
థర్డ్ పార్టీ ఏటీఎం వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటపుడు ఏ బ్యాంక్ ఏటీఎం అనేది పెద్దగా పట్టించుకోం.. కదా.. అవసరం రీత్యా అందుబాటులో ఏదో ఒక ఏటీఎంను వాడేస్తూ ఉంటాం. కానీ అదే హ్యాకర్లకు సువర్ణ అవకాశాన్ని అందిస్తోందని, ఈ థర్డ్ పార్టీ ఏటీఎం లావాదేవీలే కొంపముంచుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. థర్డ్ పార్టీ ఏటీఎంల వినియోగంతో ఖాతాదారుల డబ్బులకు రెక్కలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలనీ, ఏటీఏం సెంటర్లలో మనీ డ్రా చేసేపుడు కూడా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.
ఎస్బీఐ 6 లక్షల డెబిట్ కార్డుల బ్లాక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా బ్యాంకు కార్డు వినియోగదారుల్లో ఆందళన రేగింది.. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సమాచార కుంభకోణంగా విశ్లేషకులు పేర్కొంటున్న అక్రమాలకు చైనాలోనే బీజం పడినట్టు తెలుస్తోంది. చైనాలోని ఏటీఎం, ఇతర విక్రయ కేంద్రాల్లో నమోదవుతున్న అనధికారిక లావాదేవీలు,బాధితుల ఫిర్యాదులు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.
మరోవైపు ఈ కుంభకోణంలో ప్రధాన బాధితులుగా ఉన్న ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఇదే వాదనను తెరపైకి తెస్తున్నాయి. తమ ఏటీఎంలలో ఎలాంటి అవకతవకలూ జరగలేదనీ బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఇతర బ్యాంకుల కార్డుల నుంచి డబ్బు విత్ డ్రా అవుతున్న లావాదేవీల కార్డులే హ్యాకింగ్ గురైనట్టు వాదిస్తున్నాయి. ముఖ్యంగా యస్ బ్యాంకుకు తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉండడం, ఈ నేపథ్యంలోనే ఈ బ్యాంకుకు చెందిన ఖాతాదారుల్లో అత్యధికుల వివరాలు లీక్ అయ్యాయని పేర్కొంటున్నారు దీంతోపాటుగా పిన్ లు మార్చుకోమని సలహా ఇవ్వడంతోపాటు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడొద్దని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.