
జంబో ఫ్యామిలీ
ఓ తాతయ్య కుటుంబంలో 111 మంది సభ్యులున్నారు. ఆయన 95వ పుట్టిన రోజున వారంతా ఒక్కచోట చేరి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ అపూర్వ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చాకలి రామయ్య 95వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామయ్య, అంతమ్మ దంపతుల ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలతో పాటు మరో వందమంది మనవలు, మనవరాళ్లు, మనిమనవలు, మునిమనవరాళ్లు హాజరయ్యారు.
కుటుంబ సభ్యులంతా హాజరైన ఈ వేడుకలో తాతగారు కేక్ కట్ చేయించడంతో పాటు బంగారు పాత్రలో పాలు తాగారు. తాతగారి వేడుక కోసం ఎక్కడెక్కడో స్థిరపడిన మనవలు, మనవరాళ్లు తరలిరావడంతో ఊరంతా సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన కుమారులు మాట్లాడుతూ.. తమ తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన వందో పుట్టినరోజును వైభవంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.