
'సూర్యాపేట కాల్పులు యూపీ గ్యాంగ్ పనే'
హైదరాబాద్: బుధవారం రాత్రి దుండగుల కాల్పుల్లో గాయపడ్డ సీఐ, హోంగార్డులను తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పరామర్శించారు. గురువారం ఉదయం ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను నాయిని పరామర్శించారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బస్సుల్లో ప్రయాణించి దోపిడీలు చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాల ఆటకట్టిస్తామని అన్నారు. సూర్యాపేట ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరును నాయిని ప్రశంసించారు. ఘటనకు పాల్పడిన నిందితులను తప్పకుండా పట్టుకుంటామని చెప్పారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు పరిహారం అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని నాయిని చెప్పారు. గతంలోనే రూ.5 లక్షలను హోంగార్డులకు పరిహారంగా ప్రకటించామని హోంమంత్రి నాయిని గుర్తు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో బుధవారం రాత్రి 11 గంటల తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపై కొందరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడన్న విషయం తెలిసిందే. పరామర్శించిన వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ సంఘటనా స్థలాన్న పరిశీలించారు.