bt seeds
-
గద్వాల నుంచి జిల్లాలోకి..
కర్నూలు(అగ్రికల్చర్) : రాష్ట్రంలో పత్తి సాగయ్యే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. కొద్ది నెలలుగా పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటం, జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో గ్రామాలను నకిలీ బీటీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఖరీఫ్లో రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పైగా నకిలీ విత్తన వ్యాపారం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యవసాయ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఎమ్మిగనూరు, ఆస్పరి, దేవనకొండ, కర్నూలు, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, హొళగుంద, హాలహర్వి, పెద్దకడబూరు, గోనెగండ్ల, మద్దికెర, తుగ్గలి, ఓర్వకల్ తదితర మండలాల్లో నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. గద్వాల నుంచి.. బీటీలో నకిలీ విత్తనాలకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. చాలా ఏళ్లుగా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్నాయి. ఇక ఆశ్చర్యం కల్గించే అంశం ఏమిటంటే.. తెలంగాణలోని గద్వాల జిల్లా నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలు వస్తుండడం. కర్నూలు సబ్ డివిజన్లోని వివిధ మండలాల రైతులు గద్వాల విత్తనాలను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. బీటీ నకిలీ పత్తి విత్తనాలను ఏప్రిల్, మే నెలల్లోనే గ్రామాలకు చేర్చినట్లు సమాచారం. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పరచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ప్యాకెట్ రూ.500 నుంచి రూ.600 ప్రకారం విక్రయిస్తుండడంతో ఎక్కువ శాతం మంది రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో లూజు విత్తనాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కంపెనీ విత్తనమైతే ఇలా ఉండాలి... కంపెనీ బీటీ విత్తన ప్యాకెట్లను సులభంగా గుర్తించవచ్చు. ప్యాకెట్పై కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది. ఒకవేళ రింగ్ కాకపోతే నకిలీ విత్తనంగా అనుమానం పడొచ్చు. అలాగే కంపెనీ పేరు, అడ్రెస్, వెరైటీ తదితర వివరాలన్నీ ఉండాలి. ఇటీవల పట్టుబడిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తే కస్టమర్ కేర్ నెంబర్లు లేవు. బ్రాండెడ్ కంపెనీల పేరుతోనే నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభిస్తుండటం గమనార్హం. వీటి విక్రయిస్తున్న వారిని అక్కడక్కడ అరెస్టు చేస్తున్నా.. సూత్రధారులెవరనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్ నాయక్ను వివరణ కోరగా..నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా ట్రాన్స్పోర్టు కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లను తనిఖీ చేయించామన్నారు. రైతులు సహకరిస్తేనే నకిలీ విత్తనాల నియంత్రణ సాధ్యమని స్పష్టం చేశారు. -
కాటన్ సీడ్.. మరో ఫ్రాడ్
సాక్షి, గద్వాల : నడిగడ్డలో విత్తనోత్పత్తి కంపెనీల బాగోతాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రైతుల భూములను లీజ్కు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించినట్లు బహిర్గతమైన విషయం విదితమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అనుమతి లేని బీటీ–3 విత్తనాలను గద్వాల కేంద్రంగా వ్తితన కంపెనీలు సాగు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పరిశోధన శాస్త్రవేత్తల బృందం, డీఎన్ఏ పరిశోధన సంస్థ నిర్ధారించినట్లు తేలడం గమనార్హం. గతనెల 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అ«ధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి ఢిల్లీ ల్యాబ్లో పరీక్షించగా బీటీ–3 విత్తనాల సాగు జరుగుతోందని గుర్తించినట్లు తెలిసింది. గత నెలలోనే ఓ గోదాంలో పట్టుబడిన ఒక కంపెనీకి చెందిన ఐదు శాంపిళ్లలో మూడింటిలో బీటీ–3 విత్తనాలు ఉన్నట్లు రాష్ట్ర, కేంద్ర పరిశోధన బృందం నిర్ధారించినట్లు సమాచారం. ఈ నివేదికను జిల్లా వ్యవసాయశాఖకు పంపించినట్లు తెలిసింది. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇన్కం ట్యాక్స్ దాడులు మరువకముందే.. జోగుళాంబ గద్వాల విత్తన పత్తికి ప్రసిద్ధి. జిల్లాలో దాదాపు కోటి ప్యాకెట్ల పత్తి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పన్నుల చెల్లింపులో తేడాలు రావడంతో జనవరి నెలలో ఇన్కం ట్యాక్స్ అధికారులు విత్తన కంపెనీలపై దాడులు చేశారు. గద్వాలలో రైతుల వద్దకు, ఆర్గనైజర్ల వద్ద నేరుగా విచారణ జరిపారు. రైతుల భూములను లీజుకు తీసుకుని విత్తనాలను సాగు చేస్తున్నట్లు విత్తన కంపెనీలు తప్పుడు పత్రాలను సృష్టించినట్లు ఐటీ శాఖ తనిఖీల్లో తేలింది. రెండు విత్తన కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. గత నెలలో కేంద్ర బృందాల ఆరా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని గడ్డిమందును తట్టుకునే పత్తి రకాలు సాగు చేస్తున్నారా, గడ్డి మందు అయిన హెచ్టీ(హెర్బిసైడ్ టాలరెంట్) వంటి మందు వాడకంపై కేంద్ర బృందాలు గత నెల 18న జిల్లాలో ఆరా తీశాయి. భారత ప్రభుత్వం తరపున న్యూఢిల్లీలోని భారతీయ పరిశోధన సంస్థ, నాగ్పూర్ కేంద్ర పత్తి పరిశోధన సంస్థ, బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, తెలంగాణ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం జేడీ రాజారత్నం నేతృత్వంలోని బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని పెద్దపల్లి, బూడిదపాడు, అమరవాయి గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పత్తి పంటను పరిశీలించి గడ్డి మందు అయిన గ్రై ఫోసెట్, హెచ్టీ మందు వాడకంపై రైతులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కాటన్సీడ్ మిల్లుల్లో కాటన్ సీడ్ పత్తిని, విత్తనాలను, కెమికల్తో శుద్ది చేసిన విత్తనాల శాంపిళ్లను సేకరించి వాటిని పరిశోధనలకు పంపించారు. బీటీ–3పై నిషేధం ప్రస్తుతం దేశంలో సాగవుతున్న పత్తిలో బీటీ–1, బీటీ–2 విత్తనాలను రైతులు వినియోగిస్తున్నారు. ఇందులో కలుపు తొలగించేందుకు హెచ్టీ (హెర్బిసైడ్ టాలరెంట్) గడ్డి మందు స్ప్రే చేస్తే గడ్డితో పాటు పత్తి పంట కూడా చనిపోతుంది. దీంతో రైతులు ఎలాంటి మందులు వినియోగించకుండా కూలీలతో కలుపు తొలగించుకుంటుండగా ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. బీటీ–3 విత్తనాలతో సాగు చేస్తే హెచ్టీ స్ప్రే తట్టుకునే శక్తి పత్తి పంటకు ఉంటుంది. అ యితే, విత్తనాలకు కేంద్ర వ్యవసాయ పరిశోదన సం స్థ అనుమతి ఇవ్వలేదు. ఈ రకంపై హెచ్టీ గడ్డి మందులు వాడితే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, పర్యావరణానికి ముప్పు ఉంటుం దని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, బీటీ– 3ను నిషేధించింది. కానీ కొన్ని కంపెనీలు ఈ విత్తనాలను సాగు చేయించి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నా యనే సమాచారం అందగా కేంద్ర వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం దేశంలోని వివిధ ప్రాం తాలతో పాటు గద్వాలలో పర్య టించి శాంపిళ్లను సేకరించింది. ఈ క్రమంలోనే జిల్లాలో బీటీ–3 పండిస్తున్నట్లు గా గుర్తించినట్లు తెలిసింది. అయితే, దీనిని జిల్లా వ్యవశాఖ అధి కారి గోవింద్నాయక్ ధృవీకరించలేదు. -
పత్తివిత్తులో 'దేశీ'విప్లవం
-
పత్తివిత్తులో 'దేశీ'విప్లవం
బీటీ టెక్నాలజీతో విత్తనాల అభివృద్ధి - సగానికి సగం తగ్గనున్న ధర - వచ్చిన పంట నుంచే మళ్లీ విత్తనాలు వాడుకునే అవకాశం - బీటీ–1, బీటీ–2లకు దీటుగా చీడపీడలను తట్టుకునే సామర్థ్యం - దేశీయ విత్తనాలను అభివృద్ధి చేసిన పంజాబ్ వ్యవసాయ వర్సిటీ - ఖరీఫ్ నాటికి మార్కెట్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు - ఇక బీటీ విత్తన కంపెనీల ఆగడాలకు చెక్ సాక్షి, హైదరాబాద్: బీటీ పత్తి.. ఇకపై ఈ విత్తనం కోసం రైతులు వేలకు వేలు ధారపోయనక్కర్లేదు! కంపెనీలు ఎంత చెబితే అంత రేటుకే కొనుక్కోనక్కర్లేదు. ధర సగానికి సగం తగ్గబోతోంది. అంతేకాదు.. చేనులో పండిన పత్తి నుంచి వచ్చిన విత్తనాలనే మళ్లీ వాడుకోవచ్చు. బీటీ–1, బీటీ–2 పత్తి విత్తనాల మాదిరే చీడపీడలను తట్టుకునే సామర్థ్యంతోపాటు వాటికన్నా తక్కువ ధరకే దేశీయ విత్తనాలు అందుబాటులోకి రాబోతున్నాయి. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు సుదీర్ఘ పరిశోధనల తర్వాత ఈ బీటీ పత్తి విత్తనాలను అభివృద్ధి చేశారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విత్తన కంపెనీల గుత్తాధిపత్యానికి కళ్లెం పడటంతోపాటు పత్తి విత్తనంలో ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాదికి ఈ విత్తనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి వస్తాయని, ఈ ఏడాది కొన్ని ప్రాంతాలకు అందుతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రయోగాత్మకంగా ఇప్పటికే పంజాబ్లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో ఈ విత్తనాల ద్వారా పంట పండించి మంచి ఫలితాలు సాధించారని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బీటీ పత్తి విత్తన రకాలన్నీ హైబ్రీడ్లోనే వచ్చాయి. కానీ పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సాధారణ రకాల్లోనే బీటీ టెక్నాలజీని ఉపయోగించి ఈ విత్తనాలను తయారు చేసింది. దీనివల్ల ఈ విత్తనం వేసిన రైతు పంట పండాక తిరిగి దాన్నే విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే విత్తనం తక్కువ ధరకు లభించడంతోపాటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది. ప్రస్తుతం బోల్గార్డ్ (బీజీ)–1 పత్తి విత్తన ధర రూ.635గా.. బీజీ–2 విత్తన ధర రూ.800గా ఉంది. అయితే పంజాబ్ విశ్వవిద్యాలయం తయారు చేసిన పత్తి విత్తన వెరైటీ ఆ ధరలో సగానికే లభించనుంది. ఇదీ బీటీ కథా కమామిషు.. బీటీ పత్తి విత్తనం రాకముందు.. (2002కు మందు) హైబ్రీడ్ విత్తనాలే వాడేవారు. ఈ విత్తనానికి కాయతొలిచే పురుగు ఎక్కువగా ఆశించేది. ఎన్ని రకాల మందులు వేసినా తగ్గేది కాదు. దీంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు పడేవారు. దీనికి విరుడుగా బీటీ టెక్నాలజీతో సరికొత్త విత్తనాలు తయారయ్యాయి. బహుళ జాతి కంపెనీ మోన్శాంటో.. మహారాష్ట్ర హైబ్రిడ్ కంపెనీ (మైకో)తో కలసి దేశవ్యాప్తంగా 2002 నుంచి బీటీ–1 పత్తి విత్తన వ్యాపారం ప్రారంభించింది. ఇతర విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఏ ఇతర పత్తి విత్తనాలు మార్కెట్లోకి అడుగుపెట్టకుండా గుత్తాధిపత్యం కొనసాగించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు బీటీ–1కు కూడా చీడపీడలను తట్టుకునే శక్తి పోవడంతో 2006లో బీటీ–2 పత్తి విత్తనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. దానికి ఆ కంపెనీ పేటెంట్ రాయల్టీ వసూలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే రాయల్టీపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాయల్టీపై పోరాడారు. ఆయన పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం రాయల్టీని అమాంతం తగ్గించింది. బీటీ–2తో నష్టపోయిన రైతులు ప్రస్తుతం రైతులు ఎక్కువగా బీటీ–2 పత్తి విత్తన రకాన్ని వాడుతున్నారు. అయితే దీనికి కూడా పురుగును తట్టుకునే శక్తి తగ్గింది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల గులాబీ రంగు పురుగు వ్యాపించింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మోన్శాంటో టెక్నాలజీకి కాలం చెల్లిందన్న ప్రచారం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా జాతీయ విత్తన కంపెనీలు స్వర్ణభారత్ కన్సార్టియంగా ఏర్పడి బీటీ–3 తరహాలో కొత్త వంగడాన్ని తయారుచేశాయి. దీనికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి ఉందని తేలిందని అంటున్నారు. బీటీ టెక్నాలజీలోని ఇతర జన్యువుతో దీన్ని తయారుచేశారు. కానీ దాన్ని మోన్శాంటో అడ్డుకోవడంతో ఇన్నాళ్లుగా అది రైతుల వద్దకు చేరుకోలేకపోయిందని విత్తన సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన సాధారణ సూటి పత్తి విత్తనంతో మోన్శాంటో గుత్తాధిపత్యానికి గండి పడుతుందని అంటున్నారు. మనకు లాభమే.. పంజాబ్ వ్యవసాయ వర్సిటీ నిపుణులు తయారు చేసిన పత్తి విత్తనాలు మార్కెట్లోకి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. తెలంగాణలో ఖరీఫ్లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు. ఇతర అన్ని పంటల కంటే పత్తి సాగే అధికం. 2015–16లో పత్తి ధర గణనీయంగా తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, సోయాబీన్ పంటలను ప్రోత్సహించింది. దీంతో 2016–17 ఖరీఫ్లో పత్తి 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. అయితే ఈసారి పత్తికి అధిక ధర పెరగడంతో రైతులు తిరిగి పత్తి వైపే చూస్తున్నారు. దీంతో ఈసారి రాష్ట్రంలో కోటి పత్తి విత్తన ప్యాకెట్లు అమ్ముడుపోయే అవకాశముంది. ధర తగ్గుతుంది పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారు చేసిన పత్తి విత్తనం హైబ్రీడ్ రకం కాదు. కాబట్టి దీన్ని ఒకసారి విత్తనంగా ఉపయోగించిన రైతులు తర్వాత తాను పండించి మళ్లీ విత్తనంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ధర కూడా గణనీయంగా తగ్గుతుంది. - కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ బీటీ టెక్నాలజీ విఫలమైంది బీటీ టెక్నాలజీనే విఫలమైంది. అలాంటిది పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తయారుచేసిన బీటీ పత్తి సూటి రకం విత్తనం వల్ల ప్రయోజనం ఏముంటుంది? సూటి రకమైనా బీటీ చొప్పించాక అది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అంతర్గత పరిశోధన వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంటుంది. అంతేకాదు వారు తయారుచేసిన బీటీ సూటి రకం పత్తి విత్తనంపై స్వచ్ఛంద సంస్థ ద్వారా పరిశీలన చేసిన తర్వాతే దీనిపై మాట్లాడొచ్చు. - డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు