపిడీని, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదగొద్దు. అట్లా ఎదిగితే వాళ్లు రాజద్రోహులు అవుతారు. వాళ్ల మీద పోలీసు నిర్బంధం పెరుగుతుంది. ఇనుప గజ్జల బూట్ల కింద పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ప్రజా విశ్వాసాల మీద నిర్బంధ దాడి మొదలవుతుంది. ఇక్కడే ధర్మదేవత అడ్డం పడి ప్రజా హక్కులను రక్షించాలి. పౌర స్వేచ్ఛను కాపాడాలి. కానీ ఎందుకో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ తీరుగానే ఆలోచన చేస్తోంది. పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. నిర్బంధించడం రాజ్యానికి కొత్తేమీ కాదు ప్రధాన మంత్రి మోదీని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారనే అభియోగం మోపి పుణే పోలీసులు హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి జైల్లో నిర్బంధించారు. అంతకుముందు ప్రొఫెసర్ సాయిబాబా మీద కూడా దేశ ద్రోహం కిందనే జైల్లో పెట్టారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో ప్రజా సంఘాల నాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించటం అనేది రాజ్యానికి కొత్తేమీ కాదు. ప్రపంచాన్ని కోవిడ్–19 మహమ్మారి కబళి స్తున్న సమయం ఇది. అన్ని వ్యవస్థలను లాక్డౌన్ చేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాం. వయసు మళ్ళిన వృద్ధుల మీద ఆ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఇటువంటి వాళ్లకు సామాజిక దూరమే పరిష్కారమని వైద్య పరిశోధనలు, పరిశీలనలు చెబుతున్నాయి. కరోనా కేసుల్లో మహారాష్ట్ర రికార్డు దేశంలోకల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మే 9 నాటికి ఈ రాష్ట్రంలో అత్యధికంగా 19,063 కేసులు నమోదు కాగా 1,089 పాజిటివ్ కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య ఈ శుక్రవారానికి 731కి చేరుకుంది. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఒక్క రాష్ట్రంలోనే 714 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. సమూహాలుగా ఉంటే వైరస్ వేగంగా విస్తరించే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే పుణే జైలులో స్థాయికి మించి ఖైదీలను బంధించి ఉంచారని, ఖైదీలకు సులువుగా కరోనా అంటుకునే ప్రమాదం ఉందని, ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవడానికి తమకు తాత్కాలికంగా బెయిలు మంజూరు చేయాలని వరవరరావు, సోమాసేన్ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ వారి ఇద్దరి బెయిల్ అభ్యర్థన పట్ల అభ్యం తరం చేసింది. కోర్టు బెయిలు నిరాకరించింది. మరో వైపు నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయనకు పిత్తాశయం, క్లోమ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 90 శాతం అంగవైకల్యం, దాదాపుగా కుప్పకూలిన వ్యాధినిరోధక సామర్థ్యం. ఛాతీ నొప్పి, గుండెదడ తదితర ఆరోగ్య సమస్యలతో ఉన్న సాయిబాబా జీవించే హక్కులో భాగంగా న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే అంగీకరించలేదు. 25 కేసులు కొట్టేసినా వీవీని వదలని రాజ్యం వరవరరావు మీద కుట్ర కేసులు కొత్తేమీ కాదు.ఆయన మీద 25 రకాల కేసులు పెట్టారు. ఇందులో ఒకటి అంటే ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్లో కుట్ర చేశారని 1974లో 46 మందిపై కుట్ర, రాజద్రోహ అభియోగం మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన వరవరరావు, చెరబండరాజు, కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, ఎం.టి.ఖాన్లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు అందరినీ నిర్దోషులుగా తేల్చింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండపల్లి సీతారామయ్య, వరవరరావు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్లో వరవరరావు, సూరి శెట్టి సుధాకర్లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఔరంగాబాద్లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005 మే 30న నిజామాబాదులో అరెస్ట్ చేశారు. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఆ కేసును కొట్టేశారు. రాజ్యహింస ప్రజా విశ్వాసాలపై దాడి ఇలా ఏ కేసు స్టడీ చేసినా రాజ్యహింసే ఉంది. ప్రజా విశ్వాసాల మీద పోలీసుల దాడి కనిపిస్తుంది. బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టు ఈ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరపాలి. సామూహిక ప్రదేశాల్లో నివసించడం వలన కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒక్కసారి వ్యాధి అంటుకుంటే ఒకవైపు వృద్ధాప్యం మరోవైపు వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకున్న వీళ్లు తట్టుకుని నిలబడటం కష్టం. అదే జరిగితే వాళ్ల జీవించే హక్కును రాజ్యాంగం హరించినట్లు అవుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ తరహాలో కాకుండా న్యాయవ్యవస్థ విభిన్నంగా, తార్కిక ఆలోచన చేయాలి. ఉద్యమకారులకు సత్వర న్యాయాన్ని అందించాలి. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని హక్కుల ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను ఉపసంహరించుకోవాలి. జీవించే హక్కును గౌరవించాలి. వ్యాసకర్త: సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్ మొబైల్ : 94403 80141 -
వరవరరావు కేసు: ఎఫ్బీఐకు హార్డ్డిస్క్!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్ హింసాకాండ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును నవంబర్ 17 ,2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని వరవరరావు ఇంట్లో సోదాలు చేసిన అనంతరం పోలీసులు స్వాధినం చేసుకున్న హార్డ్ డిస్క్ ధ్వంసం కావడంతో.. అందులోని డేటాను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డేటాను రాబట్టేందుకు పూణె పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)ను ఆశ్రయించారు. వరవరరావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్న హార్డ్ డిస్క్ను ఇప్పటికే నాలుగు ఫోరెన్సిక్ ల్యాబ్లకు పంపించారు. మొదట పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా.. ఎటువంటి డేటాను గ్రహించక పోవడంతో.. ఆ తర్వాత ముంబైలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ డైరెక్టరేట్కు చేరవేశారు. అక్కడనుంచి డేటాను తెరవలేకపోవడంతో.. అనంతరం గుజరాత్, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లలో తెరిచే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ధ్వంసమయిన హార్డ్ డిస్క్ నుంచి డేటాను పొందడం కష్టతరమవడంతో.. అమెరికాకు చెందిన ఎఫ్బీఐకు పంపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా 2017 డిసెంబర్ 31న పూణేలో మావోయిస్టుల మద్దతుతో ఎల్గర్ పరిషత్ సమావేశం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగం, కులాల మధ్య అల్లర్లకు కారణమై.. భీమా కోరెగావ్లో హింసాకాండ చెలరేగింది. ఇక భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎల్గర్ పరిషత్-కోరెగావ్ భీమా కేసులో.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే నెపంతో వరవరరావును అరెస్టు చేశారు. అదేవిధంగా విప్లవ సంఘాల నేతలకు మావోయిస్టులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే అభియోగాలతో సుధా భరద్వాజ్, సుధీర్ ధవాలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, షోమా సేన్పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. -
మేధావుల విడుదలకు పోరాడాలి: హరగోపాల్
హైదరాబాద్: ప్రజాస్వామ్య మేధావులు వరవరరావు, సాయిబాబా సహా 11 మంది విడుదల కోసం మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు రాజీ లేని పోరాటం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఉద్యమించే హక్కుపై అప్రకటిత ఎమర్జెన్సీ (1975 జూన్ 25 ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా), ఉపా చట్టాన్ని రద్దు చేయడం, ప్రజాస్వామికవాదుల అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీల విడుదల కోసం పౌరహక్కుల సంఘం, టీఎస్, ఏపీ ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజలు విముక్తి చెంది సమసమాజం రావాలని కోరుకుంటూ ఉన్నతమైన విలువల కోసం పోరాడుతున్న మేధావులను జైళ్లలో పెట్టి వారి గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా, వరవరరావు తదితరులపై ఏ నేరాలూ లేవని.. ఆయుధాలతో చర్యను నిషేధించారే కానీ మావోయిస్టు రాజకీయాలను కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుండటం వల్లే వరవరరావు సహా 11 మందిని జైలులో పెట్టారని ఆరోపించారు. అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సాయిబాబా మావోయిస్టు కార్యాకలాపాలను అమలు చేస్తాడా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, ప్రొఫెసర్ ఖాసీం, బహుజన ప్రతిఘటన వేదిక నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
ఖైదు కవితో కరచాలనం
ప్రధాని హత్యకు కుట్ర చేశారనే అర్థం పర్థం లేని ఆరోపణ కింద, నకిలీ ఉత్త రాలు సాక్ష్యాలుగా చూపి విప్లవ కవి వరవరరావును ఐదు నెలలుగా దుర్భరమైన పూణే జైల్లో నిర్బంధించారు. సెషన్స్ కోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కలిసే అవకాశం ఉంటుందని తెలిసి వీవీని చూడ్డానికి తెలంగాణ నుండి 26 మంది రచయితలు, ప్రజాసంఘాల మిత్రులం వెళ్లాం. నిరీక్షణలో అరుణ్ ఫెరేరా సహచరి పరిచయమైంది. అరుణ్ ఇదివరకే సుమారు ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. జెన్నిఫర్ కొడుకుని తలచుకుంటూ తను మొదటిసారి అరెస్టయినప్పుడు వాడికి రెండేళ్లని, విడుదలయ్యాక వచ్చిన తండ్రిని వింతగా చూస్తుంటే మీ నాన్న అని పరిచయం చేయవలసి వచ్చిందని చెప్పింది. ఇప్పుడు పన్నెండేళ్లొచ్చి విషయాలు అర్థం అవుతున్నాయి గనుక నాన్నను మళ్లీ ఎప్పుడు చూస్తానని అడుగుతున్నాడట. చివరికి వీవీని చూడగలిగాం. నల్లబడిన శరీర రంగు, సన్నబడ్డ దేహం, కానీ అదే ఉత్సాహం. దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటే కళ్లను కప్పేస్తూ నీటిపొర. వీవీ ముఖంలో ఎన్నడూ లేనంతగా వృద్ధా ప్యం పైకి తేలింది. షోమాసేన్ బక్కచిక్కిపోయింది. చూపుడువేలితో అభినయిస్తూ చాలా సన్నబడ్డావని పరామర్శిస్తున్న మిత్రులకు ‘మంచిదేగా’ అని నవ్వుతూ సమాధానం చెప్తున్నారామె. సుధా భరద్వాజ్కు అభివాదం చేస్తుంటే విప్పారిన చిరునవ్వుతో ఆమె పలకరింపులు ప్రసన్నంగా ఉన్నాయి. బయట ఉంటే తీరిక లేకుండా ఉండే వీవీకి ఇక్కడి ఖాళీతనంతో పాటు ఉన్న భౌతిక స్థితి వల్ల, అననుకూల పరి సరాల్లో వయసు వల్ల తిరగబెట్టిన అనారోగ్యాల వల్ల చాలా అలసిపోయి కనిపిస్తున్నారు. ఇరుకు బెంచీలో ఆయన కోరికమీద పక్కన సర్దుకొని కూర్చున్నాను. అక్కడ సాయిబాబా, ఇక్కడ ఈయన? తనతో పాటు అదే బ్యారక్లో ఉంటున్న ఉరిశిక్షపడ్డ ఖైదీల గురించి, ముఖ్యంగా వారిలో కేవలం ముస్లింలుగా పుట్టినందువల్ల అల్ఖైదా ముద్ర వేయించుకున్న ఇద్దరని గురించి బాధపడుతున్న వీవీ, సాహిత్యం గురించి ముచ్చటిస్తూ తెలుగులో మాట్లాడక ఎన్నాళ్లయిందో అన్నప్పుడు తన స్థితిని ఆదివాసులతో పోల్చుకున్నారు. ఆదివాసుల భాష, సంస్కృతి, ఉనికి కూడా గల్లంతవుతున్నది కదా, అదింకెంత దుర్భరం అన్నారు. నోట్బుక్కులెన్నో కవిత్వం, అనువాదాలు, అనుభూతులతో నింపేసారు కానీ, తెలుగు కావడం వల్ల బైటికి పంపనివ్వడంలేదట. ఇంగ్లీషులో ఉత్తరాలు రాయగలిగినా, సహచరికి తెలియని ఇంగ్లీషు భాషలో రాయలేక మానేసానన్నారు. ఎనభైలలో జైలునుండి రాసిన ప్రేమలేఖల్లో సెన్సార్ అవుతున్న ప్రేమ గురించి బాధపడ్డ కవి, ఇప్పుడు ప్రేమను వ్యక్తీకరించే భాష కూడా చేతికందక విలవిల్లాడుతున్నాడా? అక్కడ నాగ్పూర్లో సాయిబాబాను కనీసం కుటుంబసభ్యులతో కూడా తెలుగు మాట్లాడనివ్వడం లేదని వసంత చెప్పింది. ప్రొఫెసర్ షోమాసేన్ ఆర్థరైటిస్ వల్ల కిందకూర్చోలేక, ఎన్నిసార్లు విన్నవించినా కుర్చీ ఇవ్వని జైలు కాఠిన్యంలో శరీరం కృశించిపోయే స్థితి. రిటైర్ అవ్వడానికి కొద్దిరోజుల ముందు ఈ కేసువల్ల నాగపూర్ యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని స్థితి. ప్రతిష్టాత్మక పీఎంఆర్డీ ఫెలోషిప్ సాధించిన చురుకైన పరిశోధక విద్యార్థి మహేశ్ రౌత్, తన చదువును, మనసును, ఆచరణను కూడా ఆదివాసులపై లగ్నం చేసినందుకు ఇక్కడ ఇలా వీళ్ల మధ్యకు వచ్చి చేరాడు. వీళ్ల బెయిల్ వినతిని తిరస్కరించమని ఆరోజు ప్రాసిక్యూషన్ చేసిన వాదనలో ఎల్గార్ పరిషత్ పేరు మీద దళితుల్ని సమీకరించడం అనే ‘నేరాన్ని’ గురించి పదేపదే ప్రస్తావించడం విన్నాం. వీవీని ఉద్దేశించి ‘బడా నేతా’ అంటున్నప్పుడు ఆయనకేసి చూస్తే నవ్వుతున్నారు. ఆయనే కాదు, ఆ తొమ్మిదిమందీ ఎవరిపేరు ప్రస్తావనకొచ్చినా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిరునవ్వులు చిందిçస్తున్నారో, అంతగా కసి, ద్వేషం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతులో వినిపించి ఆశ్చర్యపోయాం. ఆ రోజే విన్న కొత్త వింత వాదన, భీమా కోరేగావ్ అల్లర్లలో నిందితులుగా సంఘ్పరివార్ నాయకులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బొటేల పేర్లు డిఫెన్స్ వారు తెస్తున్నారని, వారికి అందులో ఏ ప్రమేయం లేకున్నా కేసు తప్పుదారి పట్టించడానికే ఇందులోకి లాగుతున్నారని చెప్పడం. నిజానికి భీమా కోరేగావ్ అల్లర్ల మీద మొదట దాఖ లైన ఎఫ్ఐఆర్ ఆ ఇద్దరి మీదే! వీడ్కోలు సమయంలో బిగిసిన పిడికిలి చూస్తున్నప్పుడే కాదు ఎప్పటికీ వీవీ చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘‘దళితులు ఆదివాసీల జీవితాలను, పోరాటాలను గురించి మాట్లాడే స్వేచ్ఛను మేం కోల్పోయాం. అది బాధాకరమేగానీ, మా గురించి మాట్లాడే స్నేహితులు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతే ఆ మాత్రం స్వేచ్ఛ త్యాగం చేసిన తృప్తి మిగులుతుంది’’. వ్యాసకర్త విరసం కార్యవర్గ సభ్యురాలు ఈ–మెయిల్ : varalurwa@gmail.com పి.వరలక్ష్మి -
వరవరరావు కేసులో మీ వైఖరి ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ్ పరివార్ కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలపై ‘భీమా కొరేగాం హింసా కాండ కేసు’లో వరవరరావును ఇరికించిన విషయంలో మీ వైఖరేంటో బహిరంగంగా ప్రకటించాలని ఆయన సతీమణి హేమలత కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల ఎన్నికల ప్ర చారంలో ప్రధాని మోదీ అబద్ధాలు, అక్రమాల మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే వరవరరావుపై పన్నిన అబద్ధపు కేసు గురించి మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. గతంలో విప్లవ రచయితల సంఘంపై నిషే ధమున్న సమయంలో చంచల్గూడ జైలులో అక్రమ నిర్బంధంలో ఉన్న వరవరరావును 2005 సెప్టెంబర్ 3న కేంద్ర మంత్రి హోదాలో మీరు కలిసిన విషయాన్ని గుర్తుచేస్తున్నానని తెలిపారు. ప్రస్తుత అక్రమ నిర్భంధం కేసులోనూ అదే వైఖరి తీసుకుంటారని ఆశిస్తున్నా నని చెప్పారు. గత 45 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరవరరావుపై 25 అబద్ధపు కేసులు బనాయించారని, ఇవన్నీ రుజువుకాకపోయినా ఏడేళ్ల జైలు జీవితాన్ని గడిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం పుణే పోలీసులు పెట్టిన కేసు, జైలులో ఉండగానే అహోరీలో బనాయించిన మరొక కేసు కూడా అబద్ధపు కేసులని, న్యాయస్థానాల్లో నిలబడవని, బీజేపీ ప్రభుత్వం అక్రమ నిర్బంధంలో ఉంచడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆరోగ్యం బాగా లేని 79 ఏళ్ల వయసున్న వరవరరావును ఇలా వేధించడం అమానవీయం, చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. గతంలో అన్ని కేసుల విచారణకు హజరైనట్లే ఈ విచారణకు కూడా హాజరవుతారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వరవరరావును వెంటనే బెయిల్ మీద విడుదల చేయాలని కోరారు. మోదీ మీరు ప్రకటిస్తున్న వ్యతిరేకత నిజమైనదేనని, చిత్తశుద్ధి కలిగినదేనని చూపుకోవాలంటే వరవరరావు అక్రమ నిర్భంధం మీద మీ వైఖరి ప్రజలకు తెలపాలని హేమలత అభ్యర్థించారు. -
వరవరరావు విడుదలకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరావు విడుదలకు ఆదేశించాలని కోరుతూ ఆయన సతీమణి హేమలత భారత ప్రధాన న్యాయమూర్తికి బహిరంగలేఖ రాశారు. 79 ఏళ్ల వయో భారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుపై కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు దేశ, విదేశాల ప్రముఖులు సంఘీభావం తెలిపారు. బహిరంగలేఖకు మద్దతు ప్రకటిస్తూ ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, వసంత కన్నబీరన్, వీక్షణం సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ ఈ సమావేశంలో మాట్లాడారు. ఫాసిజం వేగంగా విస్తరిస్తోంది... ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని, గత ఐదేళ్లుగా దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వరవరరావును విడుదల చేయాలని కోరినవారిలో ఆయన అభిప్రాయాలతో, నమ్మకాలతో విభేదించేవాళ్లు సైతంఉన్నారని చెప్పారు. దేశంలో ఫాసిజం అత్యంత వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్తులో అది మరింత ప్రమాదకరంగా మారుతుందన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ కుట్రకేసు మొదలుకొని గత నాలుగున్నర దశాబ్దాలుగా వరవరరావుపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టిందని, అన్నింటిలోనూ ఆయనే గెలిచారన్నారు. అక్రమకేసులు మోపినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వరవరరావును వెంటనే విడుదల చేయాలని కోరారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావును జైల్లో ఉంచడం తగదన్నారు. సమావేశంలో జహీరుద్దీన్ అలీఖాన్, కె.కాత్యాయని, దేవీప్రియ, ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి, వసంత కన్నబీరన్ తదితరులు లేఖకు మద్దతుగా మాట్లాడారు. ఆయన నిర్దోషి... గత 45 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న వరవరరావు నిర్దోషి అని, ఆయనపై ఇప్పటివరకు బనాయించిన 25 కేసుల్లో 13 కేసుల్లో నిర్దోషి అని న్యాయస్థానాలు ప్రకటించాయని హేమలత తెలిపారు. మిగిలిన 12 కేసులు విచారణ స్థాయికి రాకముందే పోలీసులు ఉపసంహరించుకున్నారన్నారు. పుణే పోలీసులు బనాయించిన భీమా కోరేగావ్ కేసులోనూ ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వా సం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాస్వామికవాదులు, మేధావులతోపాటు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, థాయ్లాండ్, శ్రీలంకకు చెందిన పలువురు రచయితలు, మేధావులు సంఘీభావం తెలుపుతూ ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేశారని చెప్పారు. -
వరవరరావుపై పుణే పోలీసుల చార్జిషీట్
పుణే : బీమా కొరేగావ్ కేసులో అర్బన్ నక్సల్స్పై పుణే పోలీసులు 1837 పేజీలతో కూడిన చార్జిషీట్ను దాఖలు చేశారు. పౌరహక్కుల కార్యకర్త, విరసం నేత వరవరరావు, గణపతి, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నోన్ గోన్సాల్వ్స్పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. బీమా కొరేగావ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగంపై వరవరరావు సహా పలువురు హక్కుల కార్యకర్తలను గత ఏడాది పుణే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో విప్లవ సంఘాల నేతలకు సంబంధాలున్నాయని, మావోయిస్టుల లేఖ ఆధారంగానే అర్బన్ నక్సల్స్ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండగా, అకారణంగా తమను అరెస్ట్ చేశారని, మావోయిస్టుల లేఖ కల్పితమని వరవరరావు గతంలో పేర్కొన్నారు. -
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా?
రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూడదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. ఈ క్రమంలోనే 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫరేరా, అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్తుంబ్డేలు రాజద్రోహులయ్యారు. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమాయకులను ఏళ్లకు ఏళ్లుగా జైళ్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ రాజ్య హింసకు అంగీకార ముద్ర వేసే ధోరణి బలపడుతోంది. దేశంలో, రాష్ట్రలో ఎప్పుడు సాధారణ ఎన్నికలొచ్చినా.. ప్రజల్లో సానుభూతి పవ నాలు తగ్గినట్లు అనిపిం చినా.. పాలకులపై హత్యా యత్నం కుట్రలు బయట కొస్తుంటాయి. నిఘా వర్గాలు చెమటోర్చి కుట్రను పసిగట్టి ‘అత్యవసరం’గా బయట పెడుతూనే ఉంటాయి. ఇది రాజ్యం అల్లిన విషవలయం. ఆధిపత్య అస్తిత్వాల పాలనలో ఈ వృత్తం పునరావృతమవుతూనే ఉంటుంది. రాజ్యా ధికారం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ‘రాజ్యం’ లో వివిధ రూపాల్లో హింస రచన జరుగుతూనే ఉంటుంది. దాంట్లో భాగమే ఇలాంటి కుట్రకోణాలు. వరవరరావుతోపాటు హక్కుల ఉద్యమకారులపై మోపిన రాజద్రోహం ఎన్నికల అంకగణితంలో ఓట్ల లెక్కను సాధించే ఓ అధ్యాయం మాత్రమే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను హత్య చేసేందుకు పాకిస్తాన్ సహాయంతో కుట్ర పన్నుతున్నారని గుండెలు బాదుకుంటూ మొత్తుకుని ఓట్లు, సీట్లు సంపాదించిన మోదీ.. వేగంగా పడిపోతున్న తన పొలిటికల్ గ్రాఫ్ను నిల బెట్టుకోవటానికి మరో హత్యాయత్నంను తెర మీదకు తెచ్చారు. ప్రధానిని హత్య చేయటానికి మావోయిస్టులు కుట్ర పన్నారని పుణే పోలీసులు ఆరోపించటం, హక్కుల ఉద్యమకారులు సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, మహేశ్ రౌత్, సుధా భరద్వాజ్, వర్నన్ గోంజాల్వెస్, అరుణ్ ఫరేరా, వరవరరావుల మీద కుట్ర కేసులు పెట్టి, నెలనెల తరబడి వాళ్లను జైల్లో బంధించి ప్రజల్లో ఓ మిధ్యా సానుభూతి వలయాన్ని పరిచి రాజ్యాధికారం సుస్థిరపరుచుకునే ప్రయత్నమే. రాజ్యానికి విశ్వాసాలు ఎప్పుడూ మూఢంగానే ఉండాలి. అవి బలమైన భావజాలంగా మారకూ డదు. రాజ్యహింసను, మత విద్వేషాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగితే రాజ్యం వాళ్లను రాజద్రోహుల కింద జమ కడుతుంది. అట్లానే కాళ్లు చేతులు చచ్చుబడి పోయి, 90 శాతం ఆంగవైకల్యంతో, 15 రకాల వ్యాధులతో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ, దాదాపు వృద్ధాప్యం అంచుల్లో ఉన్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫరేరా, అంబేడ్కర్ మన వడు ఆనంద్ తేల్తుంబ్డేలు రాజద్రోహులు అయ్యారు. ప్రజా విశ్వాసాల మీద పోలీసులు దాడి చేస్తూ.. కృత్రిమ లేఖలు, ఊహాత్మక అభియోగాలతో అమా యకులను ఏళ్లకు ఏళ్లుగా జైల్లో బంధించే హింస కొనసాగుతుంటే, కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ. రాజ్యహింసకు అంగీకార ముద్రవేసే ధోరణి బలపడుతోంది. బ్యాంకులను లూటీ చేసి రూ కోట్లకు కోట్లు కొల్లగొట్టి దేశంలో కృత్రిమ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించే ఆర్థిక నేరగాళ్లు మాత్రం దేశ ద్రోహులు కాదు. దేశీయ బ్యాంకుల నుంచి రూ వేల కోట్ల దబ్బును దర్జాగా విదేశాలకు పట్టుకుని పోతుంటే ఏ చట్టం కూడా వాళ్లకు అడ్డు రాదు. బడుగు బలహీన, మధ్య తరగతి వర్గాలు తమ చెమట, రక్తమాంసా లను రూపాయిగా మలిచి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును వైట్ కాలర్ దొంగలు ఎత్తుకుపోతుంటే రాజ్యం కళ్లు మూసుకుంటోంది. నీరవ్ మోదీ అనే వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 11,360 కోట్లు, నీలేష్ ఫరేఖ్ రూ. 2,500 కోట్లు దోచుకుని విదేశాలకు వెళ్లిపోయేంతవరకు రాజ్యా నికి తెలియదు. విజయ్ మాల్యా బ్యాంకులకు రూ. 9,500 కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయాక కానీ మనకు ఆ విషయం తెలియదు. రైతులు పంట రుణాలు తీసుకుని తిరిగి కట్టలేకపోతే రెవెన్యూ రిక వరి(ఆర్ఆర్ యాక్ట్) కింద ఆస్తులు జప్తు చేస్తారు. ఆçస్తులు జప్తు చేయటాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు వేలమంది ఉన్నారు. కానీ వీళ్ల మెడలు వంచి పొరుగు దేశాల నుంచి పట్టుకొని వచ్చి తిన్నది కక్కేయటానికి మన రాజ్యాంగంలో చట్టాలు, ఐపీసీ సెక్షన్లు ఏమీ ఉండవు. దేశంలో కుట్ర కేసులు కొత్తేమీ కాదు. ప్రభుత్వా నికి వ్యతిరేకంగా సికింద్రాబాద్లో కుట్ర చేశారని 1974లో ‘సికింద్రాబాద్ కుట్ర కేసు’ పెట్టారు. 1971 నుంచి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ కుట్ర కేసు నమోదు చేశారు. 46 మందిపై కుట్ర, రాజద్రోహ నేరం అభియోగాలు మోపారు. నాటి నక్సలైట్ నేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి లతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వర వరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు సికింద్రాబాద్ కుట్ర కేసులో అంద రినీ నిర్దోషులుగా ప్రకటించింది. 1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ రాంనగర్ కుట్ర కేసు పెట్టారు. కొండ పల్లి సీతారామయ్య వంటి నక్సల్స్ నేతలు, వరవర రావు తదితర విప్లవ రచయితలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో కేఎస్పై కేసు ఉపసంహరించుకున్నారు. కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో వరవరరావు, సూరిశెట్టి సుధాకర్లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు. 2003 సెప్టెంబర్లో వరవరరావు, సూరిశెట్టి సుధా కర్లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టివేసింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి మావోయిస్టు, విప్లవ రచయితలు కుట్ర పన్నారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఔరంగాబాద్లో కుట్ర పన్ని, అది అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విరసం సభ్యులను 2005లో మే 30న నిజా మాబాదులో అరెస్ట్ చేశారు. ఆయుధాలు సేకరించారు, ప్రభుత్వంపై యుద్ధ ఏర్పాట్లు చేశారన్న పోలీసుల వాదనతో విభేదిస్తూ.. 2010 ఆగస్ట్ 2న నిజామాబాద్ అడిషనల్ సెషన్స్జడ్జి ఆ కేసును కొట్టేశారు. 2004లో చంద్రబాబు ప్రభు త్వం కృత్రిమ లేఖ లతో నా మీద కూడా టాడా కేసు పెట్టింది. అభియోగం తప్పు అని కోర్టులు అంతిమ తీర్పులు ఇచ్చాయి. నిజమే..! కానీ కృత్రిమ లేఖ లతో, ఊహా త్మక అభియోగాలతో అక్రమంగా చార్జిషీట్ మోపిన పాలకులు, పోలీసుల మీద చర్యలు ఏవి? రాజ్యాంగంలో అటువంటి చట్ట సవరణ ఎందుకు తీసుకురావటం లేదు? కనీసం ఆత్మవిమర్శ అయినా చేసుకోవాలి. పరిపాలన చివరి దశలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని హక్కుల ఉద్యమ కారులపై పెట్టిన రాజద్రోహం కేసు లను ఉపసంహరించుకోవాలి. వ్యాసకర్త : సోలిపేట రామలింగారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే సెల్ : 94403 80141 -
చల్లారని నెగళ్లు
చెట్టు గురించో, పిట్ట గురించో రాసినంత తేలిక కాదు–చెట్టు వేళ్ల విస్తృతి గురించీ, పిట్ట రెక్కల శక్తి రహస్యం గురించీ రాయడం. అటువంటి తేలిక కాని పనినే తలకెత్తుకున్నారు అరవై ఏళ్ల క్రితం వరవరరావు. డజను వరకూ సంకలనాలు, వెయ్యి పేజీల పైబడి పరుచుకున్న అక్షరాలు.. రగిలించిన చైతన్యం, ఎక్కుపెట్టిన ప్రశ్నలు ఆయనకు సముచిత గౌరవాన్నే ఇచ్చి, కటకటాల వెనక్కు నెట్టాయి. కవిత్వం రాయకుండా ఉండలేక రాసినవి కావు ఈ కవితలు, రాయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, నొప్పిప డుతూ రాసినవి. అభిప్రాయాల్లో నిర్దిష్టత మాత్రమే కాదు, భావ వ్యక్తీకరణలోని కవి తాంశ కూడా పఠితులను విలవిలలాడేలా చేయడం వరవరరావు కవిత్వం ప్రత్యేకత. సిద్ధాంతాలను జీవితంలోకి ఇంకించుకుని సంఘంకోసం తపనతో వ్యక్తీకరించడం కేవలం ఆయనకే సాధ్యం. ఎవరైనా ఆరు దశాబ్దాల అసలు సిసలు చరిత్రను అధ్యయనం చేయాలనుకుంటే వివి కవితలన్నీ మైలురాళ్లుగా నిలుస్తాయి. ఒక్కో కవితా.. రాజ్యం చేసిన ఒక్కొక్క తప్పును వేలెత్తి చూపుతుంది. ప్రతి అక్షరం.. రాజ్యహింసలో ఒరిగిన కన్నీటి బిందువుల ఆవేదనను ప్రతిబింబిస్తుంది. వీవీ అనుభవించినంత జైలు జీవితాన్ని బహుశా ప్రపంచంలో మరే కవీ అనుభవించి ఉండడు. ఎంతో విస్తృతమైన సామాజిక కార్యాచరణలో తలమునకలుగా ఉండి, ఇంత కవిత్వాన్ని సృజించడం మాటలు కాదు. ‘విప్లవ కవిత్వమంటే..’ అంటూ రొడ్డకొట్టుడు విమర్శకులు తొలి నాళ్ల నుంచీ నోళ్లు నెప్పెట్టేలా వాగుతూనే ఉన్నారు. ‘నెత్తురంటిన చేతుల్ని గురించి/నెత్తీనోరూ బాదుకొని మొత్తుకోవాలి తప్ప/కొత్త కాగితం వాసనో/అచ్చు వాసనో వేసే/అస్పష్ట కవిత్వం పక్కన/నీ ఫొటో తప్ప నిర్దిష్టంగా పోల్చుకునేదేమీ ఉండదు’అని ఎప్పటికప్పుడు ఆయన స్పష్టంగా సమాధానమిస్తూనే ఉన్నారు. జీవితానికీ, కార్యాచరణకీ, కవిత్వానికీ మధ్య వ్యత్యాసం లేశమాత్రమైనా లేకపోవడం వల్లే ఆయన అక్షరాలు నిప్పుల కొలిమి మీద కవాతులా కణకణమండుతూంటాయి. కవి నిర్బంధంలో ఉన్నప్పుడు అతని కవిత్వాన్ని గానం చేయాల్సి రావడం ఒక ఆవేదనాపూరిత సందర్భమే కాదు, రాజ్య వైఖరికి నిదర్శనం. ఓసారి ఆ కవిత్వాన్ని పునశ్చరణ చేసుకోవడం, ఆ కవిని ఆవాహన చేసుకోవడం అక్షరాల్ని ప్రేమించే ప్రతి ఒక్కరి విధి. నెగళ్లు చల్లారకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత. – దేశరాజు (నేడు పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మహబూబ్నగర్ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఉదయం పది గంటల నుంచి ‘విప్లవ కవి వరవరరావు కవిత్వంతో ఒక రోజు’ సాహిత్య సభ సందర్భంగా..) -
పోలీసుల కస్టడీకి వరవరరావు
పుణే: మావోయిస్టులతో సంబంధాల కేసులో విరసం సభ్యుడు వరవరరావును మహారాష్ట్రలోని ఓ కోర్టు నవంబర్ 26 వరకూ పోలీసుల కస్టడీకి అప్పగించింది. సుప్రీంకోర్టు ఈ నెల 15వరకూ విధించిన గృహనిర్బంధం ముగిసిన నేపథ్యంలో శనివారం ఉదయం పుణే పోలీసులు హైదరాబాద్లో వరవరరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పుణేలోని జిల్లా సెషన్స్ జడ్జి కిశోర్.డి.వదనే ముందు ఆదివారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల పవార్ వాదిస్తూ.. గణపతి రహస్య స్థావరాలతో పాటు మావోల లేఖల్లో ఉన్న కోడ్భాషపై విచారించేందుకు వరవరరావును 14 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం 9 రోజుల పాటు వరవరరావును పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
వరవరరావు అరెస్టు
హైదరాబాద్: భీమా కొరేగావ్ కుట్ర కేసులో విప్లవ రచయితల సంఘం నేత వరవర రావును మహారాష్ట్ర పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. రెండున్నర నెలలు గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు ట్రాన్సిట్ వారంట్పై దాఖలు చేసిన వ్యాజ్యం పరిష్కారమైనట్టుగా హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో పుణే ఏసీపీ స్థాయి పోలీసు అధికారి శివాజీ పవార్ నేతృత్వంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. వరవరరావు నివాసముంటున్న ఆర్టీసీ క్రాస్రోడ్డులోని జవహర్నగర్లో హిమసాయి హైట్స్ అపార్ట్మెంట్ ముందు ప్రజాసంఘాల కార్యకర్తలు ఆందోళన చేస్తుండగా మరోవైపు పోలీసులు చాకచక్యంగా ఆయన్ను వ్యాన్లో తీసుకెళ్లిపోయారు. వరవరరావు భార్య హేమలత మాట్లాడుతూ రాత్రిపూట వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లడం దారుణమన్నారు. వరవరరావును వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పుణేకు తరలించినట్టు తెలిసింది. రెండున్నర నెలలపాటు గృహ నిర్బంధం ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులతో కలసి కుట్రకు పాల్పడినట్టు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వరవరరావుతోపాటు మరో నలుగురిని పోలీసులు ఆగస్టు 28న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టులపై ప్రముఖ రచయిత్రి రోమిలా థాపర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయం సేఫ్టీవాల్వ్ వంటిదని సుప్రీంకోర్టు పేర్కొంటూ హక్కుల నేతల గృహనిర్బంధానికి అనుమతించింది. అనంతరం ఈ కేసును హైకోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలంటూ సూచించింది. అయితే, బెయిల్ కోసం వరవరరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుట్ర కేసులు ఎత్తివేయాలి.. వరవరరావుపై కుట్ర కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసం వద్ద తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఆందోళనలో వేదిక కన్వీనర్లు చిక్కుడు ప్రభాకర్, వి.సంధ్య, విరసం నాయకులు కూర్మనాథ్, అరవింద్, అరుణోదయ రామారావు, టీపీఎఫ్ నేత నలమాస కృష్ణ, ఇఫ్టు నాయకురాలు అరుణ, చైతన్య మహిళా సంఘం నుంచి దేవేంద్ర, తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి సందీప్, పీడీఎస్యూ నుంచి మహేష్, పీడీఎం నుంచి రాజు, ఏపీసీఎల్సీ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, వేణుగోపాల్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంటనే విడుదల చేయాలి: విరసం వరవరరావును, మరో నలుగురు సుప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు సుధాభరద్వాజ్, గౌతమ్ నవలఖా, వెర్నన్ గొంజాల్వెస్, అరుణ్ ఫెరీరాలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. వారిని వెంటనే విడుదల చేయాలని విరసం కార్యదర్శి పాణి డిమాండ్ చేశారు. అప్రజాస్వామికం ప్రొఫెసర్ హరగోపాల్ ఏ నేరం చేయని వ్యక్తిని అరెస్టు చేయడం రాజ్యం చేస్తున్న నేరమని పౌర హక్కులనేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. వరవరరావుకు ఎలాంటి సంబంధం లేని భీమా కొరేగావ్ ఉదంతంలో ఇరికించి కట్టుకథలల్లి ఆయన పైన నిర్బంధం విధించారని, ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య అని అన్నారు. అరెస్టును ఖండించారు. -
వరవరరావుకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. దీంతో ఏ క్షణమైన పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్ వారెంట్ అమలును ఇటీవల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ గడవు ముగిసేలోపు పూణే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాగా గృహనిర్భందంలో ఉన్న వరవరరావుకు చికిత్స ఉందించాలని హైకోర్టు అదేశించినా.. ఇప్పటివరకు చికిత్స అందలేదని ఆయన తరుఫున న్యాయవాది న్యాయస్థానంలో తెలిపారు. -
వరవరరావుకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్ వారెంట్ అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ట్రాన్సిట్ వారెంట్ను రెండు రోజులపాటు నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. మహారాష్ట్ర పోలీసులు తనను పుణేకు తీసుకెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ట్రాన్సిట్ వారెంట్ను సవాలు చేస్తూ వరవరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మహదేవ్ వాదనలు వినిపిస్తూ, గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావుకు చికిత్సను అందించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా, ఆయనకు చికిత్స అందలేదని తెలిపారు. -
వరవరరావుకు వైద్య సేవలు అందించండి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసులో, తనను పుణేకు తరలించేందుకు హైదరాబాద్లోని కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ విరసం వ్యవస్థాపకుల్లో ఒకరైన వరవరరావు హైకోర్టును ఆశ్రయించారు. తనను పుణేకు తరలించేందుకు హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జారీచేసిన ట్రాన్సిట్ ఉత్తర్వుల్ని కొట్టివేయాలని వరవరరావు తన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్రావు విచారించి ప్రతివాదులైన మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న తనకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుల్ని అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల్ని చికిత్సకోసం పంపాలని తెలంగాణ రాష్ట్ర పోలీసుల్ని ఆదేశించారు. విచారణ ఈనెల 26కి వాయిదా పడింది. -
హైకోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన వరవరరావు
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్ర పోలీసులు జారీ చేసిన ట్రాన్సిట్ వారెంట్ను కొట్టివేయాలని విరసం నేత వరవరరావు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. భీమ్ కోరేగామ్ అల్లర్ల ఘటనలో భాగంగా వరవరరావు గృహనిర్భందంలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు తెలిపారు. పిటీషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వరవరరావు ఆరోగ్యంపై నిమ్స్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఆయన ఇంటికి వెళ్లి వైద్యం అందించాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. -
గణపతి, వరవరరావుల మధ్య ఈమెయిల్స్!
పుణె: మావోయిస్టులతో సంబంధం ఉందనే ఆరోపణలపై జూన్లో అరెస్టైన ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ పిటిషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వ్యతిరేకించింది. విరసం నేత వరవరరావు, పరారీలో ఉన్న సీపీఐ (మావోయిస్టు) నేత గణపతిల మధ్య జరిగిన ఈ–మెయిల్ సంభాషణలను మహారాష్ట్ర తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. హక్కుల కార్యకర్తలు సురేంద్ర గాడ్లింగ్, సోమసేన్, వెర్నన్ గోన్సాల్వేజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్లు జూన్లో అరెస్టయ్యారు. ఆ తర్వాతనే ఈ ఈ–మెయిల్ సంభాషణలు జరిగాయని ప్రభుత్వ తరపు న్యాయవాది ఉజ్వలా పవార్ కోర్టుకు తెలిపారు. ఈ–మెయిల్స్ను గణపతి వరవరరావుకు పంపారనీ, హక్కుల కార్యకర్తలు అరెస్టైన అంశంపై సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ ఆందోళన చెందినట్లు ఈ–మెయిల్ ద్వారా తెలుస్తోందని పవార్ పేర్కొన్నారు. -
అరెస్ట్పై హైకోర్టుకు వరవరరావు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసులు తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. వరవరరావు అరెస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, చిక్కడపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతోపాటు మహారాష్ట్ర విశ్రాంబాగ్ ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన అరెస్ట్తోపాటు తనను పుణేకు తరలించేందుకు వీలుగా హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ ఏడాది ఆగస్టు 28న జారీచేసిన ట్రాన్సిట్ రిమాండ్ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వరవరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది డి.సురేశ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఆగస్టు 28న తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు కలిసి వరవరరావు ఇంటిలో సోదాలు నిర్వహించి, అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారన్నారు. ఇలా మరికొందరిని కూడా అరెస్ట్ చేశామని, తర్వాత వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని కోర్టుకు నివేదించారు. దీంతో అరెస్టయిన వారిలో ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారన్నారు. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ వ్యక్తి విడుదలకు ఆదేశాలిచ్చిందని, ఈ నేపథ్యంలో పిటిషనర్ కూడా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. -
ఆ పిటిషన్ను విచారణ చేయనవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: పౌర హక్కుల నేత వరవరరావును ఇటీవల పుణే పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన సతీమణి హేమలత దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణను ముగించింది. పౌర హక్కుల నేతల అరెస్టు వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, ఈ వ్యాజ్యంపై విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్ల ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరవరరావుతో పాటుగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పుణే పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, వరవరరావు అరెస్ట్పై ఆయన సతీమణి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేసింది. -
వరవరరావుపై ఒక్క కేసూ నిలువలేదు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విరసం నేత వరవరరావు, మరో నలుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు పలు అభియోగాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న భారీ అభియోగంతోపాటు నేపాల్, మణిపూర్ల నుంచి నక్సలైట్లకు ఆయుధాలను సరఫరా చేయడంలో సహకరిస్తున్నారని, అర్బన్ మావోయిస్టుల కార్యకలాపాలకు నిధులిస్తున్నారన్నది ఇతర అభియోగాలు. ప్రస్తుతం వీరంత గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం 78 ఏళ్ల వరవరరావు గత 48 ఏళ్ల కాలంలో దాదాపు 25 కేసులను ఎదుర్కొన్నారు. ఏ ఒక్క కేసుల్లోనూ ఆయన దోషిగా తేలలేదు. ఆయనపై అన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఒక్క 2005 సంవత్సరంలోనే వరవరరావుపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. చిలకలూరిపేట, అచ్చంపేట పోలీసు స్టేషన్లపై నక్సలైట్ల దాడి, ఒంగోలు వద్ద ఓ సీనియర్ పోలీసు అధికారి కాన్వాయ్పై నక్సలైట్ల దాడి, బాలానగర్లో ఓ పోలీసు కాల్చివేత సంఘటనల నేపథ్యంలో వరవరరావుపై ఈ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు పోలీసులు, ముగ్గురు పౌరులు మరణించిన చిలుకలూరి పేట పోలీసు స్టేషన్పై దాడికి నక్సలైట్లను వరవర రావు రెచ్చగొట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి డైరెక్షన్ ఇచ్చారని, ఇందులో ఇతర విరసం సభ్యుల పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ఆరోపణ. పోలీసు స్టేషన్ పేల్చివేతకు నక్సలైట్లకు సెల్ఫోన్ ద్వారా డైరెక్షన్ ఇచ్చినట్లు సబ్ డివిజనల్ స్థాయి పోలీసు అధికారి స్వయంగా ఆరోపణలు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించిన అచ్చంపేట పోలీసు స్టేషన్పై దాడిని కూడా వరవరరావు ప్రోత్సహించారని మరో కేసు దాఖలు చేశారు. ముగ్గురు పౌరుల మరణానికి దారితీసిన ఒంగోలు సమీపంలో ఎస్పీ కాన్వాయ్పై జరిగిన దాడికి వరవరరావుతోపాటు మరో విరసం నేత కళ్యాణ్రావు బాధ్యులని నేరారోపణలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి లొంగిపోయిన ఇద్దరు నక్సలైట్లను విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న వరవరరావు ఇంట్లో జరిగిన రహస్య సమావేశంలో తాము పాల్గొన్నట్లు ఆ ఇద్దరు నక్సలైట్లు వెల్లడించారు. వరవరరావు కుట్ర కారణంగానే కానిస్టేబుల్ను కాల్చివేసిందనేది మరో కేసు. ఈ కేసుల్లోని లొసుగులను మీడియా పట్టుకొని వాటిని విస్తృతంగా ప్రచారం చేయడంలో పోలీసులు విచారణకు ముందే మూడు కేసులను ఉప సంహరించుకున్నారు. ఒంగోలులో ఎస్పీ కాన్వాయ్పై జరిగిన దాడి కేసులో మాత్రం వరవరరావుపై కొన్నేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఆ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. హత్యలకు, హత్యాయత్నాలకు ప్రోత్సహించారని, రెచ్చగొట్టారంటూ అంతకుముందు దాఖలైన నాలుగు కేసులు కూడా కోర్టు ముందు నిలబలేక పోయాయి. ఆయుధాల సరఫరా కేసులు ఆయుధాల డీలర్లతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయుధాల చట్టం–1959, పేలుడు పదార్థాల చట్టం–1908, కింద వరవర రావుపై దాదాపు తొమ్మిది కేసులను దాఖలు చేశారు. 1985లో ఆర్ఎస్యూ విద్యార్థి లాకప్ మరణానికి నిరసనగా చేపట్టిన బంద్ను విజయవంతం చేయడం కోసం వరవరరావు స్వయంగా బాంబులు పంచారన్నది కూడా ఓ కేసు. 1974 నాటి సికిందరాబాద్ కుట్ర కేసు, 1986 నాటి నామ్నగర్ కుట్ర కేసు వీటిలో ప్రధానమైనవి. హత్య, హత్యాయత్నాలు, దోపిడీలను ప్రోత్సహించడం, కుట్ర పన్నడంతోపాటు దేశద్రోహం అభియోగాలను కూడా ఆయనపై మోపారు. వీటిలో ఏ ఒక్క కేసు కూడా కోర్టు ముందు నిలబడలేదు. దాదాపు ఇప్పుడు కూడా ఆయనపై ఇలాంటి కేసులనే పుణె పోలీసులు దాఖలు చేశారు. మావోయిస్టు కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తున్నారన్నది కాస్త కొత్త కేసు. 1998లో కాలేజీ అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసి, పింఛను డబ్బులతో బతుకుతున్న వరవరరావు, మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్నది ఆయన కుటుంబ సభ్యుల ప్రశ్న. ఇదివరకటిలా ఈ కేసు నుంచి కూడా ఆయన నిర్దోషిగా విడుదలవుతారని వారు ఆశిస్తున్నారు. -
వారి అరెస్టుపై 2:1 మెజారిటీతో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి హక్కుల కార్యకర్తలు వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అరెస్టుల వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐదుగురు హక్కుల కార్యకర్తలను విడుదల చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో శుక్రవారం తీర్పు ఇచ్చింది. తమ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకు హక్కుల కార్యకర్తలకు ప్రస్తుతమున్న గృహనిర్బంధాన్ని 4 వారాల పాటు పొడిగించింది. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లు తీర్పునిస్తూ తమ కేసును ఎవరు విచారించాలో ఎంచుకునే అధికారం నిందితులకు ఉండదని తేల్చారు. అసమ్మతి, రాజకీయ భిన్నాభిప్రాయం కారణంగా పోలీసులు ఈ అరెస్టులు చేపట్టలేదనీ, నిందితులకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలను పరిశీలించామనీ, విచారణ సందర్భంగా ఏదో ఒకపక్షం వైపు తాము ప్రభావితమయ్యే అవకాశమున్నందున వాటి లోతుల్లోకి వెళ్లలేదని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 31న మహారాష్ట్రలోని పుణె సమీపంలో దళిత సంఘాలు ‘ఎల్గర్ పరిషత్’ పేరుతో సమావేశం నిర్వహించాయి. సదస్సు అనంతరం అక్కడి భీమా–కోరేగావ్ ప్రాంతంలో హింస చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించి పుణె పోలీసులు గత నెల 28న ఐదుగురిని అరెస్ట్ చేశారు. దీంతో వీరిని విడుదల చేసి, అరెస్టులపై సిట్ ఏర్పాటు చేయాలంటూ చరిత్రకారిణి రొమీలా థాపర్తో పాటు కొందరు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఐదుగురిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. తీర్పును స్వాగతించిన బీజేపీ.. దేశానికి వ్యతిరేకంగా, ప్రధాని మోదీ హత్యకు అర్బన్ నక్సల్స్ పన్నిన కుట్రను పోలీసులు విజయవంతంగా ఛేదించారని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అన్నారు. గృహనిర్బంధం పూర్తయ్యాక వీరి కస్టడీ కోసం కోర్టుకెళతామన్నారు. ఈ ఐదుగురికి మద్దతు ఇచ్చి జాతీయ భద్రతతో చెలగాటమాడిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సిగ్గుతో తలదించుకోవాలని బీజేపీ విమర్శించింది. వీరికి మద్దతు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అసమ్మతి గొంతు నొక్కేస్తున్నారు ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయంతో జస్టిస్ డీవై చంద్రచూడ్ విభేదించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రభుత్వం అసమ్మతి గొంతును నొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని తన తీర్పులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసమ్మతి, భిన్నాభిప్రాయం అసలైన ప్రజాస్వామ్యానికి సూచిక అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో, సరైన విచారణ జరపకుండా ఈ ఐదుగురిని వేధిస్తే భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కుకు అర్థం లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు రాసుకున్నట్లు భావిస్తున్న లేఖలను మహారాష్ట్ర పోలీసులు మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్పాక్షిక విచారణపై అనుమానాలు తలెత్తేలా పోలీస్ అధికారులు వ్యవహరించారని దుయ్యబట్టారు. ఈ కేసులో సిట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందనీ, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని తన 43 పేజీల తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అసమ్మతి అన్నది ప్రెజర్ కుక్కర్కు ఉన్న సేఫ్టీ వాల్వ్ లాంటిదనీ, దాన్ని పోలీస్ బలంతో అణిచివేయలేరని పునరుద్ఘాటించారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా పోలీసులు మీడియాను వాడుకోవడం ద్వారా విచారణ నిష్పాక్షికత దెబ్బతింటుందనీ, కేసుల్లో దోషులెవరో నిర్ధారించి తీర్పు చెప్పేందుకు పోలీసులు న్యాయమూర్తులు కాదని వ్యాఖ్యానించారు. ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనీ, కొత్తగా కేసును రిజస్టర్ చేయని విషయాన్ని ముగ్గురు జడ్జీలు తీర్పులో ప్రస్తావించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ -
బీమా కోరేగావ్ కేసులో సుప్రీం కీలక ఉత్తర్వులు
-
హక్కుల కార్యకర్తల అరెస్టుపై తీర్పు నేడే!
న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చే అవకాశముంది. మహారాష్ట్రలో గతేడాది జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం, ఆ తర్వాత చెలరేగిన భీమా–కోరేగావ్ అల్లర్ల నేపథ్యంలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్లను పుణె పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొ.సతీశ్ దేశ్పాండేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో తీర్పును ఈ నెల 20న రిజర్వు చేసిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం.. శుక్రవారం తుది తీర్పును వెలువరించే అవకాశముంది. -
వరవరరావుపై కేసు ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్: విరసం నేత వరవరరావుపై కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావు(వీవీ)ని కలవడానికి బుధవారం కోదండరాం ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఆయన నివాసానికి వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. దీంతో కోదండరాం వీవీ సతీమణి హేమలతతో మాట్లాడారు. వీవీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. రచయితగా, టీచర్గా వీవీతో తనకు అనుబంధం ఉందన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసిందని, అందుకే ఆయనను పరామర్శించేందుకు వచ్చానని చెప్పారు. జైలులో ఉన్న వారిని కలవనిస్తారని, గృహనిర్బంధంలో ఉన్న వారిని కలిసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీవీ నివసించే అపార్ట్మెంట్లో ఉండే తోటివారికి ఇబ్బందులు కలగకుండా పోలీసులు సహకరించాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్ జర్నలిస్ట్ సజయ, తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ తదితరులు కోదండరాంను కలవడానికి వచ్చారు. వీవీ ఇంటి వద్ద భారీ బందోబస్తు.. వరవరరావు నివాసం ఉండే హిమసాయి గార్డెన్స్ అపార్ట్మెంట్ ప్రధాన గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ భీంరెడ్డి, ఎస్ఐలు సహా దాదాపు 50 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హేమలత కోదండరాంతో మాట్లాడుతూ.. అపార్ట్మెంట్లో నివసించే తోటివారికి ఇబ్బంది కలుగుతోందని ఇంత పోలీస్ఫోర్స్ ఎందుకని అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదని చెప్పారు. తమ పిల్లలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు సోదాలు చేయడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. -
సీనియర్ ఫిజీషియన్ను పంపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్న తన భర్త, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు అవసరమైన వైద్యసాయాన్ని అందించేందుకు వైద్యుడిని అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ, వరవరరావు సతీమణి హేమలత దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. వరవరరావు ఇంటికి గాంధీ ఆసుపత్రిలో సీనియర్ ఫిజీషియన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుడిని పంపాలని డీజీపీని ఆదేశించింది. వరవరరావును పరిశీలించి ఆయనకు వైద్య సేవలు అవసరమైతే, వాటిని అందించాలని వైద్యుడిని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పుణే పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో వరవరరావు కూడా ఉన్నారు. వీరందరి అరెస్టులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు అరెస్ట్ చేసిన వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ఇదే రీతిలో వరవరరావు అరెస్ట్పై ఆయన సతీమణి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గతవారం విచారణ సందర్భంగా వరవరరావుకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుడిని సైతం పోలీసులు అనుమతించడం లేదని హేమలత హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో ధర్మాసనం వరవరరావుకు వైద్యసాయం కోసం పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో హేమలత ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం, ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీకి తేల్చి చెప్పింది. అరెస్టయిన నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు పొడిగించిన నేపథ్యంలో హైకోర్టు కూడా తన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
వరవరరావుకు గృహనిర్బంధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పౌర హక్కుల నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. భీమా-కొరేగావ్ అల్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర హక్కుల నేతలకు గృహ నిర్బంధ గడువు పెంచుతూ మరోసారి వారికి భారీ ఊరట కల్పించింది. ఈ గడువు నేటితో (సెప్టెంబరు 12) ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబరు 17వ తేదీవరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆగస్టు 28న విప్లవ కవి వరవరరావు సహా మరో అయిదుగురి నేతల ఇళ్లలో పుణే పోలీసుల సోదాలు నిర్వహించడంతో పాటు అరెస్ట్ చేసి పుణేకు తరలించారు. ఈ అరెస్టును సవాలు చేస్తూ చరిత్రకారులు రొమిల్లా థాపర్తో పాటు ఐదుగురు మేధావులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం పౌర నేతలను జైల్లో కాకుండా గృహనిర్బంధంలో ఉండాలని ఆగస్టు 30న ఆదేశించింది. మొదట సెప్టెంబరు 6వరకు, ఆ తరువాత 12వ తేదీవరకు వరుసగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో అయిదురోజులపాటు వారిని కేవలం గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలకు సంబంధించి వరవరరావుతో సహా మరో నలుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం తదనంతర పరిణామాల నేపథ్యంలో వారిని గృహ నిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది. అంతేకాతు గత విచారణ సందర్భంగా పుణే పోలీసుల వ్యవహారంపై జస్టిస్ దీపక్ మిశ్రా తదితరులతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
12 వరకూ గృహనిర్బంధం
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకూ పొడిగించింది. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి కేసు వివరాలను వెల్లడించడంపై కోర్టు మండిపడింది. పుణె ఏసీపీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అత్యున్నత న్యాయస్థానానికే దురుద్దేశాలు అంటగడుతున్నారని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘కోర్టు ముందు పెండింగ్లో ఉన్న అంశాలపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీ పోలీసులకు చెప్పండి. ఈ కేసు విచారణ ఇప్పుడు మాముందు ఉంది. మేము తప్పు చేస్తున్నామని పోలీసుల నోటి నుంచి వినాలనుకోవడం లేదు’ అని మహారాష్ట్ర తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. పుణెలోని భీమా కొరేగావ్లో గతేడాది డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా మావోలతో కలసి హింసకు కుట్ర పన్నారని విరసం సభ్యుడు వరవరరావు, వెర్మన్ గంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా వంటి హక్కుల కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి సంగతి తెలిసిందే. -
‘మావో’ లింకులపై బలమైన సాక్ష్యాలు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలపై బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతోనే ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేశామని మహారాష్ట్ర బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవలం అసమ్మతి, అభిప్రాయభేదం కారణంగా ఈ అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. పుణెలోని భీమా కొరేగావ్లో గతేడాది డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా చెలరేగిన హింసకు మావోలతో కలసి కుట్రపన్నారంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల వంటి మానవహక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఐదుగురిని విడుదలచేసి గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా అసమ్మతి, భిన్నాభిప్రాయం అన్నది ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని కోర్టు పేర్కొంది. తాజాగా ఈ హక్కుల కార్యకర్తల అరెస్ట్ను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, సామాజికవేత్త సతీశ్ దేశ్పాండే, న్యాయ నిపుణుడు మజా దరువాలాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం విచారణ సాగుతుండగానే వీరు ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేశారు. మేం అరెస్ట్ చేసిన ఐదుగురు నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చురుగ్గా పనిచేస్తూ నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు. వీరు ఎల్గర్ పరిషత్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటుచేశారు. రాజకీయ సిద్ధాంతాలు, భావజాలాల మధ్య భిన్నాభిప్రాయంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేయలేదు. వీరు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి. తనిఖీల సందర్భంగా వీరి ఇళ్లలోని కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, పెన్డ్రైవ్లు, మెమొరి కార్డుల్లో లభ్యమైన సమాచారాన్ని బట్టి వీరు సమాజాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు తేలింది’ అని తెలిపారు. ‘రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, ఇతరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో దేశంతో పాటు భద్రతాబలగాలపై దాడికి ప్రణాళిక, ఇతర కార్యకర్తలతో సమన్వయం తదితరాలపై కీలక సమాచారం లభిం చింది. అంతేకాకుండా వీరు తమ పార్టీలోకి నియామకాలను చేపట్టడంతో పాటు వారిని అండర్గ్రౌండ్ శిక్షణకు పంపడం, నిధుల సమీకరణ–పంపకం, ఆయుధాల ఎంపిక, కొనుగోలు, వీటిని దేశంలోకి అక్రమరవాణా చేసేందుకు మార్గాలను ఎంపికచేయడంలో భాగస్వాములయ్యారు. అరెస్టయినవారిలో కొందరు కూంబింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులను మావోలకు అందజేస్తున్నట్లు ఆ పత్రాల్లో లభ్యమైంది’ అని పోలీసులు చెప్పారు. ధనరూపంలో వెలకట్టలేనిది జీవితం రేప్ బాధితులపై సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీః జీవితం అమూల్యమైనదని, ఏ కోర్టూ దాన్ని ధనరూపంలో వెలకట్టలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచార, యాసిడ్ దాడి బాధిత మహిళలకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) రూపొందించిన పరిహార పథకంపై విచారణ సందర్భంగా బుధవారం పైవిధంగా స్పందించింది. పైన పేర్కొన్న రెండు నేరాల్లో బాధిత మహిళకు కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా(మరణించిన పక్షంలో) రూ.10 లక్షలు చెల్లించాలని నల్సా సిఫార్సు చేసింది. ఈ పరిహార పథకాన్ని ఓ లాయర్ ప్రశ్నించగా..‘జీవితానికి వెలను నిర్ధారించలేం. దాన్ని ధనరూపంలో చెప్పలేం’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆమోదించిన నల్సా పరిహార పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఏపీలో 901 కేసుల్లో ఒక్కరికే... రేప్, యాసిడ్ దాడి బాధితుల్లో కేవలం 5 నుంచి 10 శాతం మందికే పరిహారం అందుతోందని నల్సా ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గతేడాది 901 కేసులు నమోదైతే ఒక బాధితురాలికే పరిహారం దక్కినట్టు వెల్లడించింది. పోక్సో చట్టం కింద ఆంధ్రప్రదేశ్లో 1028 కేసులు నమోదైతే కేవలం 11 మంది బాధితులకే పరిహారం అందినట్లు తెలిపింది. -
వరవరరావుకు వైద్య సాయంపై పిటిషన్ దాఖలు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గృహ నిర్భంధంలో ఉన్న విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు అవసరమైన వైద్యసాయాన్ని అందించేందుకు వైద్యుడిని అనుమతించే విషయంలో పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలన జరుపుతామని వరవరరావు సతీమణికి హైకోర్టు స్పష్టం చేసింది. వరవరరావుతో పాటు దేశవ్యాప్తంగా పలువురు పౌర హక్కుల నేతల అరెస్టుపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరపనున్న నేపథ్యంలో వరవరరావు అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు తన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను పూణే పోలీసులు గత నెల 28న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరి అరెస్టులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే రీతిలో వరవరరావు అరెస్ట్పై కూడా ఆయన సతీమణి హేమలత ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, వరవరరావుకు వైద్య సేవలు అందించేందుకు వైద్యుడిని సైతం పోలీసులు అనుమతించడం లేదని కోర్టుకు నివేదించారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది సంతోశ్ వాదనలు వినిపిస్తూ, పౌర హక్కుల నేతల అరెస్టులపై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరపనున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరుపుతామని తెలిపింది. వరవరరావుకు వైద్య సేవల నిమిత్తం కుటుంబ డాక్టర్ను అనుమతించే విషయంపై పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలన జరుపుతామని హేమలతకు ధర్మాసనం స్పష్టం చేసింది. -
అరెస్ట్లకు ఆధారాలు ఉన్నాయి: మహారాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తలు అరెస్ట్లపై బుధవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. సమాజంలో అశాంతి, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించారన్న కారణంతో వారిని అరెస్ట్ చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు తెలిపారు. అరెస్ట్ అయిన ఐదుగురిపై పోలీసుల వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అసమ్మతి, అభిప్రాయ భేదాల కారణంగా వారిని అరెస్ట్ చేయలేదని వెల్లడించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, భీమా కోరెగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర చేసారనే అభియోగాలతో విప్లవకవి వరవరరావుతోపాటు, సుధా భరద్వాజ్, గౌతం నావ్లాక్, తెల్తూంద్డే, వెర్నన్ గొన్జాల్వేస్ను పుణే పోలీసులు గతవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పౌరహక్కుల నేతల అరెస్ట్ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని.. సెప్టెంబరు 5 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. -
వాళ్లు సాక్షులా..??!
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల దేశంలోని ఆరు నగరాల్లో పుణె పోలీసులు దాడులు నిర్వహించి, పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు అనుసరించిన తీరు చూస్తుంటే చట్టం గురించి అంతో ఇంతో తెలిసిన ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ విషయాలు తెలిసి.. పోలీసు వర్గాలే ఆశ్చర్యపోయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు! సామాజిక కార్యకర్తల ఇళ్ల సోదాల సందర్భంగా, వారి అరెస్ట్ల సందర్భంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 41 బీ సెక్షన్ ప్రకారం కుటుంబసభ్యుల్లో ఒకరు లేదా స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తి ఎవరైనా సాక్షిగా సంతకం చేయడం తప్పనిసరి. అయితే ఆగస్టు 28వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తల అరెస్ట్ సందర్భంగా పంచనామా లేదా అరెస్ట్ ధ్రువపత్రంపై, స్వాధీన వస్తువల జాబితా పత్రాలపై పుణె మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఓ ప్యూన్, ఓ క్లర్క్, ప్రభుత్వ బీజే వైద్య కళాశాలకు చెందిన ఓ క్లర్క్, ఓ టెక్నీషియన్లతోపాటు ఎక్కడ పనిచేస్తారో కూడా తెలియని మరో నలుగురు యువకులు సంతకాలు చేశారు. పుణెకు చెందిన వీరంతా పుణె పోలీసులతోపాటు వచ్చిన సాక్షులు. అరెస్టైన ఐదుగురు సామాజిక కార్యకర్తల్లో ఒకరైన గౌతమ్ నవ్లేఖ విడిగా వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు సాక్షుల అంశాన్ని అండర్లైన్ చేసుకుంది. పుణె పోలీసులు తమ వెంట తీసుకొచ్చిన కేసు పత్రాలు, కేసుకు సంబంధించిన నోటీసులు అన్ని కూడా మరాఠీ భాషలోనే ఉన్నాయి. చట్టం ప్రకారం నిందితులకు తెల్సిన బాషలోనే అవి తర్జుమా అయి ఉండాలి. ఇలా సాక్షులను వెంట తీసుకెళ్లడం తమకు కొత్త కాదని, తాము మహారాష్ట్రలో ఈ పద్ధతిని ఎప్పటి నుంచో పాటిస్తున్నామని పుణె పోలీసు జాయింట్ కమిషనర్ శివాజీ బోడఖే వ్యాఖ్యానించారు. తాము సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులనే సాక్షులుగా ఎంపిక చేసుకుంటామని, వారికైతే కేసు పట్ల, విచారణ పట్ల అవగాహన ఉంటుందని అన్నారు. ఇలాంటి సాక్షులు చట్టవిరుద్ధమని నిందితుల తరఫు న్యాయవాది కామిని జైస్వాల్ చెప్పారు. పోలీసులు తెచ్చుకునే సాక్షులు వారి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే అవకాశం ఉంటుందని, పోలీసుల ఏజెంట్లుగా వ్యవహరించే వాళ్లు నిందితుల పక్షాన ఎలా సాక్షులుగా నిలుస్తారని ప్రశ్నించారు. వీరే సాక్షులు ఫరీదాబాద్లో మానవ హక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్ను అరెస్ట్ చేసినప్పుడు పుణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విశ్వరామ్బాగ్ వార్డు ఆఫీసులో పనిచేస్తున్న రవిదాస్ థానే అనే జూనియర్ క్లర్క్, అదే ఆఫీసులో పనిచేస్తున్న ప్యూన్ హర్షాల్ కదమ్ సాక్షులుగా వ్యవహరించారు. ఇద్దరు ఉద్యోగులను సాక్షులుగా పంపించాలంటూ పుణె పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచి తమ కార్యాలయానికి ఓ లేఖ వచ్చిందని, అందుకని తమను పంపించారని హర్షాల్ కదమ్ తెలిపారు. ఇంతకుముందు కూడా రెండు, మూడుసార్లు పోలీసులు సాక్షిగా పిలిస్తే వెళ్లానని, అయితే పుణె దాటి బయటకు రావడం మాత్రం ఇదే మొదటి సారని ఆయన చెప్పారు. వరవర రావు అరెస్ట్ సందర్భంగా.... విరసం సభ్యుడు, రచయిత వరవర రావు అరెస్ట్ సందర్భంగా పంచనామా పత్రంలో పుణె వాసులైన గజేంద్ర కాంబ్లే (49), అల్తాఫ్ భగవాన్ (51)లను సాక్షులుగా చూపారు. వారు ఉద్యోగం చేస్తున్నారని ఉన్నది కానీ ఎక్కడ, ఏం చేస్తున్నారో వివరాలు లేవు. పంచనామాపై వరవర రావు మేనల్లుడు ఎన్. వేణుగోపాల్ సంతకం చేశారు. అయితే ఎవరి ఇళ్లయితే సోదా చేశారో వారికి మరాఠీ రాదనే వ్యాఖ్యం రాసి ఆయన సంతకం చేసినట్లు ఉంది. ఏడు పేజీల పంచనామాపై ప్రతి పేజీలో పోలీసులు సంతకాలు చేశారు. ఒక్క ఏడో పేజీలోనే వరవర రావు భార్య హేమలత సంతకం తీసుకున్నారు. పోలీసులు మోసం చేయదల్చుకుంటే లోపలి ఆరు పేజీలు మార్చుకోవచ్చన్నమాట. వరవర రావు అల్లుడు, సీనియర్ జర్నలిస్ట్ కేవీ కూర్మనాథ్ ఇంటి సోదా సందర్భంగా పుణె వాసులైన జగదీశ్ ఎల్వేకర్, భజరంగ్ ధాల్వేలను పోలీసులు సాక్షులుగా చూపారు. తన ఇంట్లో రెండు వేల పుస్తకాలుండగా, వాటిలో 40 పుస్తకాలనే ఏరి పోలీసులు తీసుకెళ్లారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే పోలీసులు ఇలా వ్యవహరించారని కూర్మనాథ్ మీడియాతో వ్యాఖ్యానించారు. రాంచీలో సోదా సందర్భంగా రాంచీలో సామాజిక కార్యకర్త స్థాన్ స్వామి ఇంటి సోదా సందర్భంగా సాక్షులుగా ప్రభుత్వ బీజే వైద్య కళాశాల ఆస్పత్రిలో సీనియర్ క్లర్క్గా పనిచేస్తున్న నంద్కిషోర్ అగార్కర్ (57), ససూన్ ఆస్పత్రిలో టెక్నీషియన్గా పనిచేస్తున్న మోహన్ గినులే (56)లను చూపారు. గౌతమ్ అరెస్ట్ సందర్భంగా జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌతమ్ను ఢిల్లీలో అరెస్ట్ చేసినప్పుడు రాందాస్ షెల్కే (34), అప్పారావు రాథోడ్ (27)లను సాక్షులుగా చూపారు. వారిని కూడా పుణె వాసులుగా పేర్కొన్నారుగానీ వారికి సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. మిగతావారి అరెస్ట్ల సందర్భంగా కూడా పుణె వాసులనే సాక్షులుగా చూపారు. చడవండి: వరవర రావు తదితరులు విడుదలయ్యేనా? -
మహారాష్ట్ర పోలీసులకు బాంబే హైకోర్టు షాక్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర పోలీసులకు మరోసారి షాక్ తగిలింది. దేశ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అయిదుగురు పౌరహక్కుల నేతల అరెస్టుల కేసులో రాష్ట్ర పోలీసుల వ్యవహరాన్ని కోర్టు తప్పుబట్టింది. రాష్ట్ర అదనపు డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరంబీర్ సింగ్ మీడియా సమావేశంపై దాఖలైన పిటిషన్ను కోర్టు సమర్ధించింది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఒకవైపు ఈ కేసును ఇన్ కెమెరా విచారణను కోరుతున్న పోలీసులు మరోవైపు మీడియా సమావేశంలో సాక్ష్యాలను బహిరంగ పర్చడటంపై పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలని కోరారు. దేశవ్యాప్తంగా పౌరహక్కుల నేతల ఇళ్లలో సోదాలు, అరెస్టుల పర్వాన్ని సమర్ధించుకున్న రాష్ట్ర ఏడీజీ పరంబీర్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. వీరికి మావోయిస్టులకు సంబంధాలున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయనీ, అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. తమవద్ద వేలకొద్దీ సాక్ష్యాలున్నాయంటూ కొన్ని లేఖలను మీడియా ముందు ప్రదర్శించారు. కాగా భీమా కోరేగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర చేసారనే అభియోగాలతో విప్లవకవి వరవరరావుతోపాటు, సుధా భరద్వాజ్, గౌతం నావ్లాక్, తెల్తూంద్డే, వెర్నన్ గొన్జాల్వేస్ను పుణే పోలీసులు గతవారం అరెస్ట్ చేసింది. అయితే ఈ అరెస్టులపై వచ్చిన అభ్యంతరాలను సమర్ధించిన సుప్రీంకోర్టు వీరిని సెప్టెంబరు 6వరకు హౌస్ అరెస్ట్లోఉంచాల్సిందిగా ఆదేశించింది. గత జూన్లో మావోయిస్టు వ్యతిరేక దాడుల్లో పూణే పోలీసులు ముంబై కు చెందిన సుధీర్ దవాలేను, ఢిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర గడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, నాగపూర్ నుంచి ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్ను అరెస్టు చేసారు. మరోవైపు ఇది బీజేపీ రాజకీయ కుట్ర అని ఆ లేఖలన్నీ కల్పితాలనీ న్యాయమూర్తి సుధా భరద్వాజ్ ఖండించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేతకు యత్నమని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
‘వారిని అరెస్ట్ చేస్తే దేశంలోని జైళ్లు సరిపోవు’
సాక్షి, న్యూఢిల్లీ : మవోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల పలువురు ప్రజా సంఘాల నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. విరసం నేత వరవరరావుతో సహా అరెస్ట్యిన వారిని అర్బన్ నక్సలైట్స్ అని పోలీసులు వ్యాఖ్యానించడంతో కొందరు ‘మీటూ అర్బన్ నక్సల్’ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్యాగ్స్ చేశారు. దీనిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వారిపై పలు వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్ పేరుతో వారిన అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘పోలీసులు వారిని మాత్రమే అరెస్ట్ చేయగలరు. వారి ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. ఆ విధంగా ఆలోచించే ప్రజలను కూడా అరెస్ట్ చేస్తే దేశంలో ఉన్న జైళ్లు సరిపోవు. జాతిపిత మహాత్మ గాంధీని ఈ దేశంలో హత్య చేశారు. గాంధీని హత్య చేసిన వారే నేడు అధికారంలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేయగలమా?’’ అని ప్రశ్నించారు. దేశ సంపదను కాజేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, చోక్సీలను ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందని ఆమె ప్రశ్నించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా సంఘాల నేతలను మాత్రం ప్రభుత్వం కుట్ర పూరితంగా అణచివేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా బీమా-కోరేగావ్ ఘటనతో వారికి ఎలాంటి సంబంధం లేదని, ప్రధాని హత్యకు వారు ప్రయత్నించారన్న వార్త తనకు వింతగా అనిపించిందని స్వర భాస్కర్ వ్యాఖ్యానించారు. -
ఈ ‘నేరపూరిత కుట్ర’ ఎక్కడిది?
సాక్షి, న్యూఢిల్లీ : విరసం సభ్యుడు వరవరరావు సహా గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు సామాజిక కార్యకర్తలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు ‘నేరపూరిత కుట్ర’ సెక్షన్ను కూడా పుణె పోలీసులు బనాయించారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి అంటే, 1860 నుంచి భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతూనే ఉంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎక్కడ ఏకాస్త ఆందోళన చెలరేగినా అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని ఉపయోగించేవారు. ఈ చట్టంలో ఉన్న ఓ వెసులుబాటు ప్రకారమే ఈ చట్టం దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. దేశంలో ఏదో ఓ మూల ఎవరిపైనో ఒకరిపైన ‘నేరపూరిత కుట్ర’ కేసును బనాయించి ఇదే కేసులో దేశంలో ఎక్కడైనా, ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడమే ఆ వెసులుబాటు. చరిత్రలో నిలిచిపోయిన 1923 నాటి కాన్పూర్ కుట్రకేసు, 1929 నాటి మీరట్ కుట్ర కేసులు ‘నేరపూరిత కుట్ర’ దుర్వినియోగానికి నిలువెత్తు దర్పణం. అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీని అణచివేసేందుకు బ్రిటీష్ పాలకులు ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఇలాంటి చీకటి లేదా రాక్షస చట్టాలను ప్రపంచంలోని అనేక దేశాలు ఎత్తివేయగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎత్తివేయక పోవడం ఆశ్చర్యం, అర్థంకాని అంశం. 1972లో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని తీసుకునేందుకు అన్నామలై యూనివర్శిటీకి వెళ్లినప్పుడు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉదయ్కుమార్ అనే విద్యార్థి మరణించారు. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరై విచారణ కమిషన్ను నియమించింది. పోలీసులు తమ చర్యను సమర్థించుకునేందుకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే కుడమురుట్టి వంతెన పేల్చివేసేందుకు ‘నేరపూరిత కుట్ర’ పన్నారని కమిషన్ ముందు పేర్కొంటూ అందుకు సాక్ష్యంగా ఓ ‘షెల్’ను చూపించారు. కుట్ర పన్నిన వారు మావోయిస్టులని మధ్యాహ్నం చెప్పిన పోలీసులు సాయంత్రానికల్లా వారిని నక్సలైట్లను చేశారు. లాఠీచార్జిలో మరణించిన ఉదయ్ కుమార్ అనే విద్యార్థి తండ్రి కూడా విచారణ కమిషన్ ముందు హాజరై తీవ్రవాద గ్రూపులతో కలిసి తన కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడంటూ పోలీసుల బలవంతం వల్ల తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ‘నేరపూరిత కుట్ర’ థియరీని విచారణ కమిషన్ బొత్తిగా విశ్వసించకుండా కొట్టి వేసింది. నాడు లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ కేసు కారణంగా తన ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెరుగుతుందని కరుణానిధి భావించారుగానీ ఆ తర్వాత మూడేళ్లలో అవినీతి ఆరోపణల వల్ల ఆయన ప్రభుత్వం భ్రష్ట్రుపట్టి ఎమర్జెన్సీ కాలంలో అర్ధంతరంగా డిస్మిస్ అయింది. ఇప్పుడు కూడా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, సామాజిక కార్యకర్తలపై మోదీ ప్రభుత్వం కూల్చివేతకు ‘నేరపూరిత కుట్ర’ కోణాన్ని జోడించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందుదామని ఆయన ప్రభుత్వం చూస్తోందని, నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడినట్లే రానున్న ఎన్నికల్లో ‘మహా కూటమి’ పేరిట ప్రతిపక్షాలు ఏకమై మోదీ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తాయని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు. -
వరవరరావు తదితరులు విడుదలయ్యేనా!
సాక్షి, న్యూఢిల్లీ : భీమ్ కోరెగావ్ కేసులో అరెస్టై ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు సామాజిక కార్యకర్తలకు సంబంధించి సుప్రీం కోర్టు తదుపరి ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందన్న అంశంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, రాంచీ, ఫరిదాబాద్, గోవాల్లో పుణె పోలీసులు ఆగస్టు 28వ తేదీన దాడులు నిర్వహించి విరసం సభ్యుడు వరవరరావుతోపాటు న్యాయవాది సుధా భరద్వాజ్, సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గోన్సాల్వ్స్, అరుణ్ ఫెరైరా, గౌతమ్ నౌలేఖలను అరెస్ట్ చేయడం ఆగస్టు 29వ తేదీన సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు వారికి గహనిర్బంధం విధించడం తెల్సిందే. సెప్టెంబర్ 6వ తేదీతో వారి గహ నిర్బంధం ముగిసి పోనుండడంతో ఏడవ తేదీన వారిని సుప్రీం కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంది. ఆ రోజున సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులను మంజూరు చేస్తుందన్నదే ప్రస్తుత చర్చ. వారిపై మొత్తానికి కేసునే కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసే విశిష్టాధికారం రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద సుప్రీం కోర్టుకు ఉంది. అయితే నిందితుల కేసుకు సంబంధించి దాఖలైన ప్రజాహిత (పిల్) వ్యాజ్యంలో వారిపై కేసును కొట్టివేయాల్సిందిగా కోరలేదు. వారిపై దాఖలైన కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని మాత్రమే డిమాండ్ చేశారు. ప్రజాహిత వ్యాజ్యంలో అలా డిమాండ్ చేయక పోవడానికి కూడా ఓ కారణం ఉంది. అది మొదటే డిమాండ్ చేసినట్లయితే కేసులో నిజానిజాల విచారణకు సుప్రీం కోర్టు, కేసును వాయిదా వేసి నిందితులను రిమాండ్కు పంపించే అవకాశం ఉంటుంది. పైగా నిందితులు తమపై తప్పుడు కేసును బనాయించారని, దాన్ని కొట్టి వేయాల్సిందిగా కోరుతూ పిటిషన్ ఎప్పుడైనా దాఖలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం ప్రజాహిత వ్యాజ్యం స్ఫూర్తికే పరిమితం కావాలని భావించి పిటిషనర్లు మరో విషయం జోలికి పోలేదు. ప్రజాహిత వ్యాజ్యం డిమాండ్ చేయకపోయినా అన్యాయంగా కేసు బనాయించారనిపిస్తే దాన్ని ఏకపక్షంగా కొట్టివేసే అధికారాలను కూడా రాజ్యంగంలోని 142వ అధికరణ సుప్రీం కోర్టుకు కల్పించింది. కనీసం ప్రాథమిక విచారణ కూడా జరపకుండా కేసును కొట్టివేస్తే అపార్థాలకు దారితీస్తుందన్న ఉద్దేశంతోను కేసును కొట్టివేయక పోవచ్చు. నిందితుల అరెస్ట్ ప్రక్రియ చట్టభద్దంగా జరిగిందా, లేదా? అన్న అంశాన్ని సుప్రీం కోర్టు ముందుగా పరిశీలిస్తుంది. అరెస్ట్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని నిందితుల తరఫు న్యాయవాదులు ఇప్పటికే వెల్లడించారు. అరెస్ట్ సందర్భంగా నిందితులకు చూపిన పత్రాలు మరాఠీ భాషలో ఉన్నాయి. కొందరు నిందితులకు మరాఠి రానందున చట్ట ప్రకారం వారికి అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసిన పత్రాలనే చూపించాలి. అది జరగలేదట. అలాగే పుణెకు నిందితుల ‘ట్రాన్సిట్ (తరలింపు)’ రిమాండ్ కోసం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ను కోరినప్పుడు ఆయనకు కేసు డైరీ చూపించలేదట. ఈ విషయాలను నిరూపించడంలో న్యాయవాదులు సఫలీకృతమైతే నిందితుల అరెస్ట్పై స్టే విధించి వారిని విడుదల చేయవచ్చు! ఊరు, జిల్లా లేదా రాష్ట్రం వీడి వెళ్లరాదనే షరతులతోనైనా నిందితులను విడుదల చేయవచ్చు! నిందితులను పోలీసులు విచారించే ప్రక్రియే ఇంకా ప్రారంభం కానందున ‘స్వతంత్య్ర దర్యాప్తు’నకు సుప్రీం కోర్టు ఇప్పుడే ఆదేశించే అవకాశం లేదు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థకు అసమ్మతి అనేది భద్రతాపరమైన వాల్వ్ లాంటిది’ అని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ ముందుగానే వ్యాఖ్యానించినందున నిందితులు విడుదల్యే అవకాశమే ఎక్కువగా ఉంది. నిందితులపై దాఖలైన కేసు మూలం ‘భీమా కోరెగావ్’ అల్లర్లే అయినప్పటికీ నిందితులు నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వారని, ఆ పార్టీకి నిధులు సమీకరించడమే కాకుండా ఆ పార్టీ తరఫున నియామకాలు జరుపుతున్నారని, మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘యాంటీ–ఫాసిస్ట్’ గ్రూపును కూడా ఏర్పాటు చేశారని పుణె పోలీసులు ఆరోపణలు చేశారు. అత్యంత వివాదాస్పద చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టమే కాకుండా భారతీయ శిక్షాస్మృతిలోని పలు కఠిన నిబంధనల కింద కేసులను నమోదు చేశారు. -
రాజీవ్గాంధీ ఘటన తరహాలో మోదీ రాజ్ అంతం!
ముంబై: ఈ ఏడాది జూన్తోపాటు మూడ్రోజుల క్రితం అరెస్టు అయిన మావోయిస్టుల సానుభూతిపరులు, పౌర హక్కుల నేతలతో మావోయిస్టులకున్న సంబంధాలపై తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు చరమగీతం పాడేందుకు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తరహా సంఘటనకు వ్యూహరచన చేయాలి’ అని ఈ ఏడాది జూన్లో అరెస్టైన హక్కుల కార్యకర్త రోనా విల్సన్.. ఒక మావోయిస్టు నాయకుడికి లేఖ కూడా రాశారని మహారాష్ట్ర అదనపు డీజీ(శాంతి భద్రతలు) పరంబీర్ సింగ్ తెలిపారు. మూడ్రోజుల క్రితం ఐదుగురు పౌరహక్కుల నేతల అరెస్టులపై విమర్శల నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కోరేగావ్–భీమా అల్లర్ల కేసుకు సంబంధించి నిర్వహించిన తనిఖీల్లో.. అజ్ఞాతంలో ఉన్న మావోలకు, ఇతర మావోలకు మధ్య నడిచిన వేలాది లేఖల్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మావో నేత కామ్రేడ్ ప్రకాశ్కు రోనా విల్సన్ రాసిన లేఖలో.. ‘ఇక్కడ తాజా పరిస్థితిపై నువ్వు రాసిన చివరి ఉత్తరం మేం అందుకున్నాం. అరుణ్ (ఫెరారీ), వెర్నన్(గొంజాల్వేస్), ఇతరులు అర్బన్ ఫ్రంట్ పోరాటంపై అంతే ఆందోళనతో ఉన్నారు’ అని రాసినట్లు సింగ్ చెప్పారు. రైఫిల్స్, గ్రనేడ్ లాంచర్స్, నాలుగు లక్షల రౌండ్ల మందుగుండు సామగ్రి కోసం రూ.8 కోట్ల అవసరముందని లేఖలో విల్సన్ కోరారని ఆయన పేర్కొన్నారు. ‘కామ్రేడ్ కిషన్, కొందరు ఇతర కామ్రేడ్స్ ‘మోదీ రాజ్’ అంతానికి నిర్మాణాత్మక ప్రణాళికను ప్రతిపాదించారు. మరో రాజీవ్ గాంధీ (హత్య) సంఘటన తరహాలో మేం ఆలోచన చేస్తున్నాం’ అని పేర్కొంటూ ప్రకాశ్ను తన నిర్ణయం చెప్పమని విల్సన్ లేఖలో కోరారని పరంబీర్ సింగ్ తెలిపారు. ‘అరెస్టు అయిన వారికి, మావోయిస్టులకు మధ్య స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే పోలీసులు ముందడుగు వేశారు. మా వద్ద ఉన్న ఆధారాలు మావోయిస్టులతో వారికున్న సంబంధాల్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహా ఆధారాలతో 2014లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను సైతం అరెస్టు చేశాం. అందరిని ఆకర్షించేలా ఏదో ఒక భారీ చర్యకు ప్రణాళిక రచిస్తున్నట్లు అరెస్టైన కార్యకర్తల మధ్య నడిచిన లేఖల ద్వారా స్పష్టమైంది. విధ్వంస చర్యలకు మావోలు ప్రణాళిక చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాం. కొరియర్ ద్వారా పాస్వర్డ్తో కూడిన సందేశాలతో కేంద్ర కమిటీ మావోలు ఈ హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపేవారు’ అని డీజీ తెలిపారు. ఆగస్టు 28న పుణే పోలీసులు దేశ వ్యాప్తంగా ప్రముఖ పౌరహక్కుల నేతల ఇళ్లలో దాడులు నిర్వహించి.. హైదరాబాద్లో వరవరరావును, ముంబైలో గొంజాల్వేస్, ఫెరీరా, ఫరీదాబాద్లో సుధా భరద్వాజ్ను, ఢిల్లీలో నవలఖాను అరెస్టు చేయడం తెల్సిందే. గతేడాది డిసెంబర్ 31న ఎల్గార్ పరిషద్ నిర్వహించిన సదస్సు సందర్భంగా కోరెగావ్–భీమా వద్ద చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. అయితే అరెస్టైన ఐదుగురిని సెప్టెంబర్ 6 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్లో పుణే పోలీసులు ముంబైలో సుధీర్ ధావలే, ఢిల్లీలో పౌరహక్కుల కార్యకర్త రోనా విల్సన్, నాగ్పూర్లో న్యాయవాది గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్లను అరెస్టు చేశారు. -
భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో ట్విస్ట్!
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా- కోరెగావ్ అల్లర్ల కేసు మరో మలుపు తిరిగింది. భీమా- కోరెగావ్ అల్లర్లు సహా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర ఆరోపణలతో.. విరసం నేత వరవరరావు సహా మరో నలుగురు పౌర హక్కుల నేతలను పుణె పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వారందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో భీమా- కోరెగావ్ హింసాకాండపై మహారాష్ట్ర ప్రభుత్వం రహస్య నివేదికను తెరపైకి తెచ్చింది. పది మంది సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ రూపొందించిన రహస్య నివేదిక జనవరి 20నే ప్రభుత్వానికి అందజేసింది. వారిద్దరే ప్రణాళికలు రచించారు.. భీమా- కోరెగావ్ హింసాకాండకు హిందుత్వ సంస్థలకు చెందిన నేతలే కారణమని రహస్య నివేదిక వెల్లడించింది. వివాదాస్పద హిందుత్వ నేత శంభాజీ బిడే, మిలింద్ ఎక్బోటేలు కలిసి అల్లర్లకు ప్రణాళికలు రచించారని పేర్కొంది. ఈ మేరకు జనవరి 20న షోలాపూర్ రేంజ్ ఐజీ విశ్వాస్నాంగ్రే పాటిల్కు నిజనిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించింది. అయితే ఇన్నాళ్లుగా ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించని మహారాష్ట్ర ప్రభుత్వం.. పౌర హక్కుల నేతల అరెస్టు తర్వాత నివేదికను తెరపైకి తీసుకురావడం.. మరోవైపు దీనికి అంతటికీ మావోయిస్టులే కారణం అంటూ మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలకు దిగడంతో.. ఈ కేసులో గందరగోళం నెలకొంది. కాగా గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?) -
పౌర హక్కుల నేతల అరెస్టు: సంచలన ఆరోపణలు
ముంబై: దేశవ్యాప్తంగా అయిదుగురు పౌర హక్కుల నేతలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు మరోసారి సంచలన ఆరోపణలకు దిగారు. పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ హింసాకాండకు సంబంధించి దేశవ్యాప్తంగా హక్కుల నేతల ఇళ్లపై దాడులు, అరెస్టులపై చెలరేగిన విమర్శలు, కోర్టు మొట్టికాయల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం స్పందించారు. మహారాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) పరమ్ బీర్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే తాము ఈ అరెస్టులు చేశామన్నారు. మావోయిస్టులు, పౌర హక్కుల నేతలకు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుర్తాలకు సంబంధించిన లేఖలు తమకు లభించాయన్నారు. ఈ లేఖలను ఏడీజీ తన ప్రెస్మీట్లో మీడియా ముందు ప్రదర్శించారు. ఇప్పటివరకు తాము సేకరించిన లేఖలు కొన్ని వేలు ఉన్నాయనీ, అందులో ముఖ్యమైన వాటినే మీడియా ముందు ఉంచుతున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కుట్రలకు పౌర హక్కుల నేతలు సహకరించారన్నారని ఈ లేఖలు స్పష్టం చేస్తున్నాయని పరమ్ బీర్ సింగ్ చెప్పారు. ముఖ్యంగా సుధా భరద్వాజ్ కామ్రేడ్ ప్రకాశ్కు ఒక లేఖ రాశారనీ, హక్కుల దుర్వినియోగంపై సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో అందులో రాశారన్నారు. శత్రువులకు వ్యతిరేకంగా తమ పని మొదలైందని కూడా ఆమె రాశారని ఏడీజీ పేర్కొన్నారు. మావోయిస్టు నేతలు, ఇతర సంస్థలతో కలిపి మయన్మార్లో రహస్యంగా సమావేశమయ్యారనీ, జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో భారీ ఎత్తున కుట్ర చేశారని, గ్రెనేడ్ లాంచర్స్ లాంటి ఆయుధాల కొనుగోలుకు నిధులు సేకరించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బీమా కోరేగావ్ అల్లర్లలో అరెస్టయిన కేడర్ కోసం మావోయిస్టు సెంట్రల్ కమిటీ రూ.15 లక్షల మంజూరు చేసిందన్నారు. 2017, డిసెంబర్ 31వ తేదీన బీమా కోరేగావ్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన కేసును జనవరి 8వ తేదీన నమోదు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు చేయడం వల్ల కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఏడీజీ తెలిపారు. కాగా, భీమా కోరెగావ్ హింసాకాండ కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావు, అరుణ్ పెరీరా, గౌతమ్ నవ్లఖా, వెర్నాన్ గొంజాల్విస్, సుధా భరద్వాజ్ లను పుణే పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ తేదీ (సెప్టెంబరు 6) వరకు వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని బుధవారం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరంతా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది!!
సాక్షి, న్యూఢిల్లీ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం నేత వరవరరావు, పౌర హక్కుల కార్యకర్తలు గౌతం నవలఖా, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, న్యాయవాది సుధా భరద్వాజ్లను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వారిని జైలుకు పంపకుండా.. గృహ నిర్బంధంలో ఉంచితే చాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే పౌర హక్కుల నేతల అరెస్టు సమయంలో, వారికి గృహ నిర్బంధం విధించిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గౌతమ్ నవలఖా స్నేహితురాలు సభా హుస్సేన్... మీడియాకు తెలిపిన విషయాలు చర్చనీయాంశమయ్యాయి. బెడ్రూం తలుపులు కూడా వేయొద్దంటున్నారు.. గౌతమ్ నవలఖాకు గృహ నిర్బంధం విధించిన నాటి నుంచి.. ఢిల్లీలోని నెహ్రూ ఎన్క్లేవ్లో ఆయనతో పాటు కలిసి ఉంటున్న సభా హుస్సేన్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు. ‘బెడ్ రూం తలుపులు తెరిచే పడుకోవాలని పోలీసులు మాకు చెప్పారు. దాంతో నాకు కోపం వచ్చింది. ముందు మాకు క్షమాపణ చెప్పండి అని వారిని అడిగానంటూ’ సభా తెలిపారు. ఇలా ప్రతీ గదిపై పోలీసులు నిఘా వేసి ఉంచడం.. గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని వ్యాఖ్యానించారు. ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది.. నవలఖా ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారన్న సభా... ‘ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం. పొద్దున లేచింది మొదలు నిద్ర పోయే వరకు వారు(పోలీసులు) మమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. దీంతో మనశ్శాంతి కరువయ్యింది. ఇంటి చుట్టూ ఎర్రని వస్త్రం కట్టారు. బంధువులు, స్నేహితులలెవరినీ ఇంట్లోకి రానివ్వడం లేదు. కనీసం బ్యాంకు పనులు కూడా చేసుకోనివ్వడం లేదని’ ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లేందుకు తనకు అనుమతిని ఇచ్చారని, కానీ పోలీసుల మధ్య గౌతమ్ను ఒంటరిగా వదిలి వెళ్లేందుకు భయంగా ఉందని సభా వ్యాఖ్యానించారు. అరెస్టులు, గృహ నిర్బంధం.. ఇదంతా కేవలం విచారణలో భాగమని.. ఇవి వారికి(పౌర హక్కుల నేతలు) ఎటువంటి చేటు చేయలేవని ఆమె పేర్కొన్నారు. చదవండి : ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!! -
సొంతిళ్లకు హక్కుల కార్యకర్తలు
ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హక్కుల కార్యకర్తల్లో ముగ్గురిని సొంతిళ్లకు పంపారు. విచారణ జరిగే సెప్టెంబర్ 6 వరకు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే. గురువారం పుణే నుంచి వరవరరావును హైదరాబాద్కు విమానంలో, వెర్నన్ గొంజాల్వేస్, అరుణ్ ఫెరీరాను ముంబైకి తరలించారు. ఉదయం ఇంటికి చేరుకున్న గొంజాల్వేస్కు ఆయన భార్య స్వాగతం పలికారు. పుణే సమీపంలో జరిగిన ఘర్షణల్లో అసలు కారకులను కాపాడేందుకే తప్పుడు పత్రాలతో తనను కేసులో ఇరికించారని గొంజాల్వేస్ ఆరోపించారు. ట్రేడ్ యూనియన్ నాయకురాలు, లాయర్ సుధా భరద్వాజ్ను ఫరీదాబాద్లో, పౌరహక్కుల కార్యకర్త నవలాఖాను ఢిల్లీలో వారివారి ఇళ్లలోనే నిర్బంధించారు. గృహ నిర్బంధంలోకి తీసుకున్న కార్యకర్తల ఇళ్ల వద్ద మహారాష్ట్ర పోలీసులతో పాటు స్థానిక పోలీసులను మోహరిస్తున్నట్లు పుణే అసిస్టెంట్ కమిషనర్ చెప్పారు. ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో నిందితులపై వచ్చిన కీలక ఆరోపణలు చేర్చనట్లు తెలిసింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారని, భీమా–కోరెగావ్ ఘర్షణల్లోనూ వారి పాత్ర ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన ఆరోపణలు ఈ నివేదికలో కనిపించలేదు. వారిని కస్టడీకి ఎందుకు అప్పగించాలో పోలీసులు 16 కారణాలు పేర్కొన్నా, పైన పేర్కొన్న రెండు ఆరోపణల్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఖండించిన మేధావులు, కార్యకర్తలు.. పౌరహక్కుల కార్యకర్తల అరెస్ట్లు, గృహనిర్బంధంపై దేశవ్యాప్తంగా మేధావులు, పౌరసంఘాల కార్యకర్తలు మండిపడ్డారు. మహారాష్ట్ర పోలీసుల తీరును ఖండించారు. రాజకీయ వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని రచయిత అరుంధతి రాయ్, లాయర్ ప్రశాంత్ భూషణ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, జిగ్నేశ్ మేవానీలు సంయుక్త ప్రకటనలో ధ్వజమెత్తారు. అరెస్టుల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లను తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. అణగారిన, వెనకబడిన వర్గాల కోసం పనిచేస్తున్న వారి గొంతుకను కేంద్రం నొక్కేస్తోందని సామాజిక కార్యకర్త స్థన్ స్వామి ఆరోపించారు. మరోవైపు, గౌతమ్ నవలాఖా అరెస్ట్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులో విచారణ జరపడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. -
గృహనిర్బంధంలో వరవరరావు
హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గృహనిర్బంధంలోనే గడిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురువారం పుణే పోలీసులు తిరిగి గాంధీనగర్లోని తన స్వగృహానికి తరలించారు. సెప్టెంబర్ 5 వరకు గృహనిర్బంధం చేసిన దరిమిలా ఆయన నివాసం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి 11.30 గంటల విమానంలో పుణే నుంచి వరవరరావు బయలుదేరాల్సి ఉండగా దాన్ని సకాలంలో అందుకోలేకపోవడంతో తెల్లవారుజామున 2.30 గంటల విమానంలో పోలీసులు ఆయనను హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ..పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారని, దీనిపై కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. అనంతరం వరవరరావును అక్కడ్నుంచి గురువారం ఉదయం 6.30కు పోలీసు బందోబస్తు మధ్య ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా సతీమణి హేమలత, కుటుంబ సభ్యులు ఆయనను ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు పుణే పోలీసులు ఇంట్లో కాపలా ఉండగా, తెలంగాణ పోలీసులు ఇంటి బయట, అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం వద్ద కాపలా ఉన్నారు. వరవరరావును కలిసేందుకు ఆయన మేనల్లుడు ఎన్.వేణుగోపాల్, వనజ, కూతుళ్లు సహజ, అనల, పవన, అల్లుళ్లు ప్రొఫెసర్ సత్యనారాయణ, కూర్మనాథ్, మనుమలు, మనుమరాళ్లు తదితర కుటుంబ సభ్యులతో పాటుగా న్యాయవాదులు రవీంద్రనాథ్, సురేశ్ను మాత్రమే పోలీసులు అనుమతించారు. ప్రజాసంఘాల నిరసన వరవరరావును కలిసేందుకు గాంధీనగర్లోని హిమసాయి అపార్ట్మెంట్కు ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, న్యూడెమోక్రసీ నాయకులు అక్కడికి తరలి రాగా వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు అక్కడకు చేరుకున్న మీడియాను సైతం పోలీసులు అనుమతించలేదు. సెప్టెంబర్ 5 వరకు వరవరరావు ఇంటి వద్ద ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. అరెస్టు అప్రజాస్వామికం: హరగోపాల్ వరవరరావు అరెస్టు అప్రజాస్వామికమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పౌరులు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించకుండా హక్కులు అడిగిన ప్రజాస్వామిక వాదుల గొంతులు నొక్కడం సరైంది కాదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డులేకుండా పోయిందన్నారు. దేశంలోని రచయితలు, జర్నలిస్ట్లు, కవులు, కళాకారులు, దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రఘునాథ్ టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, పీఓడబ్ల్యూ సంధ్య, ఉ.సాంబశివరావు, లింగయ్య, పీఎం.రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!
‘బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ - ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేధావులు.. ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌరహక్కుల నేతలపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్ట్యాగ్తో ట్విటర్లో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వరవరరావు అల్లుడు, ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) ప్రొఫెసర్ సత్యనారాయణ.. తన ఇంట్లో సోదాలు చేసిన సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అది అరెస్టు వారెంటు కాదు.. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు పవన, అల్లుడు సత్యనారాయణ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ విషయం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ... వరవరరావుకు అల్లుడినైన నేరానికే పోలీసులు తన పట్ల ఈ విధంగా ప్రవర్తించారేమో అంటూ సోదాలు నిర్వహించిన తీరును మీడియాకు వివరించారు. ‘ ఆరోజు(మంగళవారం) ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో.. సుమారు 20 మంది పోలీసులు (10 మంది మహారాష్ట్ర, 10 మంది తెలంగాణ పోలీసులు)ఇఫ్లూ స్టాఫ్ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మరాఠీ భాషలో ఉన్న ఓ కాగితాన్ని సర్చ్ వారెంట్ అంటూ నా చేతిలో పెట్టి ఇంట్లోకి వచ్చి, సోదాలు మొదలుపెట్టారు. ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. మా దగ్గర ఉన్న మొబైల్స్, ల్యాప్టాప్స్ తీసేసుకున్నారు. ఈ- మెయిల్ ఐడీలు బ్లాక్ చేశారు. అయితే పోలీసులు నాకు ఇచ్చింది సెర్చ్ వారెంట్ కాదని, ఓ పోలీసు ఉన్నతాధికారి రాసి ఇచ్చిన స్టేట్మెంట్ అని తర్వాత తెలిసిందని’ సత్యనారాయణ చెప్పారు. బాత్రూం డోర్ తెరచి ఉంచాలంటూ.. ‘బ్రష్ చేసుకునేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ అంటూ తన భార్య పవనను మనోవేదనకు గురిచేశారని సత్యనారాయణ ఆరోపించారు. ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క మచ్చ కూడా లేదు.. 30 ఏళ్ల సర్వీసులో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కేవలం వరవరరావు అల్లుడనే ఒకే ఒక్క కారణం చేత తనను టార్గెట్ చేశారని విమర్శించారు. తనలాంటి అమాయకుల మీద లేనిపోని నిందలు మోపి, గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుంటే ఏ కోర్టులకు కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు మేధావి అవ్వాలని ఎందుకు అనుకున్నావ్. నీ గదిలో అంబేద్కర్, ఫూలే దంపతుల ఫొటోలు ఎందుకున్నాయి. ప్రొఫెసర్గా సంపాదిస్తున్నది సరిపోవడం లేదా? మావో సాహిత్యం ఎందుకు చదువుతున్నావ్? వేరే పనులేమీ లేవా అంటూ ఒక ఉగ్రవాదిని ప్రశ్నించినట్లు తనను కూడా ప్రశ్నించారంటూ’ పోలీసుల తీరుపై సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఘటనతో క్యాంపస్ అంతా ఉలిక్కి పడింది. సత్యనారాయణ ఇంట్లో సోదాలు జరపటానికి పోలీసులు రావడంతో క్యాంపస్లోని విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారని ఇఫ్లూ ప్రొఫెసర్ సుజాత ముకిరి అన్నారు. సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. -
వరవరరావును హైదరాబాద్ తీసుకొచ్చిన పుణె పోలీసులు
-
హైదరాబాద్లో నివాసానికి వరవరరావు
హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావును పూణె నుంచి హైదరాబాద్కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్ గాంధీనగర్లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది. వరవరరావును ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే పూణెకు చెందిన నలుగురు పోలీసులు వరవరరావు ఇంటి వద్ద ప్రత్యేకంగా కాపలాగా ఉన్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు. వరవర రావుపై ఆందోళన వద్దు: హైకోర్టు నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ -
వరవరరావుపై ఆందోళన వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావును పోలీసులు బహిరంగంగానే అరెస్ట్ చేసినందున ఆయన ప్రాణాలకు హాని ఉంటుందనే అందోళన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఒక వైపు జాతి ప్రయోజనాలు–మరోవైపు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సున్నిత అంశమని హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట నిబంధనలకు అనుగుణంగానే వరవరరావును అరెస్ట్ చేశారో లేదో అనే అంశంపైనే విచారణ జరపాల్సివుందని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ల ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్ర పోలీసులు తన భర్త వరవరరావును అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పి.హేమలత అత్యవసర వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని బుధవారం ధర్మాసనం విచారిస్తూ.. వరవరరావు అరెస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వరవరరావును అరెస్ట్ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్లేప్పుడు ఇచ్చిన ట్రాన్సిస్ట్ ఆర్డర్ కాపీని తెలుగులో అనువదించి హేమలతకు అందజేయాలని తెలంగాణ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ అరెస్ట్పై కౌంటర్ వేయాలని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మహారాష్ట్ర డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. ట్రాన్సిస్ట్ ఆర్డర్ మరాఠీ బాషలో హేమలతకు అందజేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్కుమార్ చెప్పడంతో ధర్మాసనం పైవిధంగా ఉత్తర్వులు ఇచ్చింది. వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకోడానికి కారణం చెప్పలేదనీ, మహారాష్ట్రలోని భీమా–కోరేగావ్లో గత జనవరిలో జరిగిన అల్లర్లకు వరవరరావుకు సంబంధం లేదని, ఆ కేసులో ఆయన పేరు కూడా లేదని సురేష్ ధర్మాసనానికి చెప్పారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. -
నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులన్నీ నిబంధలనలకు విరుద్ధంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరిగాయని కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. ‘మీడియాలో వార్తల ఆధారంగా చూస్తే.. ఈ ఐదుగురి గృహనిర్బంధం నిబంధలకు విరుద్ధంగా జరిగిందని కమిషన్ భావిస్తోంది. ఈ అరెస్టులను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూస్తున్నాం’ అని ఎన్హెచ్చార్సీ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు. నవలఖా ట్రాన్సిట్ రిమాండ్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ అరెస్టుల విషయంలో కోర్టుకు పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదనేది సుస్పష్టమైందన్నారు. ‘ఫరీదాబాద్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్ పెండింగ్లో ఉంది. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లోనూ తన పేరు లేదని.. కేవలం తన సిద్ధాంతం కారణంగానే అరెస్టు చేసి హింసిస్తున్నారని చెప్పారు’ అని ఎన్హెచ్చార్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.జెనీవాలోని ఓ ఎన్జీవో నుంచి కూడా మహారాష్ట్ర పోలీసులు ఈ ఏడాది జూన్లో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల (సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, షోమాసేన్, మహేష్ రౌత్) ను అరెస్టు చేసినట్లు ఫిర్యాదు అందిన విషయాన్ని కమిషన్ వెల్లడించింది. ఈ అంశంలోనూ మహారాష్ట్ర డీజీపీకి జూన్ 29న నోటీసులు పంపామని, దీనిపై సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. -
ట్విట్టర్లో ‘మీటూ అర్బన్ నక్సల్’ ట్రెండింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల కార్యకర్తలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీరిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్లో పలువురు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో ట్విట్టర్లో ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్గా మారింది. తొలుత బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ..‘అర్బన్ నక్సల్స్కు మద్దతు ఇస్తున్నవారి జాబితా రూపొందించేందుకు చురుకైన యువతీయువకులు కొందరు నాకు కావాలి. సాయం చేయాలనుకున్నవారు నాకు సందేశం పంపండి’ అని ట్వీట్ చేశారు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు సహా చాలామంది అగ్నిహోత్రిపై మండిపడ్డారు. హక్కుల కార్యకర్తలకు తమ మద్దతును తెలియజేసేందుకు వేలాది మంది ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాగ్ట్యాగ్ను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 55,000 మంది ఈ హ్యాష్ట్యాగ్ను ట్వీట్ చేశారు. 128 సంస్థలకు మావోలతో సంబంధాలు! మావోలతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలతో 2012లో యూపీఏ ప్రభుత్వం జాబితా రూపొందించిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కొందరు ఆ సంస్థల సభ్యులు ఉన్నారన్నారు. మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో పౌరహక్కుల కార్యకర్తలను అరెస్ట్చేయడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు యూపీఏ నాటి జాబితాను తెర మీదికి తెచ్చారు. ‘మావోయిస్టులతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలను 2012లోనే యూపీఏ ప్రభుత్వం గుర్తించింది. వాటి కోసం పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనాడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. జాబితాలో ఉన్న సంస్థల కోసం పనిచేస్తున్న వారిలో వరవరరావు, సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్సాల్వెజ్, మహేశ్ రౌత్లు కూడా ఉన్నారు’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. -
వరవరరావుకు గృహనిర్బంధం..
న్యూఢిల్లీ: భీమా–కోరేగావ్ హింస కేసులో అరెస్టయిన ఐదుగురు మానవహక్కుల కార్యకర్తలకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేసిన వారిని సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. భిన్నాభిప్రాయాన్ని వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని, దీన్ని అణగదొక్కడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. భీమా–కోరేగావ్ హింస జరిగిన 9 నెలల తర్వాత వీరిని అరెస్టు చేయడంపై మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. ‘ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు సేఫ్టీ వాల్వ్ వంటిది. దీన్ని మీరు అణచాలని చూస్తే ఎప్పుడో ఓసారి అది బద్దలవుతుంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ.. చరిత్రకారురాలు రోమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవికా జైన్ సహా ఐదుగురు వేసిన పిటిషన్ ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా, నవలఖా అరెస్టుపై ఇచ్చిన ట్రాన్సిట్ రిమాండ్ను పరిశీలిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సరైన ఆధారాలు చూపకుండానే నవలఖాను ఎలా అరెస్టు చేశారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు ఎన్హెచ్చార్సీ కూడా ఈ అరెస్టులపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేసిన వారందరినీ వారి ఇళ్లకు పంపించాలని పుణే కోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోర్టుకు మహా విన్నపం అరెస్టయిన ఐదుగురిని విడుదల చేయాలంటూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు అంగీకరించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇప్పటికే పలువురు ఈ అంశంపై వివిధ హైకోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో మహా సర్కారు ఈ అంశాన్ని లేవనెత్తింది. హైదరాబాద్ నుంచి వరవరరావు, ముంబై నుంచి అరున్ ఫెరీరా, వెర్నాన్ గంజాల్వేస్, హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి సుధా భరద్వాజ్, ఢిల్లీ నుంచి గౌతమ్ నవలఖాలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. డిసెంబర్ 31న భీమా–కోరేగావ్ గ్రామంలో జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ సభ కారణంగానే దళితులు, అగ్రవర్ణాల మధ్య హింస ప్రజ్వరిల్లిందనే కేసులో ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నవలఖా అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు.. హక్కుల కార్యకర్త నవలఖా అరెస్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన దస్తావేజులను మరాఠీలోనే ఉంచడాన్ని ప్రశ్నించింది. ‘తననెందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటప్పుడు అరెస్టు పేపర్లను ఇంగ్లిషులోకి తర్జుమా చేసి నవలఖాకు ఎందుకు ఇవ్వలేదు?’ అని కూడా ప్రశ్నించింది. దస్తావేజులు వేరే భాషలో ఉన్నప్పటికీ మెజిస్టీరియల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఎలా జారీ చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసు దస్తావేజులను వెంటనే ఇంగ్లిష్లోకి మార్చాలని కోర్టు ఆదేశించింది. నవలఖా అరెస్టులో న్యాయపరమైన అంశాలు, పుణే కోర్టుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ట్రాన్సిట్ రిమాండ్ను పరిశీలిస్తామని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివిన తర్వాతే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భీమా–కోరేగావ్ వివాదానికి సంబంధించి మిగిలిన అరెస్టులు సరైనవే అని వెల్లడైతే.. నవలఖా విషయంలోనూ స్పష్టత వస్తుందని కోర్టు పేర్కొంది. కాగా, మరాఠీలో ఉన్న పత్రాలను ఇంగ్లిష్లోకి ట్రాన్స్లేట్ చేసి నవలఖా లాయర్లకు ఇస్తామని మహారాష్ట్ర పోలీసుల తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ కోర్టుకు తెలిపారు. ప్రజాగొంతుక నొక్కేస్తున్నారు: అంబేడ్కర్ ప్రజల గొంతుకను నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. భారతీయ రిపబ్లిక్ పార్టీ బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. వామపక్ష భావజాలమున్న నేతలను అరెస్టు చేయడం.. ప్రజల గొంతుకను నొక్కడమేనన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ఎన్జీవోలు, రాజకీయేతర సంస్థలు లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ముంబైలో విమర్శించారు. సనాతన్ సంస్థపై దాడులు జరుగుతున్న సమయంలో కావాలనే ఎల్గార్ పరిషత్ సభ్యులపైనా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. అటు శివసేన కూడా భీమా–కోరేగావ్ హింసకు అసలైన సూత్రధారులను ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాన్ని అంటగడుతూ అరెస్టులు జరిపే సంస్కృతి దేశవ్యాప్తంగా జరుగుతోందని విమర్శించింది. భారతీయ శిక్షాస్మృతి 153 (ఏ) కింద (మతం, జాతి, పుట్టిన ప్రాంతం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా వ్యాఖ్యానించడం) ఐదుగురిని పుణే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అరెస్టులకు ముందు చట్టపరమైన అన్ని నిబంధనలు అమలుచేశామని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దీపక్ సర్కార్ తెలిపారు. అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్టులు జరిగాయన్నారు. -
నెపం వేసి రుజువులు లేకుండా అరెస్ట్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పౌరహక్కుల నేత వరవరరావును అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వరవరరావును అరెస్టు చేయడం పౌరహక్కులను కాలరాయడమేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో కుట్ర చేశాడనే నెపంతో రుజువులు లేకుండా అరెస్టు చేయడం దారుణమని ఆయన అన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...వరవరరావు గొప్ప మానవతావాది అని, మావోయిస్టులతో చర్చల సందర్భంగా గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. ఆయన అరెస్టుపై కేంద్రం విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని జానా డిమాండ్ చేశారు. వరవరరావు కుట్ర చేశారనే ఆరోపణలు నమ్మశక్యంగా లేవని మండలిలో విపక్ష నేత షబ్బీర్అలీ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతులను ప్రభుత్వాలు అణచివేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ విధానాల్లోని తప్పులను ఎత్తిచూపుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న వరవరరావును అరెస్టు చేయడాన్ని టీపీసీసీ ముఖ్య అధి కార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తప్పుపట్టారు. -
ఆ అరెస్టులే అసలైన కుట్ర
ఈ దేశంలో ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కులను కాలరాసినప్పుడు, వరవరరావు, గౌతం నవ్లఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయటపడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కుల, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటించారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు మద్దతునిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదు. హత్యలు, అత్యాచా రాలూ, అవమానాలూ భరిస్తూ ఉన్నంతకాలం ఏ విధమైన ఘర్షణ లేదు. సరిగ్గా ఇదే మహారాష్ట్రలో భీమా కోరేగావ్ స్ఫూర్తియాత్ర సందర్భంగా జరిగిన ఘటనలకు వర్తిస్తుంది. పీష్వాల అకృత్యాలు సహిం చిన మహార్, చమార్ లాంటి నాటి అంటరాని కులాలు 1818 జనవరి 1న ప్రతిఘటనా దాడికి పూనుకున్నాయి. కేవలం అయిదు వందల మంది కొన్నివేల మంది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి విజయగాథను మననం చేసుకొని, స్ఫూర్తి పొందడానికి లక్షలాది మంది దళితులు దేశం నలుమూలల నుంచి కోరేగావ్ జైత్రయాత్రకు బయలుదేరారు. భీమా నదికి దక్షిణం వైపున ఉన్న భీమాకోరేగావ్ స్తూపం వద్ద దళితులు ఎంతో ప్రశాంతంగా పది కిలోమీటర్లకు పైగా నడిచివెళ్లి నివాళులర్పించారు. భీమా నదికి రెండోవైపు అంటే ఉత్తరం వైపు భీమాకోరేగావ్ యాత్రకు కదలివస్తోన్న దళితులపై దాడి జరిగింది. వధూబద్రుకా గ్రామంలో కొంత మంది ఆధిపత్య కులాలు కాషాయజెండా లతో, ఇనుపరాడ్లు, రాళ్లతో పొలాల్లో దాగి దాడికి దిగారు. ఊహించని ఈ దాడికి తట్టుకోలేని దళితులు చెల్లాచెదురయ్యారు. అక్కడ ఉన్న వాహనాలను తగు లబెట్టారు. ఈ గ్రామాల అగ్రకులాలకు తోడుగా పొరుగున ఉన్న సన్నావాడి, శిఖరాపూర్ గ్రామాల ఆధిపత్య కులాలు దాడిలో భాగమయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ పతంగే ఆసుపత్రిలో మరణించారు. ఈ దాడి హఠాత్తుగా జరిగింది కాదని, ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు చెప్పారు. రెండు రోజుల ముందే డిసెంబర్ 29న వధూబద్రుకా గ్రామంలో అక్కడి దళితులు నిర్మిం చుకున్న ఒక అమరవీరుని సమాధిని ఆధిపత్య కులాలు కూల్చివేశాయి. అంతకు ముందు మూడు నెలలుగా భీమాకోరేగావ్ విజయయాత్రపై చర్చ జరుగుతోంది. భీమాకోరేగావ్ దళితులు తలెత్తుకొని నిలబడటం ఆధిపత్య కులాలకు కంటగింపుగా తయారైంది. అదే ఈ దాడికి కారణం. దీనికిపై దేశంలోని అనేక ప్రాంతాలు నిరసనలతో భగ్గుమ న్నాయి. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోని దళితులు, ఆదివాసీలు రాష్ట్రం మొత్తాన్ని దిగ్బంధనం చేశారు. ముంబైని స్తంభింపజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది దళిత యువకులు భీమా కోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా జరిగిన దాడిని ప్రతిఘటించడం మనకు కనిపిస్తుంది. పూనా– ముంబై ప్రాంతమే కాకుండా మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాలు కూడా అట్టుడికిపోయాయి. ఈ ప్రతిఘటనను అణచడానికి వేలాది మంది పోలీ సులను రంగంలోకి దింపారు. కానీ రాహుల్ పతం గేని హత్య చేసిన సంభాజీ భీడే, మిలింద్ ఎగ్బోటేను మాత్రం అరెస్టు చేయలేదు. ఈ విషయమై పార్ల మెంటులో సైతం చర్చ జరిగింది. తర్వాత కేవలం మిలింద్ ఎగ్బోటేను మాత్రమే అదుపులోకి తీసుకొని బెయిల్పై విడిచిపెట్టారు. హిందూ సంఘ నాయ కుడు సంభాజీ భీడేను ఇప్పటి వరకు అరెస్టు చేయ లేదు. విచారించనూ లేదు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ గురువు అంటారు. మరో విచిత్రం ఏమిటంటే జనవరి ఒకటవ తేదీన హత్యకు గురైన దళిత యువ కుడు రాహుల్ని చంపింది హిందూ సంఘ కార్య కర్తలు కాదని, దళిత యువకులే హత్యచేశారని పోలీ సులు మరో కథ అల్లారు. సుప్రీం ఆదేశంతో దళితుల్లో ఆందోళన మహారాష్ట్రలో ఈ ఉద్యమ జ్వాలలు చల్లారకముందే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ప్రభు త్వోద్యోగులనూ, ఇతరులనూ ముందస్తుగా అరెస్టు చేయకూడదని మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామం దేశంలోని మొత్తం దళితులను ఆందో ళనకు గురిచేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏప్రిల్ రెండున దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ దళిత ఉద్యమ శక్తిని నిరూపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకకంఠంతో దళితులు సుప్రీంకోర్టు తీర్పుని నిరసించారు. భారత్ బంద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్, మ«ధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది యువకులు అరెస్టయ్యారు. రోడ్ల మీదకు వచ్చిన యువతీయువ కులను వారి కులం పేరు అడిగి మరీ వ్యాన్లలోకి ఎక్కించి జైళ్ళలోకి తోశారు. ఈ రెండు సంఘటనలతో ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ∙ఉద్య మాన్ని అణచివేయాలని ఆలోచించింది. నేరుగా దళి తులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధం ప్రయోగిస్తే ఎన్నికల్లో తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించిన పాలకులు దానికి మరో మార్గం అన్వే షించారు. అందుకు భీమాకోరేగావ్ హింసాకాండ అనే పదం సృష్టించారు. మీడియా ద్వారా దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎల్గార్పరిషత్ జరిపిన సమా వేశాన్ని దానికి మద్దతుగా చూపించారు. భీమా కోరే గావ్ ద్విశత వార్షికోత్సవ స్ఫూర్తియాత్ర సందర్భంగా కొన్ని ప్రజాసంఘాలు కలిసి డిసెంబర్ 31న పుణే లోని శనివార్వాడలో సభ ఏర్పాటు చేశాయి. కోరే గావ్ స్ఫూర్తి కొనసాగించాలనే లక్ష్యంతో ఈ సభను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ముందే చెప్పారు. గుజరాత్ దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ, జేఎ న్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్, రోహిత్ వేముల తల్లి రాధిక సహా కొంత మంది దళిత నాయకులు ఈ సభకు హాజరయ్యారు. జనవరి ఒక టిన దళితులపై దాడి తర్వాత జరిగిన దళితుల నిరసన ప్రదర్శనలకు ఈ సభకు సంబంధం ఉందని, ఎల్గార్ పరిషత్ సభలో చేసిన ఉపన్యాసాలే హింసా కాండకు కారణమయ్యాయని పోలీసులు ముందుగా ప్రకటించారు. ఈ ఎల్గార్ పరిషత్ సభలకు ఆర్థిక సహకారాన్నీ మావోయిస్టు్టలు అందించారని ప్రచా రం చేసిన పోలీసులు జూన్ నెలలో ఐదుగురు కార్య కర్తలను మావోయిస్టుల పేరుతో అరెస్టు చేశారు. దాడి చేసింది దళితులు కాదు! భీమాకోరేగావ్ జైత్రయాత్ర సందర్భంగా భీమా నదికి ఉత్తర భాగంలో దాడి చేసింది దళితులు కాదు. కాషాయజెండాలతో, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడిచే సిన వారు స్థానిక ఆధిపత్య కులాల వ్యక్తులేనని పత్రికలూ, మీడియా ఘోషించాయి. ఒకవేళ ఎల్గార్ పరిషత్ ఉపన్యాసాలే హింసాకాండకు కారణమైతే భీమా నదికి దక్షిణ భాగంలో వెల్లువెత్తిన జనసంద్రం మొత్తం పుణేనే భస్మీపటలం చేయగలిగేది. కోరేగావ్ భీమా నదికి దక్షిణభాగంలో దళిత యువకుడు రాహుల్ హత్యానంతరం కూడా దళితులు హింసకు పాల్పడలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలిపారు. లక్షలాది మంది దళితుల స్ఫూర్తికార్య క్రమాన్ని నిర్వహించింది అఖిల భారత సమతాసైనిక్ దళ్. ఎల్గార్ పరిషత్కు, భీమా కోరేగావ్ స్ఫూర్తి కార్యక్రమానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఎల్గార్ పరిషత్ సమావేశం జరిగింది డిసెంబర్ 31 సాయం త్రం. దళిత యువకుడు రాహుల్ హత్య జరిగిన గ్రామంలో డిసెంబర్ 29వ తేదీన దళితులు నిర్మిం చిన స్మారక చిహ్నాన్ని ఆధిపత్య కులాలు ధ్వంసం చేశాయి. అంటే ఆ సమావేశానికి ముందే దళితులపై పరోక్ష దాడులు ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఆధారంలేని ఎల్గార్ పరిషత్ కార్య క్రమాన్ని ఆసరా చేసుకొని మానవ హక్కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన పోలీసులు దాడులు చేశారు. ఆ దాడుల్లో ప్రధాని మోదీని హత్యచేయడానికి కుట్ర పన్నుతున్నారన డానికి ఆధారం లభ్యమైందని పోలీసులు ఢిల్లీలోని రోమా విల్సన్ గది నుంచి ఒక ఉత్తరం దొరికినట్టు ప్రకటించారు. ఇదే సందర్భంగా ముంబైలో సుధీర్ ధవలేను, నాగ్పూర్లో సోమాసేన్, మహేష్ రావత్, సురేంద్ర గాడ్లింగ్ను ఏప్రిల్ 17న అరెస్టు చేశారు. హైదరాబాద్లో విరసం నేతlవరవరరావు, ఢిల్లీలో న్యాయవాది, పౌర హక్కుల నాయకుడూ, జర్నలిస్టు, రచయిత గౌతం నవ్లఖా, ఫరీదాబాద్లో సుధా భరద్వాజ్, రాంచీ నుంచి ఆదివాసీ హక్కుల నాయ కుడు స్టాన్ స్వామి, ముంబై నుంచి అరుణ్ ఫెరీరాను అరెస్టు చేశారు. ఏప్రిల్ 2న భారత్ బంద్ తర్వాత ఈ అరెస్టులు జరగడం, దానికి భీమాకోరే గావ్ను ముడి పెట్టడం చూస్తే ఈ చర్యల వెనుక దాగి ఉన్న కుట్ర బహిర్గతమవుతోంది. విప్లవకవి వరవరరావు అరవై ఏళ్లుగా విప్లవో ద్యమంలో ఉంటూ ప్రజాఉద్యమాల్లో మమేకమ య్యారు. ఆదివాసీల పక్షాన పోరాడుతున్నారు. ధిక్కారస్వరమైన వరవరరావుని బయటలేకుండా చేయడమే లక్ష్యంగా ఈ అరెస్టుల తతంగం జరిగిం దన్నది వాస్తవం. ఈ దేశంలో ఆదివాసీలను ఎన్ కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కు లను కాలరాసినప్పుడు, వారిపై అత్యాచారాలు చేసి నప్పుడు వరవరరావు, గౌతం నవ్లాఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయట పడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కులు, ప్రజాసంఘాల నాయ కులనూ అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటిం చారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు సమాజంలో మద్దతు నిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా దళితులు, ఆదివాసీలు పోరాడుతోంటే వారికి మావోయిస్టులతో సంబంధాలను అంటగట్టి అణచివేయడం కూడా రెండో ప్రయోజనంగా భావి స్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్లో భీం ఆర్మీ ఉద్యమానికి మావోయిస్టుల అండ ఉందనే నెపంతో ఆ సంస్థ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ని ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. దళితులు, ఆదివాసీలు ఎదురు తిరిగినప్పుడల్లా వారిని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ఇదెంత మాత్రం వాంఛనీయం కాదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
జైలు కాదు.. గృహ నిర్బంధం చాలు..
-
పౌరహక్కుల నేతల అరెస్ట్; సుప్రీం కీలక వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ : విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్లపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అరెస్టైన ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలందరిని సెప్టెంబరు 5 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురిని తమ తమ సొంత ఇళ్లలోనే ఉండనివ్వాలని, బయటికి వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ సందర్భంగా.. అసంతృప్తి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ వంటిదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. కాగా పౌరహక్కుల నేతల అరెస్ట్ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రధాని హత్యకు కుట్ర’ కేసు పెడతారా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం పుణె పోలీసులు పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై దాడులు నిర్వహించి అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టారు ? ఎలాంటి కేసులు పెడుతున్నారు ? ఏ చట్టం కింద? ఏ సెక్షన్ కింద? అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి. మహారాష్ట్రలోని భీమా కోరెగావ్లో జనవరి ఒకటవ తేదీన జరిగిన దళితుల మహార్యాలీ సందర్భంగా తలెత్తిన అల్లర్ల విచారణలో భాగంగానే వీరిని అరెస్ట్ చేసినట్లు ప్రాథమిక వార్తలు తెలియజేశాయి. ఇదే అల్లర్లకు సంబంధించి జూన్ 6వ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై అత్యంత వివాదాస్పదమైన ‘చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 (వీఏపీఏ)’ను దాఖలు చేశారు. 2012లో ఈ చట్టాన్ని కేంద్రం సవరించినప్పటికీ ప్రమాదకర సెక్షన్లు, అంశాలు ఇంకా అందులో అలాగే ఉన్నాయి. హైదరాబాద్లో అరెస్టయిన వరవరరావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలపై కూడా వీఏపీఏ చట్టాన్నే దాఖలు చేసే అవకాశం ఉంది. పుణెలోని జాయింట్ కమిషనర్ కార్యాలయం నుంచి రాంచి పోలీసు స్టేషన్కు అందిన ఉత్తర్వుల్లో ‘నెంబర్ 4–2018’ కేసులో విచారణ కోసం అరెస్ట్ చేయాల్సిందిగా ఉంది. అంటే ఆ నెంబర్ కేసు వీఏపీఏదే. అయితే గతంలో అరెస్టై ప్రస్తుతం పుణె పోలీసుల నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త రోనా విల్సన్ వద్ద దొరికినట్లు పోలీసులు చెబుతున్న ఓ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని ఉంది. దీంతో ప్రధాని హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలపై కేసు పెట్టే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వమే ఇలాంటి కుట్రలు పన్నుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, మోదీ హత్య కుట్రకు ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ కేసును దాఖలు చేయక పోవచ్చు. వరవరరావు, ఆనంద్ టెల్టుంబ్డే, రోనా విల్సన్ వీఏపీఏ చట్టం ఎంతో ప్రమాదకరమైనది ఈ చట్టంలోని 13, 16, 17, 17బీ, 20, 38, 39, 40 సెక్షన్ల కింద నిందితులను విచారిస్తున్నారు. ఇందులోని 13వ సెక్షన్ ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న, వాటితో సంబంధం ఉన్నా ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించివచ్చు. మిగతా సెక్షన్లు దీనికంటే ప్రమాదరకమైనవి. టెర్రరిస్టు కార్యకలాపాలను సూచించేవి. టెర్రరిస్టు కార్యకలాపాలతో ఎవరి చావుకు కారణమైన, టెర్రరిస్టు చర్యకు ఆర్థిక సహాయం అందించినా, టెర్రరిస్టు చర్యకు పాల్పడినా, టెర్రరిస్టు సంస్థకు నియామకాలు జరిపినా, అందులో సభ్యుడిగా కొనసాగినా, ఆ సంస్థ తరఫున విరాళాలు వసూలు చేసినా ఐదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష విధించే సెక్షన్లు వీటిలో ఉన్నాయి. మహాయిస్టు చర్యలను టెర్రరిస్టు చర్యలుగా పోలీసులు పరిగణిస్తున్న విషయం తెల్సిందే. హర్యానాలోని ఫరిదాబాద్లో అరెస్ట్ చేసిన న్యాయవాది సుధా భరద్వాజ్పై వీఏపీఏ చట్టంలోని కొన్ని సెక్షన్లతోపాటు మత విద్వేషాలను రెచ్చగొట్టారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, వదంతలు వ్యాప్తి చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించారని.. ఇలా పలు ఆరోపణలు చేస్తూ భారతీయ శిక్షా స్మృతిలోని 34, 153 ఏ, 505 (1బీ), 117, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెల్సింది. ఆమె వద్ద దొరికిన ఓ లేఖలో కశ్మీరు వేర్పాటువాదులకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. ఇంతకు వీరిపై కేసులెందుకు? ఈ ఏడాది జనవరి 1వ తేదీన పుణెకు సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోని భీమా కోరెగావ్లో ఏటా జరిగే దళితుల మహార్యాలీ జరిగింది. దాదాపు మూడు లక్షల మంది హాజరైన ఆ ర్యాలీ సందర్భంగా విధ్వంసకాండ చెలరేగింది. అందులో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్లను డిసెంబర్ 31వ తేదీన ఓ బహిరంగ వేదిక నుంచి ప్రసంగించిన సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలతోపాటు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారన్నది పోలీసుల అభియోగం. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?) ప్రధాని నరేంద్ర మోదీతో సంభాజి భిడే నాడేమి వార్తలొచ్చాయి? కాషాయ జెండాలు ధరించిన ఆరెస్సెస్ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించడం వల్లనే విధ్వంసకాండ చెలరేగిందని నాడు వార్తలు వచ్చాయి. ర్యాలీకి కొన్ని రోజుల ముందు ర్యాలీని అడ్డుకోవాల్సిందిగా హిందూ సంఘాల నాయకులు ఇచ్చిన పిలుపే అల్లర్లకు కారణమైందని ఆ వార్తలు సూచించాయి. దాంతో ఆరెస్సెస్ కార్యకర్తలను రెచ్చగొడుతూ మాట్లాడినా ‘హిందూ ఏక్తా మంచ్’ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటే, ‘శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్’ సంస్థ చీఫ్ సంభాజీ భిడేలపై పుణె పోలీసులు జనవరి 3వ తేదీన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిద్దరికి ఆరెస్సెస్ అధినాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో వారిని కనీసం పోలీసులు అరెస్ట్ చేసేందుకు సాహసించలేక పోయారు. ఆ విషయమై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిని తీవ్రంగా నిలదీసింది. అరెస్ట్లు చూపించాక కోర్టుకు రావాలని కూడా ఆదేశించింది. దాంతో మిలింద్ ఎక్బోటేను అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే బెయిల్పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన గురువుగా భావించే సంభాజి భిడేను అరెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడూ ప్రయత్నించలేదు. హఠాత్తుగా మలుపు తిరిగిన కేసు హిందూ సంఘాలపై నుంచి కేసు దృష్టి ఒక్కసారిగా సామాజిక కార్యకర్తల వైపు మళ్లింది. ఎక్బోటే, భిడేలాంటి హిందూ నాయకుల ప్రసంగాల వల్ల అల్లర్లు చోటు చేసుకోలేదని, సామాజిక కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లనే అల్లర్లు జరిగాయని అభిప్రాయపడిన పుణె పోలీసులు జూన్ ఆరవ తేదీన ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నాడు విద్వేషాలను రెచ్చగొట్టారంటూ హిందూత్వ నాయకులపై భారతీయ శిక్షాస్మృతిలోని సాధారణ సెక్షన్లను నమోదు చేయగా, ఆ తర్వాత సామాజిక కార్యకర్తలపై మాత్రం అత్యంత వివాదాస్పదమైన ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం’ కింద కేసులు పెట్టారు. -
‘అర్బన్ మావోయిస్టులు’ అంటే ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మంగళవారం ఉదయం పది మంది సామాజిక కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపి వారిలో వరవరరావు సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ ఐదుగురు సామాజిక కార్యకర్తలతోపాటు భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో జూన్లో అరెస్ట్ చేసిన ఐదుగురు సామాజిక కార్యకర్తలను కూడా పోలీసులు అర్బన్ మావోయిస్టులు లేదా అర్బన్ నక్సలైట్లుగా వ్యవహరించారు. ఇంతకు ఈ అర్బన్ మావోయిస్టులంటే ఎవరు? వారిని ఎందుకు అలా పిలుస్తున్నారు? ఆ పదం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? బాలివుడ్ చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ప్లే రచయిత వివేక్ అగ్నిహోత్రి ‘అర్బన్ నక్సల్’ శీర్షికతో స్వరాజ్య పత్రికలో 2017, మే నెలలో ఓ వ్యాసం రాశారు. ‘అర్బన్ నక్సలైట్లంటే పట్టణాల్లో ఉండే మేధావులు. ప్రభావశీలురు. ప్రాముఖ్యత కలిగిన కార్యకర్తలు, వారు భారత దేశానికి కనిపించని శత్రువులు. రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవాన్ని రాజేసేవారు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో వీరిని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ ‘హాఫ్ మావోయిస్ట్స్’గా వర్ణించారు. రహస్య కేటగిరీకి చెందిన వీరు భారత ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులుగా ఆయన ట్వీట్ కూడా చేశారు. బహుశ ఆయన కూడా వివేక్ వ్యాసాన్ని చదివి ఉండవచ్చు! భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో జూన్ ఆరవ తేదీన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ షోమా సేన్, సామాజిక కార్యకర్తలు మహేశ్ రౌత్, సుధీర్ ధావ్లే, రోనావిల్సన్లను అరెస్ట్ చేసినప్పుడు వారిని పోలీసులు ‘అర్బన్ మావోయిస్టులు’గా పేర్కొన్నారు. బాలీవుడ్ అగ్నిహోత్రి రాసిన వ్యాసాన్ని పోలీసులు చదివి ఉన్నారా? పట్టణాల్లో నివసిస్తున్న మావోయిస్టులుగా భావించి కాకతాళీయంగానే అలా పిలిచారోమో వారికే తెలియాలి. అప్పటి నుంచి మాత్రం ‘అర్బన్ మావోయిస్టులు’ అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. -
మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అయిదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులను సుమోటోగా స్వీకరించిన కమిటీ మహారాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపికి నోటీసులు జారీ చేసింది. ఐదుగురు కార్యకర్తల అరెస్టు వ్యవహారంలో ప్రామాణిక పద్ధతులను అనుసరించలేదని ఆరోపించింది. ఇది వారి మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ మొట్టికాయలేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో 'వాస్తవ నివేదిక' సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. దేశవ్యాప్తంగా అయిదు రాష్ట్రాల్లోని పలునగరాల్లో మానవహక్కుల కార్యకర్తల అరెస్టులపై నివేదికలను హక్కుల సంఘం పరిశీలించిన తరువాత నోటీసులు పంపించామని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పుణే పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మానవ, దళిత హక్కుల కార్యకర్తలపై ఇళ్లపై ఆకస్మిక దాడులు, అరెస్టులు కలకలం రేపాయి. విప్లవ కవి వరవరరావు, అరుణ ఫెరారి, వెర్నాన్ గోన్సాల్వేస్, రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర, సుధా భరద్వాజ్, గౌతం నావ్లాఖ్ ఇళ్లపై సోదాలు నిర్వహించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అరెస్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రజల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. మరోవైపు విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్లపై దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రమఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్తోపాటు మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్ను ఖండిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పౌరహక్కుల నేతల అరెస్ట్పై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్లపై దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. పౌరహక్కుల నేతల అరెస్ట్ను ఖండిస్తూ.. ప్రమఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేసిన ఐదుగురు పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వారిపై తప్పుడు చార్జీషీట్లు మోపారాని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని కోరెగావ్-భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే గౌతం నవలఖా తన అరెస్ట్కు వ్యతిరేకంగా దాఖలు చేసిన సొంత పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. -
ప్రజాసంఘాల నేతలు అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్బండ్ రణరంగంగా మారింది. దేశవ్యాప్తంగా వరవరరావుతో సహా అనేక మంది హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్న దళిత, పౌరహక్కుల నేతలు, కార్యకర్తలు, లాయర్లు, కవులు, రచయితలు, కార్యకర్తలను తెలంగాణ పోలీసులు బలవంతంగా గుంజుకపోయారు. మరికొంతమందిని అసలు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన చేపట్టబోతున్న ఆందోళనకారులపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. ఒక్కసారిగా ఉద్యమకారులపై విరుచుకుపడిన తెలంగాణ పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. దొరికిన వారిని దొరకినట్టు బలవంతంగా పోలీసు వ్యాన్లోకి ఎక్కించి నాంపల్లి, బొల్లారం, గోషామహల్, బేగం బజార్, ముషీరాబాద్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముఖ్యంగా సామాజిక కార్యకర్త సజయ, సుధ, విరసం మంజుల, అరుణోదయ విమల, బండారు విజయ, లలిత, జయశ్రీ, ఖలీదా,గీతాంజలి, ప్రగతిశీల మహిళాసంఘం నాయకులు సంధ్య, ఝాన్సీ, ఇఫ్టూ అనురాధతో పాటు ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమకారులు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన కొనసాగిస్తున్నారు. -
అరెస్టుల పర్వం!
దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు, దాడులు నిర్వహించి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అయిదుగురు నాయకులు–హైదరాబాద్లో విప్లవ రచయిత వరవరరావు, ముంబైలో హైకోర్టు న్యాయవాదులు వెర్నాన్ గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్లో కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్, న్యూఢిల్లీలో పౌరహక్కుల నాయకుడు గౌతం నవల ఖాలను మహారాష్ట్రకు చెందిన పూణె పోలీసులు అరెస్టు చేశారు. పుణెకు సమీపంలోని భీమా– కొరెగావ్లో గత ఏడాది డిసెంబర్ 31న దళిత వీరుల సంస్మరణ సభకు ముందూ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఉదంతాలకు సంబంధించి సాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టులు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఆ ఉదంతాలతో మావోయిస్టు పార్టీకి సంబంధం ఉన్నదని, ఇప్పుడు అరెస్టయినవారంతా ఆ పార్టీతో సంబంధాల్లో ఉన్నవారేనని వారి అభియోగం. అంతే కాదు... భీమా–కొరెగావ్ తదనంతర పరిణామాల గురించి దర్యాప్తు చేస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టు పార్టీ పన్నిన కుట్ర వెల్లడైందంటున్నారు. ఈ అయిదుగురి అరెస్టుతో పాటు న్యాయవాది సుసాన్ అబ్రహాం(ముంబై), ఫాదర్ స్టాన్ స్వామి(రాంచీ), ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే(గోవా), జర్నలిస్టు క్రాంతి టేకుల(హైదరాబాద్) ఇళ్లలోనూ, వరవరరావు ఇద్దరు కుమా ర్తెల ఇళ్లలోనూ కూడా సోదాలు చేశారు. ఇప్పుడు అరెస్టయిన అయిదుగురూ రహస్య జీవితం గడుపుతున్నవారు కాదు. వారి వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులుగా కొనసాగుతూ, హక్కుల ఉల్లంఘనలపై నిలదీస్తున్నవారు. ఆ విష యంలో తప్ప వీరిలో చాలామందికి సంస్థాగతంగా కావొచ్చు...విశ్వాసాలరీత్యా కావొచ్చు ఏకాభి ప్రాయం లేదు. వరవరరావు విప్లవ సాహిత్యోద్యమంలో దాదాపు అర్ధ శతాబ్ది నుంచి పని చేస్తు న్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) సంస్థాపక సభ్యుడాయన. మావోయిస్టు పార్టీతో సంబం ధాలున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం నిషేధించిన సంస్థల్లో విరసం లేదు. గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీ రాలు న్యాయవాద వృత్తిలో ఉంటూ పౌరహక్కులకు సంబంధించి బలమైన గొంతు వినిపిస్తున్న వారు. మొన్న జూన్లో ఈ ఉదంతానికి సంబంధించే అరెస్టయిన అయిదుగురు సభ్యుల తరఫున న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్ వృత్తి రీత్యా న్యాయ వాది. సోషలిస్టు నాయకుడు స్వర్గీయ శంకర్ గుహ నియోగి స్థాపించిన ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చాలో చురుగ్గా పనిచేసి ప్రస్తుతం భిలాయ్ గని కార్మిక సంస్థ నాయకురాలిగా, పీయూ సీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. ఢిల్లీలో అరెస్టయిన గౌతం నవలఖా పౌరహక్కుల రంగంలో పనిచేస్తు న్నారు. చరిత్రలో భీమా–కొరెగావ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 200 ఏళ్లక్రితం ఆధిపత్య కులాలపై పోరాడి విజయం సాధించిన దళిత వీరుల స్మారక చిహ్నం అక్కడుంది. భీమా–కొరెగావ్ పోరాట ద్విశత జయంతి కావడంతో నిరుడు డిసెంబర్లో జరిగిన సదస్సుకు భారీ యెత్తున దళితులు హాజ రయ్యారు. సదస్సు జరిగిన రోజే ఘర్షణలు చెలరేగి దళిత యువకుడు చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఉదంతాలకు సంబంధించి గత మార్చిలో సమతా హిందూ అఘాదీ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటేను అరెస్టుచేశారు. ఆయన బెయిల్పై విడుదల య్యారు. ఈ కేసు అతీగతీ ఏమైందో తెలియదుగానీ... ఆ సదస్సులో ప్రసంగించిన వక్తలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయటం వల్లే హింస చెలరేగిందని పోలీసులు ఆరోపించారు. అనంతరం మొన్న జూన్లో దళిత కార్యకర్త సుధీర్ ధవాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, హక్కుల కార్యకర్త మహేష్ రౌత్, ప్రొఫెసర్ షోమా సేన్, రాజకీయ ఖైదీల హక్కుల కమిటీ నాయకుడు రోనా విల్సన్లను అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టయిన వారుగానీ, ఇంతక్రితం అరెస్ట యినవారుగానీ భీమా–కొరెగావ్ సదస్సుకు వెళ్లలేదు. ఆ సదస్సును రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబే డ్కర్తోబాటు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ కోల్సే పాటిల్ నిర్వహించారు. ఆ ముగ్గురినీ ఇంతవరకూ పోలీసులు ప్రశ్నించనే లేదు! ప్రధాని హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణ అసాధారణమైనది. దాన్ని తేలిగ్గా తీసుకోవాలని ఎవరూ అనరు. కానీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మొదలుకొని పలువురు మాజీ న్యాయమూర్తులు, కొందరు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారుల వరకూ ఆరోపణకు ఆధారంగా చూపుతున్న లేఖను కొట్టిపారేశారు. అది నమ్మశక్యంగా లేదన్నారు. వారి అభిప్రాయాల సంగతలా ఉంచి ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా పిలిపించి ప్రశ్నించే అధి కారం పోలీసులకుంటుంది. ఆ తర్వాత వారిని అరెస్టు కూడా చేయొచ్చు. ఆరోపణల్లోని నిజా నిజాలు కోర్టులు తేలుస్తాయి. అయితే ఆ ప్రక్రియకు కూడా ఒక విధానమంటూ ఉంటుంది. ఈ అయిదుగురి అరెస్టులోనూ పోలీసులు అది పాటించినట్టు కనబడదు. అరెస్టు చేసినప్పుడు వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలతో రాసే పంచనామా రిపోర్టు నిందితులకు తెలిసిన భాషలోనే ఇవ్వాలి. ఇద్దరు స్థానికులు సాక్షులుగా ఉండాలి. లేఖ బయటపడ్డాక ఏడు నెలలపాటు దర్యాప్తు సాగించిన పోలీసులు ఇలాంటి నిబంధనలు పాటించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కారణాలు చూపే ఢిల్లీ హైకోర్టు గౌతం నవలఖానూ, పంజాబ్ హర్యానా హైకోర్టు సుధా భర ద్వాజ్నూ పుణెకు తీసుకెళ్లేందుకు పోలీసులను అనుమతించలేదు. వరవరరావు విషయంలో సైతం ఈ నిబంధన బేఖాతరైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మొదలుకొని చరిత్రకారుడు రామ చంద్ర గుహ వరకూ అనేకమంది ప్రముఖులు ఈ అరెస్టుల్ని ఖండించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వర్తమాన పరిస్థితులను ఎమర్జెన్సీ కాలంతో పోల్చింది. తీసుకునే చర్యలేమైనా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని... విమర్శలకూ, ఆరోపణలకూ అతీతంగా ఉండాలని ప్రభు త్వాలు గుర్తించటం అవసరం. -
భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్ : పుణే పోలీసులు విచారణ పేరుతో హైదరాబాద్లో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నేతల ఇళ్లపై దాడులు జరపడమే కాకుండా, అక్రమ అరెస్టులకు పాల్పడటం సహించరానిదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు దేవులపల్లి అమర్ అన్నారు. పీసీఐ కమిటీ పర్యటనలో భాగంగా ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఉన్న అమర్ ఈ సంఘటనపై స్పందించారు. పౌర హక్కుల నాయకులను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి మీడియా స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను హరించడానికే పోలీసులు పథకం ప్రకారం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అమర్ స్పష్టం చేశారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నాం: టీయూడబ్ల్యూజే మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటనపై విశ్వాసం లేకుండా పోయినందువల్లే, తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజాసంఘాల ప్రముఖులు వరవరరావు, కూర్మనాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై పుణే పోలీసులు దాడులకు పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లూజే) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలు అని పేర్కొన్నారు. పోలీసు చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. అరెస్టులు సరికాదు: టీయూడబ్ల్యూజే మోదీ హత్యకు కుట్ర పేరుతో పుణే పోలీసులు విరసం నేత వరవరరావును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి ఇళ్లలో అక్రమంగా సోదాలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ వారంట్ లేకుండా సోదాలు నిర్వహించడం అక్రమమని యూనియన్ అధ్యక్షుడు అల్లం నారాయణ, క్రాంతి పేర్కొన్నారు. -
వరవరరావును తక్షణమే విడుదల చేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: విరసం అధ్యక్షుడు వరవరరావును అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభ ద్రం ఖండించారు. తక్షణ మే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, మానవ, ప్రజాస్వామ్య హక్కులపై తీవ్ర దాడి జరుగుతోందన్నారు. అబద్ధపు అభియోగాలు మోపి తన ప్రత్యర్థులను కేసుల్లో ఇరికిస్తోందన్నారు. దీనిలో భాగంగానే వరవరరావు, ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల ఇళ్లలో సోదాలు నిర్వహించారని విమర్శించారు. వరవరరావుది అక్రమ అరెస్టు: మంద కృష్ణ సాక్షి, హైదరాబాద్: ఒక లేఖ ఆధారంగా పౌరహక్కుల నేత వరవరరావును పుణే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆ లేఖ రాసింది మావోయిస్టులా? కాదా? అన్న విషయం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ లేఖను పోలీసులే సృష్టించారన్న పౌరహక్కుల నేతల ప్రశ్నకు సమాధానం చెప్పాలని మంగళవారం డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వరవరరావుపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలన్నారు. -
9 గంటలపాటు సోదాలు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారంటూ జూన్ 18న నమోదైన కేసులో ప్రమేయంపై పుణే పోలీసులు విరసం నేత వరవరరావును మంగళవారం ప్రశ్నించి ఆపై అరెస్టు చేశారు. హైదరాబాద్ గాంధీనగర్లోని ఆయన ఇంటికి ఉదయమే వచ్చిన పోలీసులు దాదాపు 9 గంటలపాటు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పుణే విశ్రంబాగ్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ దీపక్ నికమ్ నేతృత్వంలో 25 మంది పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వరవరరావు నివాసంతోపాటు విరసం కార్యవర్గ సభ్యులు టేకుల పురుషోత్తం అలియాస్ క్రాంతి (జర్నలిస్టు), సత్యనారాయణ (ఇఫ్లూ ప్రొఫెసర్), కూర్మనాథ్ (జర్నలిస్టు) ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు వరవరరావును ఓ పోలీసు బృందం ప్రశ్నించింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర కేసుకు సంబంధించి అరెస్టయిన మావోయిస్టు సానుభూతిపరుడు, ఢిల్లీవాసి రోనా విల్సన్తో ఉన్న సంబంధం, మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయడంలో వరవరరావు పాత్రపై ఆరా తీసినట్లు తెలిసింది. అనంతరం మధ్యాహ్నం 2: 30 గంటల సమయంలో వరవరరావును అరెస్ట్ చేసిన పుణే పోలీసులు... స్థానిక పోలీసుల సహకారంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో పౌరహక్కుల సంఘాల నేతలు, కార్యకర్తలు ఇతర ప్రజాసంఘాల నాయకులు పుణే పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్థానిక పోలీసులు వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3: 30 గంటల ప్రాంతంలో పోలీసులు గాంధీ ఆస్పత్రిలో వరవరరావుకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రిజన్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్పై ఆయన్ను పుణే తరలించేందుకు అనుమతించాలని కోరారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా పుణే కోర్టులో వరవరరావును ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో ఆయన్ను హుటాహుటిన పుణే తరలించారు. మరోవైపు మిగిలిన విరసం కార్యవర్గ సభ్యుల ఇళ్లలో సోదాలను సాయంత్రం 4 గంటలకల్లా పూర్తిచేసిన ఇతర పోలీసు బృందాలు...వారి వద్ద నుంచి 600 విప్లవ సాహిత్య పుస్తకాలు, 16 పెన్ డ్రైవ్లు, 8 ఆడియో టేపులు, రెండు హార్డ్డిస్క్లు, నాలుగు ల్యాప్ట్యాప్లు, ఫేస్బుక్, జీ–మెయిల్ ఖాతాల వివరాలు, మరాఠీ భాషలో ఉన్న మావోయిస్టు పార్టీకి చెందిన రెండు లేఖలు, ప్లీనరీలో మావోయిస్టు పార్టీ చేసిన తీర్మానాల కాపీలను స్వాధీనం చేసుకున్నాయి. వరవరరావుపై యూఏపీఏ చట్టం ప్రయోగం.. వరవరరావుపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 13, 16, 17, 18 (బి), 20, 38, 39, 40తోపాటు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 153 (ఏ), 505 (1), 117, 120 (బి), 34 కింద పుణేలోని విశ్వరాంబాగ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిషేధిత సంస్థలైన మావోయిస్టు పార్టీ, ఉగ్రవాద, ఇతర సంస్థలకు అనుబంధంగా పనిచేయడంతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ చట్టం కింద ఆరోపణలు రుజువైతే జీవితఖైదు పడే అవకాశం ఉంది. కోరెగావ్–భీమా హింసాకాండ నుంచి... పుణే జిల్లాలోని కోరెగావ్–భీమా ప్రాంతంలో దళితులతో కూడిన బ్రిటిష్ సేనలు, పెష్వా పాలకుల మధ్య 1818లో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సేనలు గెలిచాయి. ఈ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ పేరిట చేపట్టిన కార్యక్రమంలో భారీ హింసాకాండ చెలరేగింది. ముంబైకి చెందిన సుధీర్ దావ్లే, నాగ్పూర్కు చెందిన అడ్వొకేట్ సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, సోమాసేన్, ఢిల్లీకి చెందిన రోనా విల్సన్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే హింసాకాండ జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 18న రోనా విల్సన్ను అదుపులోకి తీసుకొని విచారించగా కీలక లేఖ లభించింది. ప్రొఫెసర్ సాయిబాబా కేసు వాదిస్తున్న నాగ్పూర్కు చెందిన అడ్వొకేట్ సురేంద్ర గాడ్లింగ్ ఆ లేఖను రోనా విల్సన్కు రాశాడు. ఇందులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యోదంతంలాగే ప్రధాని మోదీని కూడా చంపాలని, ఇందుకు రూ. 8 కోట్లు అవసరముంటుందని లేఖలో పేర్కొన్నాడు. అమెరికా సైన్యం ఉపయోగించే ఏ–4 రైఫిల్ను కొనాల్సి ఉంటుందని రాశారు. ఇందుకోసం అవసరమయ్యే ఆర్థిక సహాయ సహకారాల్లో కొంత మేర వరవరరావు సమకూరుస్తారని ఆ లేఖలో గాడ్లింగ్ పేర్కొన్నట్లు పుణే పోలీసులు ఆరోపించారు. ఇందులో భాగంగానే అక్కడి పోలీసులు హైదరాబాద్ వచ్చి విరసం కార్యవర్గ సభ్యుల ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కేసులో నా పేరు అవాస్తవం: వరవరరావు ప్రధాని మోదీ హత్యకు కుట్ర కేసులో తన పేరు రావడం ముమ్మాటికి అవాస్తవమని వరవరరావు స్పష్టం చేశారు. పౌరహక్కుల గొంతు నొక్కేందుకు పోలీసులు ఇలాంటి అక్రమ కేసులకు పాల్పడ్డారంటూ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనిపై న్యాయపరంగా పోరాడతానని, కేసుతో తనకెలాంటి సంబంధంలేదని వెల్లడించారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు: వరవరరావు భార్య హేమలత వరవరరావును అరెస్ట్ చేసి తీసుకెళ్లిన అనంతరం ఆయన భార్య హేమలత మీడియాతో మాట్లాడారు. ఉదయం 20 మంది పోలీసులమని చెప్పి ఇంట్లోకి వచ్చారని, వారెంట్ చూపాలని అడగ్గా అవసరంలేదంటూ లోపలకు ప్రవేశించారన్నారు. గతంలో ఎన్నోసార్లు పోలీసులు వచ్చినా హాల్లోనే మాట్లాడి వెళ్లేవారని, అరెస్ట్ అవసరమైతే ఆయనే వెళ్లేవారన్నారు. కానీ పుణే పోలీసులు ఇంట్లోని ప్రతి గదిలో సోదాలు చేశారని, సోదాల సమయంలో వీడియో సైతం తీశారని ఆమె తెలిపారు. స్వాధీ నం చేసుకున్న డాక్యుమెంట్లకు సంబంధించి ఓ నోట్ ఇచ్చారని ఆమె వివరించారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర అంటూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వరవరరావు 1957 నుంచి కవిత్వం రాస్తోన్న వరవరరావు.. విరసం(విప్లవ రచయితల సంఘం) వ్యవస్థాపక సభ్యుడు. 1973లో మీసా(అంతర్గత భద్రతా నిర్వహణ) చట్టం కింద అరెస్టయ్యారు. 1975–86 మధ్యకాలంలో పలుసార్లు అరెస్టై అనంతరం విడుదలయ్యారు. 1986 నాటి రాంనగర్ కుట్ర కేసు నుంచి 2003లో విముక్తి పొందారు. ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద 2005లో మరోసారి జైలుకెళ్లారు. 2006లో ఆ కేసును కొట్టివేయగా.. ఇతర కేసుల్లో ఆయన బెయిల్పై ఉన్నారు. సుధా భరద్వాజ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో హక్కుల కార్యకర్తగా సుధా భరద్వాజ్కు ఎంతో పేరుంది. భిలాయ్లో గని కార్మికుల హక్కుల కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నారు. పౌరహక్కుల కార్యకర్తగానే కాకుండా న్యాయవాదిగా భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఐఐటీ కాన్పూరులో చదువుతున్నప్పుడు పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోని కార్మికుల వెతల్ని చూసి ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చాలో సభ్యురాలిగా చేరారు. ఫెరీరా ముంబైకి చెందిన ఫెరీరా.. 2007లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)కి ప్రచార, సమాచార విభాగం నాయ కుడిగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. దాదాపు ఐదేళ్లు జైళ్లో ఉన్న ఆయన అక్కడి అనుభవాలపై ‘కలర్స్ ఆఫ్ ద కేజ్’అనే పుస్తకాన్ని రాశారు. 2014లో తనపై ఉన్న అన్ని కేసుల నుంచి విముక్తి పొందారు. గొంజాల్వెజ్ ముంబై యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న గొంజాల్వెజ్.. కొన్నాళ్లు లెక్చరర్గా పనిచేశారు. అయితే మహారాష్ట్ర రాజ్య కమిటీ ఆఫ్ నక్సలైట్స్కు మాజీ కార్యదర్శిగా, సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారనేది పోలీసుల ఆరోపణ. 20 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న గొంజాల్వెజ్ ఆరేళ్ల జైలు శిక్ష అనంతరం సరైన ఆధారాలు లేకపోవడంతో కేసుల నుంచి బయటపడ్డారు. గౌతం నవలఖా ఢిల్లీకి చెందిన ఈ జర్నలిస్టు ‘పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్కు’అనుబంధంగా పనిచేశారు. వారాంతపు పత్రికలకు ఎడిటోరియల్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. తరచూ కశ్మీర్ లోయలో పర్యటించే నవలఖా.. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పలు వ్యాసాలు రాశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
పోలీసు దాడులు: ఎమర్జెన్సీకి చేరువలో ఉన్నాం
సాక్షి, న్యూఢిల్లీ: మంగళవారం తెల్లవారు జామునుంచే ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర పోలీసులు విరుచుకుపడ్డారు. ముంబై, ఢిల్లీ, గోవా, జార్ఖండ్, తెలంగాణ(హైదరాబాద్)లో దళిత, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, లాయర్లు, ఆదివాసీ హక్కుల కార్యకర్తల ఇళ్లు, వారి బంధువుల నివాసాల్లో ఏకకాలంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసుల సహాయంతో పుణేకు చెందిన పోలీసు బృందం ఈ సోదాలు నిర్వహించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టడం తీవ్ర ఆందోళన రేపింది. హైదరాబాద్కు చెందిన విప్లవ కవి, విరసం నేత వరవరరావును అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. అలాగే జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల ఇళ్లపై పోలీసులు ఏకకాలంలో దాడులకు దిగడం కలకలం రేపింది. ముంబైలోని అరుణ్ ఫెరీరా, సుసాన్ అబ్రహాం, వెర్నాన్ గోన్సల్వేజ్, ఆనంద్ తెల్తూంద్డే, జార్ఖండ్ లోని ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్స్వామి, ఢిల్లీలో గౌతమ్ నవ్లాఖా, ఛత్తీస్గఢ్, ఫరీదాబాద్ మానవ హక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్ గృహాలను తనిఖీ చేశారు. అనంతరం వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో సెల్ఫోన్లు, ల్యాప్టాప్, మొబైల్, పెన్డ్రైవ్తోపాటు, డైరీలు, కొన్ని ఆడియో సీడీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలు, భీమా-కోరేగావ్ నిరసన సందర్భంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. చట్టవిరుద్ధ చర్యలు(నివారణ) చట్టం ఐపీసీ సెక్షన్ 153ఏ, 505, 117, 120 కింద అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవి అక్రమ అరెస్టులంటూ వివిధ ప్రజా సంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. ఉద్యమానికి సన్నద్ధమవుతునన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల సహాయంతో ప్రజాస్వామ్య గొంతులను అణచివేయడానికి కేంద్రం పన్నిన కుట్రలో భాగమే ఈ అరెస్టులని విరసం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ ఆరోపించారు. అత్యవసర పరిస్థితికి దగ్గరగా ఉన్నాం: అరుంధతీ రాయ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరుల ఇళ్లపై పుణే పోలీసుల దాడులపై ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ స్పందించారు. దేశంలో గతంలో ముందెన్నడూ చూడని అత్యవసర పరిస్థితికి చాలా దగ్గరగా ఉన్నామని ఆమె తీవ్రంగా విమర్శించారు. -
వరవరరావు అరెస్ట్
-
విరసం నేత వరవరరావు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గాంధీ ఆస్పత్రికి తరలించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మోదీ హత్యకు కుట్ర పన్నారంటూ గతంలో దొరికిన ఓ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలయ్యాయి. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చడంతో పాటు మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై వరవరరావుని పోలీసులు విచారించారు. వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పుణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్టాప్లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు. ఆ లేఖలో 27 మంది పేర్లు ఉండగా అందులో వరవరరావు పేరు కూడా ఉండటంతో ఆయన్ను విచారించిన తర్వాత అరెస్ట్ చేశారు. -
వరవరరావు ఇంటి దగ్గర ప్రజాసంఘాల నేతల ఆందోళన
-
వరవరరావు ఇంట్లో పోలీసుల సోదాలు
-
వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసుల సోదాలు
సాక్షి, హైదరాబాద్ : విప్లవ రచయితల సంఘం నేత, కమ్యూనిస్టు నాయకుడు వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు మొదలైనట్లు సమాచారం. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో వరవరరావుని పోలీసులు విచారించారు. మోదీ హత్యకు వరవరరావు నిధులు సమకూర్చారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వరవరరావు ఇంటితో పాటు ఆయన కూతురు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్టు కూర్మనాథ్, క్రాంతి టేకుల, మరో ఇద్దరు విరసం నేతల ఇళ్లలో పుణె పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో అరెస్టయిన రోనాల్డ్ విల్సన్ ల్యాప్టాప్లో దొరికిన లేఖ ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది. పుణెలో నమోదైన కేసులో వీరందరినీ పోలీసులు విచారిస్తున్నారు. -
ప్రభుత్వం మాట తప్పింది
సాక్షి, హైదరాబాద్: రైతుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన మాటను తప్పిందని హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ విమర్శించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి ఆధ్వర్యంలో వాస్తవ సాగు దారుల హక్కులపై సోమవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షిత కౌలు రైతు చట్టానికి తెలంగాణ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కనీసం గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో 30 శాతం మంది కౌలు రైతులు సేద్యం చేస్తున్నారని, వారు ఆత్మహత్యలు చేసుకుంటే నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. 2011 సాగుదారుల చట్టం ప్రకారం వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. భూ సంస్కరణలు అమలు చేయాలి: వరవరరావు రైతులను ఆదుకోవటం ప్రభుత్వ కనీస బాధ్యత అని, ఆ బాధ్యతను కూడా నెరవేర్చడం లేదని విరసం నేత వరవరరావు విమర్శించారు. గత ప్రభుత్వాల విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తుందని ఎద్దేవా చేశారు. రైతు స్వరాజ్యవేదిక నాయకుడు విస్సా కిరణ్ మాట్లాడుతూ.. కౌలు రైతులు ఈ సదస్సు నిర్దేశించిన నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. సదస్సు లో సీపీఎం రాష్ట్ర నాయకుడు నంద్యాల నర్సింహారెడ్డి, పశ్య పద్మ, టి.సాగర్, సాయన్న, వీరన్న, అచ్యుత రామారావు పాల్గొన్నారు. కౌలు రైతుల మిస్డ్ కాల్ కాంపెయిన్.. కేసీఆర్ రాష్ట్రంలో కౌలు రైతులు ఎక్కడ? అని అడుగుతున్నారు కాబట్టి, కౌలు రైతులందరూ మిస్డ్ కాల్ కాంపెయిన్లో పాల్గొనాలని సదస్సు పిలుపునిచ్చింది. 040–39560444కి మిస్డ్ కాల్ ఇచ్చి మీరు కౌలు రైతు అని తెల పాలని పిలుపునిచ్చారు. కౌలు రైతుల సమస్యల కోసం 8500983300 నంబర్ హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. -
ఉరిశిక్ష రద్దే ‘ఉరి’కి పరిష్కారం
మల్లెపల్లి లక్ష్మయ్య గురువారం ‘సాక్షి’ ఎడిట్ పేజీలోని తన కాలమ్ (ఉరిశిక్ష నేరానికా, నేరస్తు డికా?)లో ‘జస్టిస్ కృష్ణ య్యర్ సుప్రీంకోర్టు బెంచ్లో సభ్యుడుగా ఉండగా తన పరిశీలనకు వచ్చిన మూడు కేసులను విచారించి దోషులకు కింది కోర్టులు విధించిన మరణ శిక్షలను జీవిత ఖైదు శిక్షలుగా మార్చారు’ అని రాశారు. అందుకాయన ఉదహరించిన మూడు కేసుల సందర్భమేమో కాని భూమయ్య, కిష్టాగౌడ్లకు విధించిన ఉరిశిక్షలను మాత్రం ఆయన రద్దు చేయలేకపోయారు. వాస్త వానికి వారిద్దరికీ ఉరిశిక్ష అమలు అప్పటికి రెండు సార్లు ఆగిపోయింది. మొదటిసారి 1974 డిసెంబ ర్లో ఏపీసీఎల్సీ కృషి వల్ల సీపీఐ అగ్ర నాయకులు చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్గుప్తా, కాంగ్రెస్ నాయ కుడు ఎస్.జైపాల్రెడ్డి అభ్యర్థన మేరకు కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అనుకూలంగా స్పందించడంతో ఆగిపోయింది. రెండోసారి 1975 మే 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెకేషన్ బెంచ్గా ఉన్న జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ గంగాధరరావు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినట్టుగా భూమయ్య, కిష్టాగౌడ్కు తెలియజేయలేదనే సాంకేతిక కారణంతో అర్ధరాత్రి ఉరి శిక్షను ఆపివేస్తూ ఉత్తర్వులు పంపారు. ముగ్గురు యువన్యాయవాదులు సి.వెంకటకృష్ణ, కె.ఎన్.చారి, కె.వెంకట్రెడ్డి, కేజీ కణ్ణబీరన్ పనుపున సెలవుల్లో తమ ఇళ్లలోనే ఉన్న జడ్జీల నుంచి ఈ ఉత్తర్వులు పొందగలిగారు. అప్పుడు ‘భూమయ్య కిష్టాగౌడ్ల ఉరిశిక్ష రద్దు’ అనే ఒకే ఎజెండాపై ఏపీసీఎల్సీ కార్యదర్శి పత్తిపాటి వెంకటేశ్వర్లు కన్వీనర్గా కమిటీ ఏర్పడి దేశవ్యాప్త ఉద్యమాలు చేపట్టింది. జైపాల్రెడ్డి మొదలు ఏబీ వాజపేయి, జయప్రకాశ్ నారాయణ్ దాకా ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. అంతర్జాతీయంగా జా పా సార్త్, సైమన్ డీ బావ్రా, తారిక్ అలీ (ఫ్రాన్స్), నోమ్ చామ్స్కీ(అమెరికా) సహా 300 మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. అంతర్జాతీయ పత్రికల్లో దీనిపై రాశారు. లండన్, పారిస్ వంటి నగరాల్లో భారత రాయబార కార్యాలయాల ముందు ప్రదర్శనలు జరి గాయి. తర్వాత నెలన్నర దాటకముందే 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అప్పటికి భూమయ్య, కిష్టాగౌడ్ల ఉరిశిక్ష రద్దుకు జార్జి ఫెర్నాండెజ్ ఢిల్లీ బోట్ క్లబ్బు ముందు ఓ పెద్ద ర్యాలీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలో ప్రాథమిక హక్కు లనన్నీ రద్దు చేస్తూ ఎమర్జెన్సీ విధించడంతో ఫెర్నాం డెజ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ ఇద్దరి ఉరిశిక్ష రద్దు పోరాటంలో ఉన్న కాంగ్రెసేతర నాయకులు, ఉద్యమ కారులందరూ జైళ్లపాలయ్యారు. బయట మిగిలిన కణ్ణబీరన్, సుప్రీంకోర్టు న్యాయవాది గార్గ్ తదిత రులు ఈ ఉరిశిక్షల రద్దుకు మళ్లీ ప్రయత్నించారు. ఆ పిటిషన్ జస్టిస్ కృష్ణయ్యర్ ముందుకే వచ్చింది. తన కన్నా ముందు సుప్రీంకోర్టు ధ్రువీకరించి, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించాక తానేమీ చేయలేనని, తాను మరోసారి రాష్ట్రపతి విశాల హృదయానికే ఈ అంశాన్ని వదిలివేస్తున్నానని జస్టిస్ అయ్యర్ పేర్కొ న్నారు. ఫలితంగా, 1975 డిసెంబర్ 1న భూమయ్య, కిష్టాగౌడ్లకు ఉరిశిక్ష అమలు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యమైంది. రాజ్యసభ సభ్యుడు భూపేశ్గుప్తా నవంబర్ 30న రాష్ట్రపతిని కలిసి మరునాడు ఉదయం భూమయ్య, కిష్టాగౌడ్ల ఉరిశిక్షను ఆపవలసిందిగా విజ్ఞప్తి చేసినట్లుగా డిసెంబర్ 1న ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’లో చిన్న వార్త వచ్చింది. కాని, వారిద్దరినీ అప్ప టికే ఉరితీసిన విషయం జైల్లో ఉన్న రాజకీయ డిటెన్యూలెవరికీ తెలియదు. రాజ్యాంగం నుంచి ఉరి శిక్షను తొలగిస్తే తప్ప ఇంత అమానుషమైన రాజ్య హత్యలను ఆపడం సాధ్యం కాదనడానికి మాత్రమే ఈ విషయాన్ని ప్రస్తావించాను. అరుదైన నేరాల్లో అరుదైన నేరానికే ఉరిశిక్ష వేయాలని సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగు తున్నదనడానికి భూమయ్య, కిష్టాగౌడ్ల ఉరిశిక్షల అమలే తిరుగులేని దాఖలా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మరణ శిక్షలు పడిన 11 మంది కమ్యూనిస్టు విప్లవకారుల ఉరి ఆపడానికి కమ్యూ నిస్టు పార్టీ అభ్యర్థన మేరకు లండన్ నుంచి బారిస్టర్ ప్రిట్, సుప్రీంకోర్టు నుంచి డానియల్ లతీఫీ వంటి ప్రసిద్ధ న్యాయవాదులు హైదరాబాద్ వచ్చారు. వారి వాదనల కన్నా తన మత విశ్వాసాల వల్ల పాప భీతితో నిజాం నవాబు ఈ మరణ శిక్షలను ఆమో దించే సంతకం చేయలేదు. అలాగే గోడకు నిలబెట్టి తుపాకీతో కాల్చివేసే పద్ధతి ఉన్న జారిస్టు రష్యాలో ఏదో నేరానికి మరణ శిక్ష పడిన డాస్టోవ్స్కీ రచయిత అనే విషయం తెలిసి, జార్ స్వయంగా మరణ శిక్ష అమలును ఆపివేశాడు. కానీ రెండు సార్లు ఉరికంబం దాకా వెళ్లి మరణవేదననంతా అనుభవించి తిరిగి వచ్చిన భూమయ్య, కిష్టాగౌడ్లు భారత రాజ్య చట్ట బద్ధ హత్య నుంచి బయటపడలేకపోయారు. వరవరరావు వ్యాసకర్త, విరసం సంస్థాపక సభ్యులు -
తొలితరం ఉద్యమ మహిళ
సందర్భం జూన్ 6న రిపబ్లిక్ చానల్, టైమ్స్ నౌ లేఖల దుమారం మొదలైన రోజుల్లోనే కొమురమ్మ మహబూబాబాద్లో చనిపోయిన వార్త తెలిసింది. తేరుకున్నపుడు ఆమె జ్ఞాపకాలు ముసురుకుం టూనే ఉన్నాయి గానీ రాయడానికి వీలు కాలేదు. మేము సికింద్రాబాద్ కుట్ర కేసులో సహ ముద్దాయిలం. సీపీఐఎంఎల్íసీఓసీ వరంగల్ జిల్లా తొలి నాయకులలో ఒకరైన బర్ల యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్మోహన్రెడ్డి, స్నేహలతల దళంలో వెంకటయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వినేవాళ్లం. 1974 మే 18న హనుమకొండలో అరెస్టు చేసి మే 20న నన్ను మరో నలుగురు విప్లవ రచయితలను సికింద్రాబాద్ మేజిస్ట్రేటు కోర్టులో హాజరుపరచినపుడు ఇచ్చిన ఎఫ్ఐ ఆర్లో కోటగిరి వెంకటయ్య, కొమురమ్మల పేర్లను చూశాం. ఎమర్జెన్సీ కాలంలో విరసం కార్యవర్గ సభ్యులం దరినీ మీసా కింద అరెస్టుచేసి రాష్ట్రం లోని ఆయా జైళ్లలో డిటెన్యూలుగా ఉంచారు. అట్లా మేం వరంగల్ జైలులో ఉండగా కొమురమ్మ అరెస్టయి ఇదే ఆవరణలోని మహిళా జైలుకు వచ్చిందని జైలు జవాన్ల ద్వారా తెలిసింది. అంతకుముందే కృష్ణానదీ తీరాన మంగళగిరి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కోటగిరి వెంకటయ్య మరణించినట్లు పత్రికల్లో చదివాం. అప్పటికి ఆమె గర్భవతి. రహస్యప్రదేశంలో ఉన్నపుడు కోటగిరి వెంకటయ్యను, ఆమెను అరెస్టు చేశారని, ఇద్దరినీ వేరుచేసి ఆయనను ఎన్కౌంటర్ పేరుతో చంపేసి, ఆమె కదలలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నందున అరెస్టు చేసి వరంగల్ జైలుకు తీసుకువచ్చారని తరువాత కాలంలో తెలిసింది. కొమురమ్మ జైలులోనే ప్రసవించింది. ఆమె పాప జైలులోనే పెరిగింది. 1976–77లో మేం చంచల్గూడ జైలులో ఉన్నప్పుడు సికింద్రాబాద్ కుట్రకేసు విచారణకు స్పెషల్ కోర్టుకు తీసుకెళ్లేవాళ్లు. ఈ కేసు విచారణ కోసమే కొమురమ్మను కూడా చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. అప్పటికే ఆ జైలులో డిటెన్యూలుగా విప్లవ రాజకీయ ఖైదీలుగా డా. వీణా శత్రుజ్ఞ, పీఓడబ్లూ్ల్య అధ్యక్షురాలు కె.లలిత, కరపత్రాలు పంచుతూ అరెస్టయిన పీఓడబ్లూ్ల్య అంబిక, స్వర్ణలత(అమరుడు మధుసూదన్రాజ్ సహచరి)ల సహచర్యం, ఆదరణ వల్ల కొమురమ్మ, ఆమె పాపకు కాస్త ఆరోగ్యం సమకూరి తేరుకున్నట్లున్నది. కోర్టు వాయిదాలకు తీసుకువెళ్లేప్పుడే మొదటిసారి ఆమెను ఎస్కార్ట్ వ్యానులో చూడగలిగాను. ఆజానుబాహువు. దృఢకాయం. గంభీరమైన వ్యక్తిత్వం. ఎమర్జెన్సీ ఎత్తివేసి ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణంలో రాజకీయ ఖైదీలతోపాటు కొమురమ్మ కూడా విడుదలై మహబూబాబాద్ ప్రాంతంలో ప్రజాఉద్యమంలో పనిచేయడం ప్రారంభించింది. వరంగల్లో రాడికల్ విద్యార్థి సంఘం రెండో మహాసభలు(1978 ఫిబ్రవరి), గుంటూరులో రాడికల్ యువజన సంఘం ఆవిర్భావ మహాసభలు (1978 మే) జరిగి ‘గ్రామాలకు తరలండి’ కార్యక్రమం చేపట్టి వందలాది గ్రామాలు తిరిగే సందర్భంలో కొమురమ్మ రాడికల్ యువజన సంఘంలో పనిచేసింది. ఆమె పాపను స్నేహలత అనే పేరు పెట్టి హనుమకొండ హాస్టల్లో చేర్చాం. మహబూబాబాద్కు దగ్గరలోని కేసముద్రంలో రాడికల్ యువజన సంఘం సభలు కొమురమ్మ ఆధ్వర్యంలోనే జరి గాయి. వేలాదిమంది విద్యార్థి, యువజనులు, రైతాంగం తరలివచ్చారు. సభలో కొమురమ్మ కూడా వక్త. 1989 ఫిబ్రవరిలో సికింద్రాబాద్ కుట్రకేసులో తీర్పు సందర్భంగా, బతి కుండి బహిరంగ జీవితంలో ఉన్న ముద్దాయిలందరం కలుసుకున్నాం. కేసు కొట్టివేసి మా అందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. అప్పటికే కొమురమ్మ జీవితంలో చాలా కష్టాలు, విషాదాలు అనుభవించింది. చాలా విరా మం తరువాత ఆఖరుసారి ఆమెను 2015 జనవరి 27న కవి విమల ఇంటిలో కలవగలిగాను. సుప్రసిద్ధ చరిత్ర రచయిత ప్రొ‘‘ ఉమా చక్రవర్తి మహిళా రాజకీయ ఖైదీల మీద డాక్యుమెంటరీ చేయదలుచుకుని కొమురమ్మను పిలిపించింది. ఆమె కష్ట సుఖాలు, ఆమె కుటుంబం గురించి విని చాలా బాధ కలిగింది. మళ్లీ ఒకసారి వచ్చి తన సమస్యలన్నీ చెప్పుకుంటానని తప్పకుండా వస్తానని మాట ఇచ్చింది కానీ రాలేకపోయింది. ఆ సమస్యలతో, అనారోగ్యం తోనే బహుశా మరణించి ఉంటుంది. మహబూబాబాద్లోని విప్లవ అభిమానులు, ప్రజాసంఘాలు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారని ప్రజాసంఘాల కార్యకర్తల ద్వారా తెలిసింది. ఆమె కుటుం బానికి సంతాపం, ఆమె కోసం అశ్రునయనాల జోహార్లు చెప్పడానికి ఇంత ఆలస్యమైంది. వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు వరవరరావు -
అవి హిందుత్వ కుట్రలే
హైదరాబాద్: నాలుగు దశాబ్దాలుగా సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎందరో మహిళలకు అండగా ఉంటున్న ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్యపై సోషల్ మీడియాలో దాడులు హిందుత్వ కుట్రేనని విరసం నేత వరవరరావు విమర్శించారు. సంధ్యపై సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులను నిరసిస్తూ గురువారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్యూ, ఐఎఫ్టీయూ, పీవోడబ్ల్యూ, ఏఐకేఎంఎస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ దాడుల వెనకాల మోదీ ప్రభుత్వం నిలబడిందని ఆరోపించారు. సంధ్యపై సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులు, అశ్లీల మాటలను పోలీసులు సైబర్ నేరం కింద పరిగణించకపోవటాన్ని బట్టి ఈ వ్యవస్థ ఎవరి అధీనంలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీలంకేశ్ను హత్య చేశారని, సంధ్య, సూరెపల్లి సుజాత, దేవి వంటి సామాజిక కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగాప్రజల హక్కులను కాలరాస్తున్నారని, స్వామి అగ్నివేశ్పై దాడి చేయటం దుర్మార్గమని ప్రొఫెసర్ రమా మెల్కొటే అన్నారు. రేటింగుల కోసం దేవి, సంధ్యలను చానళ్లు పిలుస్తాయే తప్ప, వారిపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవని దేవి విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్న దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయపరమైన పోరాటానికి సిద్ధం కావాలని ‘ఆంధ్రజ్యోతి’ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. రాజ్యం తనపై ఎన్నోసార్లు దాడులు చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే తన ఉద్యోగాన్ని సైతం తీసేశారని సంధ్య గుర్తుచేశారు. దాడులు, అణచివేతలు కొత్త కాదని, హిందుత్వ కుట్రలను సైతం ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సామాజిక కార్యకర్త సజయ, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మణ్, టఫ్ అధ్యక్షురాలు విమల, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘అడవి నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టే కుట్ర’
హైదరాబాద్: అడవిపై ఆదివాసులకు చట్టపరమైన హక్కులున్నా అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం.ఎల్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ బాగ్లింగంపల్లిలోని ఓంకార్ భవనంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూతం.వీరన్న అధ్యక్షతన జరిగిన సదస్సులో వరవరరావు మాట్లాడుతూ ఓపెన్కాస్టులు, గనుల పేరుతో బహుళజాతి, కార్పొరేట్ సంస్థలకు పేదల పంట, అటవీ భూములను కట్టబెట్టుతూ అదివాసీ జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలకు మంచిరోజులు తెస్తామంటూ నమ్మించి గద్దెనెక్కిన మోదీ, కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు చెడ్డరోజులే మిగిల్చారని అన్నారు. ప్రజాఉద్యమాలు, ప్రజాస్వామిక హక్కులను నిరంకుశత్వంతో అణచివేస్తూ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీల అప్పులను రద్దు చేస్తున్న పాలకులు రైతులచేతికి బేడీలు వేస్తున్నారని, జైలు పాలు చేస్తున్నారని, ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. భూతం వీరన్న మాట్లాడుతూ బయ్యారం ఉక్కు తెలంగాణ ఆదివాసుల హక్కు అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలమల్లేశ్, సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకురాలు రమ, ఎంసీపీఐ(యు) నాయకులు ఉపేందర్రెడ్డి, నాయకులు రాజేశ్, సత్తార్, సోమిశేట్టి దశర«థ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
అవిశ్రాంత పోరాట యోధుడు
నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలెజీలో బీఏ మూడో సంవత్సరం (1959 – 60)లో ఉండగా వచ్చిన ఒక కొత్త ఇంగ్లిష్ లెక్చరర్ గురించి మా జూనియర్లు ఆశ్చర్యంగా చెప్పుకొంటుండేవాళ్లు. ఆయన మనం చూస్తున్న చాలా మంది లెక్చరర్ల లాగా ఆలోచించడు, మాట్లాడడు. ఫైర్ బ్రాండ్లా ఉన్నాడు అనేవాళ్లు. అట్లా మొదట కేశవరావ్ జాదవ్ పేరువిన్నాను. ఉస్మానియా క్యాంపస్కు వచ్చిన తర్వాత మళ్లీ 1962లో ఒక సంచలన వార్త విన్నాను. గోవాను భారత ప్రభుత్వం దురాక్రమణ చేసిందని నిరసన తెలుపుతూ కొంత మంది యువకులు మహారాష్ట్ర, గోవా సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. వారిలో తర్వాత కాలంలో విరసంలో నాకు ఆత్మీయ స్నేహితుడైన ఎంటి ఖాన్ ఉన్నాడు. కేశవరావ్ జాదవ్ ఉన్నాడు. ఈ దేశం ఒక దేశం కాదు. ఉపఖండమని, ఇది ఎన్నో దేశాల, జాతుల సమాఖ్య అని వాటికి స్వయం ప్రతిపత్తి, స్వయం నిర్ణయాధికారం ఉండాలని భారత్, చైనా యుద్ధం (1962) కన్నా ముందు విశ్వసించిన వారిలో లోహియా కూడా ఉన్నాడు. 1933 జనవరి 27న హైదరాబాద్లోని హుస్సేనీ ఆలంలో పుట్టి 2018 జూన్ 16న అమరుడైన కేశవరావ్ జాదవ్ నిండు జీవితాన్ని అట్లా రాజీలేని లోహియా వాదిగా గడిపాడు. సోషలిస్టుగా ఉంటూనే నక్సలైటు ఉద్యమాన్ని సుదీర్ఘ కాలం బలపరిచినవాడు జార్జి ఫెర్నాండెజ్ అయితే, జీవితాంతం బలపరిచినవాడు కేశవరావ్ జాదవ్. 1997లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అమరుడు ఆకుల భూమయ్య నాయకత్వంలో ప్రారంభమైన తర్వాత ఏర్పడిన జనసభకు, ఐక్య వేదికగా అది వేరువేరు రూపాలుగా తీసుకున్న నిర్మాణాలకు సన్నిహితుడై ఎన్ని ఉద్యమాల్లో పాల్గొని ఎన్ని పోరాటాలు చేసి ఎన్నిమార్లు జైళ్ల పాలయ్యాడో.. కోదండరాం చెప్పినట్టు ప్రజాస్వామిక తెలంగాణ భావనకు రాజ్యహింసతో తడిసిన ఆయన అంగీ ఒక సంకేతం. 200 ఏళ్ల క్రితం బీదర్ నుంచి వచ్చి ఆయన కుటుంబం హుస్సేనీ ఆలంలో స్థిరపడటం వల్ల ఆయన పుట్టుక నుంచి హైదరాబాదీ అయ్యాడు. హైదరాబాద్ పాత నగరాన్ని ఎంతో ప్రేమించినవాడు. హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన వైవిధ్యంగల విశ్వాస సమ్మేళనాన్ని హైదరాబాద్ ఏక్తాగా నిలబెట్టాలని ఎంటి ఖాన్ వలెనే తపించేవాడు. ఈ నేపథ్యం వల్లనే ఆయన 1952 నుంచి కూడా వివిధ రూపాలలో వచ్చిన ముల్కీ, ప్రత్యేక తెలంగాణ హక్కుల పరిరక్షణ ఉద్యమాలతో అంత మమేకమయ్యాడు. ఇందిరా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎమర్జెన్సీ కాలమంతా ఆయన మీసా కింద జైళ్లలో ఉన్నాడు. ఆయన, ఖాన్ సాబ్ ఇద్దరూ చంచల్గూడ జైలులో ఉన్న రోజుల్లో రాడికల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రమణి, పీడీఎస్యూ విద్యార్థి పటోళ్ల ఇంద్రారెడ్డి ఈ ఇద్దరితోనూ చాలా ప్రభావితులయ్యారు. తార్కుండే నాయకత్వంలో జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన పీయూసీఎల్ అండ్ డీఆర్ 1977లో పీయూసీఎల్, పీయూడీఆర్గా విడిపోయిన తర్వాత జాదవ్ పీయూసీఎల్లో ఉండిపోయాడు. కానీ, ఒక పౌరునిగా కాళోజివలె ప్రజల జీవించే, మాట్లాడే, సంఘం పెట్టుకునే, విశ్వాసాలు కలిగి ఉండే హక్కుల కోసం రాజ్యంతో రాజీ లేకుండా పోరాడే విషయంలో ఆయన పోరాటాల్లో ఉండే ఎవరితోనైనా కలిసి పనిచేశాడు. పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేశవరావ్ జాదవ్ కూడా ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు చేయాలని చాలా బలంగా ఆకాంక్షించేవాడు, కృషి చేశాడు. అందువల్లనే 2004 అక్టోబర్లో సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్తో పాటు సీపీఐఎంఎల్ జనశక్తి కూడా చర్చలకు వచ్చినప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరించినవారిలో జాదవ్ కూడా ఉన్నాడు. నేను 1989 ఏప్రిల్ నుంచి హైదరాబాద్లో స్థిరపడిన తర్వాత జాదవ్తో నాకు మాత్రమే కాదు నా కుటుంబానికి కూడా స్నేహం, ఆత్మీయత ఏర్పడినాయి. మేము ఎన్నో ఉద్యమాలు, ఎన్నో వేదికలు పంచుకున్నాము. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వివిధ దశల్లో బలపరుస్తూ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం సాగిన సకల ఉద్యమాలకు సంఘీభావం తెలిపిన అరుదైన మేధావి కేశవరావ్ తెలంగాణ జ్ఞాపకాల్లో నిలిచి ఉంటారు. వరవరరావు వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు -
మోదీ హత్యకు కుట్ర.. కట్టు కథ: గద్దర్
సాక్షి, హైదరాబాద్: భీమా కోరేగావ్ హింసకు కారకులైన నిందితులను తప్పించేందుకే దళిత, ఆదివాసీ ఉద్యమనేతలను, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని, కుట్ర కేసులు బనాయిస్తోందని విప్లవ రచయిత, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆరోపించారు. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యదర్శి రోనా విల్సన్ వద్ద లభించినట్లు చెబుతున్న లేఖల్లో వరవరరావు పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో ఆయన శనివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత చిక్కుడు ప్రభాకర్ తదితరులతో కలసి మాట్లాడారు. రోనావిల్సన్ వద్ద లభించినట్లుగా చెబుతున్న లేఖలన్నీ అబద్ధాలనీ, కట్టుకథలనీ, మావోయిస్టులు రాసినట్లుగా చెబుతు న్న ఆ లేఖల్లోని భాష, రాసిన తీరు ఈ అంశాలను వెల్లడి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆరు నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీగ్రాఫ్ పడిపోతోందని, ప్రజల్లో సానుభూతిని పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రధానిని హతమార్చే కుట్రకు పాల్పడుతున్నట్లు తప్పుడు ప్రచారాన్ని సృష్టించుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలవాల్సిన మీడియా ఈ అబద్ధపు రాతలు, లేఖల ఆధారంగా అసత్య కథనాలను ప్రచారం చేస్తోందని, సత్యం గొంతులోంచి వెలువడక ముందే అసత్యం ప్రపంచాన్ని పదిసార్లు చుట్టివచ్చినట్లుగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని దుయ్యబట్టారు. ఆ లేఖలు ముమ్మాటికీ పోలీసుల సృష్టే.... ‘సాధారణ జనజీవితంలో ఉన్న వ్యక్తులకు మావోయిస్టు పార్టీ రాసే లేఖలు ఎలా ఉంటాయో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల సందర్భం గా అందరికీ తెలుసు. ప్రజాజీవితంలో ఉన్న తనను ‘మా మహానేత’ అని సంబోధిస్తూ మావోయిస్టులు రాసినట్లుగా చెబుతున్న లేఖల్లో ఉందని అంటున్నారు. సాధారణ జనజీవితంలో ఉన్న వ్యక్తులను మావోయిస్టు పార్టీ ఎప్పటికీ అలా సంబోధించదు. అదే లేఖలో మరో చోట ‘లాల్ జోహార్’ అనే మాట ఉన్నట్లు తెలిసింది. లాల్జోహార్ అనే పదం అమరు లకు నివాళులర్పించేటప్పుడు చెబుతారు. కానీ ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులకు రాసే లేఖల్లో అలా ఉం డదు. పైగా ‘వరవరరావు’ అని పూర్తి పేరు లేఖలో రాసినట్లుగా ప్రస్తావించారు. ఇలాంటి అనేక అం శాలు ఆ లేఖలు పచ్చి అబద్ధాలు, పోలీసుల కల్పితాలేనని తెలియజేస్తున్నాయి. కానీ, వాస్తవాలను నిర్ధారించుకోకుండా జాతీయస్థాయి మీడియా సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి’ అని ఆరోపించారు. 200 ఏళ్లనాటి భీమా కోరేగావ్ పోరాటంలో అమరులైనవారిని స్మరించుకొనేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్, సుధీర్ రావత్, పీబీ సావంత్ వంటి ప్రముఖుల సారథ్యంలో తరలివచ్చిన దళిత, ఆదివాసీలపై ఆరెస్సెస్ శక్తులు హింసకు పాల్పడ్డాయని, అందుకు బ్రాహ్మణీయ ఫాసిస్ట్ శక్తులు శంభాజీ భిటే, మిలింద్ ఎక్బోటేలు బాధ్యులని ఆధారాలున్నా, ఎఫ్ఐఆర్ నమోదైనా వాళ్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా దళిత, ఆదివాసీలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. భీమా కోరేగావ్ హింస వెనుక మావోయిస్టులున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం దళిత, ఆదివాసీలపై కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆరెస్సెస్ శక్తుల, నయా బ్రాహ్మణవాద కుట్రలను ప్రశ్నిస్తున్నందుకే రోనా విల్సన్, ఐపీఎల్ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, దళిత కార్యకర్త సుధీర్ దావ్లే, విస్థాపన వ్యతిరేక ఉద్యమకారుడు మహేశ్ రావత్ల ను అరెస్టు చేసిందన్నారు. వారికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ లేఖల కథలల్లుతున్నారని చెప్పారు. ఆ లేఖలను బహిర్గతం చేయాలని, హక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సామాజిక ఉద్యమనేత ఉ.సాంబశివరావు, నారాయణ, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ప్రొఫెసర్ హరగోపాల్ అక్రమంగా అరెస్టు చేసిన రోనా విల్సన్, సరేంద్ర గాడ్లింగ్, ప్రొఫెసర్ సోమాసేన్, సుధీర్ దావ్లే, మహేశ్ రావత్లను వెంటనే విడుదల చేయాలని, ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు మావోయిస్టుల రాజకీయాల గురించి మాట్లాడడమే నేరమన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి కాంగ్రెస్కు కూడా మావోయిస్టుపార్టీతో సంబంధాలు ఉన్నట్లుగా బీజేపీ ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారాలు, తప్పుడు లేఖలతో ఈ కుట్రలో వరవరరావును కూడా ఇరికించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఉదంతంపైన సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కోరారు. మీడియా అబద్ధపు రాతలను, తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని, వాస్తవాలను వెలికి తేవాలని కోరారు. దుబ్బాక టౌన్: ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్రనా..? ఇది నిజమా? ఎవరు నమ్మాలి? వాళ్లే రాజకీయాల్లో సంచలనం కోసం చేసుకుంటున్న ప్రచారం కావచ్చు’ అని ప్రజా గాయకుడు గద్దర్ అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ హత్యకు కుట్ర జరిగినట్లు వచ్చిన వార్తలను కట్టు కథగా అభివర్ణించారు. ఇలాంటి ప్రచారం ప్రభుత్వాలకు, పెద్ద నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. ఈ వార్తలపై కేంద్రం సమగ్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. అనవసరంగా అమాయకులను ఇబ్బందుల పాలు చేయవద్దన్నారు. సమాజం కోసం, పేదల కోసం పోరాడుతున్న విప్లవకారులను ఒకవైపు బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతూనే, కమ్యూనిస్టు దేశాలైన చైనా, నేపాల్లకు వెళ్లి సెల్యూట్లు కొట్టడం మోదీ ద్వంద్వ రాజకీయ నీతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో నిరంకుశ పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రశ్నించేవారిని కాల్చి చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మోదీ హత్యకుట్ర.. ఆ వార్తల్లో నిజం లేదు
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర పన్నారని, మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య తరహాలో మోదీపై దాడికి వ్యూహ రచన చేశారని పుణె పోలీసులు పేర్కొంటున్న నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, చీకుడి ప్రభాకర్, తదితర హక్కుల సంఘాల నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మావోయిస్టులను హతమార్చిన గడ్చిరోలీ ఘటనపై గళం ఎత్తుతున్న వారిపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా వరవరరావుపై కుట్ర నమోదుచేశారని, భీమా కోరేగావ్ ఆందోళనలకు సంబంధించి ఢిల్లీ, మహారాష్ట్రలో హక్కుల సంఘాల నేతలు ఐదుగురిని ఎలాంటి ఆధారాలు లేకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని వారు అన్నారు. ఆ వార్తల్లో నిజం లేదు : వరవరరావు ప్రధాని మోదీ హత్యమార్చడానికి మావోయిస్టులు రాసిన లేఖలో తన పేరు ఉందన్న కథనాలు అవాస్తమవని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. రోనాల్డ్ విల్సన్ ల్యాప్ట్యాప్లో దొరికిందని పేర్కొంటున్న కుట్ర లేఖ అబద్ధమని, ఆ లేఖలో తన పేరు ప్రస్తావించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఇదంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమని విమర్శించారు. మోదీ హత్యకు కుట్ర అంటూ పూణే పోలీసులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ‘ ఈ కేసులో మీడియా వ్యవహరించిన తీరు దురదృష్టకరం. ఓ చానల్ ఇంటర్వ్యూ నుంచి నేను వాకౌట్ చేశాను. చర్చలో పాల్గొనేవారు కాదు యాంకరే స్వయంగా నాపై దాడి చేశారు. మావోయిస్టుల శైలి ఏంటో మీడియాకు తెలుసు. మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల్లో పాల్గొన్నాను కాబట్టి నాకు కూడా తెలుసు. ఆ లేఖలు ఎలా ఉన్నాయో అలానే మీడియా ప్రచురించాలి. ఎవరైనా అవి పార్టీ రాసిన లేఖలు అంటే నమ్ముతారా?’ అని వరవరరావు అన్నారు. రోనాల్డ్ విల్సన్ తనకు తెలుసునని, రాజకీయ ఖైదీల విడుదల కోసం ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. హక్కుల సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేసి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని బీజేపీ భావిస్తోందని వరవరరావు మండిపడ్డారు. వరంగల్లో అరెస్ట్ చేసిన డీఎస్యూ యూనియన్ నాయకులు భద్రి, రంజిత్ సూరి, సుధీర్లను వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. -
ప్రజా ఉద్యమాలను అణిచివేతకు యత్నం
-
కుట్ర కేంద్రానిదే
సాక్షి, హైదరాబాద్ : కామ్రేడ్ వరవరరావుపై కుట్ర ఆరోపణలను ఖండిస్తున్నామని, ఇది ప్రజాసంఘాలను, ప్రశ్నించే హక్కును అణచేందుకు కేంద్రం పన్నిన భారీ కుట్రని విప్లవ రచయితల సంఘం(విరసం) నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. భీమా, కోరెగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ దళిత, ఆదివాసీ హక్కుల, ప్రజాసంఘాల బాధ్యుల అరెస్ట్ను నిరసిస్తున్న సమయంలోనే అంతకన్నా కుట్రపూరిత చర్యలకు పోలీసులు తెరలేపారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఒక లేఖను సృష్టించి అందులో విరసం వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ వరవరరావు పేరును ఇరికించారని అన్నారు. కోరేగావ్లో అసలు నిందితులైన సంఘ్ పరివార్ నాయకులను వదిలేసి దళిత, హక్కుల సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణను అణచివేయాలని చూస్తున్నారని వాపోయారు. నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తులు రచించిన కుట్రని ఆరోపించారు. మోదీపై కుట్ర పెద్ద అబద్దమని, అసలు కుట్ర మోదీ రాజ్యమే చేస్తున్నదని విరసం నేతలు ఆరోపించారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మతం పేరుతో, సంస్కృతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలను, వికృత పోకడలను భీమా కోరెగావ్ మరోమారు అణగారిన ప్రజల ముందు పెట్టిందన్నారు. అది సహించలేకే మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నదని ఆరోపించారు. నాగ్పూర్ నుంచి భీమా కోరెగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్రను తిప్పికొట్టవలసిందిగా ప్రజలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేస్తున్నదని పత్రికా ప్రకటన ద్వారా విరసం నేతలు పాణి(కార్యదర్శి), కల్యాణ రావు(సీనియర్ సభ్యులు), వరలక్షి, కాశిం, రాంకీ(కార్యవర్గ సభ్యులు) తెలియజేశారు. -
మోదీ హత్య ప్లాన్ : నన్ను టార్గెట్ చేశారు
సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్ చేయడానికేనని విరసం నేత వరవరరావు వ్యాఖ్యానించారు. ప్రధాని హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు స్పందిస్తూ... ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రధానిని హత్యచేసే శక్తి మావోయిస్టులకు ఉందా? అనేది కూడా అనుమానమేనని అన్నారు. ఇటీవల మోదీ గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన ఇమేజ్ను పెంచే చర్యగా తాను ఈ కుట్రను భావిస్తున్నానని ఆయన అన్నారు. రోనా జాకబ్ విల్సన్ భీమకోరేగావ్ ఘటనలో దొరకలేదని, ఢిల్లీ, పుణెలో దాడులు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వరవరరావు పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన విల్సన్తో సంబంధం లేదని చెప్పనని, ఇదంతా తనను టార్గెట్ చేయడమే అనిపిస్తుందన్నారు. అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు ఎవరూ తనను సంప్రదించలేదని, మహా అయితే తనను కూడా అరెస్టు చేస్తారని, అంతకంటే ఏమీ కాదని వరవరరావు వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంఘాలు, విప్లవ రచయితలను అణచివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా కోరేగావ్లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్ దావలే, సురేంద్ర గాట్లింగ్, సోమా సేన్, మహేష్ రౌత్, రోనా జాకబ్ విల్సన్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జాకబ్ విల్సన్ను అరెస్ట్ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. అరెస్ట్ అయిన జాకబ్ విల్సన్ ల్యాప్ టాప్లో ప్రధాని హత్యకు కుట్రపన్నారంటూ పూణె పోలీసులు ఓ లేఖను కోర్టుకు సమర్పించారు. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉన్నట్లు తెలిసింది. మోదీని కూడా రాజీవ్ హత్య తరహా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లు, ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడతాయని లేఖలో పేర్కొంటూ, ఈ కుట్రలో వరవరరావు సహకారంతో డబ్బు సర్దుబాటు చేయాలని ప్రస్తావించారు. దీంతో పూణే పోలీసులు వరవరరావును కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. -
ప్రధానిని హత్యచేసే శక్తి మావోయిస్టులకు ఉందా?
-
28న కలెక్టరేట్ల ఎదుట ధర్నా
హైదరాబాద్: గడ్చిరోలి హత్యాకాండలో దోషులను కఠినంగా శిక్షించే వరకు ఒత్తిడి తీసుకురావాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడ్చిరోలి హత్యాకాండను నిరసిస్తూ ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ధర్నాలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 42కు చేరిందని ఆయన తెలిపారు. మృతుల సంఖ్య 42 ఉంటే కేవలం 8 మందిని మాత్రమే గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ ఘటనలో ఎదురుకాల్పులు జరిగితే పోలీసుల వైపు ఎలాంటి ప్రాణనష్టం ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్కౌంటర్ కేసులన్నింటిలోనూ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, చట్టబద్ధంగా న్యాయ విచారణను ఎదుర్కొని, ఆత్మరక్షణ కోసమే ఎదుటి మనిషిని చంపామని న్యాయస్థానంలో రుజువు చేసుకోవాల్సిందేనని అన్నారు. ఇదే విషయాన్ని 2009లో ఏపీ హైకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తన తీర్పులో పేర్కొందని గుర్తు చేశారు. సమావేశంలో డాక్టర్ సుధాకర్, పీవోడబ్ల్యూ సంధ్య, చిక్కుడు ప్రభాకర్, ఉ.సా, సూరేపల్లి సుజాత, కోట పాల్గొన్నారు. -
పృథ్వీ, చందన్లను విడుదల చేయాలి
హైదరాబాద్: అక్రమంగా అరెస్టు చేసిన విరసం సభ్యుడు పృథ్వీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి చందన్లను బేషరతుగా విడుదల చేయాలని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆధ్వర్యంలో ప్రశ్నించే కలాలు, కళలపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ, మార్చి 27న పృథ్వీ, చందన్లను గన్నవరంలో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వీసీ అప్పారావును హత్య చేసేందుకు మావోయిస్టు నేతలు చంద్రన్న, హరిభూషణ్లతో కలసి కుట్ర చేశారంటూ వారిని అరెస్టు చేశామని చెప్పటం సిగ్గు చేటన్నారు. దళితులు, ఆదివాసీలపై చేస్తున్న దాడులను సమర్థించుకోవటానికే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో విరసం నగర కన్వీనర్ గీతాంజలి, విరసం సభ్యులు శివరాత్రి సుధాకర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
పరిణత విప్లవకారుడు ప్రభాకర్
సందర్భం రెండు దశాబ్దాల క్రితం బీఎడ్ పూర్తి చేసి డీఎస్సీ పరీక్షకు అర్హుడైన ప్రభాకర్ తాజాగా తెలంగాణ డీఎస్సీ పరీక్ష సమయంలోనే ఎన్కౌంటర్కు గురై తన అంతిమ యాత్రలో ఊరేగవలసిరావడం కాకతాళీయమూ, విషాదం కూడా. రాజ్యం దృష్టిలో సంచలనాత్మక నాయకుడిగా నమోదు కాలేదు గానీ ప్రజల హృదయాల్లో ఇంచుమించు రెండు దశాబ్దాలుగా ప్రభాకరుడిగా వెలుగొందుతున్న దడబోయిన స్వామి విప్లవోద్యమం ఎదుర్కొనే తీవ్రమైన కష్టనష్టాల దృష్ట్యా జీవితంలోని పశ్చిమార్థంలోకి ప్రవేశిస్తున్నట్లే. తాను, తనతోపాటు క్యాంపులో ఉండిపోయిన ఆదివాసీ మహిళ రత్న.. తెలంగాణ గ్రేహౌండ్స్ దాడిచేసిన మార్చ్ 2వ తేదీ ఉదయం తీవ్ర అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నారు. అయినా మొదట తనను గురిచూసి కాల్చిన గ్రేహౌండ్స్ను ప్రతిఘటించడానికే ప్రయత్నించాడు ప్రభాకర్. గ్రేహౌండ్స్లో మరణించిన సుశీల్కుమార్ శరీరంలో వెళ్లిన బుల్లెట్ ఎదురుగా వచ్చి తాకింది కాదు. వెనుకనించి దూసుకువచ్చిందని పోస్ట్మార్టమ్ రిపోర్టు. శవపరీక్ష చేసినవాళ్లు నిజాలు చెప్పవచ్చు చెప్పకపోవచ్చు గానీ శవాలు అబద్ధం చెప్పవు కదా. దడబోయిన స్వామి ఏబైమూడేళ్లకు పూర్వం అప్పటి అవిభక్త వరంగల్ జిల్లాలో కడిపికొండ శివారుగ్రామంగా ఉన్న రాంపేట గ్రామంలో ఇద్దరన్నల తర్వాత మూడోవాడుగా ఒక పేద గొల్లకుటుంబంలో పుట్టాడు. నగర శివారు ప్రాంతంలో రాజకీయ, విద్యాచైతన్యం ఉండటం వల్ల పట్టుదలగా చదువుకున్నాడు. ఐదోతరగతి వరకు ఊర్లో, ఇంటర్వరకు కాజీపేటలో, డిగ్రీ కాకతీయ యూనివర్సిటీలో చేసి హనుమకొండ బీఎడ్ కాలేజీలో బీఎడ్ చేశాడు, తర్వాత ఎంఎస్సీ కూడా పూర్తి చేసి కడిపికొండ పరిసర గ్రామాల్లో విద్యావలంటీర్గా పనిచేసాడు. స్వామికి బుద్ధి తెలిసేనాటికే కడిపికొండ, భట్టుపల్లి, కాజీపేట డీజల్కాలనీ, రోడ్డు దాటితే సోమిడి మొదలైన అన్ని గ్రామాల్లో విప్లవోద్యమం, రాడికల్ విద్యార్థి, యువజనోద్యమాలే గ్రామీణ వరంగల్ జిల్లాలో ప్రాధామ్యంలో ఉన్నవి. తనకంటే ముందు సీకేఎం కాలేజీ విద్యార్థి అయిన క్రాంతి రణదేవ్, తన ఊరివాడే అనదగిన శ్యాంసుందరరెడ్డి ఆయనకు నవయవ్వనం నాటికే వేలుపట్టుకొని నడిపించే రాడికల్ విద్యార్థి, యువజనోద్యమ నాయకులయ్యారు. సూరపనేని జనార్దన్, జన్నుచిన్నాలు నాయకత్వ వారసత్వాన్ని స్వీకరించి కాకతీయ యునివర్సిటీలో రాడికల్ విద్యార్థి ఉద్యమం మొదలు, జిల్లాలో విప్లవోద్యమం విస్తృతంగా నిర్మాణం చేసిన పులి అంజయ్య (సాగర్) కు పైన పేర్కొన్న గ్రామాలు పెట్టని కోటలు. ఈ వాతావరణంలో విద్యార్థిగానైనా, ఉపాధ్యాయునిగానైనా మసలుకున్న స్వామి 1985 నుంచే ప్రజలమధ్య వివిధ రకాల విప్లవ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. విద్యావలంటీర్గా పనిచేసే అవకాశం ఉపయోగించుకొని తన ఊరి పరిసర గ్రామాల్లో స్టడీసర్కిల్స్ ఏర్పాటుచేసి విప్లవ రాజకీయ అధ్యయనం, అధ్యాపనలను ప్రోత్సహించాడు. ఆయన పనిచేసిన తీరుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే తీవ్ర నిర్బంధం అమలవుతున్న 1999లో రాజ్యం దృష్టిలో పడిన తన సీనియర్ ఒకరు శత్రువు దృష్టి మళ్లించడానికి ఖమ్మంలో కాంగ్రెస్ సేవాదళ్ శిబిరంలో పాల్గొనడానికి వెళ్తే తాను కూడ వెంట వెళ్లాడు. కానీ మళ్లీ అతనితో తిరిగి రాలేదు. పోలీసులకేమి ఉప్పు అందిందో కానీ వచ్చి ఇల్లంతా సోదా చేసారు. ఇంటి అటక పైన గెరిల్లా యూనిఫాం కని పించింది. ఇంటివాళ్లను వేధించి, బెదిరించి స్వామి వెనక్కిరాగానే ఎస్పీ ఆఫీసుకు తీసుకురమ్మని పురమాయించి పోయారు. స్వామి ఇంటికివచ్చి పోలీసులు వచ్చి పోయారని ఇంటివాళ్లు చెప్పగానే అటక ఎక్కి చూసి ఇంక అదే పోకడగా వెళ్లిపోయాడు. అలా 2001లో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్న స్వామి ఏడేళ్లపాటు వరంగల్, జనగామ ఏరియాలో పనిచేసి కమాండర్ స్థాయికి ఎదిగాడు. 1993కన్నా ముందు సాగర్కు కొరియర్గా కూడ పనిచేసాడు. ఇంత సుదీర్ఘకాలపు పట్టణ, గ్రామీణ విద్యార్థులు, యువకులు, ప్రజలమధ్యన వివిధ రంగాలలో పనిచేసిన అనుభవంతో ఒక స్థిమితమైన పరిణతితో ఆయన 2008లో దండకారణ్యానికి వెళ్లి అక్కడ అప్పటినుంచీ స్థిరంగా సీపీఐ మావోయిస్టు సెంట్రల్ రీజినల్ బ్యూరోలో ప్రెస్వర్క్లో ఉన్నాడు. నాయకత్వానికి శ్రేణులకు అనుసంధానంగా పత్రిక, ప్రచురణలు వెలువరించడంలో నిరంతరం కృషిచేస్తూ నేర్చుకుంటూనే నేర్పుతూ దండకారణ్య స్పెషల్ జోనల్కమిటీ డివిజన్ కమిటీ నాయకత్వ స్థాయికి ఎదిగాడు. అంత కీలకమైన స్థానంలో ఇంత సుదీర్ఘకాలంగా ఉంటూ శత్రువు దృష్టి పడకుండా ఆయన వ్యవహరించిన తీరు ఆదర్శప్రాయమైనది. రాంపేట గ్రామ ఉమ్మడి అవసరాల కోసం ఉపయోగించే ఏ అగ్రిమెంట్ కాగితంలోనైనా, యాదవ సంగం రికార్డుల్లో, స్థల కొనుగోలు కాగితాల్లో, స్మశాన వాటిక కాగితాల్లో, ప్రభుత్వ ఫిర్యాదుల్లో ప్రభాకర్ రాతే ఉంది. అలాంటి వ్యక్తి మార్చి 2న ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు వార్తల్లోనూ, బ్యానర్లలోనూ, మావోయిస్టు పార్టీ కేంద్ర రీజనల్ బ్యూరో ప్రెస్ ఇన్చార్జిగా ఉన్నాడని వచ్చిన వార్త రాంపేటకే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఊళ్లో కాగితాలపై రాసిన పని అతడిని దక్షిణభారత దేశం దాకా తీసుకుపోయింది. 1998లో గ్రామంలోనే తొలి వ్యక్తిగా బీఎడ్ పూర్తి చేసి డీఎస్సీ పరీక్షకు అర్హుడైన ప్రభాకర్ 2018 మార్చి 2వ తేదీ తాజాగా తెలంగాణ డీఎస్సీ పరీక్ష జరిగిన సమయంలోనే తన అంతిమ యాత్రలో ఊరేగవలసిరావడం కాకతాళీయమూ, విషాదం కూడా. (మార్చి 2న పూజారి కాంకేర్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్ స్మృతిలో) - వరవరరావు వ్యాసకర్త విరసం సంస్థాపక సభ్యులు -
ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ
హైదరాబాద్: ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్ కేసీఆర్ ఫాసిస్టు పాలనకు పరాకాష్ట అని, 12 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం హేయమైన చర్య అని వరవరరావు మండిపడ్డారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారికి ఫోరెన్సిక్ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. -
ఎన్నికలను బహిష్కరించాలి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించి నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాల్లో ప్రజలను సమీకరణం చేయాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా అణగారిన వర్గాలకు ఒనగూరేదేమీలేదని చెప్పారు. 2019 ఎన్నికలు ఫాసిజానికి పరిష్కారం చూపుతాయని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్లో విరసం రాష్ట్ర మహాసభల ముగింపుసభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ కూడా పార్లమెంటరీ ఎన్నికల వల్ల విధ్వంసంతో కూడిన దోపిడే తప్ప పేదలకు ఒనగూరిందేమీ లేదన్నారు. దేశంలో నరేంద్రమోదీతో మొదలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకు అందరిదీ ఒకే విధానమని చెప్పారు. పార్లమెంటరీ ఎన్నికల ద్వారా ప్రజలను కులం పేరుతో చీల్చి, మతం పేరుతో కలుపుతున్నారని పేర్కొన్నారు. బ్రాహ్మణ భావజాలం దేశానికి ఎంత శత్రువో.. పార్లమెంటరీ రాజకీయాలూ అంతే శత్రువులన్నారు. పార్లమెంటరీ పద్ధతిలో ఎన్నికైన నెహ్రూతో మొదలుకుని ఇందిరాగాంధీ, రాజీవ్ తదితరులంతా చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా 3 వేల మంది కమ్యూనిస్టులను పొట్టన బెట్టుకున్నారని, అదే సమయంలో రజాకార్ల పేరుతో 40 వేల మంది ముస్లింలను ఊచకోత కోశారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు నక్సల్బరీ ఒక్కటే మార్గం కాదని వరవరరావు పేర్కొన్నారు. 1930లో మార్క్సిజం ఎలాగైతే ఫాసిజాన్ని ఓడించిందో అలాంటి సమీక్ష జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గొప్ప విప్లవం దేశంలో మళ్లీ వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం నల్లమలలో విప్లవకారులు లేకపోవచ్చు.. ఖాళీ అయిన నల్లమల విప్లవం భవిష్యత్లో వస్తోందన్నారు. విరసం అంటరానితనం అయ్యిందని, ఎన్కౌంటర్ల పేరుతో రాజ్యహింసకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ముంబైలో ఏడుగురిని బందీ చేశారని, వారిపై మావోయి స్టు ముద్రవేసి హతం చేసేందుకు రాజ్యం కుట్ర చేస్తోందని వరవరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా వారి అరెస్టును వెంటనే ప్రకటించాలని, వారి ప్రాణాలకు హాని తలపెట్టవద్దని ఆయన కోరారు. పాలకులు భయపడుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్ సభలు, సమావేశాలు జరుపుతామంటే పాలకులు భయపడుతూనే ప్రజలను భయపెట్టిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో పాలక, ప్రతిపక్షాలన్నీ కూడా భయంతో సతమతమవుతున్నాయని చెప్పారు. ఈడీ, సీబీఐ, సిట్ ఇలా తమ మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయో.. ఎప్పుడు జైలుకు వెళ్తామోననే ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కల నెరవేరిన మరుసటి రోజు నుంచే సభలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. భయానక పరిస్థితుల్లో కూడా మాట్లాడగలిగే సాహసం చేసేది ఒక్క విరసం మాత్రమేనన్నది గుర్తుం చుకోవాలన్నారు. ప్రస్తుతం దేశభక్తి అంటే రామభక్తిగా మారిందని.. రాముడిని కొలవకపోతే దేశద్రోహం చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారని విరసం నేత కల్యాణ రావు దుయ్యబట్టారు. దేశంలో బ్రాహ్మణీయ ఫాసిజం పెరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని నాగపూర్కు చెందిన వీరసాథెదార్ అన్నారు. విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణి విరసం రాష్ట్ర కార్యదర్శిగా పాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర మహాసభల్లో ముగింపు సందర్భంగా ఆదివారం ఈ ప్రకటన చేశారు. విరసం సభ్యులు వరలక్ష్మి, కాశీం, రాంకి, అరసవెల్లి కృష్ణ, జగన్, చిన్నయ్య, బాసిత్, రివేరా, క్రాంతి, వెంకన్న, రాము, గీతాంజలి, ఉదయబాను, ఉజ్వల్, కిరణ్ తదితరులు ఏకగ్రీవంగా పాణిని ఎన్నుకున్నారు. -
సామ్రాజ్యవాద భావజాలాన్ని అడ్డుకోవాలి
హైదరాబాద్: బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద భావజాలాన్ని అడ్డుకోవాలని విరసం నేత వరవరరావు అన్నారు. సోమవా రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం (విరసం) 26వ మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నేరెళ్ల ఘటన, మందకృష్ణ మాదిగ అరెస్టుల నేపథ్యంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందనిపిస్తోందని అన్నారు. రాజ్యం చేతిలో అనేకమంది విప్లవ రచయితలు, ఆదివాసీలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య పాలకులు చిచ్చు పెడుతున్నారని విమర్శిం చారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాలకూ కాషాయం రంగు వేస్తున్నారన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని ప్రపంచ తెలుగు మహాసభలకు దూరం పెట్టారన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో మహబూబ్నగర్ క్రౌన్ గార్డెన్లో జరిగే విరసం మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విరసం సభ్యులు గీతాంజలి, ఖాసిం తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని విరసం నేత వరవరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, మేళ్లమడుగులో జరిగిన ఎన్కౌంటర్లో ప్రభుత్వమే అమాయకులను తన పోలీసులతో హత్య చేయించిందని ఆరోపించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ వరుసగా జరిగిన రెండు ఎన్కౌంటర్లలో చనిపోయిన వారిలో ఏడుగురు ఆదివాసీలు, ఒక దళితుడు, ఒక లంబాడీ వ్యక్తి ఉన్నారని అన్నారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేసి న్యాయవిచారణ చేయాలని డిమాండ్ చేశారు. మంద కృష్ణ మాదిగను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్ రావు, జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, వివిధ సంఘాల నేతలు మన్నారం నాగరాజు, నలమాస కృష్ణ, చిక్కుడు ప్రభాకర్, మోహన్ బైరాగి, ఉ.సాంబశివరావు, జాన్వెస్లీ, గురజాల రవీందర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్
సాక్షి, మేడ్చల్జిల్లా: బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్ నడుస్తోందని, డంపింగ్యార్డ్ విషయంలో కోర్టు కేసుల పేరుతో ప్రజా ఉద్యమాలను నీరుగార్చే ప్రయత్నాలను సహించబోమని విరసంనేత వరవరరావు, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ అన్నారు. 12న జవహర్నగర్లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం మేడ్చల్ జిల్లాప్రెస్క్లబ్లో జవహర్నగర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్నగర్లోని డంపింగ్యార్డ్ ప్రభావంతో దాదాపు 15 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని దానిని దూర ప్రాంతాలకు తరలించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు పవర్ప్లాంట్ పేరుతో ఇక్కడే శాశ్వతంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు రాంకీ డంపింగ్యార్డ్ను వ్యతిరేకించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత డంపింగ్యార్డ్కు వచ్చి కంటనీరు పెట్టుకుందని ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా తయారైన డంపింగ్ను తరలించేదుకు జవహర్నగర్ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఏకమయ్యాయన్నారు. మంగళవారం నిర్వహించే మహాధర్నాకు వేలాది మంది పాలమిలటరీ భలగాలతో విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఈ విషయంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డికి విజ్ఞప్తి చేశామని, శాంతియుతంగా నిర్వహించే ఈ మహాధర్నాకు ఆటంకం ఎదురైతే జరుగబోయే పరిణామాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. జవహర్నగర్ ప్రజాహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మెన్ మేడరవి, కన్వీనర్ మస్తాన్బీ, వైఎస్సార్సీపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల డానియేల్, ప్రజాకళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్, తెలంగాణప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవిచందర్ ,వైఎస్సార్సీపీ కీసర మండల అధ్యక్షుడు సోమన్న పాల్గొన్నారు. -
‘బ్లాంకెట్’ నిషేధం.. బహుపరాక్!
