రంగారెడ్డి : ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన సురేష్(30), శంకర్లు లారీ డ్రైవర్లు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నాగారం శివాలయం వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.