
రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి
రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం తమ శాఖ కార్యక్రమాలపై అన్ని జిల్లాల డీపీవో, డీఆర్డీవోలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయని అన్నారు.
గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పంచాయతీల నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా చర్యలు చేపట్టాలని డీపీవోలను ఆదేశించామన్నారు. ఏ గ్రామంలోనైనా అక్రమాలు, అవకతవకలు జరిగాయని తేలితే క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు పర్యవేక్షణాధికారులూ బాధ్యత వహించాల్సిందేనన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనులపై జిల్లాల వారీగా 15 రోజుల్లో నివేదికలు సమర్పించాలని డీపీవోలను ఆదేశించామన్నారు. ఒక్కో జిల్లా అధికారి నెలలో 20 రోజుల పాటు కనీసం 20 గ్రామాలను సందర్శించాలని నిర్ధేశించినట్లు మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
స్త్రీనిధి బ్యాంక్ ద్వారా రూ.600 కోట్ల మేర రుణాలందించి మహిళలకు చేయూతనిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8,600 గ్రామాలుండగా, ఇప్పటికే 3,000 గ్రామాల్లో కంపూటర్లు అందుబాట్లో ఉన్నాయని, మిగిలిన గ్రామ పంచాయతీల్లో రికార్డులను కూడా కంప్యూటరీకరించి ప్రజలు తెలుసుకునే విధంగా ఆన్లైన్లో ఉంచుతామన్నారు. ఉపాధిహామీ పథకం కింద జాబ్కార్డ్ కలిగిన ప్రతి కుటుంబానికి కనీసం 60 రోజుల పని కల్పించాల్సిన బాధ్యత ఫీల్డ్ అసిస్టెంట్లదేనని, డిమాండ్ కంటే రెండు రెట్లు పనిని మంజూరు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు.
బిల్లుల భారం పంచాయతీలదే..
మంచినీటి పథకాల నిర్వహణ కోసం వాడుకున్న విద్యుత్ బిల్లులను ఆయా గ్రామ పంచాయతీలే చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. త్వరలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు అందనున్న నేపథ్యంలో గ్రామ అవసరాలకు తగినట్లుగా వాటిని వినియోగించుకోవాలన్నారు. కాగా, ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అన్ని వర్గాలకు సంక్షేమ వసతి గృహాలు త దితర పథకాలు పూర్తయితే భ విష్యత్తులో ప్రతిపక్ష పార్టీల చిరునామాలే గల్లంతవుతాయన్నారు.
సీపీఎం మహాజన పాదయాత్రను ఉద్దేశించి మంత్రి జూపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డెరైక్టర్ నీతూ కుమారి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రామారావు, గ్రామీణాభివృద్ధి జాయింట్ కమిషనర్లు సైదులు, జాన్ వెస్లీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డెరైక్టర్లు బాలయ్య, రాజేశ్వర్రెడ్డి, వెంగళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.