
ఆంధ్రతండాలో రాజయ్యను సమస్యలపై ప్రశ్నిస్తున్న యువకులు
రఘునాథపల్లి(స్టేషన్ఘన్పూర్): స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎన్నికల ప్రచారంలో అడ్డంకులు తప్పడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్రతండాలో శనివారం పలువురు యువకులు తమ గ్రామానికి ఏం చేశావంటూ వాదనకు దిగారు. సీసీ రోడ్లు లేవు.. తాగునీటి సరఫరా లేదు.. ఐదేళ్లుగా సీసీ రోడ్లు లేవు.. తాగు నీటి సరఫరా లేదు.. ఐదేళ్లుగా తండాను ఎలాంటి అభివృద్ధి చేయలేదు? ఓట్లు ఎలా వేస్తాం? అంటూ ప్రశ్నించారు.
జాఫర్గూడెం నుంచి అశ్వరావుపల్లికి బీటీ రోడ్డు ఎందుకు వేయలేదని గ్రామస్తులు ప్రశ్నించారు. అశ్వరావుపల్లికి బీటీ రోడ్డు మంజూరైందని, ఎన్నికల తర్వాత పనులు ప్రారంభమవుతాయని రాజయ్య చెప్పారు. మంగళిబండతండాలో కొత్తగూడెం నుంచి వాటర్ ట్యాంకు వరకు సీసీ రోడ్డు, మురుగుకాల్వలు నిర్మించాలని, మిషన్భగీరథ నీళ్లు రావడం లేదని రాజయ్య దృష్టికి తీసుకెళ్లగా ఎన్నికలు తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని ఆయన నచ్చజెప్పారు.
అంబేడ్కర్ను మరిచారు..
ఆశీర్వాదం పేరుతో మండలంలో తొలి ప్రచారంలో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముందుగా రఘునాథపల్లి మండలకేంద్రంలో శ్రీకారం చుట్టారు. ఎస్బీఐ నుంచి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం మీదుగా ర్యాలీ వెళ్లినా అక్కడ నివాళులర్పించకపోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. రాజయ్యతో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేయించాలని స్థానిక టీఆర్ఎస్ నాయకులు, మండల పార్టీ బాధ్యుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. రాజయ్య రహదారి లోని పలు షాపులకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. కానీ అంబేడ్కర్, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించకుండానే వెళ్లడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment