Bhadrachalam ramalayam
-
‘చిత్రం’పై చిక్కిన అర్చకుడు, సస్పెన్షన్ వేటు
భద్రాచలం: భద్రాచలం రామాలయ అర్చకుడు మధుసూదనాచార్యులుపై సస్పెన్షన్ వేటు పడింది. రామాలయం గర్భగుడిలో మూలవిరాట్ ఫొటోలను తీసిన అర్చకుడిని దేవస్థానం అధికారులు గుర్తించారు. అతనిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఇలా జరిగిందని భావించి ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు మరో ముఖ్య అర్చకుడిని సంజాయిషీ కోరుతూ ఆలయ ఈఓ ప్రభాకర్ శ్రీనివాస్ బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గర్భగుడిలోని మూలవరులను సెల్ఫోన్తో ఫొటోలు తీసి బయటికి పంపించడంతో అవి సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా చక్కర్లు కొట్టాయి. దీనిపై పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఈఓ విచారణకు ఆదేశించారు. ఆలయ సూపరింటెండెంట్ భవాని రామకృష్ణ దీనిపై విచారణ చేపట్టారు. గర్భగుడిలోని మూలవరులకు బెంగుళూరుకు చెందిన భక్తుడు బంగారు ఆభరణాలు సమర్పించగా వాటిని శుక్రవారం రోజున అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పటి వరకు మూడు శుక్రవారాలలో మాత్రమే స్వామి వారికి బంగారు కవచాలను అలంకరించగా, ఆయా రోజుల్లో గర్భగుడిలో విధులను నిర్వహించిన అర్చకుల నుంచి విచారణ అధికారి భవాని రామకృష్ణ వివరాలను రాబట్టారు. మూడు శుక్రవారాలలో స్వామి వారి అలంకరణను నిశితంగా పరిశీలించారు. కాగా సెల్ఫోన్లో బయటకు వచ్చిన ఫొటోలు ఈనెల 16న తీసినట్టుగా గుర్తించారు. ఆ రోజు ఆలయ విధుల్లో ఉన్న మదన్మోహనాచార్యులు గర్భగుడిలో మూలవరుల మూర్తులను సెల్ఫోన్ ద్వారా తీసినట్లు వెల్లడయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఈఓ ఆయనపై సస్పెన్షన్ వేటు విధించారు. అర్చకుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ప్రధాన అర్చకుడు, మరో ముఖ్య అర్చకుడు ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని భావించి.. ఇందుకు గల కారణాలపై వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఎంతో పవిత్రంగా భావించే స్వామి వార్ల మూలవరుల ఫొటోను అర్చకుడే సెల్ఫోన్ ద్వారా తీసి సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపించటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామాలు మరోసారి జరగకుండా దేవస్థాన అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. -
దొరికిన ‘సీతమ్మ’ ఆభరణాలు
-
దొరికిన ‘సీతమ్మ’ ఆభరణాలు
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన బంగారు ఆభరణాలు శనివారం దొరికాయి. గర్భగుడిలో ఆభరణాలు భద్రపరిచే బీరువాలోనే ఇవి కనిపించడంతో ఊపిరి దదపీల్చుకున్నారు. దీంతో తొమ్మిది రోజులపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. దొరికిన ఆభరణాలను ఈవో రమేష్బాబు విలేకరులకు చూపించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. పంచనామా నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయాధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఈవో రమేష్బాబు మాట్లాడుతూ కొందరు అర్చకుల తీరు వల్లే బంగారు ఆభరణాలు కనిపించలేదనేది యధార్థమన్నారు. అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో భద్రాద్రి రామాలయ ప్రతిష్టకు మచ్చతెచ్చే రీతిలో జరిగిన ఈ సంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కొందరు అర్చకులు కావాలనే ఇలా చేసినట్లు తేటతెల్లమవుతోందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్చకులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి ప్రధాన బాధ్యులైన అర్చకులను సస్పెండ్ చేస్తామని, మిగతా వారిని వేర్వేరు ఆలయాలకు బదిలీ చేస్తామని ప్రకటించారు. పోయిన చోటే కనిపించాయి.. దేవాదాయ శాఖ కమిషనర్ దీనిపై సీరియస్ కావటంతో పోయిన బంగారు ఆభరణాలను తిరిగి రాబట్టేందుకు దేవస్థానం ఈవో రమేష్బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన ఆయన శనివారం మరోమారు అర్చకులతో తన చాంబర్లో సమావేశ మయ్యారు. ఆలయ ప్రతిష్టను మరింత దిగజార్చకుండా ఆభరణాలు ఎక్కడున్నాయో గుర్తించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో అర్చకులంతా గర్భగుడిలో వెతుకుతామని వెళ్లి.. బీరువాలోని మరో లాకర్లో ఆభరణాలు ఉన్నట్లు వాటిని తెచ్చి అధికారులకు చూపించారు. దేవాదాయ శాఖ జ్యూయలరీ అధికారి పర్యవేక్షణలో గర్భగుడిలోని బీరువా, ఇతర లాకర్లను వెతికినప్పుడు కనిపించని బంగారు నగలు.. ఈవో హెచ్చరికతో అవి అక్కడే కనిపించినట్లు అర్చకులు చెప్పటం అనేక సందేహాలకు తావిస్తోంది. పోయిన ఆభరణాలు లభ్యమైనప్పటికీ దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది.