
ఇండో-పాక్ పై మోదీకి స్వామి లేఖ
న్యూఢిల్లీ: ఇండో-పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బీజీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. దేశీయ పరిశ్రమలు, జాతీయ భద్రత రీత్యా పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతిని నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, దేశీయ సిమెంట్ పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడం, జాతీయ భద్రతా కారణాలరీత్యా మాత్రమే దేశంలోకి సిమెంట్ దిగుమతి నిషేధించాలని అభ్యర్థిస్తున్నానని స్వామి మోదీకి రాసిన ఒక లేఖలో విజ్క్షప్తి చేశారు.
పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతులను అనుమతించడమంటే నిషిద్ధ వస్తువులు, హానికరమైన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి అక్రమ రవాణాకు ఆస్కారం అందించినట్టేనని ఆయన వాదించారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ నుంచి సిమెంట్ దిగుమతికి మన దేశం ఒక డంపింగ్ గ్రౌండ్ గా మారిందన్నారు. పాకిస్తాన్ నుంచి పన్నులు లేని సిమెంట్ దిగుమతులకు అనుమతి ఇవ్వడం ద్వారా దేశీయ సిమెంట్ పరిశ్రలను పణంగా పెట్టారని విమర్శించారు. సిమెంట్ పై కాకుండా సిమెంట్ తయారీకి అవసరమైన పదార్థాలపై పన్నులు విధించడం ద్వారా దిగుమతి సుంకాన్ని ఆకర్షించవచ్చని స్వామి సూచించారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కు ఇది వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.