
ఫిజిక్స్ కాస్త కఠినం
ప్రశాంతంగా ఎంసెట్ పరీక్ష
► ఇంజనీరింగ్లో సరైన జవాబుల్లేని మూడు ప్రశ్నలు
► నిమిషం నిబంధనతో తిప్పలు
► ఇంజనీరింగ్లో 93.43 శాతం.. అగ్రికల్చర్, ఫార్మసీలో 92.97 శాతం హాజరు
► నేడు ప్రాథమిక కీ.. 18 వరకు అభ్యంతరాల స్వీకరణ
► 22న ఎంసెట్ ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ విభాగంలో 93.43 శాతం మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 92.97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్) ప్రశ్నలు కాస్త కఠినంగా వచ్చాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎంసెట్ ప్రశ్నపత్రం సెట్ కోడ్ను ఉదయం 6 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. 246 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. 1,41,190 మంది విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 1,31,910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక 154 కేంద్రాల్లో మధాహ్నం 2:30కు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష ప్రారంభమైంది. దీనికి 79,061 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 73,501 మంది పరీక్ష రాశారు. కాగా.. ఎంసెట్ ప్రాథమిక ‘కీ’ని శనివారం విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య తెలిపారు. వాటిపై ఈనెల 18వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 22వ తేదీన ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించారు.
సులభంగానే ప్రశ్నపత్రం..
ఫిజిక్స్ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చినా.. మొత్తంగా గతేడాదితో పోల్చితే సులభంగానే ప్రశ్నలు వచ్చాయని సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు వెల్లడించారు. ఇంజనీరింగ్ విభాగంలో మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని మరో సబ్జెక్టు నిపుణులు మూర్తి తెలిపారు. సెట్ ‘ఎ’కోడ్ ప్రశ్నపత్రంలోని 87, 98, 110 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో సరైన జవాబులు లేవని వివరించారు. దీంతో కొంతమంది విద్యార్థులు కొద్దిపాటి గందరగోళానికి గురయ్యారని చెప్పారు. సిలబస్లోని అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు వచ్చాయన్నారు. గతేడాది ఎంసెట్లో ఎక్కువ సమయం తీసుకునే సుదీర్ఘ ప్రశ్నలు 15 వరకు ఇవ్వగా.. ఈసారి అలాంటివి నాలుగైదు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఇటీవల జరిగిన ఏపీ ఎంసెట్తో పోల్చినా.. రసాయన శాస్త్రం, గణితంలో 50 నుంచి 60 వరకు ప్రశ్నలు సులభంగా ఉన్నాయన్నారు. గణితంలో అత్యధికంగా 80 మార్కులు పొందగలుగుతారని, సాధారణ విద్యార్థి కూడా 40 నుంచి 50 మార్కులు పొందగలరని చెప్పారు.
కన్నీళ్లు పెట్టించిన ‘నిమిషం’నిబంధన
ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్న నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. పరీక్ష రాసేందుకు ఉరుకులు, పరుగుల మీద బయలుదేరినా.. పలు సమస్యల కారణంగా కొందరు విద్యార్థులు రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కారణంగా పలు చోట్ల అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్నారు. కానీ ఇలా ఆలస్యంగా వచ్చిన వారెవరినీ అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దాంతో విద్యార్థులు కంటతడిపెట్టారు. పరీక్ష రాయనివ్వాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. అయినా అనుమతించకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగారు. మరోవైపు పరీక్ష కేంద్రాల బయట కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ముందుగానే గేట్లు మూసివేత!
హైదరాబాద్లోని నారాయణగూడలో ఉన్న కేశవ మెమోరియల్ కళాశాల పరీక్షా కేంద్రం ప్రధాన గేటును ఉదయం 9.52 గంటలకే మూసివేయడంతో ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. హిమాయత్నగర్కు చెందిన మాధవి, సఫీలు 9.54 నిమిషాలకే కేశవ మెమోరియల్ పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. గేటుకు తాళాలు వేసి ఉండడం, సెక్యురిటీ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఇద్దరినీ గేటు పైనుంచి ఎక్కించి లోపలికి పంపారు. కానీ వారు హాల్టికెట్ నంబర్తో పరీక్షాహాల్ను సరిచూసుకుని వెళ్లే సరికి 10.03 గంటలు కావడంతో పరీక్షాహాల్లోకి రానివ్వలేదు. ఎంతగా ప్రాధేయపడినా అనుమతించకపోవడంతో కన్నీటితో వెనుదిరిగారు.