రైల్వే ఫ్లై ఓవర్‌కు మోక్షమెప్పుడో? | KOLR/Kolanoor (2 PFs) Railway Station Arrange for Railway flyover | Sakshi

రైల్వే ఫ్లై ఓవర్‌కు మోక్షమెప్పుడో?

Feb 24 2016 2:05 AM | Updated on Sep 3 2017 6:15 PM

రైల్వే ఫ్లై ఓవర్‌కు మోక్షమెప్పుడో?

రైల్వే ఫ్లై ఓవర్‌కు మోక్షమెప్పుడో?

నిత్యం వందలకొద్దీ రైళ్ల రాకపోకలు.. గంటల తరబడి గేట్ మూసివేత. ఫలితంగా మూడు మండలాల ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.

ఓదెల : నిత్యం వందలకొద్దీ రైళ్ల రాకపోకలు.. గంటల తరబడి గేట్ మూసివేత. ఫలితంగా మూడు మండలాల ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. కాజీపేట్-బల్లార్షా సెక్షన్ల మధ్య కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్‌క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ఏళ్లుగా వేడుకుంటున్నారు. వీరి విన్నపాలు ఎప్పటిలాగే బుట్టదాఖలు అవుతూనే ఉన్నారుు. కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్‌క్రాసింగ్ గేట్ వద్ద 1982, మార్చిలో జయంతి జనతా ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ సర్వీసును ఢీకొట్టడంతో 50 మందికి పైగా అక్కడిక్కడే దుర్మరణం చెందారు.

ఉలిక్కిపడ్డ దక్షిణమధ్య రైల్వే అప్పటికప్పుడే లెవల్ క్రాసింగుగేట్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటి వరకు రైల్వే ఫ్లైఓవర్‌ను మాత్రం నిర్మించలేదు.  
 
గంటలతరబడి ఎదురుచూపులు
కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల ప్రయాణికులు కొలనూర్ లెవల్ క్రాసింగుగేట్ దాటి వెళ్లాల్సిందే. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొలనూర్ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్తుంటారుు. నిత్యం వందల సంఖ్యలో రైళ్లు పోతుండడంతో లెవల్ క్రాసింగుగేట్ గంటల తరబడిగా మూసి ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలించే 108, 104 వాహనాలు సైతం ఆగిపోతున్నాయి.
 
ఎన్నో విన్నపాలు
రైల్లే ఫ్లైఓవర్ నిర్మించాలని జీఎంలకు అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఇటీవల రైల్వే జీఎం రవీంద్రగుప్తాకు స్థానిక నాయకులు కలిసి సమస్యను విన్నవించారు. అరుునా ఫలితం కనిపించడం లేదు. పక్కనే గల ఇరుకుగా ఉన్న బ్రిడ్జి నుంచి తాత్కాలికంగా వాహనాలు పోతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. అప్పటి ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణారావు హయూంలో అండర్‌బ్రిడ్జి విస్తరణకు నిధులు మంజూరైనప్పటికీ నేటికి పనులు ప్రారంభం కాలేదు.  
 
ఎవరూ పట్టించుకుంటలేరు
ఫ్లైఓవర్ నిర్మించాలని చాలా సార్లు జీఎంలకు వినతిపత్రాల ఇచ్చారు. ఎవరూ స్పందించడం లేదు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు గంటలతరబడిగా ఆలస్యంగా నడుస్తున్నారుు. చానా ఇబ్బందులు పడుతున్నం.
 - ఎస్పీ రాజయ్యగౌడ్, కొలనూర్
 
ఇబ్బందులు పడుతున్నం
 కొలనూర్ క్రాసింగ్ వద్ద గేట్ ఎప్పటికీ మూసే ఉంటుండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నం. 108, 104 బండ్లు కూడా ఆగిపోతున్నాయి. ఫ్లైఓవర్ నిర్మిస్తే మూడు మండలాల ప్రజల కష్టాలు తీరుతాయి.  
 - మాటురి ఎల్లయ్య, గోపరపల్లె
 
పట్టించుకోని రైల్వేశాఖ
1982లో కొలనూర్ గేట్‌వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అరుునా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైళ్లు ఎక్కువగా పోతుండడంతో గంటలతరబడి గేట్ వేసే ఉంటుంది. ఫ్లైఓవర్ మంజూరు చేయూలి.  
- గుండేటి ఐలయ్యయాదవ్, హరిపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement