పనాజీ: నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలిన ఘటనలో 8మంది కార్మికులు సజీవసమాధికాగా, 12మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పనాజీకి 80కిలోమీటర్ల దూరంలో ఉన్న కానకోనా టౌన్లో శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు .. కానకోనాలో చ్వాదీ వార్డ్లో రూబీ రెసిడెన్సీ వద్ద మూడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. దాంతో సమాచరం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మురం చేశారు. శిధిలాల నుంచి ఇప్పటివరకూ 8 మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తోంది.
తీవ్రగాయాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రజా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే నిర్మాణంలో వున్న భవనం కింద 40మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శిధిలాల కింద మరికొంతమంది ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.