వరంగల్ : సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం రోజున... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలలో జాతరకు శ్రీకారం చుడతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో మేడారం జాతర లాంఛనంగా మొదలవుతుంది. మేడారం మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజ కార్యక్రమాలను ‘మండ మెలిగె’ పేరుతో పిలుస్తారు. మండ మెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. మేడారం జాతర ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనుంది. మండ మెలిగె రోజు నుంచి మేడారం జాతర పూర్తయ్యే వరకు ఆదివాసీలు ప్రతి రోజు వన దేవతలకు పూజలు నిర్వహిస్తారు.
మండ మెలిగె రోజు నుంచే ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. ప్రధాన పూజారి(వడ్డె) నేతత్వంలోని బందం బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటుంది. గుడిని శుభ్రం చేస్తారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. మహా జాతరకు ఉపయోగించే సామగ్రిని శుద్ధి చేస్తారు. పసుపు, కుంకుమలు పెడతారు. ముగ్గులు వేసి శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. దుష్టశక్తులను నివారించేందుకు కోడిపిల్లను మామిడి తోరణాలకు కడుతారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం ఉదయం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేద్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే రకమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
మేడారంలో బుధవారం ‘మండమెలిగె’
Published Wed, Feb 10 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement