
మలేషియా విమానంలో ఐదుగురు భారతీయులు!
వియత్నాం వద్ద సముద్రంలో కూలిపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానంలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు తాజాగా తెలియవచ్చింది. మొత్తం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో కలిసి కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఈ విమానానాకి తెల్లవారుజామున ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. కౌలాలంపూర్లోని గత అర్థరాత్రి 12.41 నిమిషాలకు బయలుదేరిన విమానం బీజింగ్ ఈ రోజు ఉదయం 6.30 నిముషాలకు చేరుకోవాల్సి ఉంది.
తెల్లవారుజామున 2.40 ప్రాంతంలో ఆ విమానం అదృశ్యమైంది. ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మలేషియా ఎయిర్లైన్స్ వెల్లడించింది. అదృశ్యమైన విమానంలో 150 మంది ప్రయాణికులు చైనీయులు ఉన్నారని చైనా పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. గల్లంతైన విమానంలో భారతీయులు ఎవరూ లేరని మన విదేశాంగ శాఖ తొలుత ప్రకటించింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఇందులో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు తెలిసింది. వారి క్షేమసమాచారం తెలియక, అసలు ఎవరెవరు ఉన్నారో కూడా అర్థం కాక దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
విమానంలో మొత్తం ఐదుగురు భారతీయులు, 152 మంది చైనీయులు, 38 మంది మలేసియన్లు, ఏడుగురు ఇండోనేసియన్లు ఆరుగురు ఆస్ట్రేలియన్లు, ఓ శిశువు సహా నలుగురు అమెరికన్లు, ముగ్గురు ఫ్రెంచివారు, న్యూజిలాండ్, ఉక్రెయిన్, కెనడాల నుంచి ఇద్దరేసి, రష్యా, ఇటలీ, తైవాన్, నెదర్లాండ్స్, ఆస్ట్రియాల నుంచి ఒక్కొక్కరు విమానంలో ప్రయాణించారు.