
పాక్ లో మలాలా పుస్తకం నిషేధం
తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ రాసిన 'ఐ యామ్ మలాలా' పుస్తకాన్ని పాకిస్తాన్ లో నిషేదించారు.
ఇస్లామాబాద్ : తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ రాసిన 'ఐ యామ్ మలాలా' పుస్తకాన్ని పాకిస్తాన్ లో నిషేధించారు. ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని పెంచినా పాక్ లో మాత్రం నిషేధం ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రైవేటు స్కూల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మిర్జా కసిఫ్ బ్రిటీష్ డైలీకి ఇచ్చిన ఓ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రచురణలో ఉన్న పుస్తకం పాకిస్తాన్ బాలలను భయందోళనలకు గురి చేసేలా ఉందని ఆయన తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న 1,52,000 పాఠశాలల్లో ఈ పుస్తకం ప్రవేశ పెట్టాలంటే సమీక్ష తప్పకుండా జరపాలన్నారు. ఈ క్రమంలోనే ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిలిపివేసామన్నారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటి వరకూ నిషేదం విధించలేదని, ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాలిబన్ల దాడి తనపై చేసిన దాడిని పుస్తక రూపంలోకి తీసుకువచ్చి బాలల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని మలాలా చేసిన ప్రయత్నం ఆచరణలోకి వచ్చేటట్లు కనబడుట లేదు.