
ప్రధాని మోదీని తిట్టాడని.. క్రికెట్ స్టంపుతో..!
పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల నగదు కోసం ప్రజలు బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రజలు కష్టాలు పడటానికి ప్రధాని నరేంద్రమోదీయే కారణమంటూ నిందించిన ఓ వ్యక్తిపై దేశ రాజధాని ఢిల్లీలో దాడి జరిగింది. లల్లన్ సింగ్ కుష్వాహా (45) అనే వ్యక్తి టీవీ కొనేందుకు ఢిల్లీలోని ఇస్మయిల్ పూర్కు బయలుదేరాడు. ఇంతలో అతనికి ఏటీఎం ముందు బారులుతీరి డబ్బుల కోసం పడిగాపులు పడుతున్న ప్రజలు కనిపించారు.
అక్కడ గందరగోళ పరిస్థితిని చూసి స్పందించిన అతను ప్రధాని మోదీని నిందించాడు. మోదీ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నాడు. దీంతో ఏటీఎం సమీపంలో కిరాణ దుకాణం నిర్వహించే అస్తిక్ అనే వ్యక్తి కుష్వాహాతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాడీవేడి వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన ఆస్తిక్.. కుష్వాహాపై క్రికెట్ స్టంప్తో దాడి చేశాడు. కుష్వాహా తలకు గాయాలయ్యాయి. 'అతను ఎందుకు ఆగ్రహానికి గురయ్యాడో తెలియదు. కానీ నాతో గొడవపడటం మొదలుపెట్టి.. తలపై స్టంపుతో మూడుసార్లు కొట్టాడు. పిడిగుద్దులు కురిపించాడు. తలపై నాకు రెండు కుట్లుపడ్డాయి' అని కుష్వాహ తెలిపారు. ఆస్తిక్ దాడితో రక్తస్రావమైన కుష్వాహాను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై ఢిల్లీలోని జైత్పూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. గొడవపడిన ఇద్దరు ఒకరికొకరు తెలిసినవారేనని పోలీసులు చెప్తున్నారు.