
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/మనుబోలు: విజయవాడ డివిజన్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు–తిరుపతి జిల్లా గూడూరు మధ్య మూడవ రైల్వే లైను పనుల్లో భాగంగా గూడూరు సమీపంలోని పంబలేరు నదిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) నిర్మించిన పొడవైన రైల్వే ఫ్లైఓవర్ను శుక్రవారం ప్రారంభించారు. మనుబోలు–గూడూరు మధ్య సుమారు 10 వరకూ కాలువలు, ఏర్లు ఉన్నాయి. వీటిలో గూడూరు సమీపంలోని పంబలేరు పెద్దది. దీంతో పాటు సమీపంలోని కొన్ని కాలువలను కలుపుకుని 2.2 కిలోమీటర్ల దూరంతో అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ను నిర్మించారు.
ఈ రైల్వే ఫ్లైఓవర్ దక్షణ మధ్య రైల్వేలో 7వ పెద్ద ఆర్వోఆర్గా నిలిచిందని రైల్వే అధికారులు తెలిపారు. జోన్లో అతి పొడవైన ఆర్వోఆర్ కూడా ఇదేనని పేర్కొన్నారు. దీని నిర్మాణంలో హైగ్రేడ్ కాంక్రీట్, స్ట్రక్చరల్ స్టీల్ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ సింగిల్ లైన్ వంతెన రెండు దిశలలో రైళ్ల కదలికల కోసం రూపొందించారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ ఫ్లైఓవర్ ఉపకరిస్తుంది.
ఈ ఫ్లైఓవర్ వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుంచి రేణిగుంట, చెన్నై మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇక అంతరాయం ఉండదు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ఫ్లైఓవర్ను నిరి్మంచడంలో కృషి చేసిన రైల్వే అధికారులు, ఆర్వీఎన్ఎల్ సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment