
ఉక్కు శాఖతో ఎన్ఎండీసీ అవగాహన
హైదరాబాద్: ఇనుప ఖనిజ సరఫరాకు సంబంధించి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖతో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరే షన్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారంనాడిక్కడ ఎన్ఎండీసీ కార్యాలయంలో ఈ మేరకు ఒప్పంద పత్రాలను మార్పిడి చేసుకున్నారు.
కేంద్ర ఉక్కు కార్యదర్శి రాకేష్ సింగ్, ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారిలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సంయుక్త కార్యదర్శి సయిదైన్ అబ్బాసి, ఎన్ఎండీసీ డెరైక్టర్లు నరేంద్ర కె. నంద (టెక్నికల్), రబీంద్ర సింగ్ (పర్సనల్), డాక్టర్ టీఆర్కె రావు ( కమర్షియల్), పీకే సత్పతి (ప్రొడక్షన్), డీఎస్ అహ్లువాలియ (ఫైనాన్స్) తదితరులు పాల్గొన్నారు.