ఓటర్లను బిచ్చగాళ్లుగా మారుస్తున్న కాలంలో జైల్లో సాయిబాబా కూడా ప్రాణాల్ని కాపాడే మందుల కోసం, చలి నుంచి కాచుకునే దుప్పటి కోసం బిచ్చగాడుగా మళ్లీ మళ్లీ అడుక్కోవాల్సి వస్తున్నది. చలికాలం ప్రవేశించింది. తనకు కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా ఇవ్వడం లేదనీ, తీవ్రమైన జ్వరంతో తాను కువకువ కూయాల్సి వస్తుందనీ, ఈ స్థితి ఇట్లాగే సాగితే తనకింక ఈ చలి కాలం గడవటం కష్టమని నాగపూర్ హై సెక్యూరిటీ జైలు అండాసెల్లో మార్చ్ 8 నుంచి దాదాపు ఎనిమిది నెలలుగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా రాశాడు. పోలీసులు, ప్రభుత్వాలు, రాజ్యా నికి కాకున్నా మానవ సమాజం కోసం అయినా మళ్లీ మళ్లీ మనం ఆయన తొంభైశాతం వికలాంగుడని, బెయి లుపై బయటికి వచ్చే నాటికే నరాల జబ్బువల్ల ఎడ మచెయ్యి లేపలేని స్థితిలో ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. హృద్రోగం, రక్తపు పోటు, మధుమేహంతో పాటు ఈసారి జైలుకు పోయే ముందు ఆయనకు గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో ఇన్ఫెక్షన్ వచ్చింది. అందుకే శస్త్ర చికిత్స చేయాలని ఢిల్లీలోని రాక్లాండ్ ఆసుపత్రి వాళ్లు చెప్పారు. ఎడమచెయ్యి శస్త్ర చికిత్స చేయించుకుంటే పనికి వస్తుందేమో తెలుసుకోవడానికి, ఇతర వ్యాధులకు ఆయన బెయిలుమీద ఉన్నప్పుడు హైదరాబాద్ కేర్ బంజారాలో ఆరు వారాలు చికిత్స పొందాడు. దేశం లోని నిపుణులైన వైద్యులు వచ్చి కూడ అప్పుడే ఆ స్థితి లేదని ఇంకొంత కాలం వేచి చూడాలని చెప్పారు. ఆ తర్వాత కోర్టు తీర్పు కోసం ఆయన తిరిగి గడ్చి రోలీ కోర్టుకు వెళ్లేదాకా ఢిల్లీలో ఎయిమ్స్ కాకుండా ఉన్న ఒకే ఒక్క సూపర్ స్పెషల్ ఆసుపత్రి రాక్లాండ్లో ఫిజియోథెరపీ చేయించుకున్నాడు. ఆ స్థితిలో ప్రయా ణాలు చేయకూడదని ఆ ఆసుపత్రి వైద్యులు ఆయనకు సూచించారు. కానీ ఆ రోజుల్లో ఆయన గడ్చిరోలీ కోర్టుకు విచారణకు తిరగక తప్పలేదు. తన స్వీయ వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లక తప్పలేదు. అయితే విచారణకు వెళ్లిన కాలమంతా కోర్టులో వాదోపవాదాలుగానీ, జడ్జి వైఖరి, మాటలుగానీ, ముఖ్యంగా తన న్యాయవాదులు కేసు నిర్వహించిన తీరుగానీ ఆయనకు ఈ కేసు నుంచి తప్పకుండా తాము నిర్దోషులుగా బయటపడతామనే విశ్వాసాన్ని కలిగిం చాయి. నూటికి నూరుపాళ్లు నమ్మకంతోనే తీర్పు వెలువ డగానే వచ్చి కేర్ ఆసుపత్రిలో చూపించుకొని ఢిల్లీలో ఉద్యోగంలో చేరడానికి సిద్ధమై వచ్చాడు. గడ్చిరోలీ జిల్లా జడ్జి ఎనిమిదివందల యాభై పేజీల ఇంగ్లిష్ (సాధా రణంగా హిందీలో ఇస్తారు) తీర్పులో ‘సాయిబాబా తొంభైశాతం వికలాంగుడే కావచ్చుగానీ, మానసికంగా క్రియాశీలంగా ఉన్నాడు గనుక యావజ్జీవ శిక్ష విధిస్తు న్నానన్నాడు. విజయటిర్కె అనే ఒక ఆదివాసీకి మినహా పాండు, మహేశ్ అనే మరో ఇద్దరు ఆదివాసులకు, ప్రశాంత్రాహీ అనే జర్నలిస్టుకు, హేమ్ మిశ్రా అనే జేఎన్యూ విద్యార్థికి యావజ్జీవ శిక్ష వేశాడు. హేమ్ మిశ్రా కూడా చెయ్యి వికలమై బాధపడుతున్నాడు. జేఎన్యూలో సాంస్కృతిక కళాకారుడు. ఈ తీర్పులో మూడు వందల యాభై పేజీలకు పైగా జీఎన్ సాయి బాబాపై ప్రాసిక్యూషన్ ఆరోపణలన్నింటికీ జడ్జి ఆమో దం ఉంది. అంతేకాదు ‘సాయిబాబాకు ఇంతకన్న కఠిన శిక్ష వేయలేకపోవడానికి’ చట్టం తన చేతులు కట్టి వేసిం దని రాశాడు. గడ్చిరోలి, బస్తర్లలో ఆల్ అవుట్ వార్లో ఆది వాసులు కేవలం ఎన్కౌంటర్లలో చనిపోవటం మాత్రమే కాదు. రాయపూర్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలలోనూ చనిపోతున్నారు. కంటి శస్త్ర చికిత్సలలో గుడ్డివాళ్లవుతున్నారు. డయేరియా, మలే రియాతో చనిపోతున్నారు. సామూహిక లైంగిక అత్యా చారాలకు గురవుతున్నారు. మార్కెట్ కొనుగోలు శక్తి లేని ఆదివాసీ, ముస్లిం, దళిత, బడుగు వర్గాలందరూ నేరపూరిత నిర్లక్ష్యానికి గురై చనిపోవడం రాజ్యం లక్ష్యం. వాళ్ల పక్షం వహించే ప్రజాస్వామ్య శక్తుల, వ్యక్తుల విష యంలో కూడా రాజ్యం వైఖరి అదే. వాళ్లు సహజ మర ణాలకు గురవుతారు. కోర్టు హత్యలకు గురవుతారు. జైళ్లలో చంపబడతారు. ఒక్కరోజు ఓటు బిచ్చగాడు అధికారానికి వచ్చి మిగిలిన కాలమంతా ఓటర్లను బిచ్చగాళ్లుగా మార్చాలని పథకాలు రచిస్తున్న కాలంలో జైల్లో సాయిబాబా కూడా తన డాక్టర్లు రాసిచ్చిన, తనవాళ్లు తెచ్చిన ప్రాణాల్ని కాపాడే మందుల కోసం, చలి నుంచి కాచుకునే దుప్పటి కోసం బిచ్చగాడుగా మళ్లీ మళ్లీ అడుక్కోవాల్సి వస్తున్నది. మందులు, ఉన్ని దుప్పటి జైలు గేటుకు చేరుతాయి. అవి ఆయన కుటుంబ సభ్యులు, ప్రతివారం కలిసే న్యాయ వాది తెచ్చి ఇస్తారు. కానీ అవి జైలు ఆఫీసు గేటు దాటి అండాసెల్లోని సాయిబాబాకు చేరవు. అండాసెల్ 2వ ప్రపంచ యుద్ధకాలపు గ్యాస్ చాంబర్ ఏమీ కాదు. జీవిత ఖైదు అయినా సరే ఎంతటి తీవ్రవాది, దేశ ద్రోహి అయినా జీవించే హక్కును సుప్రీంకోర్టు ఆఖరున రాష్ట్ర పతి కూడా అట్లా ఆదేశిస్తే తప్ప కోల్పోరు. బతికి ఉన్న సాయిబాబాపై ఈ బ్లాంకెట్ నిషేధాన్ని, బతికే హక్కును హరిస్తున్న అతి తీవ్రమైన నేరంగా ఎంచి ప్రతిఘటించ డానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ సంఘటిత పోరాటం చేయాలి. సాయిబాబా వంటి వాళ్లను కాపాడుకోవాలి. బ్లాంకెట్ అనే మాట తెలుగులో ఉన్ని దుప్పటి అని వాడు తాము. నాగపూర్ జైల్లో ఆరడుగుల మూడు అంగుళాల బెడ్షీట్ మాత్రమే అనుమతిస్తారు. (పెద్దదైతే ఉరి పెట్టు కుంటారనే భయంతో) ఉన్ని దుప్పటి ఇవ్వరు. ఇంగ్లిష్లో బ్లాంకెట్–శబ్దానికి మొత్తంగా అనే అర్థం కూడా ఉంది. మొత్తంగానే ఈ నిరాకరణ సాయిబాబా జీవించే హక్కునే నిరాకరిస్తున్నది, నిషేధిస్తున్నది. వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు -
రేప్ చేసిన చేతులకు రాఖీలా?
అభిప్రాయం ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా పాల్నార్ గ్రామంలోని బాలికల వసతి గృహంలో 500 మంది ఆదివాసీ బాలికలు ఉన్నారు. రాఖీ పండుగ రోజున అక్కడి పాఠశాలను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సందర్శిం చారు. ఈ పాఠశాల పిల్లలతో సీఆర్íపీఎఫ్ సైనికులకు రాఖీ లు కట్టించాలని వారికి ఆలోచన వచ్చింది. జూలై 31నే ఈ పథకాన్ని రచించి వందమంది జవాన్లను తీసుకొని ఆ వసతి గృహానికి వెళ్లారు. అధికారులు ఈ రాఖీ కట్టే దృశ్యాన్నంతా వీడియో తీసే ఏర్పాటు కూడా చేశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆదివాసీ మహిళలకు సీఆర్పీఎఫ్ జవాన్లు సంరక్షకులుగా ఉన్నారని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చూపాలనుకున్నది. రక్షాబంధన్ రోజు ఆ కార్యక్రమాన్ని లైవ్ షో చేయాలనుకున్నారు. అందుకని రాఖీ పున్నమి రోజు చాలాసేపటి వరకు ఆ కార్యక్రమం కొనసాగింది. ఉదయం నుంచి ఈ కార్యక్రమం చాలాసేపు కొనసాగడంతో కొంతమంది బాలికలు కార్యక్రమం మధ్యలో మరుగుదొడ్డికి వెళ్లారు. వాళ్లను ఐదారుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు అనుసరించారు. తాము మరుగుదొడ్ల లోపల ఉండగా బయట ఇట్లా జవాన్లు నిలబడడానికి ఆ అమ్మాయిలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ జవాన్లు బెదిరిం చారు. మీ శరీరంలోని రహస్య ప్రదేశాల్లో ఏం దాచుకున్నారో మేం వెతకాల్సి ఉంటుందని చెబుతూ ముగ్గురు అమ్మాయిల స్థనాలను దారుణంగా నలిపేశారు. ఒక అమ్మాయి మరుగుదొడ్డిలో తలుపు వేసుకొని ఉండిపోయింది. ముగ్గురు సైనికులు తలుపు తోసుకొని లోపలికి వెళ్లారు. 15 నిమిషాలు వాళ్లు ఆ లోపలే ఉండిపోయారు. మిగిలిన అమ్మాయిలను బయట ఉన్న జవాన్లు గొడవ చేయకుండా నోరు మూశారు. తర్వాత రక్షా బంధన్ సంరక్షకుల కార్యక్రమం ముగిసింది. ఆ రాత్రి ఆ బాలికలు తమ వార్డెన్ ద్రౌపదీ సిన్హాకు జవాన్లు తమతో వ్యవహరించిన తీరు చెప్పారు. వార్డెన్ ఈ విషయాన్ని ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తెచ్చింది. ఈ ఫిర్యాదు చేసిన అమ్మాయిలను సీఆర్పీఎఫ్ క్యాంపు నకు తీసుకురమ్మన్న కలెక్టర్, ఎస్పీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించారు. గ్రామస్తులు చొరవ తీసుకొని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలని సోనీ సోరీని పిలిపించారు. సోనీ సోరీ అక్కడికి వెళ్లినప్పుడు ఆ హాస్టల్ వార్డెన్ గేటుకు తాళం పెట్టి వాచ్మన్లాగా గేటు ముందు కూర్చున్నది. ఒక పోలీసు కానిస్టేబుల్ను పై అధికారులు అక్కడ నియమించారు. ఇంక చేసేది లేక సోనీ సోరీ అక్కడి పాఠశాలలో చదివే పిల్లల ఇళ్లల్లోకి వెళ్లి ఆ సంఘటనకు సంబంధించిన సమాచారమంతా సేకరించింది. దంతెవాడలో చాలాకాలం పాటు వనవాసి ఆశ్రమం నిర్వహించి, పోలీసుల దౌర్జన్యంతో ఛత్తీస్గఢ్ వదిలి వెళ్లిన హిమాంశు కుమార్ ఈ సంఘటనను బయటి ప్రపంచం దృష్టికి తెచ్చాడు. తమపై లైంగిక అత్యాచారం చేసిన జవాన్లకే తాము రాఖీలు కట్టే స్థితికి నెట్టబడిన ఆదివాసీ బాలికలపట్ల ఈ వ్యవస్థ వైఖరి ఏమిటి? ఆదివాసులపై సామూహిక లైంగిక అత్యాచారాలను ప్రోత్సహించిన నేరారోపణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు రుజువైన పోలీసు ఉన్నతాధికారి కల్లూరిని ఆగస్టు 15న ఒక విశ్వవిద్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ఆహ్వానించడం రేప్ చేసిన చేతులకు రాఖీలు కట్టించడమనే దుర్మార్గానికి పరాకాష్ట కాదా? వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు -
రాజ్యహింసకు గురవుతున్న గిరిజనులు: వరవరరావు
హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో గిరిజనులు భయంకరమైన రాజ్యహింసకు గురవుతున్నారని విరసం నేత వరవరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉన్న హక్కులు కూడా పోయా యని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఆధ్వర్యంలో తెలంగాణలో ఆదివాసీలపై ‘అక్రమ కేసులు–హక్కుల ఉల్లంఘన’ రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో వరవరరావు మాట్లాడుతూ... ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయన్నారు. రాష్ట్రంలో హరితహారం పేరుతో మొక్కలను నాటు తూ, పోడు భూములను ఆక్రమించుకుంటున్నార న్నారు. 1945లోనే కొమురంభీం ‘మా ఊళ్లో మా రాజ్యం’ అనే నినాదం ఇచ్చారని, అందుకే ఆది వాసీలకు స్వయంప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల పోడు భూములకు పట్టాలి వ్వాలని, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆదివాసీలకు ఉన్న ప్రత్యేకమైన హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని సామాజికవేత్త సాంబశివరావు అన్నారు. తుడుం దెబ్బ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉపేందర్, రమణాలలక్ష్మయ్య, ప్రొఫెసర్ కాశీం పాల్గొన్నారు. -
తెలంగాణలో మాఫియా రాజ్యం
-
తెలంగాణలో మాఫియా రాజ్యం
విరసం నేత వరవరరావు పెద్దపల్లి రూరల్: తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని విరసం నేత వరవరరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్య మ సమయంలో ‘నక్సల్స్ ఎజెండా యే నా ఎజెండా’ అన్న కేసీఆర్ కుర్చీ ఎక్కిన తర్వాత దొరల పోకడకు తెర తీశార న్నారు. నేరెళ్ల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇసుక మాఫియా నిందితుల ఆస్తులను పంచాలన్నారు. కరీంనగర్ జైలులో ఉన్న నేరెళ్ల బాధితులను వరవరరావు పరా మర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ఇసుక మాఫియా మామూలుది కాదని.. సింగపూర్, మలేషియాలకు ఇసుక రవాణా చేస్తున్న గోల్డ్స్టోల్ కంపెనీకి చెందిందని, దీనికి కేటీఆర్తో సంబంధాలున్నాయన్నారు. -
ప్రొ‘‘ సాయిబాబను కాపాడుకుందాం!
నాగపూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటికీ దిగజారడంతో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదికతో కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనకు శిక్ష విధించే కొద్ది రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధికి సంబంధించిన ఆపరేషన్ మూడు వారాలలో చేయాలనీ డాక్టర్లు సూచించారు. ఈ మూడు నెలల కాలంలో ప్రొ. సాయిబాబకు జైలులో ఏ విధమైన వైద్య సహాయం అందలేదు. జైలు అధికారులు కానీ, డాక్టర్స్ కానీ మహారాష్ట్ర ప్రభుత్వం గానీ వైద్య సహాయం అందించలేకపోవడం వలన ఆయన ఆరోగ్యం బాగా పాడైపోయింది. మే నెల లోనే రెండుసార్లు స్పృహ తప్పడం జరిగింది. క్లోమ గ్రంధికి సంబంధించిన నొప్పి తీవ్రతరం అయింది. ఛాతి నొప్పి, గుండెదడ రావడం జరిగింది. జైలు డాక్టర్లు నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచిం చినా జైలు అధికారులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం నాగపూర్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ 90 శాతం శారీరక వైకల్యంతో వీల్ చెయిర్లోనే గడపాల్సిన పరిస్థితిలో ఉంటున్నారు. జైలులోని దుర్భర పరిస్థితులకు తోడు దాదాపుగా ఎవరిని కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారు. పోలీసు, జైలు సిబ్బంది ఆయన పట్ల అత్యంత మొరటుతనంతో వ్యవహరిస్తున్నారు. జైలులో ప్రొ. సాయిబాబ ఆరోగ్య పరిస్ధితిఫై జాతీయ మానవ హక్కుల కమిటీ (ఢిల్లీ) ఏక సభ్య బృందాన్ని మే 15వ తేదీన జైలుకు పంపింది. ప్రాణాం తక వ్యాధులను ఎదుర్కొంటున్న సాయిబాబకు ప్రాణ రక్షక చికిత్సను అందించడానికి బదులుగా ఆయనను జైలు డాక్టర్ పరీక్షించడానికి కూడా జైలు సిబ్బంది అనుమతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జైల్లో సాయిబాబకు సృష్టిస్తున్న దుర్భర పరిస్థితులు ఆయన జీవితానికి, గౌరవానికి, సమానత్వ భావనకు భంగకరంగా మారడమే కాకుండా క్రూరమైన, అమానుషమైన పద్ధతులను పాటిస్తూ ఆయన ఆరోగ్య పరిరక్షణ హక్కు పట్ల కూడా వివక్ష ప్రదర్శిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. జీవించే హక్కులో భాగంగా ప్రొ. సాయిబాబ ఆరోగ్యంపై జైలు అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. జైలులో ఉన్న సాయిబాబకు తగిన వైద్య సహాయం అందించాలి. గతంలో ఆయన వైద్యం చేయించుకున్న ఢిల్లీ ఆసుపత్రికి లేదా హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి అక్కడికే తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. జైలులో ప్రొ. సాయిబాబ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రభుత్వాలు కావాలనే ప్రొఫెసర్ సాయిబాబ ఆరోగ్యం విషమించాలని చూస్తున్నాయనిపిస్తోంది. జైలులోనే ఆయనను అనారోగ్యంతో చంపాలని చూస్తున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిటీ వెంటనే స్పందించి ప్రొ. సాయిబాబకు తగిన వైద్య సహాయంతోబాటు, బెయిల్ ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రొ. సాయిబాబ సహచరి ఎ.ఎస్. వసంత కుమారి నుంచి వచ్చిన ఈ సమాచారం నేపథ్యంలో నాగపూర్ హై సెక్యూరిటీ జైలు అండా సెల్లో ఉన్న ప్రొ. సాయిబాబను ప్రాణాలతో కాపాడుకోవాలంటే ఆయనను వెంటనే హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించడానికి వీలుగా సికింద్రాబాద్ చర్లపల్లి హై సెక్యూరిటీ జైలుకు తరలించాలని ప్రజాస్వామ్యవాదులందరూ స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ మేరకు మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెట్టి ఆ రెండు ప్రభుత్వాలు అంగీకరించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అభ్యంతరం లేని విధంగా కృషి చేయాలని కోరుతున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టులకు సెలవులు ఉన్నందున బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం కంటే ముందుగా ప్రజాస్వామ్యవాదులందరూ తక్షణం చేపట్టవలసిన కర్తవ్యం ఇది అని విజ్ఞప్తి చేస్తున్నాను. – వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు -
నక్సల్బరీయే పీడిత జనవిముక్తి మార్గం
విరసం నేత వరవరరావు సాక్షి, హైదరాబాద్: పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని కుగ్రామమైన నక్సల్బరీలో రాజుకున్న నిప్పురవ్వ విప్లవోద్యమ దావానలమై దేశమంతటా విస్తరించిందని, గడిచిన ఐదు దశాబ్దాల్లో పీడిత జనవిముక్తికి నక్సల్బరీయే ఏకైక మార్గమని రుజువు చేసిం దని విరసం నేత వరవరరావు అన్నారు. ఏభైయేళ్ల నక్సల్బరీ ఉద్యమ ప్రస్థానంపై ‘సోషలిజమే ప్రత్యామ్నాయమార్గం’గా పేర్కొంటూ గురువారం ఇక్కడ విరసం నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. నాలుగు రోజులుగా జరిగిన రాజకీయ తరగతుల ముగింపు సందర్భంగా జరిపిన ఈ సభ నక్సల్బరీలో 1967 మే 25న భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటులో మరణించిన పది మంది ఉద్యమకారులుసహా నాటి నుంచి నేటి వరకు అసువులు బాసిన అమరవీరులందరికీ రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించింది. వరవరరావు మాట్లాడుతూ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఇప్పటి వరకు పార్టీ ఎన్ని చీలికలైందో అంత ఐక్యతను సాధించిందని అన్నారు. గుజరాత్ నుంచి విషపు పడమటి గాలి తెలంగాణకు వీస్తున్నదన్నారు. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నల్లగొండలో రజాకార్లు దాడులు చేసిన ప్రాంతాల్ని సందర్శిస్తున్నారని విమర్శించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ని నిషేధించారే కానీ తన గొంతును నిషేధించలేదనీ, అందుకే మావోయుస్టు పార్టీ కేంద్ర కమిటీ పంపిన ప్రకటనను చదివి వినిపిస్తున్నానంటూ పేర్కొన్నారు. విరసం మరో నేత కల్యాణరావు మాట్లాడుతూ ఆకలి, అంటరానితనం, అసమానతలు న్నంతకాలం సాయుధ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ నక్సల్బరీ విప్లవోద్యమం తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిందన్నారు. వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు నారాయణరావు, నలమాస కృష్ణ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
సారీ.. నో కామెంట్!
విప్లవ కవి వరవరరావుకు ఫోన్ చేసి ‘నేను–నా దైవం’ శీర్షికకు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ‘నేనూ దైవమా!!’ అన్నారు. పోనీ... దైవత్వాన్ని ‘నేను–నా విప్లవం’గా మార్చి చెప్పండి అని అడిగాం. లేకపోతే ఆయన దగ్గర్నుంచి ఏం సమాధానం వస్తుందో మాకు తెలుసు. అదేంటంటారా... ‘సారీ.. నో కామెంట్’. ► దేవుణ్ణి నమ్మే కుటుంబంలో పుట్టి, దేవుణ్ణి నమ్మని వారు ఎలా అయ్యారు?! వరవరరావు: యూనివర్సిటీలో చేరే వరకూ దేవుడి ఉనికిపై నాకు ఎలాంటి ఆలోచనలూ లేవు. ఎం.ఎ చేస్తున్నప్పుడు ఎంతోమందిని చదివాను, అలాగే ఎంతో సాహిత్యాన్ని! అందులో గురజాడ, శ్రీశ్రీ, చలం.. వంటి వారెందరో ఉన్నారు. ఆంత్రోపాలజిస్టుల అభిప్రాయాలూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దాంతో ఒక నిశ్చయానికి వచ్చాను. మనిషి దేవుణ్ణి సృష్టించాడు తప్ప, మనిషిని సృష్టించిన దేవుడు లేడని. ► డార్విన్, మార్క్స్ కూడా మీకు తోడైనట్లున్నారు? జీవ పరిణామక్రమంలో ఆది మానవుడు అనంతర మానవుడిగా మారడానికి శ్రమ కారణమైంది. ఆహారాన్వేషణలో, ఆహార ఉత్పత్తిలో భాగంగా మెదడు వృద్ధి చెందింది. అది వికసించింది. ఉత్పత్తికి శ్రమ ఆధారమైంది. డార్విన్ చెప్పిన పరిణామక్రమం, మార్క్స్ ఏంగిల్స్ చెప్పిన శ్రమ ఆధారంగా ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకున్న వాళ్లలో నేనూ ఒకడిని. ► తర్కాలతో దేవుణ్ణి అందుకోలేమనే వారూ ఉన్నారు కదా! మనిషి పండు తిన్నాడు. గింజలు విసిరేశాడు. అవి పది చెట్లు అయ్యాయి. ఆ పది చెట్ల ఫలాలు వందల చెట్లకు కారణం అయ్యాయి. ఆ క్రమంలోనే మనిషి రుతువులను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. రోగానికి కారణమేంటి, చావుకు కారణమేంటి? అని జవాబులు వెతకడం మొదలుపెట్టాడు. తనకు అర్థమైనదాన్ని జ్ఞానంగా ఆపాదించుకుని, అర్థంకాని దానిని అలౌకిక శక్తిగా ఊహించుకున్నాడు... ► ... ఒక్క నిమిషం.. అలౌకిక శక్తి అవసరం మనిషికి ఏమిటి? మార్క్స్ ఏమన్నాడంటే... తనను తాను వివరించుకోలేనప్పుడు మనిషి సృష్టించుకున్నదే దైవరూపం అని. సమాజం, వ్యవస్థలు ఎలా మారుతుంటే దేవుని రూపం అలా మారుకుంటూ వచ్చింది. వ్యవసాయంలో ఉన్న మనిషికి రాయి, పశువు, గుర్రం, పాము దేవుళ్లయ్యాయి. ఇవన్నీ వ్యవసాయంతో సంబంధం ఉన్నవి. భూమిని దున్నుతున్నప్పుడు రాయి అడ్డు వస్తే ఆ రాయీ వారికి దేవుడైంది. వాటి మీద శ్లోకాలు కట్టి కీర్తించాడు. ప్రకృతిని ఆరాధించాడు. పంట పండటానికి కారణమైన వరుణుడిని, సూర్యుడిని... పంచభూతాలను దేవుళ్లను చేశాడు. ► మీరూ.. అలా దేవుణ్ణి నమ్మిన కుటుంబాల నుంచే వచ్చారు. అలాంటిది మీ భావనలలో ఇంత వైరుధ్యం ఏమిటి? వరంగల్లోని చిన్న పెండ్యాల మా ఊరు. మొదటి నుంచీ మాది రాజకీయ కుటుంబం. నేను పుట్టేనాటికి మా పెద్దన్నయ్యలిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. మా బాపు (నాన్న) వైష్ణవ ఆరాధకుడు. దేవుణ్ణి కొలిచేవాడు. మా ఇంట్లో పెరుమాళ్ల ఇల్లు అని ఒక గది ఉండేది. ఆ పక్కనే వంట గది. పెరుమాళ్ల ఇంట్లో ఏముండేవో మాకు తెలిసేది కాదు. బహుశా! రాగి, ఇత్తడి విగ్రహాలు ఏవో ఉండేవనుకుంటా. ఆ విగ్రహాలు, దీపపు చెమ్మలు శుభ్రంగా కడిగి, తుడిచిచ్చే పని మా అమ్మది. వంటింట్లో నుంచే పెరుమాళ్ల ఇంట్లోని మా బాపుకు అందించేది. ఆయన వాటినందుకొని తలుపులేసుకుని దేవుణ్ణి పూజించుకునేవాడు. మా అమ్మకు పెరుమాళ్ల ఇంట్లోకి పోయి మా బాపుతో కూర్చుని పూజ చేసే అర్హత లేదు! మా ఇళ్లలో పురుషుడు చేసే పూజను స్త్రీ చూస్తే దేవుడికి దృష్టి దోషం కలుగుతుందట. అందుకని మా అమ్మ చూస్తున్నప్పుడు మా బాపు పూజ చేసేవాడు కాదు. అంటే.. ఆమెకు దేవుణ్ణి చూసే అర్హత లేదు. ఆమెకు జ్ఞానార్హత లేదు. అసలు మను ధర్మ శాస్త్ర ప్రకారం దేవుణ్ణి పూజించే అర్హత స్త్రీకి లేదట. ఎంత అన్యాయం? ► ఆ అన్యాయాన్ని మీరు ప్రశ్నించలేదా? అప్పటికి లేదు. నాకు ఎనిమిదేళ్లు వచ్చేసరికి మా బాపు చనిపోయాడు. మా అమ్మకు పూజ చేసే అర్హత లేదంటే ఆయన దృష్టిలో ఆమె పిల్లలమైన మాకూ లేనట్టేగా! పైగా, నేను చెడు నక్షత్రంలో పుట్టాను అని, నా వల్ల ఇంటికి అరిష్టం అని నన్ను దేవుడికి పరిచయం చేయాలనుకోలేదేమో ఆయన. ఇక మా అమ్మను ఆయన ఒక పనిముట్టుగానే భావించేవాడు. ఆయన్ని చెడ్డవాడని నేను అనను. మూఢవిశ్వాసాలున్న ఒక సగటు మనిషి ఆయన. మా అమ్మ అన్నీ సిద్ధం చేసి ఉంచితే, దేవుణ్ణి మొక్కుకొని బయటపడి, పది మంది పిల్లలను పోషించడానికి నాలుగు పైసల కోసం పొద్దుటి నుంచి రాత్రి వరకు కష్టపడేవాడే తప్ప ఆయనకైనా దేవుని గురించి ఆలోచించే తీరిక ఉండేదని అనుకోను. కష్టం చేసేటోడికి దేవుణ్ణి గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? లీజర్లీ క్లాస్.. దేవుణ్ణి సృష్టించింది. కష్టం చేసేవాడికి సమస్యలు వస్తే పరిష్కారాలకు దేవుడున్నాడని ఆ వర్గం చెబితే నమ్మిన వారిలో ఆయనా ఒకరు. ► దేవుణ్ని కొందరికే ఎందుకు అలా పరిమితం చేశారు? మా బాల్యంలో వినాయక పూజ బ్రాహ్మణులు, కోమట్లు మాత్రమే చేసేవారు. రేగడి మట్టితో చిన్న బొమ్మ చేసి, పూజించి ఇంటెనెక బావిలో వేసి, కోమట్ల ఇంటి మీద రాళ్లు వేసేవారు. వాళ్ల చేత తిట్లు తింటే మంచి జరుగుతుందనేది మరో మూఢ నమ్మకం. ఇప్పుడు దేవుడు మార్కెట్ అయిపోయాడు. కులాన్ని బట్టి దేవుడు, వర్గాన్ని బట్టి దేవుడు పుట్టుకొచ్చారు. గ్రామదేవతలంతా శూద్రుల దేవుళ్లు. రాముడు, కృష్ణుడు, వినాయకుడు అగ్రకులస్తుల దేవతలు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు దేవుణ్ణి సృష్టించుకున్నారనే కదా. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.. ‘మీరు ఎంత అభూత కల్పనలు చేసే ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట మీ భౌతిక జ్ఞానం పనిచేస్తుంది’అని అంటారు. ఉదాహరణకు.. స్వారోచిత మనుసంభవం తీసుకుందాం. ప్రవరుడు అనే ఆయన యజ్ఞయాగాదులు చేసుకునేవాడు. అతడి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చాడు. కైలాసగిరి, హిమాలయాలు అన్నీ తిరిగానని చెప్పాడు. ఓ పసరు వల్ల ఇదంతా సాధ్యమన్నాడు. ప్రవరుడు కోరితే అతని పాదాలకు ఆ పసరు రాసాడు. ప్రవరుడు వెంటనే హిమాలయాలకు వెళ్లాడు. తిరిగివద్దామంటే పసరు కరిగిపోయి రాలేక పోయాడు. అప్పుడు రాళ్లపల్లి వారు ఏమంటారంటే– ‘అంత శక్తి గల పసరు అలా ఎలా కరిగిపోయింది?’ అని. అంటే, ఎక్కడో మన ఇంద్రియ జ్ఞానం పనిచేస్తుందన్నమాట. అయితే ఆ ప్రశ్నించే గుణాన్ని అణచివేస్తే తప్ప పాలకులు మనల్ని పరిపాలించలేరు. అణిచివేతకు సరైన ఆయుధం ‘దేవుడు.’ ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నవి రెండే రెండు శక్తులు.. ఒకటి పెట్టుబడి, రెండవది మూఢభక్తి. ► దేవుడి నుంచి రాజకీయాల్లోకి వెళ్లారు! దేవుళ్ల పరిణామ క్రమం అది (నవ్వుతూ). రాజకీయమే కాదు, వ్యాపారం కూడా అయిపోయాడు దేవుడు. అయోధ్యలో బాబ్రీ మసీదు విషయమే తీసుకుందాం. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే అయోధ్యలో గతంలో ఉన్నది రామ్లల్లా అనే దేవుడి గుడి. రామ్లల్లా మార్వాడీల దేవుడు. మార్వాడీలు చేసేది వ్యాపారం. ఆ విధంగా చూస్తే రాముడు... వ్యాపారుల దేవుడు అనుకోవాలి. ► సృష్టిలో మీకు ఎక్కడైనా దైవాంశం గోచరిస్తుందా? డిగ్రీలో మాకు సంస్కృతం సబ్జెక్ట్ ఉంది. అక్కడ కొన్ని విషయాలు తెలిశాయి. స్త్రీలు సంస్కృతం చదవకూడదు. మాట్లాడకూడదట. అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు సంస్కృతం మాట్లాడుతాడు. శకుంతల శూద్రులు మాట్లాడే పాళీ భాషలో మాట్లాడుతుంది. అంతెందుకు రామాయణంలో రాముడు సంస్కృతం మాట్లాడతాడు, సీత పాళీ భాష మాట్లాడుతుంది. మా లెక్చరర్ని ఓ ప్రశ్న అడిగాను. ‘అయ్యా! సీత, శకుంతల పాళీ భాష మాట్లాడితే రాముడికి, దుష్యంతుడుకి అర్థం అవుతుంది. వాళ్లు రాజుల కాబట్టి అన్ని భాషలు నేర్చుకొని ఉంటారు. మరి రాముడు, దుష్యంతుడు సంస్కృతం మాట్లాడితే సీతకు, శకుంతలకు ఎలా తెలుస్తుంది?’ అని. ఇది ఇప్పటికీ అర్థం కాదు. నేను పండితులను ఇదే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఏర్పరచిన నియమాల వల్ల మీరే దేవతగా పూజించే సీతకు సంస్కృతం రావడానికి వీల్లేదు. రుషి దగ్గర పెరిగిన శకుంతలకు సంస్కృతం రావడానికి వీల్లేదు. నస్త్రీ స్వాతంత్య్రమర్హతి.. స్త్రీకి స్వాతంత్య్రం ఉండకూడదన్నారు. ఇది మనువు నిర్దేశించింది. ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా..?’ అనే ద్రౌపది ప్రశ్నకు ఎలాగైతే సమాధానం లేదో.. దీనికీ లేదు. సంస్కృతమంతా ‘డు’ అంతాలే! అంటే మగవాడికి సంబంధించినవే! తర్వాత రాణులు వచ్చి ఉంటారు కానీ, మన సంస్కృతం రాయబడింది రాజుల గురించే! దేవుడికి స్త్రీ అవసరం లేనప్పుడు, స్త్రీకి దేవుడెందుకు? ఈ సృష్టిలో మనిషికి జన్మనిస్తుంది కాబట్టి స్త్రీయే దేవత. ► మీరు స్త్రీ పక్షపాతి అనుకోవచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం నా నైజం. నాకు ముగ్గురు కూతుళ్లు. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వారికి ఎలా చెప్పాలి?! ఈ సాహిత్యాన్నే వారికీ పరిచయం చేశాను. వాళ్లూ మనిషి సృష్టించిన దేవుణ్ణి నమ్మరు. ► చావు పుట్టుకలను దేవుడి నుంచి వేరుచేసి చూడగలమా? చావు పుట్టుకులను వివరించకపోవడం వల్లే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. పంచేంద్రియాలతో ఈ శరీరం రూపు కడుతుంది. ఆత్మ అనేది పెద్ద అబద్దం. మళ్లీ జన్మ ఉంటుందన్నది కూడా అబద్ధం. మనిషి దేవుడు తన కన్నా గొప్పగా ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడికి నాలుగు తలలు పెట్టాడు. నాలుగు చేతులు పెట్టాడు. నాకంటే గొప్పవాడైన దేవుడికి నాలాగే ఒక్క తలకాయ ఉంటే ఎట్లా బలవంతుడవుతాడు అనుకున్నాడు. అందుకనే ఆ నాలుగు తలల ఊహ. రాక్షసుడికి నాలుగు కాదు పది తలలు ఉండాలనుకున్నాడు. రావణాసురుడికి పది తలలు పెట్టాడు. వాడిని ఒక్క తల ఉన్న మనిషి ఎలా చంపాడంటే, అవతారం అన్నారు! పక్షి లేకుండా విమానం లేనట్టే, ఒక చేప లేకుండా ఓడ లేనట్టే, ఒక మనిషి లేకుండా దేవుడు లేడు. దేవుడికి ప్రాతిపదిక మనిషే! ► మీరు మావోయిజాన్ని నమ్ముతారు. మావోను మీ దైవం అనుకోవచ్చా? మావోయిజం త్యాగం గురించి చెబుతుంది. ఒక మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు ఇంటిని, భార్య బిడ్డలను వదిలేసి అడవుల్లో జీవిస్తాడు. దున్నేవారికే భూమి కావాలి. కష్టం చేసేవాడికే ఫలితం కావాలని పోరాడతాడు. పోరాటం ఎప్పటికీ దైవసంకల్పం కాదు. పరిస్థితుల ప్రోద్బలం. అందుకే నేను మనిషి నమ్ముతాను. మనిషి కోసం కష్టపడే మనిషే దేవుడు. ► కష్టం వచ్చినప్పుడు మీరు ఎవరిని తలచుకుంటారు? మా అమ్మను తలుచుకుంటాను. దైవాలకన్నా గొప్పది అమ్మే! ► ఇప్పుడంటే సరే, మీ చిన్నప్పుడు పండగలు జరపడం, దేవుళ్లను ఆరాధించడం జరగలేదా? మీ పేరులోనే ఒక దేవుడు ఉన్నాడు? మేం ఐదుగురు అన్నదమ్ములం, ఐదుగురు అక్కచెల్లెళ్లు. పదిమందిలో నేను ఆఖరివాడిని. మూలా నక్షత్రంలో పుట్టానని దానికి విరుగుడుగా అళ్వారు స్వాములలో ఒకరిపేరైన వరవరస్వామి పేరు నాకు పెట్టారు మా బాపు. ఆయన పట్వారీ గుమాస్తా. ఆయన కష్టం మా అందరి కడుపు నింపడానికే సరిపోయింది. ఆస్తులు కరిగి పోయాయి. మా మూడో అన్నయ్య టెన్త్ పాసై ఉద్యోగం చేసేవరకూ రెండు పూటలూ గడవని పరిస్థితి. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండేది. తార్కిక సాహిత్యానికి దగ్గరగా ఉండేవాళ్లం. అందుకేనేమో కష్టకాలంలోనూ దేనినీ గుడ్డిగా నమ్మలేదు. పెద్ద పండగ అంటే అంతా సామూహికంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగే తెలుసు. ఇప్పుడు పండగలను కూడా మార్కెట్ శక్తులే శాసిస్తున్నాయి. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
టీడీఎఫ్ బృందాన్ని విడుదల చేయాలి
విడుదలకు యత్నిస్తున్న వారిపై నిర్బంధం తగదు: వరవరరావు హైదరాబాద్: విచారణ లేకుండా ఐదు నెలల నుంచి జైల్లోనే మగ్గిపోతున్న తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) నిజనిర్ధారణ బృందాన్ని వెంటనే విడుదల చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఈ బృందాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై రాజ్య నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడు తూ..గత ఏడాది డిసెంబర్ 25న ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో ఏడుగురు సభ్యులున్న టీడీఎఫ్ బృందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి అప్పగించిందని.. అప్పట్నుంచీ వారంతా ఆ రాష్ట్రంలోని సుకుమా జైల్లో మగ్గిపోతున్నారని ఆయన ఆరోపించారు. వీరి అరెస్టులపై ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులిద్దరూ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. జైల్లో ఉన్న టీడీఎఫ్ నిజనిర్ధారణ బృందం విడుదల కోసం ప్రజాస్వామిక నేతలు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ వారికి మాత్రం బెయిల్ మంజూరు చేయడం లేదన్నారు. టీడీఎఫ్ సభ్యుల్ని బేషరతుగా విడుదల చేయాలని లేదంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీఎఫ్ కన్వీనర్ ఎన్. నారాయణరావు, కోట శ్రీనివాస్, ప్రజాకళామండలి నాయకులు కోటి తదితరులు పాల్గొన్నారు. -
చలినెగళ్లూ.. హేమంత స్వప్నాలూ..
