రూపాయి పరిహారం ఇచ్చినా చాలు : రేవంత్‌ | how much compensation is needed for Reventh reddy - high court | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు ఎంత పరిహారమిస్తారో చెప్పండి 

Published Thu, Feb 7 2019 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

how much compensation is needed for Reventh reddy - high court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో ఆయనకు ఎంత పరిహారం చెల్లిస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లింపులో మీ వైఖరి ఏమిటో తెలపాలంది. రేవంత్‌ది అక్రమ నిర్బంధం కాదని, ఆయన అరెస్ట్‌కు దారితీసిన పరిస్థితులను కోర్టు ముందు ఉంచుతామని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు రేవంత్‌రెడ్డిని అక్రమం గా నిర్బంధించారని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ రేవంత్‌ సన్నిహితు డు వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం, పోలీసులపై నిప్పులు చెరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యక్తిగత హాజరుకు సైతం ఆదేశాలు ఇచ్చింది.  

వ్యాజ్యంపై విచారణ అనవసరం.. 
తాజాగా ఈ వ్యాజ్యంపై బుధవారం ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యంపై తదుపరి విచారణ అవసరం లేదన్నారు. రేవంత్‌ను అప్పుడే విడిచిపెట్టేశామని, దీనిని మూసేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అంతేకాక ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయరాదని అభ్యర్థించారు. వ్యాజ్యం మూసివేతపై అభిప్రాయం చెప్పాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డిని ధర్మాసనం కోరింది. పిటిషన్‌ను మూసేస్తే పోలీసులు పిటిషనర్‌తో వ్యవహరించినట్లుగానే ఇతరులతోనూ వ్యవహరిస్తారని మోహన్‌రెడ్డి చెప్పారు. పరిహారం అయితే ఇప్పించాలని, అది లక్ష అయినా, రూపాయి అయినా అభ్యంతరం లేదని, పరిహారం చెల్లించడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసినట్లు రుజువవుతుందని తెలిపారు. ఈ సమయంలో ఏజీ జోక్యం చేసుకుం టూ రేవంత్‌ది అక్రమ నిర్బంధం కాదని, సీఎం సభ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారంతో ముందస్తుగా అరెస్ట్‌ చేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement