ఏకగ్రీవ పంచాయతీలకు అందని నజరానా
73 గ్రామాల ఎదురుచూపు
పంచాయతీ పాలనకు ఏడాది పూర్తి
హన్మకొండ అర్బన్ : ఏకగ్రీవ పంచాయతీలకు ఏడాది గడిచినా ప్రోత్సాహకాలు అందలేదు. దీంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ప్రోత్సాహకాలకు తోడు పంచాయతీలకు అభివృద్ధి నిధులొస్తే తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుందామనుకున్న ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. గ్రామ పంచాయతీ సర్పంచ్తోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పంచాయతీలకు గత ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున నజరానా అందజేసిన విషయం విదితమే.
దీనిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో 2013లో జరిగిన ఎన్నికల్లో 73 గ్రామ పంచాయతీలకు ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాది గడిచినా ప్రోత్సాహక నగదు బహుమతి ప్రభుత్వం నుంచి అంద లేదు. ప్రస్తుతం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15లక్షల వరకు ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధులు మాత్రం విడుదల చేయకపోవడంతో ప్రజలు, ప్రజాపతినిధులు నిరుత్సాహంతో ఉన్నారు.
నిధుల వరద...
2014 ప్రథమార్థంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన అన్ని రకాల నిధులను ప్రభుత్వం దాదాపు పూర్తి స్థాయిలో విడుదల చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీలకు కోట్లలో నిధులు వచ్చాయి. సర్పంచ్ల కు సాంకేతిక కారణాల వల్ల పదవిలో చేరిన వెంటనే కాకుండా సుమారు రెండు నెలల తర్వాత(31-10-2013)నుంచి చెక్పవర్ ఇచ్చారు. అనంతరం సర్పంచ్లకు కలెక్టర్ ఆదేశాలతో మొత్తం 29 రకాల శాఖలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పాలనపై అవగాహన కల్పించారు. ఇది కొత్తగా ఎన్నికైన, రాజకీయ అనుభవం లేని వారికి ఎంతగానో ఉపయోగపడింది.
పంచాయతీలకు ఇచ్చిన నిధుల వివరాలు
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.1,42,72,000
13వ ఆర్థిక సంఘం నిధులు రూ.16,81,40,200
షెడ్యూల్డ్ ఏరియా నిధులు రూ.66,37,600
గతంలో ఆగిపోయిన నిధులు రూ.15,27,93,000
పర్క్యాపిటల్ నిధులు రూ.17,48,600
{పొఫెషనల్ ట్యాక్స్ నిధులు రూ.59,61,400
సీనరేజ్ నిధులు రూ.23,07,000
‘మన ప్రణాళిక’తో పెరిగిన ప్రాధాన్యం
ప్రస్తుతం మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి పక్కాగా అమలు చేస్తుండటంతో పంచాయతీలకు, సర్పంచ్లకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం గ్రామస్థాయి ప్రణాళికలకే ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీంతో గ్రామాలకు అవసరమైన అన్ని రకాల విషయాలను ప్రణాళికల్లో పొందుపరిచారు.
నారాజ్..
Published Thu, Jul 31 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM
Advertisement
Advertisement