వరవరరావు జ్ఞాపకాల దొంతరలో ఉస్మానియా ఉస్మానియా శత వసంతాల పండుగ సందర్భంగా వర్సిటీతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రముఖ విప్లవకవి వరవరరావు. వర్సిటీలో శ్రీశ్రీ కవిత్వం, చలం సాహిత్యం, చిమ్మచీకటినీ, నిశ్శబ్ద స్తబ్ధతను బద్దలుకొట్టుకొని తెల్లవారుతూ రాజేసిన ‘చలినెగళ్లు’.. పేదరికం అలవాటుగా మిగిల్చిన తెల్లని పైజామా లాల్చీ, నవ యువకుడి ‘హేమంత స్వప్నా’ల్లో పూచిన ‘మల్లెపూలు’.. ఇవన్నీ తన అభ్యుదయ సాహిత్య ప్రయాణానికీ, విప్లవోద్యమంతో పెనవేసుకున్న తాత్విక చింతనకూ పునాదిరాళ్లని చెప్పారు. వరవరరావు జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. అతిథులం.. రూమ్మేట్స్గా.. అంపశయ్య నవీన్కు నేనూ, ఎస్వీ రామా రావుకి జైపాల్రెడ్డి అనాథరైజ్డ్ గెస్ట్లుగా ఉస్మానియాలోకి అడుగుపెట్టాం. తర్వాత రూమ్మేట్స్మి అయ్యాం. తెలుగు ఎంఏలో సీటు రావడంతో 1960 నుంచి 1964 వరకు ఉస్మానియాలో ఉన్నా ను. ఆ సమయంలోనే నా ‘చలినెగళ్ళు’కవితా సంకలనం రాశాను. ఓయూలో ఉన్నంతకాలం శ్రీశ్రీని కలవడం, చలా న్ని చదవడం, హేమకి లేఖలు రాయడం.. ఇదే నా జీవితం. చలాన్ని విపరీతంగా చదివేవాణ్ణి. శ్రీశ్రీ నగరానికి వస్తున్నాడంటే నాకో కార్డుముక్క వచ్చేది. ఆయ న్ను మైసూర్ కేఫ్లో కలిసే వాళ్లం. ‘చలినెగళ్ళు’కి శ్రీశ్రీ ముందుమాట కోసం నాలుగేళ్ళు ఎదురుచూశాను. చివరకు ఆయన రాయకుండానే నా పుస్తకాన్ని అచ్చువేసుకున్నాను. ఇక హేమ (భార్య)పైన రాసిన హేమంత స్వప్నాలు ఇంకా పబ్లిష్ చేయలేదు. మల్లెపూలు కవితలు కూడా ఓయూలో రాసినవే. మూడేళ్లు.. మూడు కవితా బహుమతులు ఉస్మానియా ఆంధ్రా అభ్యుద య ఉత్సవాల్లో 1959–1960–1961లలో వరుసగా మూడేళ్ల పాటు కవిత్వంలో మూడు బహుమతులు సాధించా. రెండు ప్రథమ, ఒక కవితకు తృతీయ బహుమతి వచ్చింది. పొలిటికల్ సైన్స్ చేద్దామనుకుని వచ్చి... ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చేద్దామని నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. కానీ తెలుగు ఎంఏ విభాగంలో మొదటిపేరు నాదే కావడంతో తెలుగులో చేరాను. ఎందుకంటే అలా ఎంపికైతే నాకు 80 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. దాన్నే అప్పుడు బర్సర్ అనేవారు. దాంట్లో 35 రూపాయలు మెస్ చార్జీలకు, 18 రూపాయలు హాస్టల్కు పోను మిగిలినవి జేబు ఖర్చులకు ఉండేవి. ఇక తెలుగులో చేరితే ఉద్యోగం వస్తుందన్న ఆశ ఒకటి అటువైపుగా నడిపించింది. ఇక అంపశయ్య నవీన్ ఎంఏ తెలుగులో చేరాలనుకున్నారు. కానీ నేను వారించి ఎకనమిక్స్ చదవమన్నాను. అలా ఇద్దరం మేం చేరాలనుకున్న కోర్సుల్లో కాకుండా ఇతర సబ్జెక్టుల్లో చేరాం. లాల్చీ, పైజమాతోనే పోల్చుకునేవారు.. పేదరికం, సింప్లిసిటీ నాకు తెల్ల లాల్చీ పైజమాలను అలవాటు చేసింది. నాకోసం ఉస్మానియాకు ఎవరైనా వస్తే.. లాల్చీ, పైజమాలో ఉన్న వ్యక్తి కావాలని అడిగేవారు. అంతలా గుర్తింపుగా మారాయి. అప్పుడు ఎక్కువ మంది పంచె కట్టుకునేవారు. పంచె ఖరీదు కనుక నేను పైజమా వేసుకునేవాణ్ని. డిసెంబర్ 25న హేమతో నా పెళ్ళి జరిగింది (హేమంత స్వప్నం సాకారమైంది). డిసెంబర్ 24న నేను ఉస్మానియా నుంచి బయటకొచ్చాను. పెళ్లిలో మాత్రం పంచెకట్టు. అయితే ‘మల్లెపూలూ, హేమంత స్వప్నాలూ’అచ్చువేయలేదు. విద్యార్థి సంఘాల్లో చురుగ్గా నిజానికి నేను నెహ్రూకు వీరాభిమానిని. ఉస్మానియా తొలి విద్యార్థి సంఘం ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాను కూడా. రాఘవాచారి ఓయూ లా కాలేజీ అధ్యక్షుడిగా పోటీచేస్తే ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం చేశాం. రాఘవాచారి స్టూడెంట్స్ యూనియన్ ఆవిష్కరణకు కృష్ణమీనన్ని పిలిచారు. కృష్ణమీనన్ను సమర్థించే వాళ్లంతా అభ్యుదయవాదులని భావించేవాళ్లు. సంఘ్పరివార్ వ్యతిరేక భావాలకు పునాది పడింది అక్కడే. -
తిరోగమనవాదాలను తిప్పికొడదాం
ప్రగతిశీల పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో వక్తలు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పులకించింది. అప్పుడెప్పుడో ఇక్కడ ఉద్యమ పాఠాలు నేర్చి నేడు దేశరాజకీయాల్లో ఉద్దండులుగా నిలిచిన తన పూర్వ విద్యార్థుల రాకతో ఉప్పొంగి పోయింది. జనాన్ని ఉర్రూతలూగించిన ప్రజాకవులు, గాయకుల పలకరింపులతో తన్మయత్వం చెందింది. ప్రతిభాపాటవాలతో దేశవిదేశాల్లో తన ప్రతిష్టను చాటిచెప్పిన మేధావులను చూసి మురిసిపోయింది. ఈ అపూర్వ సన్నివేశం ఉస్మానియా వర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం(జార్జిరెడ్డి హాల్)లో శుక్రవారం జరిగిన ప్రగతిశీల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చోటు చేసుకుంది. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రగతినిరోధక, మతోన్మాద, హిందూత్వ తిరోగమన వాదాలను తిప్పికొట్టేందుకు మరింత సంఘటి తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కె.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో తొలి విప్లవ విద్యార్థి ఉద్యమ నాయ కుడు బూర్గుల నర్సింగరావు మాట్లాడుతూ 1948 పోలీస్ యాక్షన్ అనంతరం అత్యధిక శాతం మంది వాడే ఉర్దూ భాషకి బదులు ఆంగ్ల భాషని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియాలో తొలి ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు. అనేక ఉద్యమాలకు ఊతమిచ్చిన ఉస్మానియా విద్యారి ్థలోకం దేశ విద్యార్థి ఉద్యమ చరిత్రలోనే ముఖ్యపాత్ర వహించింద న్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ నేడు దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి ఉద్యమాల ప్రభా వాన్ని తగ్గించాలనే పాలకవర్గాల కుట్రలో భాగంగా పీహెచ్డీ, ఎం.ఫిల్ సీట్లను కుదించి దళిత, ఆదివాసీ, మైనారిటీ విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లోకి రాకుండా చేస్తున్నారన్నారు. వామపక్షపార్టీల ఐక్యతా దిశగా పయనిస్తున్నామని, త్వరలోనే దాన్ని సాధిస్తా మని అన్నారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రగతిశీల ఉద్యమాలను అణచివేసే హత్యాఘటనలకు ఉస్మానియా ప్రత్యక్షసాక్షిగా నిలిచిందన్నారు. ప్రజాగాయకులకు పుట్టినిల్లు: సత్యనారాయణ ప్రజాగాయకులను, మహిళా ఉద్యమకారులను మన కందించిన ఉస్మానియా చరిత్ర చిరస్థాయిగా ఉంటుందని తెలుగు వర్సిటీ వీసీ ఎస్.వి. సత్య నారాయణ అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమం, దళిత్ పాంథర్స్ ఉద్యమాలు స్ఫూర్తినిచ్చా యని గద్దర్ అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల కొచ్చిన తాము గ్రామాలకు తరలండి అనే నినాదంతో గ్రామాలకు చేరుకున్నామని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీల్లో దళిత, అస్తిత్వ ఉద్యమాలు జరిగిన విధంగా తెలంగాణ పోరాటం సైతం రాజకీయాలకతీతంగా ఉస్మానియా విద్యార్థు లంతా పాల్గొన్నారని అన్నారు. ఉస్మానియాతోపాటే బోల్షివిక్ విప్లవానికీ వందేళ్లు: వరవరరావు విప్లవాల పురిటిగడ్డ ఉస్మానియాతోపాటే బోల్షివిక్ విప్లవానికి సైతం నూరు వసంతాలు పూర్తికావడం యాదృచ్ఛికం కాదని విరసం నేత వరవరరావు అన్నారు. బోల్షివిక్ విప్లవ స్ఫూర్తినీ, షహీద్ భగత్సింగ్ విప్లవ త్యాగనిరతిని పుణికి పుచ్చుకున్న చరిత్ర ఒక్క ఉస్మానియాకే దక్కిందన్నారు. ప్రజా పోరాటయోధులు మల్లోజుల, పటేల్ సుధాకర్లు ఉస్మానియాలా కాలేజ్ విద్యార్థులేనని, తెలంగాణ సాయుధ పోరాట పిలుపునిచ్చిన మగ్దుం మొయీనుద్దీన్, రాజ్బహదూర్గౌర్ల స్ఫూర్తి ఇక్కడుందని అన్నారు. ప్రగతి శీల ఉద్యమంతో ప్రారంభమై స్త్రీల అస్తిత్వ ఉద్యమాలకు పునాదులు వేసిన సమానత్వ చరిత్ర నేటికీ స్ఫూర్తిదాయకమని ప్రగతిశీల మహిళా సంఘం వ్యవస్థాప కురాలు కె.లలిత అ న్నారు. పీడీఎస్ యూ, ఎఐ ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, టీవీవీ, డీఎస్యూ, టీవీఎస్, పీడీఎస్యు (విజృం భణ) లాంటి ప్రగతిశీల విద్యార్థి సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. నాటి రష్యా బోల్షివిక్ విప్లవం వెదజల్లిన విప్లవ భావాలు నేటికీ ఇక్కడ సజీవంగా ఉన్నాయని న్యూడె మొక్రసీ నాయకుడు ప్రదీప్ అన్నారు. నాటి విద్యార్థి అమరులు జార్జిరెడ్డి, మధు సూధన్రాజ్, రంగవల్లి, మారోజు వీరన్నల త్యాగాలు విప్లవం పట్ల అచంచల విశ్వాసాన్ని నింపుతున్నాయని అన్నారు. -
'ఆయన జైల్లోనే చనిపోతారేమో'
హైదరాబాద్: దళితులు, ఆదివాసీలు, మైనార్టీల గురించి మాట్లాడితే.. ప్రభుత్వం వారిపై నక్సల్స్ అనే ముద్ర వేస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. భావప్రకటనా హక్కును కాలరాస్తోందని అన్నారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యాలయంలో రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవయసు కావడంతో అనేక వ్యాధులకు గురైన సాయిబాబాకు సరైన మందులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. చత్తీస్గఢ్లోని పోలీసు బలగాల మారణకాండను ప్రపంచానికి తెలియజేయడానికి వెళ్లిన టీడీఎఫ్ నాయకులను పోలీసులు అక్కడే నిర్భందించారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. టీపీఎఫ్ అధ్యక్షుడు నలమాస కృష్ణ మాట్లాడుతూ... ఈ నెల 23న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సాయంత్రం 6 గంటలకు రాజకీయ ఖైదీల విడుదల పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
బేలా సోమారి కోసం!
సందర్భం బస్తర్లో బేలా సోమారి (హక్కుల కార్య కర్త) ఇంటి మీద దాడి జరగడం ఇది రెండోసారి. ఇది ఐజీ కల్లూరి భాషలో స్వచ్ఛందంగా ఆదివాసీలు చేసిన దాడి. కాని ఇది కల్లూరి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం, రాజ్యం చేసిన దాడి. హిమాంశు కుమార్తో ప్రారంభించి ఇప్పటి వరకు బస్తర్లో బయట సమాజం నుంచి వచ్చిన ప్రజాస్వామ్య వాదులు ఎవరూ ఉండకుండా తరిమేయగలిగారు. ఒక్క బేలా భాటియా విషయంలోనే అది సాధ్యం కావడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ మేధావి తాను ఆదివాసీగా మారి బేలా సోమారి అయింది. ఆమె విదేశాల్లో చదవవచ్చు, అక్కడే పీహెచ్డీ చేయ వచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో ప్రొఫెసర్ కావచ్చు. ఒకసారి ఢిల్లీ బస్తీలలో, మురికివాడల్లో పనిచేయాలని ఎంచుకున్నదంటే వాటిని తన ఆవాసాలుగా మార్చుకుంటుంది. దండకారణ్యంలో ఆదివాసీ సమాజం గురించి చదవడానికీ, చదువు చెప్పడానికీ చేరిందంటే ఆమె దండకారణ్యంలో భాగమైన గడ్చిరోలీ, బస్తర్ ప్రజల మధ్య ఉండడానికి ఎంచుకుంటుంది. ఆమె మొదటిసారి దండకారణ్యంలోకి వెళ్లే ప్రయత్నంలో నన్ను కలిసింది. ఇటువంటి వాళ్లతో మనకు ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు, కానీ తమ విశ్వాసాలతో పాటు మన విశ్వాసాలను కాపాడడానికి వాళ్లు ప్రాణాలు ఒడ్డడానికైనా వెను కాడరు. ఇవాళ ‘బస్తర్ను కాపాడుకుందాం’ అని నినదించే వాళ్లందరికీ ఆమె ప్రతీక. బాసగూడ మారణకాండ తరువాత బొజ్జా తారకం నాయ కత్వంలో సీడీఆర్ఓ నిజ నిర్ధారణ కమిటీ వెళ్లి వచ్చిన తరువాత ఆర్డిఎఫ్, హైదరా బాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నది. బస్తర్ పరిస్థితులను వివరిస్తూ ‘బస్తర్ అడవుల్లో ఒక ఆదివాసీ మహిళ మీదనో, పిల్లల మీదనో ఒక దాడి, ఒక అత్యాచారం, ఒక అన్యాయం జరిగిందంటే పోలీసుస్టేషన్లో ఎఫ్ఐ ఆర్ నమోదు చేయడమే ఒక విప్లవం’ అన్నారామె. అప్పటి నుంచి ఇప్పటి వరకు బేలా సోమారి లాంటి వాళ్లు ఆ కృషిని ముందుకు తీసుకువెళ్లారు. ఆదివాసీ యువకుల చేతులకు మారణాయుధాలు ఇచ్చి తమ తోటి ఆదివాసుల పైనే దాడులు చేయించి, చంపిం చడం; ఆదివాసీ సమాజంలో ఒక అంతర్యుద్ధం వంటి కల్లోలాన్ని సృష్టించడమేనని సుప్రీంకోర్టు అభిశంసించింది. ఒక్క 2016లోనే ఛత్తీస్గఢ్లో 134 బూటకపు ఎన్కౌంటర్ హత్యలు జరిగాయి. ఆదివాస మహిళల మీద భద్రతా బలగాలు సామూహిక లైంగిక అత్యాచారాలు చేశాయి. వీటిని జాతీయ మానవ హక్కుల కమిషన్ దాకా తీసుకురాగలిగారు. బేలా సోమారి ఇంటిపై దాడికి కొంచెం ముందే మరో హక్కుల కార్యకర్త శాలినీ గేరాపై రద్దయిన నోట్ల మార్పిడి కేసు పెట్టారు. అంతకు కాస్త ముందు డిసెంబర్ 25న తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం బృందం సభ్యులు ఏడుగురు నిజ నిర్ధారణకు వెళ్తూ ఉంటే తెలంగాణ పోలీ సులే దుమ్ముగూడెం దగ్గర అరెస్టు చే¯ì సుక్మా పోలీసులకు అప్పగించారు. రెండుసార్లు బెయి ల్ను నిరాకరించగా ఛత్తీస్గఢ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద వీళ్లు సుక్మా జైలులో మగ్గుతున్నారు. వీరిలో బల్లా రవీంద్రనాథ్ స్వయంగా రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి రెండు తెలుగు రాష్ట్రాల చాప్టర్కు కార్యదర్శి. ఆయనా, చిక్కుడు ప్రభా కర్ హైకోర్టు న్యాయవాదులు. రమడాల లక్ష్మయ్య తుడుందెబ్బ ఆదివాసీ సంఘం నాయ కుడు. దుడ్డు ప్రభాకర్ రెండు దశాబ్దాలుగా కుల నిర్మూలన పోరాట సమితి రెండు తెలుగు రాష్ట్రాల నాయకుడు. దుర్గాప్రసాద్ సీనియర్ జర్నలిస్టు. రాజేంద్రప్రసాద్, నజీర్ ఉస్మానియా యూనివర్సిటీలో రిసెర్చ్ స్కాలర్లు. రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ విద్యార్థి వేదిక ఉపాధ్యక్షుడు. నజీర్ తెలంగాణ విద్యార్థి వేదిక ఉస్మానియా క్యాంపస్ బాధ్యుడు, రచయిత, వక్త. వీళ్ల అరెస్టు సందర్భంలోనే ఐజి కల్లూరి తాను ఉండి ఉంటే వాళ్లను కోర్టుకు అప్పగించేవాడిని కాదని, ఇక నుంచి అంటే 2017లో ‘తెల్ల కాలర్ మావోయిస్టు’లను వేధించే అజిత్ దోవల్ డాక్ట్రిన్ (సిద్ధాంతాన్ని) అమలు చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటించాడు. ఎన్ఆర్పి కల్లూరి మారణకాండను అమలుచేస్తూనే ఉన్నాడు. 2009లో గ్రీన్హంట్ ఆపరేషన్గా ప్రారంభమైన ఈ ప్రజల మీది యుద్ధం మూడు దశలు దాటి ఆపరేషన్ విజయ్, హాకా, మిషన్ 2016లలో కూడా విఫలమై, ఇప్పుడు మిషన్ 2017గా ఆదివాసీ ప్రజలతో పాటు ప్రజాస్వామ్యవాదులపై అమలవుతున్నది. దాని పేరే ‘సఫేద్ కాలర్ మావోయిస్టు’ల అణచివేత. బేలాపై దాడి అనంతరం తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఐజీ కల్లూరిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. ఆయన మాట్లాడుతూ బేలా బాటియా గెలిచింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సంద ర్భంగా బేలా ఒక మాటన్నారు. ‘పోరాటం కల్లూరిమీద కాదు. కల్లూరివంటి వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ విధానాల మీద’. బుద్ధిజీవులకు, ప్రజాస్వామ్యవాదులకు న్యాయం పట్ల, ప్రజా స్వామ్యం పట్ల అంత నిజాయితీతో కూడిన ప్రేమ, పక్షపాతం ఉంటే అది ఒక్కటే ఇవాళ రాజ్యహింసను, రాజ్యం దాడిని ఎదు ర్కోవడానికి మిగిలిన ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామిక మార్గం. బేలా సోమారి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెను అక్కడి నుంచి పంపించాలని రాజ్యం చేస్తున్న కుట్రను ప్రతిఘటిస్తూ, ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న ప్రపంచీకరణ విధ్వంసక అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం కూడా ఆశ యంగా, లక్ష్యంగా నిర్దేశించుకోవడమే ఇవాళ మన కర్తవ్యం. వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు -
చంద్రబాబు ‘చాణక్య’ రాజనీతి
అభిప్రాయం రెండు వేల ఎకరాల చింతపల్లి అడవులను దుబాయ్ కంపెనీకి అప్పగించడంపై గత ఇరవై ఏళ్లుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఆదివాసులపై, వారి మధ్యనున్న మావోయిస్టులపై ప్రభుత్వాలు జరిపిన రాజ్యహింసను ఇక్కడ మళ్లీ ప్రస్తావించనక్కర్లేదు. ‘చిలకా చెప్పింది అక్షరాలా నిజం...!’ అంటూ దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య ఎన్కౌంటర్ పేరుతో ఏఓబీ ఘటనపై.. ‘చాణక్యుడు’ ఒక పోస్టర్ వేశాడు. ఆలకూరపాడులో జరిగిన మున్నా సంతాప సభలో ఏఓబీ ఘట నపై ఏపీసీఎల్సీ స్పందనగా దీనిని పేర్కొన్నది. చిలకా చంద్రశేఖర్ చేసిన ప్రసంగంలో ఇది దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్యన జరిగిన ఎన్కౌంటర్గా ఆయన అన్నట్లుగా పేర్కొన్నది. దీనిపై ఈ ‘చాణక్యుడు’ చాలా వ్యాఖ్యానం చేశాడు. ఈ పోస్టర్లో మావోయిస్టులు విశాఖ మన్యంలో ఒక సంవత్సర కాలంలో చేసే వసూళ్ల వివరాలు వాళ్లు రాసుకున్న డాక్యుమెంట్ల ప్రకారమే అంటూ ఇచ్చారు. అవి అక్రమమైనవని కూడా పేర్కొన్నారు. ఆ మొత్తం రెండు కోట్ల నలభై లక్షల రూపాయలని, అట్లే గిరిజనుల నుంచి వారి పంట దిగుబడిలో 1/3వ వంతు వసూలు చేస్తారని, గిరిజనులకే చెందాల్సిన ఈ సొమ్మంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నిస్తూ, ముసుగు సంఘాల నేతలారా ఇందులో మీ వాటా ఎంత అని ప్రశ్నించింది. రాజ్యాంగం ఆదివాసులకు జల్, జంగల్, జమీన్ల మీద ఇచ్చిన అధికారాలే కాకుండా, తెలుగు నేల మీద 1/70 మొదలు పెసా వరకు చట్టాలే కాకుండా, ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులన్నీ ప్రభుత్వంలో రాజకీయాధికారంలోను, రాజ్యాంగ యంత్రంలోను ఉన్నవాళ్లు ఎవరెంత తింటున్నారో, ఇటువంటి ఒక పారదర్శక జాబితాను చాణక్యుడు ఇవ్వగలడా? ఈ విశాఖ మన్యం ప్రాంతంలోనే నదుల మీద చేసిన నిర్మాణాలు, పవర్ హౌజ్లు, బాక్సైట్ తవ్వకాలు, కాఫీ తోటలు మొదలైన ఎన్నో రూపాల అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వంలో రాజకీయాలలో, పరిపాలన యంత్రాంగంలో ఉన్న వాళ్లకు, కాంట్రాక్టర్లకు, తాబేదార్లకు చెందుతున్నదెంత? ఆదివాసులకు చెందుతున్నదెంత? గిరిజనుల పంట దిగుబడిలో మూడో వంతు మావోయిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్న చాణక్యుడు ఈ పంట పండించడానికి వాళ్లు చేస్తున్న పోడు భూములు ఆదివాసేతరులు ఆక్రమించుకుంటుంటే తానేం చేశాడో చెప్పగలడా? మావోయిస్టులు అక్కడ గడ్డి వేళ్ల స్థాయినుంచి అమలు చేస్తున్న అభివృద్ధి గురించి ఇటీవల నిజనిర్ధారణకు వెళ్లి వచ్చిన సీడీఆర్ఓలోని నలభైమంది బృందంలో ఒకరైన ప్రొ‘‘ కాత్యాయని విద్మహే చాలా వివరమైన వ్యాసం రాశారు. ‘మావోయిస్టులు తొలుతగా భూమి సమస్యను తీసుకుని ఆదివాసులను కూడగట్టారు. మద్యం వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసే సోండీల ఆక్రమణలో ఉన్న రెండు వందల ఎకరాల భూమిని ప్రజాపరం చేయడానికి ఉపక్రమించారు. ఈ ఉద్యమం విజయవంతం అయ్యేంత వరకు ప్రజల వెంటే ఉన్నారు. ప్రజలతోనే ఉన్నారు. ఈ భూమిని స్వాధీన పరిచి, ప్రజలకు పంచి, వ్యవసాయం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇప్పటికీ ప్రజల ఆధీనంలో ఆ భూములు సాగవుతూనే ఉన్నాయి. భూమిని స్వాధీనం చేసుకొని భూమిలేనివారికి పంచడం ఒక కార్యక్రమంగా మావోయిస్టులు ఆదివాసుల హృదయాలను గెలుచుకున్నారు. రైతాంగ సదస్సులను నిర్వహించి, వ్యవసాయ ఉత్పత్తిలో అభివృద్ధి మార్గాల గురించి ప్రజలతో చర్చించారు. శ్రమ, సహకార సంఘాలను ఏర్పరిచారు. సమష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. ఈ పద్ధతిలో ఎవరి భూమి వాళ్లు సాగు చేసుకోవడంగా కాక, అందరూ కలసి సాగుయోగ్యమైన భూమినంతటిని ఏకఖండంగా చేసి పనిచేశారు. ఈ క్రమంలో సాగుభూమి లేని వాళ్లు ఎంత ప్రయోజనం పొందారో, భూమి ఉన్నవాళ్లు కూడా వ్యక్తిగతంగా అంతగా లాభపడ్డారు. 26, 27 గ్రామాలలో ఈ విధంగా శ్రమ సహకార పద్ధతిలో జరిగిన వ్యవసాయం వల్ల వచ్చిన ఫలితాలతో మిగిలిన చోట్ల కూడా ప్రజలు ఇలాంటి పద్ధతిలో సాగుచేయడానికి చొరవ తీసుకున్నట్టు తెలిసింది. నిత్య జీవితాల కోసం చేయవలసిన ప్రయాణాలు, సౌకర్యాల కల్పన కోసం ఆదివాసులను కూడగట్టడం మావోయిస్టులు చేసిన మరొక ముఖ్యమైన పని. అందులో భాగంగానే బలిమెల వాగులో పడవలు పెట్టాలనే డిమాండ్ పెట్టి సాధించుకోగలిగారు. చేపలు పడితే కట్టాల్సిన పన్ను రద్దు కోసం పోరాడి సాధించారు. ఆదివాసులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలోను మావోయిస్టులు విశేష కృషి చేశారు. కటాఫ్ ఏరియాల గ్రామ నిర్మాణాల నుండి కొంతమందిని ఎంపిక చేసి, తగిన శిక్షణ ఇచ్చి, ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య బృందాలను ఏర్పరిచారు. చాణక్యుడు మావోయిస్టులు ఆదివాసుల నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. వైద్యం విషయంలో ప్రభుత్వం ఆధునిక వైద్యాన్ని మారుమూలలకు పంపించే ప్రయత్నం చేస్తుంటే మావోయిస్టులు అడ్డుపడుతున్నారని చెప్పాడు. వాస్తవం ఏమిటంటే మావోయిస్టులు ఇంటింటికీ రూ. 100 వసూలు చేసి తెప్పించిన మందులతో వాళ్లు గ్రామాలలో ఏర్పాటు చేసిన వైద్య బృందాలు స్థానిక ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నాయి. మావోయిస్టుల ఈ వైద్య విధాన ఫలితమే ప్రభుత్వం ‘మెడికల్ లాంచ్’ల ఏర్పాటు. విద్య విషయంలో మావోయిస్టులు ప్రస్తుతానికి వయోజనులకు రాత్రి బడులు నడిపే తొలి దశలో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల సక్రమ నిర్వహణకు బాధ్యులుగా అధ్యాపకులను చైతన్యపరిచేందుకు కృషి చేస్తున్నారు. దాని ఫలితంగానే కొన్ని గ్రామాలలో బడికి వచ్చే పిల్లల సంఖ్య పెరుగుతున్నది. కాఫీ ప్లాంటుల్లోకి చొచ్చుకుపోయిన మావోయిస్టులు బాక్సైట్ సమస్యలపై సంఘటితం అవుతున్న ఆదివాసులకు వెన్నుదన్నుగా ఉన్నారు. దాని ఫలితమే ఇరవై ఏళ్లుగా దాన్ని నిలువరించగలిగారు. ఉద్యమ ఉధృతికి జీవోలు రద్దు చేసుకున్నారు. సమర్థ పాలకుడు దేశాన్ని సక్రమంగా పరిపాలిస్తున్నప్పుడు దొంగలు, దోపిడీదారులు, తీవ్రవాదులు ఉక్కిరిబిక్కిరై ‘సమాజంలో అవినీతి, అసమానతలు, అసహనం పెరిగిపోయిం ద’ని ఫిర్యాదు చేస్తారని చాణక్యుడు తన పోస్టర్లో ముక్తాయించాడు. ఇవాళ దేశంలో ఉన్న అవినీతి, అసమానత, అసహనాల గురించి దొంగలు, దోపిడీదారులు, తీవ్రవాదులు మాత్రమే మాట్లాడుతున్నారా? ప్రజలు మాట్లాడుతున్నారా? అనే విషయాన్ని ప్రజల విజ్ఞతకే వదిలేస్తూ చాణక్యుని కుటిలబుద్ధి గురించి దీన్ని బట్టి అంచనా వేయగలరని భావిస్తున్నాను. (వ్యాసకర్త : వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు ) -
బోల్షివిక్ విప్లవ స్ఫూర్తితో పోరాడాలి
న్యూ డెమొక్రసీ జాతీయ సదస్సులో వరవరరావు సాక్షి, హైదరాబాద్: బోల్షివిక్ విప్లవ స్ఫూర్తి తో అందరూ పోరాడాలని విరసం నేత వరవరరావు పిలుపునిచ్చారు. ఆటుపోట్లు ఎదురైనా అంతిమ విజయం విప్లవానిదేన న్నారు. అక్టోబర్ విప్లవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం న్యూ డెమొక్రసీ నేతృత్వంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన ప్రసం గించారు. నేడు దేశాన్ని శాసిస్తోన్న ఫాసిస్టు భావజాలం కేవలం మోదీతో మొదలవలే దని, నాటి రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీలిద్ద రూ ఫాసిస్టు పోకడల్లో మోదీకి పూర్వీకులని వరవరరావు అన్నారు. జరుగుతున్నవన్నీ భూపోరాటాలే.. న్యూ డెమొక్రసీ జాతీయ నాయకురాలు టాన్యా మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పోరాటాలన్నీ భూపోరాటాలేనని అన్నారు. సింగూరు, నందిగ్రాం, మొదలుకొని, సోం పేట, కాకరాపల్లి, నేడు ఆంధ్రప్రదేశ్లో బల వంతపు భూసేకరణకి వ్యతిరేకంగా జరుగు తున్న ఉద్యమాలన్నింటికీ భూమే కేంద్రమని అన్నారు. ప్రజల భూపోరాటాలను బలోపే తం చేయాలన్నారు. సాదినేని వెంకటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో తమిళనాడు సీఎస్ఎఫ్ నాయకులు బాలన్, మహారాష్ట్ర మార్క్స్స్ట్లెనినిస్ట్ పార్టీ నాయ కుడు అశోక్, తమిళనాడు సీపీఐ ఎంఎల్ నాయకులు భాస్కర్, గుర్రం విజయ్ కుమార్, వేములపల్లి వెంకట్రామయ్య తది తరులు ఉపన్యసించారు. టాన్యా రచించిన ‘భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ’ పుస్తకాన్ని వరవరరావు.. ఎన్.విజయశేఖర్ రచించిన ‘మహత్తర అక్టోబర్ రష్యా విప్లవం’ పుస్తకాన్ని టాన్యా ఆవిష్కరించారు. -
కేసీఆర్ నియంతృత్వ పోకడలు
ప్రజాస్వామిక వేదిక ప్రతినిధులను విడుదల చేయాలి: వరవరరావు న్యూశాయంపేట: నియంతృత్వ పోకడల్లో కేసీఆర్ గత పాలకుల ను మించి పోయాడని విరసం నేత వరవరరావు విమర్శించారు. సోమవారం హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వారిపై పోస్టర్ వేయడం చూస్తుంటే రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 54 సంస్మరణ సభలు పెట్టుకున్నప్పుడు లేని నిర్బంధం నేడు తెలంగాణలో ఉందన్నారు. ఎన్కౌంటర్ ఘటనపై నిజనిర్ధారణ కోసం ఛత్తీస్గఢ్కు వెళుతున్న తెలంగాణ ప్రజాస్వామిక వేదిక బృందం నేతలైన దుడ్డు ప్రభాకర్, చిక్కుడు ప్రభాకర్, రవీంద్రనాథ్ తదితరులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి కుంట పోలీస్ స్టేషన్కు తరలించారని, వారిని వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మడమ తిప్పకుండా ఉద్యమాలు చేసిన టీపీఎఫ్ నాయకులు ఆకుల భూమయ్య సంస్మరణ సభను జరుపుకోవడానికి కూడా అనుమతించకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో కాత్యాయని, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ పాల్గొన్నారు. -
తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది
డీటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో విరసం నేత వరవరరావు నల్లగొండ టూ టౌన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దొరల పాలన నడుస్తోందని విరసం నేత వరవరరావు ధ్వజ మెత్తారు. నల్లగొండలో జరుగుతున్న డీటీఎఫ్ విద్యా వైజ్ఞానిక నాలుగో రాష్ట్ర సభలు సోమవారం ముగిశాయి. చివరిరోజు ముఖ్యఅతి«థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్సహా ఆ నాలుగు కుటుంబాలు మాత్రమే ప్రయోజనం పొందాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి సమైక్యాంధ్రప్రదేశ్ పాలన వరకు ఎవరూ వ్యవహరించని విధంగా విమలక్కను, కార్యకర్తలను బయటకు వెళ్లగొట్టి అరుణోదయ సాంస్కృతిక కార్యాల యాన్ని మూసివేయించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. 1996లో కూడా ప్రపంచ బ్యాంకు ఆదేశాలు పాటించి సమైక్య రాష్ట్రానికి సీఈవోగా వ్యవహరించిన చంద్ర బాబు రాష్ట్రంలో నెత్తుటేరులు పారించాడన్నారు. కొత్తగూడెం ఏజెన్సీ ఏరియాలో ఓ గోండు యువకుడు సింగరేణిలో ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైతే.. అతడిని ఉద్యోగంలో చేరవద్దని వేధించారని చెప్పారు. సదరు యువకుడు ఆగస్టులో విజయవాడలో జరిగిన సివిల్ పరీక్షకు వెళ్లి నేటికీ తిరిగి రాలేదన్నారు. మెరిట్లో అతడి తర్వాత ఉన్న వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోందన్నారు. కరెన్సీ రద్దు తర్వాత పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కాషాయీకరణ, విద్య వ్యాపారీకరణను వ్యతిరేకించి కామన్ విద్య కోసం ఉద్యమించాలని వరవరరావు పిలుపునిచ్చారు. సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రఘుశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టప్ప, జ్వాల సంపాదకుడు గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.