నేటి నుంచే మహాయాగం | Chandi maha yagna from Today in cm from house | Sakshi
Sakshi News home page

నేటి నుంచే మహాయాగం

Published Wed, Dec 23 2015 3:26 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

నేటి నుంచే మహాయాగం - Sakshi

నేటి నుంచే మహాయాగం

* ఎర్రవల్లిలో ఉదయం 7.45 గంటలకు అయుత చండీయాగానికి శ్రీకారం
* సర్వాంగ సుందరంగా ముస్తాబైన యాగ క్షేత్రం
* శృంగేరీ పండితులతోపాటు 2 వేల మంది బ్రాహ్మణుల రాక
* సీఎం దంపతులతో గౌరీపూజ చేయించిన వేద పండితులు
* నేడు యాగానికి హాజరుకానున్న గవర్నర్ దంపతులు
* ప్రతి నిత్యం 50 వేల మంది భక్తులు వస్తారని అంచనా
* ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ

సాక్షి, హైదరాబాద్/జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం నేటి నుంచి ప్రారంభం కానుంది.

బుధవారం ఉదయం 7.45 గంటలకు ప్రారంభం కానున్న ఈ మహా క్రతువు ఆదివారం వరకు అయిదు రోజుల పాటు సాగనుంది. ఇందుకు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శృంగేరీ పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేల మంది రుత్వికులు మంగళవారం యాగశాలకు చేరుకున్నారు. వారందరికీ సీఎం దంపతులు దీక్షావస్త్రాలు, సామగ్రి అందజేశారు. 12 మంది రుత్వికులకు పాదాభివందనం చేసి వస్త్ర ప్రదానం చేశారు.
 
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు యాగాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేల మంది భక్తులు తరలివస్తారని అంచనా. వీరందరికీ సరిపడేలా అమ్మవారి పసుపు కుంకుమ, ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణగా వెళ్లి యాగాన్ని వీక్షేంచేలా యాగశాల చుట్టూరా బారికేడ్లతో మార్గాన్ని నిర్మించారు.

ఈ ఏర్పాట్లన్నింటినీ సీఎం స్వయంగా దగ్గరుండి  పర్యవేక్షించారు. అయుత చండీ మహాయాగానికి శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి తన ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. శృంగేరీ జగద్గురు మహా సంస్థానం పండితుల ఆధ్వర్యంలోనే యాగం నిర్వహించేందుకు అంగీకారం తెలుపుతూ.. ఈ యాగానికి నరహరి సుబ్రహ్మణ్య భట్టు ప్రధాన ఆచార్యులుగా, తంగిరాల శివకుమార శర్మను వాచకులుగా పంపించారు.

మహారుద్ర యాగానికి ఆచార్యులుగా పురాణం మహేశ్వరశర్మ, యాగ పర్యవేక్షకులుగా శివసుబ్రహ్మణ్య అవధాని, గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్‌శర్మ వ్యవహరిస్తున్నారు. యాగంలో 1,100 మంది రుత్వికులు ఏకకంఠంతో పారాయణాలు చదవనున్నారు. మరో 400 మంది రుత్వికులు వారికి సహాయం చేయనున్నారు.
 
గౌరీపూజతో యాగానికి అంకురార్పణ
చండీయాగం అంకురార్పణలో భాగంగా మంగళవారం యాగస్థలిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభ గౌరీ పూజ చేశారు. ఉదయం 7.30 గంటలకు యాగస్థలికి చేరుకున్న వీరితో శృంగేరీ పండితులు పూజ చేయించారు. త్రైలోక్యమోహనగౌరి హోమం, గురు ప్రార్థన, గణపతిపూజ, గోపూజ, ఉదకశాంతి, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, సాయంకాలం పూట ఆచార్యాది రుత్విగ్వరణం, దుర్గాదీప నమస్కార పూజ, రక్షాసుదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చండీయాగ పనులను పరిశీలించారు. గౌరీపూజలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తుమ్మల నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
 
నేడు ప్రముఖుల రాక
అయుత చండీ మహాయాగం తొలి రోజున జరిగే పూజల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి బొసాలే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ పాల్గొంటారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గవర్నర్ దంపతులు ఎర్రవల్లికి బయల్దేరుతారు.

8.30కు యాగశాలకు చేరుకుంటారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ ప్రకారం 24న కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, 25న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగ ర్‌రావు, 26న తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు.
 
బందోబస్తుపై సమీక్ష
ఐజీ మహేష్‌భగవత్, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మంగళవారం యాగస్థలి ముఖద్వారం వద్ద పోలీ సు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వీవీఐపీ, వీఐపీల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌తో చర్చించారు. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఐజీ నవీన్‌చంద్ బందోబస్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బలగాలకు అవగాహన కల్పించారు.
 
చండీయాగంలో నేటి పూజలిలవీ..
జగదేవ్‌పూర్: యాగంలో తొలిరోజు బుధవారం ఉదయం 7.30 గంటల నుంచి గురుప్రార్థన, గణపతి పూజ, గోపూజ, మహామంటప స్థాపనం, చండీ యంత్రలేఖనం, యంత్ర ప్రతిష్ఠ, దేవతా అవాహనం, ప్రాణప్రతిష్ఠ, నవావరణార్చన, ఏకాదశన్యాస పూర్వక సహస్ర చండీ పారాయణం, పంచబలి, యోగినీబలి, మహారుద్రయాగ సంకల్పం, రాజశ్యామల, మహారుద్ర పురశ్ఛరణ చతుర్వేదయాగ ప్రారంభం, మహాసౌరం, ఉక్తదేవతా జపములు, మంత్రపుష్పం, విశేష నమస్కారములు, కుమారి సువాసిని, దంపతి పూజ, మహా మంగళహారతి, ప్రసాద వితరణం ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు ధార్మిక ప్రవచనం, సాయంకాలం కోటి నవాక్షరీ పురశ్ఛరణం, విశేషపూజ ఆశ్లేషబలి, అష్టావధాన సేవ నిర్వహిస్తారు. రాత్రి శ్రీరామలీల హరికథ తదితర కార్యక్రమాలు జరుగుతాయి.
 
చండీయాగానికి ప్రత్యేక బస్సులు
సాక్షి, సంగారెడ్డి: అయుత చండీయాగానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యాగం జరిగే ఐదు రోజులపాటు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. మంగళవారం ఆర్టీసీ మెదక్ రీజియన్ ఆర్‌ఎం వేణు.. గౌరారం, ప్రజ్ఞాపూర్ స్టేజీల ను పరిశీలించడంతో పాటు యాగశాల వర కు బస్సు సర్వీసులను నడపటానికి వీలుగా అధికారులకు సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి అదనపు బస్సులు నడిపేందు కు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
 
రెండు నిమిషాలకో బస్సు
* హైదరాబాద్ జూబ్లీబస్‌స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌కు ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాల ఏర్పాటు.
* హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ప్రజ్ఞాపూర్ లేదా గౌరారం వద్ద బస్సు దిగాల్సి ఉంటుంది.
* ప్రజ్ఞాపూర్/గౌరారం నుంచి భక్తులను యాగశాల వరకు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.
* ప్రజ్ఞాపూర్/గౌరారం నుంచి యాగశాల వరకు మూడు బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
* గౌరారం, ప్రజ్ఞాపూర్ వద్ద ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement