
‘అమెరికా పునరాలోచించుకోవాలి’
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్–అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపగలదని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ అన్నారు. ఈ నిర్ణయంపై అమెరికా పునరాలోచించుకోవాలని సూచించారు. అమెరికాలో సాంకేతిక రంగం ఎదుగుదలకు భారతీయులు, భారత కంపెనీలు దోహదం చేశాయనీ, ఈ రంగ అభివృద్ధికి మేధో పరమైన పెట్టుబడులను భారతీయులు పెట్టారని ఆయన అన్నారు. అమెరికాలోని అట్లాంటిక్ కౌన్సిల్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) అధ్యక్షుడి నేతృత్వంలో ఒక బృందం ఈ వారంలో వాషింగ్టన్లో పర్యటించి హెచ్–1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వ అధికారులు, మేధో సంస్థలు, చట్టసభల సభ్యులతో చర్చలు జరపనుంది. ఈ బృందంలో మనీష్ తివారీ కూడా సభ్యుడిగా ఉన్నారు.