ఉద్యోగాలు సేఫ్..భరోసా ఇస్తున్న సీఈవోలు
కోల్ కత్తా : ఐడియా, వొడాఫోన్ల మెగా విలీన ప్రకటన అనంతరం తమ ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? అని ఆందోళన చెందుతున్న ఎంప్లాయీస్ కు కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల జాబ్స్ సేఫ్ గానే ఉంటాయని ప్రకటించాయి. ఐడియాలో ఎలాంటి ఉద్యోగాల కోత లేదని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా స్పష్టంచేశారు. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో విలీనాంతరం ఏర్పడబోయే అతిపెద్ద టెలికాం కంపెనీకి చైర్మన్ గా కుమార్ మంగళం బిర్లానే వ్యవహరించనున్నారని తెలిసింది. వొడాఫోన్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ను అపాయింట్ చేయనుంది.
తమ సంబంధిత సర్కిళ్లలో బలమైన ఉనికిని చాటుకోవడానికి ఇరు కంపెనీలు వేరువేరుగానే కార్యకలాపాలు నిర్వహించనున్నాయని ఈ టెలికాం దిగ్గజాలు పేర్కొన్నాయి. ఇండియన్ స్టాఫ్ కు కొత్త ప్రొఫిషనల్ అవకాశాలు కల్పించడానికి ఈ విలీనం ఎంతో సహకరించనుందని తెలుపుతూ వొడాఫోన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విట్టోరియో కోలో తమ భారత ఉద్యోగులకు ఓ ఈ-మెయిల్ పంపారు. ఎంతో ఆకట్టుకునే కంపెనీగా వొడాఫోన్ ను తీర్చిదిద్దడానికి వొడాఫోన్ ఇండియా టీమ్ కు ఈ డీల్ సహకరించనుందని పేర్కొన్నారు. గట్టి పోటీ ఉండే ఇండియా మార్కెట్లో విజయం సాధించడానికే వొడాఫోన్ ఇండియా ఉద్యోగులు ఎక్కువగా ఫోకస్ చేస్తారని కృషిచేస్తారని అభిప్రాయపడ్డారు.