ఊరు వలసబాట.. | People Of Villagrs Migrate To Big Cities | Sakshi
Sakshi News home page

ఊరు వలసబాట..

Nov 15 2018 1:05 PM | Updated on Nov 23 2018 6:47 PM

 People Of Villagrs Migrate To Big Cities - Sakshi

అడవి నుంచి చీపురు పుల్లలను తీసుకువస్తున్న గిరిజనులు

సాక్షి, వేమనపల్లి: ఉన్న భూములు అటవీ వివాదంలో ఉన్నాయి.. చేద్దామంటే పనులు లేవు.. తిందామంటే తిండికి లేదు,. వారికి వేరే ఉపాధి లేక రాజారం ఊరు వలస బాట పట్టింది. అందురు పనుల కోసం పట్నం బోతే ఇంటివద్ద ఉన్నోళ్లు చీపుర్ల కోసం అడవిబాట పడుతున్నారు. అక్కడ దొరికే  చీపురు పుల్లలను సేకరించి, చీçపుర్లను తయారు చేసి వాటిని విక్రయించిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు.  రాజారం గ్రామంలో మొ త్తం 88 కుటుంబాలున్నాయి. వీటిలో 56 కుటుంబాలు గత 15 రోజుల నుంచి మంచిర్యాలకు వలస వెళ్తూనే ఉన్నారు.

ఇక ఇంటి వద్ద  ఉండే ముసలివారు చీపురు పుల్లల సేకరణను ఉపాధిగా ఎంచుకున్నారు. వరి కోతలు, పత్తి తీయడం పనులు మొదలయ్యేదాక వీరికి ఈ పనే ఆధారం.  తెల్లవారకముందే సద్ది మూట పట్టుకుని అడవిబాట పడుతారు. వన్యమృగాల భయాన్ని లెక్క చేయకుండా చెట్టూ పుట్టా తిరిగి చీపురు పుల్లలు సేకరిస్తున్నారు. వాటిని ఇంటికి తెచ్చి ఎండలో ఆరబెట్టి వాటిని కట్టలుగా కడుతారు. సమీప గ్రామాల్లో తిరిగి రూ.20 లకు  కట్ట చొప్పన అమ్మి జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కష్టపడి చీపురు పుల్లలు ఏరినా..  సరైన కూలీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   


తేలని భూవివాదం.. 
రాజారం గిరిజనులు భూముల్లేని పేదలు కాదు. చీపురు సేకరణ, వలసలు వెళ్లటమే వీరికి ప్రధానాధారం కాదు. గోదుంపేట శివారులో ఉన్న వీరి భూములు అటవీ వివాదంతో తుడిచిపెట్టుకు పోయాయి. ఈ శివారులో 54 కుటుంబాలకు సాగు భూములున్నాయి. గత 20 ఏండ్ల క్రితమే ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఐటీడీఏ సహకారంతో బోర్లు వేసి మామిడి చెట్లు పెంచి ఉపాధి చూపింది. గత 8 సం.లుగా ఆ భూమిపై అటవీ అధికారుల బెదిరింపులు మొదలయ్యాయి. దీం తో భూములను వదిలిపెట్టడంతో  వీరు ఉపాధి కోల్పొయి కూలీలుగా మారారు. గత మూడు నెలల క్రితం మా భూములు మాగ్గావాలని గిరిజనులు ఉద్యమానికి సిద్దమయ్యారు.  భూముల వద్దకు వెళ్లి సాగు చేసేందుకు అరకలు కట్టారు.

దీంతో   అటవీ, పోలీస్‌ అధికారులు 9 మందిపై కేసులు నమోదు  చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆగాలని స్వయంగా జిల్లా కలెక్టర్‌ సూచించడంతో గిరిజను లు శాంతించారు. పల్లెల్లో వరి కోతలు, పత్తి సేకర ణ పనులు ప్రారంభం కాకపోవడంతొ కడుపు నిండే మార్గం లేక  మంచిర్యాలలోని పలు ప్రాం తాలకు  ఇటుక పనికి వెళ్తున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు చీపుర్లను అమ్ముకుంటు ఉపాధి పొందుతున్నారు.  


మేం బతుకుడెట్ల..
మాకు గోదుంపేట శివారులో భూములు ఉన్నా యి. కానీ అటవీఅధికారులు సాగు చేయకుండా బెదిరిస్తున్నారు. ఇగ మేం బతుకుడెట్ల. అందరం మంచిర్యాల ఇటుక ప నులకు పోతె  ఇంటి కాడున్నోళ్లు చీపురు ఏరేందుకు పోతాండ్లు. 

  –  బుర్సమాంతయ్య రాజారం
                             
ఊళ్లో ఉపాధి లేదు..
మాకు ఊళ్ల వేరే ఉపాధి లేదు. ఇగ ఏం పనిజేసుడు.  మేమంతా ఇటుక పనికి పోతె ఇంటి కావలికి  ముసులోళ్లు ఉంటుర్రు. ఆళ్లకు బువ్వ ఎట్ల, ఉపాసం ఉండలేక  చీపురుపుల్లలు ఏరేందుకు పోతుల్లు. వాటితో వచ్చిన పైసలతోని బియ్యం, సామాన్లు కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు.  
–  నాయిని చంద్రు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement