Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Police prevented Anganwadis from going to the Mahadharna1
అంగన్‌వాడీ ఆగ్రహ వేడి..

వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంగన్‌వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్‌వాడీలను అశ్వారావుపేట బోర్డర్‌లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్‌ గేట్‌ వద్ద ప్రైవేట్‌ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్‌వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్‌డౌన్‌! కూటమి సర్కా­రుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్‌ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజ­యవాడ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్‌వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్‌వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్‌వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్‌వాడీలను పోలీసులు హౌస్‌ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంగన్‌వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్‌వాడీలను అశ్వారావుపేట బోర్డర్‌లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్‌ గేట్‌ వద్ద ప్రైవేట్‌ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్‌ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్‌వాడీలను కలసిన నారా లోకేశ్‌ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్‌సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చింద­న్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్‌లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్‌వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్‌­వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్‌వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్‌వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్‌ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్‌ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్‌ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్‌వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్‌ మండలంలో ఐసీడీఎస్‌ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్‌వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్‌ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్‌వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్‌వాడీలు విజయనగరం కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్‌వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ సెంట­ర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్‌వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు చేయాలి. » పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్‌ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్‌వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్‌ పిల్లలకు సాయంత్రం స్నాక్స్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్‌ బుక్‌ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్‌బుక్‌ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్‌వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్‌ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్‌వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్‌లో రాస్తా రోకో చేశారు.

CM Revanth Reddy Sensational Comments On KCR: Telangana2
కేసీఆర్‌ను కొట్టింది నేనే.. గద్దె దింపిందీ నేనే!

సాక్షి, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌(KCR)ను బండకేసి కొట్టింది నేనే.. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ఓడగొట్టిందీ నేనే. గద్దె దింపింది నేనే..ఆ కుర్చిలో కూర్చుందీ నేనే. సీఎంగా ఉండి పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గుండు సున్నా ఇచ్చింది నేనే. ప్రస్తు­తం నాది ముఖ్యమంత్రి స్థాయి. ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.స్థాయి అంటే ఏంటని, ఎలా వస్తుందని ప్రశ్నించారు. ‘ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగితే స్థాయి వస్తుందా? డ్రగ్స్‌ పెట్టుకుని పార్టీలు చేసుకుంటే వస్తుందా?..’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీ­సీసీ చీఫ్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా­తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. కేసీఆర్‌ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా రేవంత్‌ స్పందించారు. కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు ‘కేసీఆర్‌కు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదు. ఆయనకు, కొడుకు కేటీఆర్‌కు బలుపు తప్ప ఏమీ లేవు. ఆ కుటుంబానికి ఎందుకంత బరితెగింపో అర్థం కావడం లేదు. అయినా కేసీఆర్‌ చెల్లని రూ­పా­యి. ఆయన గురించి మాట్లాడడం వృ«థా. బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులు, తప్పుల కారణంగానే రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు. 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. అయినా బీఆర్‌ఎస్‌కు తెలంగాణతో సంబంధం లేదు. అందుకే వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాష్ట్రానికి ఏమీ జరగొద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. స్పైడర్‌ సినిమాలో విలన్‌ తరహాలో రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు సంబరపడుతూ, తీన్మార్‌ డ్యాన్సులు చేస్తున్నారు. యూజ్‌లెస్‌ ఫెలో మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు కేసీఆర్‌ పదేళ్లలో చేయలేని పనులు మేము 14 నెలల్లో చేశాం. కాళేశ్వరం, మేడిగడ్డలు లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండించాం. అయినా రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పి రొయ్యల పులుసు తిన్నోళ్లు ఎవరు? యూజ్‌లెస్‌ ఫెలో, హౌలేగాడు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి హరీశ్‌రావు లొంగిపోయాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పని చేయాలని, కాంగ్రెస్‌ను ఓడించాలనే ఉద్దేశంతోనే డబ్బులు పంచి మరీ బీజేపీకి హరీశ్‌రావు ఓట్లు వేయించాడు..’ అని రేవంత్‌ ఆరోపించారు. నిధులు ఏ రూపంలో వచ్చినా లెక్కబెడదాం ‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధం కావాలి. 2014 జూన్‌ 2 నుంచి పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి ఎన్ని నిధులు వెళ్లాయి? మళ్లీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తిరిగి వచ్చాయి? ఏ రూపంలో వచ్చినా సరే లెక్కపెడదాం. నేను, మా ఉప ముఖ్యమంత్రి భట్టి వస్తాం. కిషన్‌రెడ్డితో పాటు ఎవరినైనా రమ్మనండి. చర్చిద్దాం. తెలంగాణ నుంచి వెళ్లిన దానికంటే కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చినా అక్కడే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తా..’ అని సీఎం సవాల్‌ చేశారు. ఎక్కువ సాగుతోనే నీటికి ఇబ్బందులు ‘గత పదేళ్ల కాలంలో కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మా నడ్డి విరుగుతోంది. అయినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎప్పుడైనా యాసంగిలో 35–40 లక్షల ఎకరాలు సాగవుతుంది. కానీ ఈసారి రాష్ట్రంలో ఏకంగా 55 లక్షల ఎకరాలు సాగయింది. అందుకే అక్కడక్కడా నీటికి ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఏ రిజర్వాయర్‌ నుంచి ఏ మేరకు ఎప్పుడు నీళ్లు ఇవ్వాలన్న దానిపై అధికారులు ఎప్పుడో షెడ్యూల్‌ సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్ర నుంచి వచ్చే అనుమతులను బట్టి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం పనులు ఉంటాయి. రిజల్ట్స్‌ వేరు..రిజర్వేషన్లు వేరు కృష్ణమాదిగ బీజేపీ నేతలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. రిజల్ట్స్‌ వేరు, రిజర్వేషన్లు వేరు. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్న రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల మేరకు ఇప్పుడు ఫలితాలు ప్రకటిస్తున్నాం. పాత నిబంధనలను మేము మార్చలేం. కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే అందరికీ న్యాయం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడ? ‘రీజనల్‌ రింగు రోడ్డు ఇచ్చామంటూ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ చెప్పిన మాటను నిలబెట్టుకోవాలి. నేను మెట్రో తెచ్చానని కిషన్‌రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్‌లో జైపాల్‌రెడ్డి తెచ్చిన మెట్రో కనపడుతోంది కానీ కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి భట్టి నిర్వహించిన సమావేశానికి రమ్మంటే సమయం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. మరి కేంద్రమంత్రి ఖట్టర్‌ సికింద్రాబాద్‌లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు ఎందుకు వెళ్లలేదు? కేంద్రమంత్రి ఖట్టర్‌ కూడా కిషన్‌రెడ్డిని హడావుడిగా పిలిచాడా? కేసీఆర్‌ ఫీలవుతాడనే ఆ సమావేశానికి కిషన్‌రెడ్డి వెళ్లలేదు. కేసీఆర్‌ చెప్పిన చదువు మా దగ్గర చెపితే ఎలా?..’ అని రేవంత్‌ అన్నారు.

Rohit reaction on playing in the upcoming World Cup3
‘2027’పై ఇప్పుడే చెప్పను!

