
విభజన హామీలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా: పొంగులేటి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈ అంశాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
రాష్ర్టంలో భద్రాచలం-కోవూరు, కరీంనగర్-పెద్దపల్లి లైన్లతోపాటు, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వంటి పలు రైల్వే ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్రానికి సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని, నదుల అనుసంధానంలో గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించాలని పొంగులేటి సూచించారు. అందుకు చేవెళ్ల-ప్రాణహితతో పాటు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏకపక్షంగా ఆంధ్రలో కలపడంతో ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ అంశాన్ని కూడా పార్లమెంట్లో లేవనెత్తుతామని పొంగులేటి చెప్పారు.