Bars License
-
బార్ల సంఖ్య సగానికి తగ్గించండి
సాక్షి, అమరావతి: ప్రజలకిచ్చిన మాట మేరకు దశల వారీ మద్య నియంత్రణలో భాగంగా బార్ల సంఖ్యను సగానికి సగం తగ్గించేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో ఇక 50 శాతమే ఉండాలని, 50 శాతం కనిపించకూడదని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ వనరుల శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 839 బార్లు ఉండగా ఇందులో 420 బార్లు కనుమరుగు కావాలని సూచించారు. లైసెన్స్ ఫీజును భారీగా పెంచాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లోనే బార్లు ఉండాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బార్లు తెరిచి ఉంచే సమయాన్ని కూడా తగ్గించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్లు తెరిచి ఉంచుతున్నారని, నూతన బార్ల విధానంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లు తెరిచి ఉండాలని సూచించారు. ఇందుకు సంబంధించిన నూతన బార్ల విధానాన్ని వీలైనంత త్వరగా రూపొందించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మహిళా సంక్షేమమే సీఎం ధ్యేయం ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఎంతో మంది మహిళల కష్టాలు విన్నారు. తమ భర్తలు తాగుడుకు బానిస కావడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని ఆయనకు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కష్టం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. వారి కష్టాలను స్వయంగా చూసిన జగన్.. తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచి్చన మాట మేరకు తొలుత 43 వేల బెల్ట్షాపులను తొలగించారు. ఆ తర్వాత 4,380 మద్యం దుకాణాలలో 20 శాతం దుకాణాలు (880) తొలగించారు. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. మద్యంను ఆదాయ వనరుగా చూడకుండా ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా సీఎం ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా బార్ల సంఖ్యను సగానికి తగ్గించేయాలని ఆదేశించారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం గత చంద్రబాబు సర్కారు తెచ్చిన 2017 – 2022 బార్ల విధానం అమల్లో ఉంది. గతంలో వారి మద్దతుదారులకు లబ్ధి కలిగేలా ముందు చూపుతో వ్యవరించారు. ఇప్పుడు ఆ విధానం స్థానంలో సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ప్రజలకు మేలు జరిగేలా నూతన బార్ల విధానాన్ని రూపొందిస్తాం’ అని ఎక్సైజ్ కమిషనర్ ఎం.ఎం. నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. -
బార్ల లైసెన్సు మూడు నెలల పొడిగింపు
సారా, గంజాయి విక్రయాలపై సమాచారం అందిస్తే బహుమతులు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు నెల్లూరు(క్రైమ్) : బార్ల లైసెన్సు కాలపరిమితిని మరో మూడునెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసిందని నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 39 బార్లు ఉన్నాయని, వీటి కాలపరిమితి ఈనెలాఖరకు ముగియనుందన్నారు. నూతన పాలసీ రాకపోవడంతో లెసెన్సును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారన్నారు. జనవరి నుంచి నూతన పాలసీ అమలులోకి రానుందన్నారు. గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ జిల్లాలో మద్యం అమ్మకాలను నిషేధించామన్నారు. డ్రైడే రోజు మద్యం విక్రయాలు సాగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆ రోజు విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 256 బెల్టుషాపులపై కేసులు నమోదు చేసి 248 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 800 లీటర్ల మద్యం, 150 లీటర్ల బీర్బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎమ్మార్పీ ఉల్లంఘించిన 23 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.23 లక్షలు జరిమానా విధించామన్నారు. సమయపాలన పాటించని 40 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి ఒక్కో దుకాణం నుంచి రూ.5 వేలు జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఇంకా నిబంధనలు పాటించని 44 దుకాణాలపై కేసులు నమోదు చేశామన్నారు. సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు అమలయ్యేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా మద్యం, మత్తు పదార్ధాల వల్ల సంభవించే అనర్ధాలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లాలో నవోదయం కార్యక్రమం ద్వారా సారాను కట్టడిచేశామన్నారు. ఇంకా ఎవరైనా సారాయి, గంజాయి విక్రయాలు సాగిస్తుంటే తమకు సమాచారం అందించాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమాచారం అందించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. -
లెసైన్స్ ఫీజుపై ఆందోళన అక్కర్లేదు
బార్ల యజమానులకు స్పష్టం చేసిన ఎక్సైజ్ కమిషనర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బార్ల లెసైన్స్ ఫీజుల పెంపు ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లేదని ఆబ్కారీ శాఖ కమిషనర్ చంద్రవదన్ వెల్లడించారు. బార్ల లెసైన్స్ రెన్యూవల్ దరఖాస్తు ఫీజును మాత్రం పది వేల నుంచి లక్ష రూపాయలకు పెంచినట్లు చెప్పారు. ‘తెలంగాణ రెస్టారెంట్ అండ్ బార్ లెసైన్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు ఎస్.మనోహర్గౌడ్ ఆధ్వర్యంలో బార్ల యజమానులు సోమవారం కమిషనర్ను కలి శారు. ఈ సందర్భంగా బార్ల లెసైన్స్ ఫీజు పెంపు, సీటింగ్ కెపాసిటీ ఆధారంగా అదనపు ఫీజు వసూలు అంశాలపై కమిషనర్తో చర్చించారు. ఫీజులు పెంచితే బార్ల నిర్వహణ కష్టమవుతుందని, ఒక్కో బార్ మీద సుమారు 40 కుటుంబాలు ఆధారపడి ఉన్నట్లు కమిషనర్కు వివరించారు. స్పందించిన కమిషనర్... రెన్యూవల్ ఫీజు తప్ప మరేదీ పెంచలేదని, యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.