
‘సోల్’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
అన్ని రంగాల్లో గ్లోబల్ లీడర్ల అవసరం నేడు ఎంతో ఉంది
సమర్థ నాయకత్వంతో దేశాభివృద్ధి సాధ్యం
‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు మానవ వనరుల నిర్మాణం కీలకం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించేలా నేడు అన్ని రంగాల్లో ప్రపంచస్థాయి నాయకులు రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయోజనాలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేసే అత్యుత్తమ నాయకులు సమాజానికి కావాలని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్(సోల్) సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉత్సాహవంతులైన సారథుల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో సోల్ లాంటి సంస్థలు గేమ్ఛేంజర్ అవుతాయని వ్యాఖ్యానించారు.
వేర్వేరు రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఆలోచనా దృక్పథంతో వ్యవహరిస్తూ స్థానికంగా అభివృద్ధికి పాటుపడే నేతలు తయారు కావాలని పిలుపునిచ్చారు. నేడు మన దేశం ‘గ్లోబల్ పవర్హౌస్’గా ఎదుగుతోందని, ఈ నేపథ్యంలో భారతీయ దార్శనికతను ప్రతిబింబించే నాయకత్వం అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. దేశానికి విజనరీ నాయకులు కావాలని వివరించారు. కీలక రంగాల్లో దేశం మరింత వేగంగా ముందుకు పరుగెత్తాలని, సమర్థ నాయకత్వం వల్లే అది సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. సోల్ లాంటి సంస్థల అవసరం నేడు ఎంతో ఉందన్నారు.
రాజకీయ అధికారానికే పరిమితం కావొద్దు
‘గ్లోబల్ అప్రోచ్, లోకల్ మైండ్సెట్’కలిసిన నాయకులు సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సంక్షోభాలను పరిష్కరించడంలో, భవిష్యత్తు పట్ల సరైన ఆలోచనలు చేయడంలో సమర్థులైన వ్యక్తులను దేశం కోరుకుంటోందని పేర్కొన్నారు. భవిష్యత్ నాయకత్వం కేవలం రాజకీయ అధికారానికే పరిమితం కావొద్దని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లు, వేదికలపై మన దేశం పోటీ పడాలంటే అంతర్జాతీయ పరిణామాలపై పూర్తి అవగాహన కలిగిన నాయకులు కావాలన్నారు. డీప్–టెక్, అంతరిక్షం, బయోటెక్, పునరుత్పాదక ఇంధనం వంటి ఆధునిక రంగాలతోపాటు క్రీడలు, వ్యవసాయం, తయారీ, సామాజిక సేవ వంటి రంగాల్లో నాయకత్వాన్ని సిద్ధం చేసుకోవాలని ఉద్ఘాటించారు.
ఆ స్ఫూర్తిని మననం చేసుకోవాలి
అన్ని రంగాల్లో అత్యున్నత ఫలితాలు సాధించాలని కేవలం కోరుకుంటే సరిపోదని, ఆచరణలో సాధించి చూపాలని ప్రధానమంత్రి తేలి్చచెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థలను అభివృద్ధి చేసే సమర్థుల అవసరం నేడు దేశానికి ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. మన దేశంలో పురుడు పోసుకున్న ఎన్నో సంస్థలు ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించాయని గుర్తించారు. ఆ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకోవాలన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన దిశగా మనమంతా ముందుకు సాగుతున్నామని, ఈ తరుణంలో జాతి నిర్మాణం కోసం మానవ వనరుల నిర్మాణం అత్యంత కీలకమని వివరించారు.
ఉత్తమమైన పౌరులతోనే దేశం ముందంజ వేస్తుందన్నారు. మానవ వనరుల విషయంలో గుజరాత్ అనుభవాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు గుజరాత్లో సహజ వనరులేవీ లేవన్నారు. గుజరాత్ భవిష్యత్తుపై అప్పట్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. సమర్థవంతమైన మానవ వనరులను, నాయకులను తయారు చేసుకోవడంతో గుజరాత్ నేడు అభివృద్ధి పథంలో నడుస్తోందని వెల్లడించారు. గుజరాత్లో వ జ్రాల గనులు లేవని, అ యినప్పటికీ ప్రపంచంలో ప్రతి పది వజ్రాల్లో తొమ్మి ది వజ్రాలు గుజరాతీల చేతుల్లోనే సానపెట్టుకొని అందంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
మోదీ నాకు పెద్దన్న: భూటాన్ ప్రధాని
గుజరాత్లోని గిఫ్ట్ సిటీ సమీపంలో విశాలమైన ‘సోల్’క్యాంపస్ త్వరలో సిద్ధం కాబోతోందని నరేంద్ర మోదీ చెప్పారు. బలమైన నాయకత్వాన్ని త యారు చేసుకోవడంపైనే మన దార్శనికత, భవిష్యత్తు ఆధారపడి ఉన్నా యని తెలిపారు. ‘సోల్’ నుంచి సమర్థులైన నాయకులు బయటకు రావాలని ఆకాంక్షించారు. మనమంతా ఉమ్మడి లక్ష్యం, సమ్మిళిత ప్రయత్నాలతో ముందుకు కదిలితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు. 21వ శతాబ్దంలో జని్మంచినవారు భారతీయ సమాజాన్ని తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. యువశక్తితో దేశం నవ్య పథంలో పయనించబోతోందని అన్నారు. ‘సోల్’సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి దాషో త్సెరింగ్ తాబ్గే సైతం పాల్గొన్నారు. మోదీ గొప్ప నాయకుడు అని ప్రశంసించారు. ఆయన తనకు పెద్దన్న లాంటివారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment