
రెండేళ్లలో భారత్లో రూ. 18,600 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ గ్రామీణ ప్రాంతాలలోనూ తమ నెట్వర్క్ విస్తరించేందుకు వీలుగా రానున్న రెండేళ్లలో 300 కోట్ల డాలర్ల(సుమారు రూ. 18,600 కోట్లు)ను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మొబైల్ దిగ్గజం వొడాఫోన్ తెలిపింది. ప్రభుత్వంతో కంపెనీకి రూ. 11,200 కోట్లమేర ఆదాయ పన్ను చెల్లింపు వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరంతో వొడాఫోన్ గ్లోబల్ సీఈవో విటోరియో కొలావో సమావేశమయ్యారు. పన్ను వివాద పరిష్కారం కోసం సమావేశమైన కొలాలో ఆ వివరాలను తెలిపేందుకు నిరాకరిస్తూనే ఆర్థిక మంత్రితో సమావేశం ఫలవంతమైనట్లు విలేకరులకు చెప్పారు.
సమావేశానికి అవకాశమిచ్చిన ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీకి సంబంధించి వ్యాపారపరంగానేకాకుండా ఇతర అంశాలలోనూ భారత్కు ప్రాధాన్యత ఉందన్నారు. దేశంలో తమ నెట్వర్క్ను మరింత విస్తరించడం, పటిష్టపరచడం వంటి కార్యక్రమాలకు రెండేళ్లలో 300 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో పన్ను వివాదం కొనసాగుతున్నప్పటికీ తమ పెట్టుబడి ప్రణాళికలపై ఈ ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. దీర్ఘకాల ప్రణాళికలకు జర్మనీ తరువాత భారత్ తమకు కీలక మార్కెట్ అని చెప్పారు. విస్తరణపై వెచ్చించే నిధులను స్పెక్ట్రమ్ చెల్లింపులకు వినియోగించబోమన్నారు. భారత్ మార్కెట్కు సంబంధించి కేవలం నాలుగేళ్ల కోసం కాకుండా 20 ఏళ్లకుపైబడిన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.