
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్ వారెంట్ అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ట్రాన్సిట్ వారెంట్ను రెండు రోజులపాటు నిలిపేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు.
మహారాష్ట్ర పోలీసులు తనను పుణేకు తీసుకెళ్లేందుకు వీలుగా హైదరాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ట్రాన్సిట్ వారెంట్ను సవాలు చేస్తూ వరవరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మహదేవ్ వాదనలు వినిపిస్తూ, గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావుకు చికిత్సను అందించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా, ఆయనకు చికిత్స అందలేదని తెలిపారు.