జూన్‌లో ఎల్లంపల్లికి మేడిగడ్డ నీళ్లు | Medigadda water to Ellampalli in June | Sakshi

జూన్‌లో ఎల్లంపల్లికి మేడిగడ్డ నీళ్లు

Jan 1 2019 3:38 AM | Updated on Jan 1 2019 3:38 AM

Medigadda water to Ellampalli in June - Sakshi

మంథని/రామగుండం/కాళేశ్వరం: జూన్‌ నాటికి మేడిగడ్డ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలిస్తామని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఆరుగురు సభ్యుల విశ్రాంత ఇంజనీర్ల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు కన్నెపల్లి, అన్నారం, గోలివాడ పంపుహౌస్‌లను సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌–4లో పనులు వెనుకబడ్డాయని, రెండు నదుల కలయికతో అసౌకర్యం ఏర్పడినట్లు తెలుస్తోందన్నారు. నీటిని మళ్లిస్తున్నామని, మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారన్నారు.

11 మోటార్లు, పంపులు, 87 గేట్లు బిగింపు పూర్తవుతుందన్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 పంపులకు గాను 4 బిగించారని తెలిపారు. 2 టీఎంసీకి డిజైన్‌తోపాటు అదనంగా మరో టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని వివరించారు. మరో 5 మోటార్లు రావాల్సి ఉందని,2 జనవరి, మరో 3 ఫిబ్రవరి వరకు చేరుతాయని ఏజెన్సీ వారు చెబుతున్నారని, సమయానికి చేరితే మార్చి నాటికి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. జూన్‌ నాటికి రాష్ట్ర మంతటికి సాగునీరు అందుతుందన్నారు. కన్నెపల్లి పంపుçహౌస్, మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తి కావచ్చన్నారు.

అన్నారం బ్యారేజీ పూర్తయిందని, 66 గేట్లు బిగింపు, వంతెన పనులు పూర్తయ్యాయన్నారు. సుందిళ్ల బ్యారేజీలోనూ 74 గేట్ల బిగింపు పూర్తయిందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై నివేదికను సీఎంకు  అందిస్తామన్నారు. బ్యారేజీ డిజైన్, మ్యాప్‌లను పరిశీలించినన బృందం సభ్యులు సాంకేతికకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బృందంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమౌళి, సభ్యులు వేణుగోపాల్, రాంరెడ్డి, సత్తిరెడ్డి, వెంకట్రామరెడ్డి ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement