Bisweshwar Nandi
-
'ఇది భారత్.. ఇక్కడ ఆకట్టుకుంటేనే'
భువనేశ్వర్: రియో ఒలింపిక్స్లాంటి ఒక మెగా ఈవెంట్కు వెళ్లే ముందు క్రీడాకారులకు ఆర్థిక చేయూతనిస్తే వారి ప్రదర్శన మరింత మెరుగ్గా ఉంటుందన్న పలువురి భావనను జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోచ్ బిశ్వేశర్ నంది తోసి పుచ్చాడు. ఇక్కడ ఎటువంటి నజరానాలు పొందాలన్నా ముందు మన ప్రదర్శన సంతృప్తికరంగా ఉంటేనే జరుగుతుందని విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నాడు. ' ఇది భారత్.. ఇక్కడ ముందుగా మనల్ని నిరూపించుకుంటేనే ప్రశంసాపూర్వకమైన నజరానాలు అందుతాయి. ఆయా క్రీడాకారులు గురించి ఏమైనా రాయాలన్నా వారు ప్రత్యేకతను చాటుకున్న తరువాతే జరుగుతుంది' అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత బిశ్వేశ్వర్ తెలిపారు. గత రాత్రి ఓ సన్మాన కార్యక్రమానికి హాజరైన బిశ్వేశ్వర్.. భారత్ లో ఆటగాళ్లకు రివార్డులు రావాలంటే వారు కచ్చితమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. దాంతో పాటు రియో శిక్షణలో భాగంగా దీపాకు విదేశీ కోచ్ అవసరం లేదన్న తన వాదనను బిశ్వేశ్వర్ సమర్ధించుకున్నాడు. తాను ఏ ఎక్సర్సైజ్ చెప్పినా ఎంతో చురుగ్గా చేసే అమ్మాయికి మరొక కోచ్ అవసరం లేదనే భావించే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే రియోలో దీప శిక్షణను పొడిగించడానికి భయపడేవాడినని బిశ్వేశ్వర్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం ఆమె తండ్రి తనకు ఇచ్చిన వార్నింగే ప్రధాన కారణమన్నాడు. కొన్ని సందర్భాల్లో దీప చాలా మొండిగా ఉంటుందనే విషయాన్ని ఆమె తండ్రి పదే పదే చెప్పడంతో ప్రాక్టీస్ సెషన్ను పొడిగించడానికి భయపడాల్సి వచ్చేదన్నాడు. -
'దీపా కర్మాకర్ పై ఒత్తిడి ఉంది'
రియో డి జనీరో:ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్టిక్గా రియోలో అడుగుపెట్టిన దీపా కర్మాకర్పై యావత్ భారతావని చాలా ఆశలు పెట్టుకుందని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది స్పష్టం చేశారు. ప్రస్తుతం తమపై ఒలింపిక్స్ పతకం సాధించాల్సిన ఒత్తిడి అధికంగా ఉందని పేర్కొన్నారు. గత ఏప్రిల్లో దీపా సంచలన ప్రదర్శనతో రియోకు అర్హత సాధించిన అనంతరం ఆమెపై ఒక్కసారిగా ఆశలు పెరిగిపోయాయని..ఇప్పుడు ఒలింపిక్స్లో పతకం తీసుకొస్తుందని వంద కోట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే తమపై అధిక ఒత్తిడి పడుతుందన్నాడు. ' రియోలో దీపా కర్మాకర్ పతకం సాధిస్తుందని అంతా భారీ అంచనాలతో ఉన్నారు. భారత అభిమానులకు పతకం కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది బిలియన్ భారత ప్రజల ఆశ. దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించిన తరువాత ఆమెపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. కాకపోతే మెగా ఈవెంట్లో పతకం సాధించడమనేది కష్టంతో కూడుకున్నదని వారికి తెలియదు. మా శాయశక్తులా పతకం సాధించడానికి యత్నిస్తాం. ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.దీపా కర్మాకర్ ప్రదర్శనపై నాకు కూడా నమ్మకం ఉంది.' అని బిశ్వేశ్వర్ నంది పేర్కొన్నారు. ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్.. ఆగస్టు 7వ తేదీన తొలి రౌండ్ పోరులో తలపడనుంది.