దుబాయ్‌: వరుసగా గత మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌ చేరిన భారత జట్టు రెండు టైటిల్స్‌ నెగ్గి మరో దాంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఈ మూడు టోర్నీలు కలిపి 24 మ్యాచ్‌లు ఆడితే ఒక్క వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మినహా మిగతా 23 మ్యాచ్‌లు గెలిచింది. వరుసగా టి20 వరల్డ్‌ కప్, చాంపియన్స్‌ ట్రోఫీలలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా ట్రోఫీని సాధించింది. ఇది అసాధారణ ఘనత అని, తమ జట్టు స్థాయిని ప్రదర్శించామని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఘనత. మా టీమ్‌ ఎంత బలంగా ఉందో ఇది చూపించింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు వారి మధ్య చక్కటి సమన్వయం, బయటి అంశాలను పట్టించుకోకుండా ఒత్తిడిని అధిగమించి ఇలాంటి విజయాలు సాధించడం అసాధారణం. విజయం సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ పని చేశారు’ అని రోహిత్‌ అన్నాడు. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు సాధించడం అంత సులువైన విషయం కాదని, దాని వెనక చాలా శ్రమ ఉందని అతను చెప్పాడు. ‘చాలా తక్కువ జట్లు మాత్రమే ఓటమి లేకుండా వరుసగా రెండు ట్రోఫీలు గెలిచాయి. అన్నీ మా వ్యూహాల ప్రకారమే ఆడి సఫలమయ్యాం. వన్డే వరల్డ్‌ కప్‌లో చాలా అద్భుతంగా ఆడిన తర్వాత కూడా ఫైనల్లో ఓడాం. ఇదే విషయాన్ని కుర్రాళ్లకు చెబుతూ గత రెండు ఫైనల్స్‌కు ముందు చివరి బంతి పడే వరకు పోరాడమని స్ఫూర్తి నింపాం. ఇదే ఫలితాన్ని అందించింది’ అని రోహిత్‌ వెల్లడించాడు. తమ తుది జట్టులో వైవిధ్యమైన ఆటగాళ్లు ఉండటం విజయానికి కారణమని కూడా అతను విశ్లేషించాడు. ‘1 నుంచి 11వ నంబర్‌ ఆటగాడి వరకు ఏదో ఒక రూపంలో జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ సమష్టితత్వంతో పాటు గెలవాలనే కసి కూడా వారిలో కనిపించింది’ అని రోహిత్‌ వివరించాడు. 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడే విషయంపై తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్య చేయనని, ప్రస్తుతానికి తాజా విజయాలను ఆస్వాదిస్తున్నట్లు రోహిత్‌ స్పష్టం చేశాడు. ఈ ఫార్మాట్‌ నుంచి తాను రిటైర్‌ కావడం లేదని ఆదివారమే మ్యాచ్‌ అనంతరం అతను వెల్లడించాడు. ‘ప్రస్తుతం అంతా బాగుంది. భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం అప్పుడే లేదు. 2027 వన్డే వరల్డ్‌ కప్‌ ఆడతానా లేదా అని ఇప్పుడే చెప్పను. దీని గురించి ఈ సమయంలో మాట్లాడటం అనవసరం. నా కెరీర్‌లో ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాను. మున్ముందు ఏం జరుగుతుందో ఎప్పుడూ ఆలోచించలేదు. నా సహచరులతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. అది చాలు’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు.

Rasi Phalalu: Daily Horoscope On 11 March 2025 In Telugu4
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.ద్వాదశి ఉ.9.34 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆశ్లేష రా.2.58 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ప.3.32 నుండి 5.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.38 నుండి 9.26 వరకు, తదుపరి రా.11.00 నుండి 11.48 వరకు, అమృతఘడియలు: రా.1.28 నుండి 2.07 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.16, సూర్యాస్తమయం: 6.04. మేషం: కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.వృషభం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.మిథునం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కర్కాటకం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.సింహం: కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తిపై సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.తుల: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం: కష్టానికి ఫలితం కనిపించదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.ధనుస్సు: మిత్రులతో కలహాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మకరం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. స్థిరాస్తివృద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కుంభం: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.మీనం: ఆర్థిక ఇబ్బందులు. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

Donald Trump calls on Iran to come to talks on nuclear deal5
ట్రంప్‌ శాంతిమంత్రం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈసారి ఎవరి అంచనాలకూ అందకూడదన్న సంకల్పంతో ఉన్నట్టు కనబడుతోంది. సరిగ్గా నెల్లాళ్ల క్రితం ఆయన ఇరాన్‌పై ఆంక్షల తీవ్రతను పెంచారు. అంతే కాదు... తనను చంపటానికి ప్రయత్నిస్తే ఇరాన్‌ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్‌పై దాడి చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చానన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రావా లని ఇరాన్‌కు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. సైనిక చర్య తీసుకుంటే ఇరాన్‌ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది గనుకే చర్చలకు పిలుపునిచ్చానని ట్రంప్‌ వివరణనిచ్చారు. తొలిసారి అధికారంలోకొచ్చినప్పుడు అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా ట్రంప్‌ 2018లో ఏకపక్షంగా రద్దుచేశారు. అది కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్‌)తో పాటు జర్మనీ, యూరప్‌ యూనియన్‌(ఈయూ)లు, ఇటుఇరాన్‌ సంతకాలు చేశాయి. ఆంక్షలు సడలించటానికి అంగీకరించాయి. ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్‌లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్‌ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్‌ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. జో బైడెన్‌ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు.ట్రంప్‌ తాజా ప్రతిపాదనలో చర్చల ప్రస్తావన ఉన్నా నిజానికది మరిన్ని డిమాండ్లు తమముందుంచి లొంగదీసుకోవటానికేనని ఇరాన్‌ మత నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ చేసిన ప్రకటనను కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇరాన్‌లో తమ కీలుబొమ్మ పాలకుడు మహమద్‌ రెజా పహ్లావీ (ఇరాన్‌ షా) 1979లో జరిగిన ఇస్లామిక్‌ విప్లవంలో పదవీచ్యుతుడైనప్పటినుంచీ అమెరికా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. ఆనాటినుంచి కొనసాగిన ఆంక్షల పర్వం ఎడతెరిపి లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు విధించటం కూడా పరిపాటైంది. 1988లో 290 మందితో వెళ్తున్న ఇరాన్‌ ప్రయాణికుల విమానాన్ని సైనిక విమానంగా భావించి అమెరికా కూల్చివేసింది. తాను విధించిన ఆంక్షల్ని మరింత విస్తృతం చేయటానికి 2006లో భద్రతామండలిలో తీర్మానం చేయించింది. 2012లో ఈ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. పర్యవసానంగా పసిపిల్లలకు పాలడబ్బాలు, ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్‌ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తన ప్రధాన ఆదాయ వనరైన ముడిచమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవటంతో... అమె రికా బ్యాంకుల్లోవున్న వేలాదికోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్ల స్తంభించటంతో ఇరాన్‌ ఎన్నో అగచాట్లు పడింది. అణ్వాయుధాల విషయంలో ఇరాన్‌ వాదన సమంజసమైనది. అణు కార్య క్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని, పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం మొదటినుంచీ కోరుతోంది. ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది. గత ఒప్పందం రద్దయ్యాక అమెరికా, ఇరాన్‌లమధ్య పర స్పరం అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలుత తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. ట్రంప్‌ తాజా ప్రతిపాదనలోని ముఖ్యాంశాలేమిటో ఎవరికీ తెలియదు. ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నదని ట్రంప్‌ ఆరోపించారు. దాన్ని మరింత పకడ్బందీగా మారుస్తామన్నారు. ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది. తాము కేవలం ఇరాన్‌ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని, ఇతర అంశాలు ఒప్పుకోబోమని చెప్పారు. క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఆయన అభిప్రాయంలా కనబడుతోంది. సంస్కరణవాది మసూద్‌ పెజెష్కియాన్‌ నిరుడు జూన్‌లో ఇరాన్‌ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక ఆ దేశం వైఖరి మారింది. అగ్రరాజ్యాలతో చర్చించి 2015 నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చు కోవటానికి తాను సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌కు మంచి సంబంధాలే వున్నాయి. ఇరాన్‌తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్‌ హామీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్‌ ఇంకా అణ్వస్త్ర తయారీ స్థాయికి ఎదగలేదు. ట్రంప్‌ తొలి ఏలుబడి నాటికి పశ్చిమాసియాలో ఇరాన్‌ దాదాపు ఏకాకి. సౌదీ అరేబి యాతో దానికి ఘర్షణ వాతావరణం ఉండేది. ఇప్పుడలా కాదు. ఇరాన్‌తో దాదాపు పశ్చిమాసియా దేశాలన్నిటికీ మెరుగైన సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రపంచ వాణిజ్యాన్ని ఛిద్రం చేస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లతో ఇరాన్‌కు సాన్నిహిత్యముంది. అందువల్ల ఇరాన్‌తో నిజంగా ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. అయితే ఇరాన్‌నుంచి ఆశించే ఎలాంటి ఆచరణైనా ఇజ్రాయెల్‌కు కూడా వర్తింపజే సినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. కాని పక్షంలో ఈ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది.

Amrutha Pranay Case Verdict: Accused Subhash Kumar Sharma has been sentenced to death6
ప్రణయ్‌ హంతకుడికి ఉరి

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌ పరువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఐపీసీ సెక్షన్‌ 302, 129 (బీ), 109 ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ యాక్ట్‌ కింద నిందితులకు శిక్షలు ఖరా రు చేస్తూ.. నల్లగొండ రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి సోమవారం తీర్పు ఇచ్చారు.ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావు నాలుగేళ్ల కింద ఆత్మహత్య చేసుకోగా.. ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌శర్మకు మరణశిక్ష విధించారు. ఏ3గా ఉన్న మహ్మద్‌ అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్‌ అబ్దుల్‌ బారీ, ఏ5 అబ్దుల్‌ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ నిజాంలకు జీవిత ఖైదు విధించారు. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ హత్యకు గురవగా.. సుమారు ఆరున్నరేళ్ల విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడింది.కూతురి ప్రేమ వివాహాన్ని తట్టుకోలేక.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతీరావు, గిరిజ దంపతులకు అమృత వర్షిణి ఒక్కరే కూతురు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతుల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్‌. ఇద్దరూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో 2018 జనవరి 30న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసు కున్నారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తన తండ్రి మారుతీరావు నుంచి రక్షణకల్పించాలని అమృత వర్షిణి పోలీసులను కోరారు. దీని తో పోలీసులు ప్రణయ్, అమృత ఇద్దరి తల్లి దండ్రులను మిర్యాలగూడ డీఎíస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. అనంతరం అమృత ప్రణయ్‌తో కలసి ముత్తిరెడ్డికుంటలోని ఇంటికి వెళ్లారు.తర్వాత ప్రణయ్‌ కుటుంబం ఆధ్వర్యంలో వారు వివాహ రిసెప్షన్‌ చేసుకున్నారు. సుపారీ గ్యాంగ్‌తో హత్య..: కూతురు ప్రేమ వివాహం, పట్టణంలోనే రిసెప్షన్‌ చేసుకోవడాన్ని చూసి మారుతీరావు తట్టుకోలేకపోయారు. ప్రణయ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. సుపారీ గ్యాంగ్‌కు రూ.కోటి ఇచ్చి ప్రణయ్‌ హత్యకు ప్లాన్‌ చేశారు. అప్పటికే అమృత, ప్రణయ్‌ వివాహమై 8 నెలలు గడిచింది.అమృత 5 నెలల గర్భిణి కూడా. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ తల్లితో కలసి అమృతను మెడికల్‌ చెకప్‌ కోసం పట్టణంలోని జ్యోతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న బిహారీ సుపారీ కిల్లర్‌ సుభాష్ కుమార్‌ శర్మ కత్తితో ప్రణయ్‌పై దాడి చేశాడు. అజ్గర్‌ అలీ, నిజాం అతడికి సాయం చేశారు. ప్రణయ్‌ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 1,200 పేజీలతో చార్జిషిట్‌.. ప్రణయ్‌ పరువు హత్య అప్పట్లో జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఆ సమయంలో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్‌ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు.. ఆస్పత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా మిర్యాలగూడ పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు. 4 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. 9 నెలల పాటు దర్యాప్తు చేసి, 78 మంది సాక్షులను ప్రశ్నించి 2019 జూన్‌ 19న 1,200 పేజీలతో చార్జిషిట్‌ను దాఖలు చేశారు. 8 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లోని గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగింది. తాజాగా సోమవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఏ2 సుభా‹Ùకుమార్‌ శర్మకు న్యాయమూర్తి ఐపీసీ సెక్షన్‌ 302, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, సెక్షన్‌ 27 (3), ఆయుధ నిరోధక చట్టం కింద మరణశిక్ష విధించారు. హత్యలో పాలుపంచుకున్న ఏ3 అజ్గర్‌ అలీ, ఏ4 మహ్మద్‌ అబ్దుల్‌ బారీ, ఏ5 మహ్మద్‌ అబ్దుల్‌ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్‌ సముద్రాల శివ, ఏ8 ఆటోడ్రైవర్‌ ఎంఏ నిజాంలకు ఐపీసీ 302 రెడ్‌విత్‌ 120 (బీ), 109, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద జీవిత ఖైదు విధించారు. ఇక రూ.10 వేల నుంచి రూ.15 వేలు జరిమానాలు చెల్లించాలని, లేదంటే 4 నెలలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో వెల్లడించారు.కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత: ప్రణయ్‌ హత్య కేసులో సోమవారం తుది తీర్పు వెలువడు తుందని తెలిసిన ప్రజా సంఘాల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. దీనితో పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, సిబ్బంది, నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించాక.. నింది తుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు. తన తండ్రి ఎలాంటి నేరం చేయలేదని, అయినా శిక్ష పడిందంటూ.. తిరునగరు శ్రవణ్‌కుమార్‌ కూతురు శ్రుతి బోరున విలపించింది. కాగా.. కోర్టు తీర్పు పరువు హత్యలకు పాల్పడే వారికి చెంప పెట్టు వంటిదని ప్రణయ్‌ హత్య కేసును వాదించిన స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దర్శనం నర్సింహ పేర్కొన్నారు.అమృతకు బాసటగా కౌసల్య మిర్యాలగూడ అర్బన్‌: ప్రణయ్‌ హత్య ఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేప డంతో.. ఇదే తరహాలో బాధితురాలిగా మారిన తమిళనాడు మహిళ కౌసల్య మిర్యాలగూడకు వచ్చి అమృతకు బాసట గా నిలిచారు. కౌసల్య గతంలో శంకర్‌ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివా హం చేసుకుంది. ఇది తట్టుకోలేని కౌసల్య తండ్రి.. శంకర్‌ను హత్య చేయించాడు. తన భర్త మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పోరాటం చేసిన కౌసల్య నిందితులకు శిక్షపడేలా చేసింది.ప్రణయ్‌ ఘటన విషయం తెలిసి మిర్యాలగూడకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం, ఆ కేసులో నిందితులకు పడిన శిక్షలను అమృతకు వివరించి ధైర్యం చెప్పింది. తమిళ నాడులోని కేసుకు సంబంధించిన ఫైల్‌ కాపీని సైతం ఆమె ఇక్కడి పోలీసులకు అందజేసినట్టు సమాచారం.కేరళ ఎంపీ డిమాండ్‌తో..: కేరళకు చెందిన దళిత సోషల్‌ ముక్తి మంచ్‌ జాతీయ నాయకుడు, ఎంపీ సోం ప్రసాద్‌ మిర్యాల గూడకు వచ్చి.. అమృతను పరామర్శించారు. దేశంలో పరువు హత్యలను నివారించడానికి ప్రణయ్‌ చట్టం తేవాలని ఆయన పార్లమెంట్‌ సమావేశాల్లో డిమాండ్‌ చేశారు. దానితో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది.

Varma played key role in Pawans entry into assembly7
నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ!

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్‌ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్‌వీ­ఎస్‌ఎన్‌ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టా­రనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్‌ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు ప్రొటోకాల్‌ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్ర­బాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళన­లోనూ పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్‌ అంచనా వేస్తున్నట్లు సమాచారం. సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్‌ కళ్యాణ్‌ గెలవలేకపో­యిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజక­వర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయ­నను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపో­యారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠా­పురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటు­ను తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళ­నకు దిగాయి. టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయ­నను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్‌ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతి­మిలాడి ఆయన పవన్‌ కోసం పని చేయించారు. పవన్‌ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర పవన్‌ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పి­నట్లు ప్రచారం జరిగింది. దీంతో పవ­న్‌­ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పని­­చేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపో­యిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంప­డంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకే పవన్‌ అడ్డు­పడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీ­య భవి­ష్యత్తు ఇచ్చిన వర్మను పవన్‌ దెబ్బ­కొ­ట్ట­డం దారుణ­మని వాపోతున్నాయి. ఎమ్మె­ల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యా­యం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి.

Fuel Tanker And Cargo Ship Collide Near England8
ఇంగ్లండ్‌ తీరంలో రెండు నౌకలు ఢీ

లండన్‌: ఇంగ్లండ్‌ తూర్పు తీరంలో ఆయిల్‌ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్‌ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్‌ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు. గ్రీస్‌ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్‌ పేరున్న ఆయిల్‌ ట్యాంకర్‌ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్‌ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్‌ వైపు వెళ్తున్న పోర్చుగల్‌ సరుకు నౌక సొలొంగ్‌ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్‌ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్‌ మారిటైం కోస్ట్‌గార్డ్‌ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్‌బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్‌ను పంపించింది. నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్‌బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు. కాగా, స్టెనా ఇమాక్యులేట్‌ ఓడలో జెట్‌–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్‌మెంట్‌ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్‌ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్‌ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది.

