
దొరికిన దొంగకు హారతులా?: కర్నె
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి జైలుపాలైన టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి బెయిల్ దొరికినందుకే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి జైలుపాలైన టీడీ పీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి బెయిల్ దొరికినందుకే టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రూ.50లక్షలిస్తూ ఏసీబీకి దొరికిన దొంగకు హారతులు పడతారా అని నిలదీశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. బెయిల్పై విడుదలైన రేవంత్రెడ్డి టీఆర్ఎస్ నేతలను దూషించడంపై కర్నె మండిపడ్డారు.
ఏం ఘనకార్యం చేసి రేవంత్రెడ్డి జైలుకు వెళ్లాడో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. జైలుకు వెళ్లిన వారు పశ్చాత్తాప పడి బుద్ధి తెచ్చుకుంటారని, నిర్దోషిలా బయట పడినట్లు ఫోజు కొట్టరని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రేవంత్రెడ్డికి బెయిల్ మాత్రమే దొరికిందని, నిర్దోషిగా తీర్పు రాలేదని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన భాష కాదని రేవంత్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడుతుందని, తప్పుందో లేదో కోర్టు తేలుస్తుందని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.