
కీలక అధికారి లేకుండానే.. మాస్టర్ ప్లాన్ ఒప్పందం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ కారదర్శి గిరిధర్ లేకుండా ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఒప్పందం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసింది. గిరిధర్ సమక్షంలో జరగాల్సిన ఈ ఒప్పందం ఆయన లేకుండానే చేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు, ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణలతో గిరిధర్కు విబేధాల వల్లే ఆయన సెలవులో వెళ్లారని సమాచారం. ఈ నెల 11 నుంచి గిరిధర్ సెలవులో ఉన్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని గిరిధర్ వ్యతిరేకించారని తెలుస్తోంది. తనను పట్టణాభివృద్ధి శాఖ నుంచి బదిలీ చేయాలని గిరిధర్ కోరుతున్నట్టు సమాచారం. చంద్రబాబు ఇటీవలి జపాన్ పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.