Higher education is out of reach for children from poor families due to fee reimbursement arrears9
కూటమి ప్రభుత్వ కుట్రతో .. యువ శక్తి నిర్వీర్యం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. యాజమాన్యం తరగతి గది నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తుందోనన్న అవమాన భారంతోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నారు. కళ్ల ముందే బిడ్డలు పడుతున్న అవస్థలు చూడలేక పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టిమరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న దుర్భర పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలోని చివరి రెండు త్రైమాసికాలకు కలిపి రూ.1,400 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,100 కోట్లను జూన్‌లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ఖర్చులను నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ.3,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయి పెట్టింది. కూటమి సర్కారు ఏర్పడిన ఈ 9 నెలల్లో మొక్కుబడి ప్రకటనలు మినహా విద్యార్థులకు ఒరగబెట్టిందేమీ లేదు. దీనికితోడు గత విద్యా సంవత్సరంలోని వసతి దీవెన చెల్లింపులు రూ.1,100 కోట్లకు మంగళం పాడింది. విద్యార్థులకు మొత్తం రూ.4600 కోట్లు బకాయిపడింది. అయితే, వైఎస్సార్‌సీపీ ‘యువత పోరుబాట’ ప్రకటనతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక త్రైమాసికంలో రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు పాక్షిక చెల్లింపులు మాత్రమే జరిగాయి. చాలావరకు నిధులు ఇంకా కళాశాలల ఖాతాల్లో జమకాకపోవడం గమనార్హం. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదువుతున్నవారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రగల్భాలు పలికారు. వారిని నమ్మి ప్రైవేటు కళాశాలల్లో చేరినవారి నెత్తిన పిడుగుపడినట్లయింది. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ ఇలా.. ఉన్నత విద్యను సొంత డబ్బు పెట్టి చదువుకోలేనివారు తీవ్ర సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.ఇవ్వాల్సింది.. ఇచ్చేది.. అంతా మాయే!ఉన్నత విద్యలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాలి. వసతి దీవెనగా ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు అందించాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది మాత్రం రూ.700 కోట్లే. అందులోనూ పూర్తి సొమ్ములు కళాశాలలకు చేరలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు వచ్చే స్కాలర్‌షిప్‌లు మాత్రమే జమయ్యాయి. ఇక 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయిలు పెట్టింది. వచ్చే విద్యా సంవత్సరానికి మరో రూ.3,900 కోట్లను కలుపుకొని మొత్తం రూ.7,100 కోట్లు చెల్లించాలి. తాజా బడ్జెట్‌లో మాత్రం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే కూటమి చెప్పిన పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ హామీ బూటకంగా తేలిపోయింది. పాత బకాయిలూ ఇచ్చిన వైఎస్‌ జగన్‌2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా చదివించింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. మొత్తం రూ.18,663.44 కోట్లను అందజేశారు.తొలి సంతకానికి విలువేది?కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న కొలువులు ఊడబీకి వలంటీర్లను నడిరోడ్డుపైకి లాగేశారు. రూ.10 వేలు వేతనం ఇస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పించి పీఠం ఎక్కిన తర్వాత 2.60 లక్షల మంది వలంటీర్ల జీవితాలను గాలికి వదిలేశారు. మరోవైపు తొలి సంతకం అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొట్టిన డీఎస్సీకి 9 నెలలైనా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. సుమారు 16,347 పోస్టులను ప్రకటించి.. డిసెంబరు నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేశారు. జనవరి వెళ్లిపోయే.. జాబ్‌ కేలండర్‌ పోయే!‘ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. జగన్‌లాగా పారిపోయే బ్యాచ్‌ కాదు నేను’..2024 ఫిబ్రవరి 13న యువగళం సభలో మంత్రి నారా లోకేష్‌ చెప్పిన మాటలు ఇవి. కానీ, ఎన్నికలై, ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్‌ కేలండర్‌ ఊసే మర్చిపోయారు. లోకేష్‌ మాత్రమే కాదు.. చంద్రబాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. జనవరి 1 వెళ్లిపోయింది, ఫిబ్రవరి దాటేసింది, మార్చి కూడా అయిపోతోంది..! కానీ జాబ్‌ కేలండర్‌ ప్రకటన లేదు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతున్నా ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. వైద్య కళాశాలలపై ప్రైవేటు కత్తివైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తూ పేదింటి బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 700 సీట్లు కోల్పోగా, వచ్చే ఏడాది అదనంగా వచ్చే సీట్లతో కలిపి మొత్తం 2500 సీట్లను కోల్పోవాల్సి వస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ! వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫి కేషన్లు ఇచ్చి పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. ప్రతి నోటిఫికేషన్‌కు షెడ్యూల్‌లో ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు జరిపింది. రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేపట్టి 1.34 లక్షల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చిన పరీక్షలను సైతం కోర్టు కేసులతో పాటు అన్ని వివాదాలను పరిష్కరించి పోస్టులు భర్తీ చేసింది. ప్రస్తుతం పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రతి నెల సగటున రూ.15 వేల చొప్పున ఖర్చు చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఉద్యోగం రాలేదు.. భృతి ఇవ్వలేదు!చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌ లలో నిరుద్యోగుల సంక్షేమానికి పైసా కూడా విదల్చలేదు. ఏపీలో గత ఏడాది 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి ఒకరిని గుర్తించినా నెలకు రూ.3 వేల చొప్పున రూ.4,800 కోట్లు, ఏడాదికి రూ.57,600 కోట్లు కేటాయించాల్సి ఉండగా మొండిచెయ్యి చూపింది. 2025–26 బడ్జెట్‌కు వచ్చేసరికి కుటుంబాల సంఖ్య 1.70 కోట్లకు చేరింది. ఈ లెక్కన నెలకు రూ.5,100 కోట్లు ఏడాదికి రూ.61,200 కోట్లు అవుతోంది.

Nirmal SP Janaki Sharmila New Step for Girl Student Safety10
పోలీస్‌ అక్క భద్రత.. భరోసా

‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్‌ కాని ఫ్రెండ్‌. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్‌ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్‌కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్‌క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్‌టచ్‌–బ్యాడ్‌టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్‌ జిల్లాలోనే తొలి పోస్టింగ్‌ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్‌ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్‌ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్‌ ఒక జూనియర్‌ని గైడ్‌ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్‌ సెలబ్రిటీలు, మోటివేషనల్‌ స్పీకర్‌లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్‌ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్‌ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్‌ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్‌ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్‌ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్‌లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్‌ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్‌ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్‌ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్‌ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్‌– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

title
ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’

అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో  మెడికల్‌ కాన్ఫరెన్స్‌ ఘనంగా జరిగింది.

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

title
ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలు కష్టమే

సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్‌ ఉన్న హెచ్

Advertisement

వీడియోలు

Advertisement