
ఏసీలకు జీఎస్టీ కాక..మండనున్న ధరలు
న్యూఢిల్లీ: ఒకవైపు జీఎస్టీ బిల్లు అమలుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు జీఎస్టీ ఆధారిత పన్ను రేట్ల ప్రభావం ఎయిర్ కండీషనర్ల ధరలపై పడనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ 28శాతం పన్ను పరిధిలోకి ఏసీలు రావడం మూలంగా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.
ఎయిర్ కండిషనర్లపై 18శాతం సెస్ విధించినా కూడా ప్రస్తుత ఉన్న ధరలతో పోలిస్తే 2.5శాతం పెరగనున్న ఉత్పత్తి ఖర్చులతో పాటు.. మొత్తం సేవలపై 18శాతం కలిపి ఏసీలు ధరలు మండిపోనున్నాయని బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు 2018 జనవరి 1 నుంచి జీఎస్టీ కొత్త ఎనర్జీ రేటింగ్ విధానాన్ని పరిచయం చేస్తే ... ధరలు ఇంకా పెరుగుతాయన్నారు. దీంతో వచ్చే ఏడాదినాటికి ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఏసీలు ధరలకు..3 స్టార్ ఏసీల ధరలు చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా 40 శాతం ఏసీల సేల్స్ జూన్ మాసానికంటే ముందే జరుగుతాయని, కానీ జీఎస్టీ పన్ను రేటు స్పష్టత కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారని చెప్పారు.
గత ఏడాది మొత్తం మార్కెట్ 20 శాతం వృద్ధి చెందగా, బ్లూస్టార్ 35శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. వినియోగ వస్తువుల ధరలు పెరిగిన కారణంగా మార్కెట్ గ్రోత్15-20శాతం ఉంటే..తమ మార్కెట్ కూడా 20-25 శాతం వృద్ధి చెందుతుందని త్యాగరాజన్ అంచనా వేశారు. జీఎస్టీ ఆధారిత పన్నుపై మరో నెలలో క్లారిటీ రావచ్చే ఆశాభావాన్నివ్యక్తం చేశారు. జమ్మూ, ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సిటీ లోబ్లూ స్టార్ కొత్త ప్లాంట్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభంకానున్నాయి.
కాగా కొత్తగా అమలు చేయనున్న వస్తు సేవా పన్నుకు సంబంధించిన ఐదు ముసాయిదా బిల్లులకు జీఎస్టీ కౌన్సిల్ గురువారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గరిష్ట జీఎస్టీ రేటు 28 శాతంతో పాటుగా అదనంగా గరిష్టంగా 15 శాతం సెస్ విధించాలని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.