కోరిక కాదన్నాడని.. డాక్టర్పై యాసిడ్ దాడి!
లక్నో: ఉత్తరప్రదేశ్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. తన కోరికను కాదన్నాడనే కారణంతో ఓ మధ్య వయసు మహిళ స్థానిక ఓ యువ డాక్టర్ పై యాసిడ్ దాడి చేయడం కలకలం రేపింది. ఘజియాబాద్ జిల్లాలో వైశాలిలో సోమవారం ఈ దారుణం జరిగింది. బాధితుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళితే వైశాలికి చెందిన ఓ మహిళ (45).. పశువుల డాక్టర్ అయిన అమిత్ వర్మ (28)పై యాసిడ్ కుమ్మరించింది. జాతీయ మీడియా కథనం ప్రకారం.. అమిత్ వర్మతో సంబంధాన్ని కోరుకున్న మహిళ గత కొన్నిరోజులుగా అతణ్ని వేధిస్తోంది. ఆమె ప్రతిపాదనను డాక్టర్ గట్టిగా తిరస్కరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెటర్నరీ డాక్టర్ అమిత్ .. కుక్కల కోసం స్థానికంగా ఒక క్లినిక్ నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం నాలుగు లీటర్ల యాసిడ్తో క్లినిక్కు వచ్చిన ఆమె.. అమిత్ పై దాడి చేసి ఉడాయించింది. తీవ్ర గాయాలపాలైన అమిత్ను అతని స్నేహితుడు దీపక్ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితునికి నలభై శాతం గాయాలయ్యాయని పొట్టమీద, ఛాతీపైన తీవ్ర గాయాలైనట్టువైద్యులు ప్రకటించారు.
పోలీసులు కేసు నమోదుచేసి, బంధువులకు సమాచారం అందించారు. అయితే అమిత్ వర్మ తీవ్ర గాయాల పాలై బ్యాండేజీలతో ఉండటంతో ఆయన నుంచి ప్రస్తుతానికి వాంగ్మూలం ఏదీ నమోదు చేయలేదు. కాగా, ఘటనా స్థలంలో మరో మహిళ పర్సు, ఐడీ కార్డు దొరికాయని పోలీసు అధికారి దీపక్ ఉపాధ్యాయ తెలిపారు.