
4 లక్షల కోట్లకు బీమా వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపార పరిమాణం రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అంచనా వేస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ బీమా వ్యాపారం (జీవిత, సాధారణ) పరిమాణం రూ.3.75 లక్షల కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం బీమా వ్యాపారంలో వృద్ధిని ఆశిస్తున్నామని, దీంతో ఈ సంఖ్య రూ. నాలుగు లక్షల కోట్లకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఐఆర్డీఏ చైర్మన్ టి.ఎస్.విజయన్ వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) స్నాతకోత్సవానికి విజయన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ పాత జీవిత బీమా పథకాలను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్ వరకు గడువిచ్చినట్లు తెలిపారు.
కొత్త మార్గదర్శకాలతో రూపొందించిన పథకాలను వేగంగా ఆమోదిస్తున్నామని, ఇప్పటివరకు 450 పథకాలు అనుమతుల కోసం రాగా ఇప్పటికే 300 పథకాలకు అనుమతులను జారీ చేసినట్లు తెలిపారు. బీమా పథకాల్లో డీ-మ్యాట్ను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం చేసిన సూచనపై ఆయన స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని తప్పనిసరి చేయలేమని, దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు. పాలసీల విక్రయంలో బ్యాంకులను ఏజెంట్లుగా ఒక కంపెనీకి చెందిన పథకాలనే విక్రయించే విధంగా కాకుండా బ్రోకర్ వలే అన్ని కంపెనీల పథకాలనూ విక్రయించడం వంటి సంస్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 15 నుంచి 20 మంది ఆఫీసర్లను నియమించుకోనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.