ఇవాంకా విచ్చేశారు.. సగం సమయం ‘రిజర్వ్‌’కే | Ivanka tour details | Sakshi
Sakshi News home page

ఇవాంకా విచ్చేశారు.. సగం సమయం ‘రిజర్వ్‌’కే

Published Tue, Nov 28 2017 2:11 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Ivanka tour details - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వద్ద ఇవాంకా ట్రంప్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెరికా నుంచి ప్రతినిధులు, డెలిగేట్ల బృందంతో కలసి బయలుదేరిన ఆమె.. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ ఇవాంకా ఉల్లాసంగా కనిపించారు. ఎయిర్‌పోర్టులో అమెరికన్‌, తెలంగాణ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. తర్వాత నేరుగా ఆమె బస చేసే హోటల్‌కు వెళ్ళారు. అయితే తొలి నుంచీ ఇవాంకా పర్యటన వివరాలను గోప్యంగా ఉంచిన ప్రభుత్వాలు.. తుదివరకు అదే గోప్యతను పాటించాయి. హెచ్‌ఐసీసీకి పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉండే ట్రైడెంట్‌ హోటల్‌లో ఇవాంకా బస ఏర్పాట్లు చేసినట్లు పర్యటన తుది షెడ్యూల్‌ విడుదలైంది.



కానీ పోలీసు యంత్రాంగం, అమెరికా నుంచి వచ్చిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీ అధికారులు ట్రైడెంట్‌తో పాటు వెస్టిన్‌ హోటల్‌లోనూ పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి 9.20 గంటల వరకు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన కొనసాగుతుంది. సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో.. ఏకంగా 18 గంటల పాటు రిజర్వ్‌ టైమ్‌గా నిర్దేశించారు. మంగళవారం తెల్లవారుజామున విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకోనున్న ఇవాంకా మధ్యాహ్నం 2.50 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయాన్ని షెడ్యూల్‌లో ‘రిజర్వ్‌’గా చూపారు.

సాయంత్రం ప్రధాని మోదీతో కలిసి ప్రపంచ పారిశ్రామిక సదస్సు ప్రారంభోత్సవంలో.. రాత్రికి భారత ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చే విందులో పాల్గొంటారు. రెండో రోజు బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్‌లో ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్‌ హోటల్లో భేటీ అవుతారు. సాయంత్రం 5:35 గంటలకు హోటల్‌ ఖాళీ చేయనున్న ఇవాంకా.. రాత్రి 8.20కి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యలో ఏం చేస్తారన్నది షెడ్యూల్‌లో పేర్కొనలేదు. అయితే ఇలా షెడ్యూల్‌లో చూపని, ‘రిజర్వ్‌’గా పేర్కొన్న ఖాళీ సమయాల్లో ఇవాంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారా.. అన్నది ఆసక్తి రేపుతోంది. ఆమె చార్మినార్‌ను సందర్శించే అవకాశముందన్న నేపథ్యంలో.. పోలీసు యంత్రాంగం ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 

ఇవాంకా పర్యటన వివరాలు
28వ తేదీ (మంగళవారం)
- 3.00 తెల్లవారుజామున: ఇవాంకా శంషా బాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను బస చేసే హోటల్‌కు వెళ్ళారు.
మధ్యాహ్యం 2.50 వరకు: రిజర్వ్‌ సమ యం (అధికారులు వివరాలు వెల్లడించకుండా.. ‘రిజర్వు’గా పేర్కొన్నారు)
- 3.00: ఇవాంకా హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు.
3.10– 3.25: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ
- 3.35– 3.55: ప్రధాని మోదీతో భేటీ
4.00–4.25: భారత స్టార్టప్‌ల అధునాతన ప్రదర్శన ‘ది ఇండియన్‌ ఎడ్జ్‌’ను తిలకిస్తారు.
- 4.25: ప్రధాని మోదీతో కలసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారు.
- 4.45–4.50: ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు.
5.15–5.45: ప్లీనరీ సెషన్‌లో ‘మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు– నాయక త్వం’పై నిర్వహించే చర్చాగోష్టికి ప్యానెల్‌ స్పీకర్‌గా ఉంటారు.
5.50–6.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
- 7.15: హోటల్‌ నుంచి బయల్దేరుతారు.
8.00: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు.
- 8.05–8.20: ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’పేరుతో ఏర్పాటు చేసే భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శనను తిలకిస్తారు.
- 8.20–8.35: భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌షోను తిలకిస్తారు.
- 8.45: ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో కలసి విందులో పాల్గొంటారు.
- 10.00: ఫలక్‌నుమా నుంచి బయల్దేరుతారు.
10.40: హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.



29వ తేదీ (బుధవారం)
- ఉదయం 9.00: అమెరికా బృందంతో బ్రేక్‌ఫాస్ట్‌
9.50: హోటల్‌ నుంచి హెచ్‌ఐసీసీకి బయలుదేరుతారు.
- 10.00: సదస్సు ప్లీనరీ సెషన్‌లో ‘వి కెన్‌ డూ ఇట్‌.. అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం’ అంశంపై చర్చాగోష్టి లో పాల్గొంటారు.
- 11.00: హెచ్‌ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. భోజన విరా మం అనంతరం మహిళా పారిశ్రామిక ప్రతి నిధులతో ట్రైడెంట్‌ హోటల్‌లో ముఖాముఖి
- 5.35: హోటల్‌లోనే సిబ్బందితో విందు చేసి విమానాశ్రయానికి బయల్దేరుతారు
- 8.20: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు
9.20: దుబాయ్‌ ఎమిరేట్స్‌ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు.

ఇవాంకా కాన్వాయ్‌ రిహార్సల్స్‌ 
అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా నగరానికి వస్తున్న నేపథ్యంలో సోమవారం రాజేంద్రనగర్‌లో కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. ఓఆర్‌ఆర్‌పై నుంచి భారీ కాన్వాయ్‌ హిమాయత్‌సాగర్, రాజేంద్రనగర్, పీడీపీ చౌరస్తా, శివరాంపల్లి, ఆరాంఘర్, మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకు నిర్వహించారు. దాదాపు 40 వాహనాలతో ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు మరోసారి రిహార్సల్స్‌ నిర్వహించారు. అడుగడుగునా పోలీసులను మోహరించి బందోబస్తును నిర్వహించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న భవనాలపై సైతం పోలీసులను బందోబస్తు కోసం వినియోగించారు. మంగళవారం సాయంత్రం ఇవాంకా ఈ దారిగుండానే ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు.   ఇవాంకా కాన్వాయ్‌లో 17 యూఎస్‌ఏ వాహనాలు ఉండగా పోలీసుల వాహనాలు మరో నాలుగు ఉన్నట్లు తెలిసింది. ఇవాంకా కాన్వాయ్‌లో మరో మూడు యూఎస్‌ఏ వాహనాలు చేరనున్నట్లు సమాచారం.  కాన్వాయ్‌ మరికొద్ది నిమిషాల్లో రానుందనగా రాజేంద్రనగర్‌ ప్రధాన రహదారిపై కుక్కలు పరుగులు తీశాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వాటిని తరిమేశారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement