
'రామమందిరం': మళ్లీ కలకలం రేపుతున్న బీజేపీ!
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేపీ మళ్లీ వివాదాస్పద అయోధ్యలో 'రామమందిరం' నిర్మాణం అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నది. యూపీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రామమందిరాన్ని గొప్పగా నిర్మిస్తామని తాజాగా ప్రకటించింది.
'రామమందిరం విశ్వాసానికి సంబంధించిన అంశం. రెండునెలల్లో దీనిని నిర్మించలేం. ఎన్నికలు పూర్తయిన తర్వాత మందిరాన్ని కడతాం. బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుంది' అని యూపీ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య విలేకరులకు తెలిపారు. యూపీ సీఎం అఖిలేశ్ ఇటు దళితులను, అటు వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీల జాబితాలో 17 ఓబీసీ కులాలను చేర్చేందుకు అఖిలేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.