Bavi
-
కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం
జూలూరుపాడు: సుమారు ఏడు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం కనుమరుగవుతోంది. కాకతీయుల కాలంలో తాగునీటి అవసరాలు, శత్రు సైన్యాల నుంచి తమను రక్షించుకోవడానికి దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడు (Julurpadu) ప్రాంతంలో రాజాబావిని రాతికట్టడంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సువిశాలమైన రాజాబావికి రెండు వైపులా నివాసం కోసం గదులు నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ బావి పైభాగాన తూర్పు, పడమరకు ఎదురెదురుగా 10 గదులు నిర్మించారు. బావిలోకి దిగేందుకు 30 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి చుట్టూ 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు గల పైకప్పు ఒకేరాయిలా కనిపిస్తోంది. పూడిక మట్టితో నిండిపోవడంతో బావి లోతు ఎంత అనేది తెలియడం లేదు. సున్నం, రాళ్లతో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. అయితే, గుప్తనిధుల కోసం తవ్వకాలు, చెత్తాచెదారం పేరుకుపోవడం, బావిలో పూడిక పెరగడంతో నానాటికీ వైభవం కోల్పోతున్నా సంరక్షణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దండయాత్రల నుంచి రక్షణకు.. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రక్షణ కోసం కాకతీయ రాజులు (Kakatiya Kings) పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల మీదుగా సొరంగ మార్గాల ద్వారా ఖమ్మం ఖిలాకు వచ్చేవారని, కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్)కోటకు, పాత ఖమ్మం (Khammam) జిల్లాలోని జూలూరుపాడు రాజుల బావి, భేతాళపాడు గుట్టలపై ఉన్న కోట వరకు వచ్చేవారని తెలుస్తోంది. జూలూరుపాడు నుంచి పాపకొల్లులోని పుట్టకోట, చండ్రుగొండ మండలం బెండాలపాడు గుట్టల్లో వెలిసిన శ్రీవీరభద్రస్వామి, కనగిరి గుట్టల్లోని ఆలయాలు, అప్పట్లో సైనికులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు నేటికీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న సొరంగ మార్గాల ద్వారా శత్రువుల నుంచి రక్షణ పొందటంతోపాటు, శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు.. కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో భద్రపరిచే వారని నమ్ముతుంటారు. బావిలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఏడేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బావి పైభాగాన ఉన్న గదుల్లో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చారిత్రక కట్టడం ధ్వంసానికి గురవడంతో బావి ఆనవాళ్లు భావితరాలకు కన్పించకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. తగ్గని నీటిమట్టం.. బావి నీటిని గతంలో ఈ ప్రాంత వాసులు తాగునీటిగా ఉపయోగించేవారు. బావిలో నీటిమట్టం తరగకపోవడంతో, బావిలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీటిని 15 రోజుల పాటు పంటలకు వినియోగించినా నీటిమట్టం ఎంతమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బావిలోకి దిగుడు మెట్లు, బావి చుట్టూ తిరగటానికి వీలుగా ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఈ తరం ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రాతిబావిని నిర్మించడం విశేషం. అలాంటి బావి పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పూడిక మట్టి, ముళ్ల పొదలతో నిండిపోయింది. బావి చుట్టూ ఉన్న స్థలం కూడా ఆక్రమణకు గురికావడంతో ముళ్ల పొదలు, చెట్లతో కళావిహీనంగా మారింది. చారిత్రక సంపద ధ్వంసం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజాబావి నీళ్లు తాగే వాళ్లం 40 ఏళ్ల క్రితం రాజాబావి నీళ్లు తాగే వాళ్లం. వేసవి కాలంలో కూడా నీళ్లు బాగా ఉండేవి. ఈ నీటిని పంటల సాగుకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో పాటు ముళ్ల పొదలు, చెట్లు పెరగడంతో అటువైపు ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేయాలి. – చిన్నకేశి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు చారిత్రక కట్టడాన్ని కాపాడాలి వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాలి. రాజాబావి ధ్వంసమవుతుండటంతో భావితరాలకు కన్పించకుండాపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చారిత్రక సంపదను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి. – తాళ్లూరి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు బావి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి రాజాబావి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు, చెట్లతో నిండి కళావిహీనంగా మారింది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – నర్వనేని పుల్లారావు, జూలూరుపాడు చదవండి: వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..పురాతన సంపదను కాపాడతాం కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడమైన రాజా బావిని కాపాడుతాం. ఈ సమస్యను ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా చేయవచ్చేమో పరిశీలిస్తాం. ముళ్ల పొదలు, చెట్లు తొలిగించి, పూర్వవైభవం వచ్చేలా చర్యలు చేపడతాం. – డి.కరుణాకర్రెడ్డి, ఎంపీడీఓ జూలూరుపాడు -
ప్రధాని మోదీ ప్రశంసించిన బారం బావికి జీవం..
నారాయణపేట: ఒకప్పుడు ఎంతో మంది దాహార్తి తీర్చిన ఆ బావి.. కాలక్రమంలో నిరాదరణకు గురైంది. ఉనికినే కోల్పోయి కంపచెట్లకు నెలవుగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధభరితంగా తయారైంది. అలాంటి బావి.. కలెక్టర్ చొరవ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో పూర్వవైభవం సంతరించుకొంది. బతుకమ్మ వేడుకలకు వేదికవడమే కాకుండా.. మన్కీబాత్లో ప్రధానమంత్రి మోదీ నోట కీర్తించేవరకూ వెళ్లింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బారం బావి ఖ్యాతిపై కథనం.. జిల్లా కేంద్రంలోని పురాతనమైన బారంబావి గురించి తెలుసుకున్న కలెక్టర్ దాసరి హరిచందన బావిని పునరుద్ధరించి భావితరాలకు అందించాలని సంకల్పించారు. ఈ మేరకు గతేడాది ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. బావి మెట్లకు మరమ్మతు చేయించి చుట్టూ పెరిగిన కంపచెట్లు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. బావిలో పూడికను తీయించడంతో ఊటనీరు చేరి జలకళ సంతరించుకుంది. పునరుద్ధరణ తర్వాత బారం బావి.. గతేడాది నుంచి బతుకమ్మను అక్కడే కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బారం బావి పునరుద్ధరణపై గతేడాది మార్చి 28న మన్కీబాత్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. మళ్లీ బతుకమ్మ పండుగ నేపథ్యంలో.. చారిత్రక మెట్లబావి పునరుద్ధరణ విషయమై పట్టణంలో పలువురు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ దాసరి హరిచందన చూపిన చొరవను గుర్తు చేసుకుని, హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యుద్దీపాల కాంతుల్లో బారం బావిలో బతుకమ్మ సంబరాలు విద్యుత్ కాంతులతో జిగేల్.. గతంలో బతుకమ్మ వేడుకలను స్థానిక చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించేవారు. బారంబావి పునరుద్ధరించడంతో గతేడాది నుంచి అక్కడే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బావి చుట్టూ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో.. ఆ కాంతుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జిల్లాలోని ఒక్కొక్క శాఖ ఒక్కోరోజు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలతో సంబరాలు జరుపుకొంటారు. తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే బతుకమ్మలను బారం బావిలో నిమజ్జనం చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవతల వేషధారణలతో విద్యార్థినుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. బతుకమ్మలను పుట్టిలో ఉంచి బారంబావిలో ప్రదర్శించడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. -
బన్సీలాల్పేట్ కోనేరు బావిపై మోదీ ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్పేట: సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లోని పురాతన బావి పునరుద్ధరణపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి ఈ బావికి పూర్వవైభవాన్ని తెచ్చారని ఆయన కొనియాడారు. నీటిసంరక్షణ, భూగర్భ జలాలను కాపాడుకొనేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. ఆదివారం మన్ కీ బాత్లో బన్సీలాల్పేట్లోని బావి గురించి ఆయన ప్రస్తావించారు. చెత్తా చెదారం, మట్టితో నిండిన ఈ బావిని వాననీటి సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయడం సంతోషదాయకమన్నారు. ఇవీ ప్రత్యేకతలు.. ► సుమారు 1830 కాలానికి చెందిన బన్సీలాల్పేట్ బావి అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగి ఉంది. బావి ప్రవేశ ద్వారం ఆర్చ్లాగా ఉంటుంది. చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడం, సింహాలు, పాములు, గుర్రాల బొమ్మలు అలనాటి కళాత్మకతను సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. 35 మీటర్ల వెడల్పు 53 అడుగుల లోతు ఉన్న ఈ బావి చాలా కాలం వరకు ఉనికిని చాటుకుంది. ► 40 ఏళ్ల క్రితం దీనిని పూర్తిగా మూసివేశారు. మట్టి, చెత్తా చెదారంతో నిండిపోయింది. వాహనాలకు పార్కింగ్ అడ్డాగా మారింది. వాననీటి సంరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టిన ‘ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు’ సంస్థ జీహెచ్ఎంసీ సహకారంతో బావి పునరుద్ధరణకు నడుం కట్టింది. చెత్తా చెదారం తొలగించారు. సుమారు 2 వేల టన్నుల మట్టిని సైతం తొలగించి బావికి పూర్వ ఆకృతిని తెచ్చారు. ప్రస్తుతం ఈ బావి నీటితో తళతళలాడుతోంది. ► దీని చుట్టూ ఏర్పాటు చేసిన రాతి కట్టడాలు, కళాకృతులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి ఆగస్టు నాటికి ఈ ప్రాంగణాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ‘ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు’ వ్యవస్థాపకులు కల్పన రమేష్ లోకనాథన్ తెలిపారు. ఇప్పటి వరకు పూడికతీత కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్తో బావిని కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్: నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం) పాతబావులకు పూర్వవైభవం... ఇప్పటి వరకు నగరంలో గచ్చిబౌలి, కొండాపూర్, నార్సింగి. కోకాపేట్, బన్సీలాల్పేట్ బావులను పునరుద్ధరించారు. బాపూఘాట్ బావి పునరుద్ధరణకు ప్రణాళికలను సిద్ధం చేశారు. నిజాం కాలం నాటి సిటీ కాలేజీ చుట్టూ ఒకప్పుడు 87 బావులు ఉండేవని వాటిలో చాలా వరకు శిథిలమయ్యాయని కల్పన తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న రెండు బావులను మాత్రం పునరుద్ధరించేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ బావికి పూర్వవైభవంపై ప్రధాని అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్లో ఈ ఏరియాలో అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్) -
బావిలో పడి మహిళ ఆత్మహత్య
భూపాలపల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ బావిలోపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భూపాలపల్లి నగర పంచాయతీలోని జంగేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానిక సీఐ సీహెచ్ రఘునందన్రావు కథనం ప్రకారం.. జంగేడు గ్రామానికి చెందిన మేదరి రాజ్కుమార్ ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతడి భార్య సులోచన(35) గత రెండేళ్లుగా కడుపునొప్పి, నడుము నొప్పితో బాధపడుతోంది. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతోంది. అయినా ఆరోగ్యం బాగుపడలేదు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఆమెకు భరించలేని కడుపునొప్పి రావడంతో గ్రామంలోని తన తల్లిగారింటికి వెళ్తున్నానని కూతురు కళ్యాణికి చెప్పి బయల్దేరింది. అనంతరం కొద్దిసేపటికి కళ్యాణి తన తాతయ్య లింగయ్యకు ఫోన్ చేసి ‘అమ్మ వచ్చిందా’ అని ఆరా తీయగా సులోచన ఇక్కడికి రాలేదని చెప్పడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకసాగారు. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో తన తండ్రి లింగయ్య ఇంటి సమీపంలోని ఓ బావిలో సులోచన శవమై కనిపించింది. మృతురాలికి కుమార్తె కల్యాణి, కుమారుడు పవన్ ఉన్నారు. -
పోలియో బాధిత చిన్నారి బావిలో తోసివేత
రెంటచింతల: రెండు కాళ్లకు పోలియో సోకిన చిన్నారి(3)ని భారంగా భావించిన తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా బావిలో పడేసి పారిపోయారు.ఈ సంఘటన గుంటూరు జిల్లా రెంటచింతలలో శనివారం చోటుచేసుకుంది. నేలబావి సమీపంలో నారుమడికి నీరుపెట్టేందుకు వెళ్లిన రైతు పాత పుల్లారావుకు బావిలో నుంచి పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆయన వెళ్లి బావిలోకి జారిన మర్రి ఊడలను పట్టుకొని వేలాడుతున్న పాపను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పాపకు స్థానిక వైద్యుడు మధుబాబు వద్ద వైద్య పరీక్షలు చేయించి, ఆయన పర్యవేక్షణలో ఉంచారు. పాప వివరాలు తెలిసినవారు సీఐ నం:9440796228, ఎస్ఐ నం: 9440900883, స్టేషన్ నం: 08642258433లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు.