బాంబు పేల్చిన ములాయం కోడలు
లక్నో: ఉత్తరప్రదేశ్ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కు ముందు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని బాంబు పేల్చారు. వెనుబడిన జాబితాలోని యాదవ కులానికి చెందినప్పటికీ తన కూతురికి రిజర్వేషన్ అవసరం లేదని ఒక వెబ్ సైటుకు ఇచ్చిన ఇంటర్య్యూలో చెప్పారు. ‘మేము బాగా కలిగిన కుటుంబానికి చెందినవాళ్లం. అలాంటప్పుడు కులాల ప్రతిపాదికన రిజర్వేష్లన్లు ఎందుకు తీసుకోవాల’ని ఆమె ప్రశ్నించారు.
అపర్ణ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఓబీసీలు, నిమ్నకులాలపై నిజంగా సమాజ్ వాదీ పార్టీకి ప్రేమ ఉంటే ఆమెపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. అపర్ణ యాదవ్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి ఉమాభారతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదవ కులంలో ఎంతో మంది వెనుకబడినవారు ఉన్నారని తెలిపారు. కాగా, తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడిన అపర్ణ యాదవ్.. లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.