categorize
-
స్థానిక సచివాలయాలు.. ఇక మూడు కేటగిరీలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల కేటగిరీని బట్టి సిబ్బంది సంఖ్యను సైతం నిర్ధారించింది. 2,500లోపు జనాభా ఉండే సచివాలయాలను ‘ఏ’ కేటగిరీ, 2,501 నుంచి 3,500లోపు జనాభా ఉండే సచివాలయాలను ‘బీ’, 3,501కు మించి జనాభా ఉన్న సచివాలయాలను ‘సీ’ కేటగిరీలో చేర్చింది. ఏ కేటగిరీ సచివాలయాలకు ఆరుగురు సిబ్బందిని కేటాయించగా.. ఇందులో ఇద్దరు సాధారణ, నలుగురు నిర్దిష్ట విధులకు వినియోగించాలని నిర్దేశించింది. బీ కేటగిరీ సచివాలయాలకు ఏడుగురు సిబ్బందిని కేటాయించగా.. వీరిలో ముగ్గురు సాధారణ, నలుగురు నిర్దిష్ట విధులకు వినియోగించాలని పేర్కొంది. సీ కేటగిరీ సచివాలయాలకు 8 మంది సిబ్బందిని కేటాయించగా.. వీరిలో నలుగుర్ని సాధారణ విధులకు, మరో నలుగుర్ని నిర్దిష్ట విధుల కోసం వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా సచివాలయాలను, సిబ్బందిని హేతుబద్దీకరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది విధులు ఇలా.. » గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీరాజ్ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. » పట్టణాల పరిధిలోని వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి, వార్డు మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. » గ్రామ సచివాలయాల్లో నిర్దిష్ట విధులను గ్రామ రెవెన్యూ ఆఫీసర్, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వ్యవసాయ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, ఇంధన అసిస్టెంట్ నిర్వర్తిస్తారు. » వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట విధులను రెవెన్యూ కార్యదర్శి, హెల్త్ కార్యదర్శి, ప్లానింగ్–రెగ్యులేషన్ కార్యదర్శి, సౌకర్యాల కార్యదర్శి, పారిశుధ్య–పర్యావరణ కార్యదర్శి, ఇంధన కార్యదర్శి నిర్వర్తిస్తారు. కేటగిరీల వారీగా విధులు ఇలా.. » ఏ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీరాజ్ కార్యదర్శి, సంక్షేమ విద్య అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. » పట్టణాల్లోని ఏ కేటగిరీ వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను పరిపాలన కార్యదర్శి లేదా విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి లేదా మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. » బీ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్, పట్టణాల్లోని బీ కేటగిరీ వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి లేదా మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. » సీ కేటగిరీ గ్రామ సచివాలయాల్లో సాధారణ విధులను పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ–విద్య అసిస్టెంట్, మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో సాధారణ విధులను వార్డు పరిపాలన కార్యదర్శి, విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వార్డు సంక్షేమ–అభివృద్ధి కార్యదర్శి, మహిళా పోలీస్ నిర్వర్తిస్తారు. » ఇందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సాధారణ విధులు నిర్వర్తించే సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. » నిర్దిష్ట విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించి విడిగా ఉత్తర్వులిస్తామని పేర్కొంది. -
ఉపాధి హామీలో వేతన ‘విభజన’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొం టున్న ఫీల్డ్ అసిస్టెంట్లను దారి లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు నిర్దేశించిన నెలకు రూ.10 వేల వేతనాన్ని పనితీరు ఆధారంగా విభజించనుంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్రావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు కేటాయించిన పంచాయతీల్లోని జాబ్కార్డుదారులకు కల్పించే పనిదినాల ఆధారంగా వారిని విభజించాలని, మరీ తక్కువ పని దినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే తొలగించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కేటగిరైజేషన్తో పాటు తొలగింపు ప్రక్రియను ఈనెల 14కల్లా పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మూడు కేటగిరీలుగా విభజన.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇస్తున్నారు. ప్రతి యేటా జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు వారిని రెన్యువల్ చేస్తుంటారు. వీరు ఈ పథకం కింద వారికి కేటాయించిన పంచాయతీల్లోని జాబ్కార్డు దారులందరికీ పనిదినాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ పనిదినాల కల్పన ఆధారంగానే ఫీల్డ్ అసిస్టెంట్లను ఇప్పుడు ప్రభుత్వం విభజిస్తోంది. పంచాయతీలోని జాబ్కార్డు ఉన్న వారికి కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారిని కేటగిరీ–1లో పెట్టి వారికి గతంలో ఇస్తున్న విధంగానే నెలకు రూ.8,900 వేతనం, రూ.1,100 అలయెన్సులు కలిపి రూ.10 వేలు చెల్లించనుంది. కేటగిరీ–1.. జాబ్కార్డుదారులకు కనీసం 30 అంతకన్నా ఎక్కువ పనిదినాలు కల్పించిన వారికి రూ.10 వేలు చెల్లించనుంది. వీరి కాంట్రాక్టును రెన్యువల్ చేయనుంది. కేటగిరీ–2ఏ.. 29–20 రోజుల పని దినాలు కల్పించగలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఈ కేట గిరీలో ఉంచి వారి రెన్యువల్ను పెండింగ్లో పెట్ట నున్నారు. వేతనం నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. కేటగిరీ–2బీ.. నెలకు 19–10 పని దినాలు కల్పించగలిగిన వారిని ఈ కేటగిరీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్ చేయరు. వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించనున్నారు. వీరి కాంట్రాక్టును గత ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు రెన్యువల్ కూడా చేయనుంది. ఇక, 29–20 రోజుల పనిదినాలు కల్పించగలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేటగిరీ–2ఏలో ఉంచి వారి రెన్యువల్ను పెండింగ్లో పెట్టాలని, వారి వేతనాన్ని నెలకు రూ.9వేలకు పరిమితం చేయనున్నారు. అలాగే నెలకు 19–10 పనిదినాలు కల్పించగలిగిన వారిని కేటగిరీ–2బీలో పెట్టి వారి కాంట్రాక్టును కూడా రెన్యువల్ చేయవద్దని, వారి వేతనాన్ని రూ.7,500గా నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక, సగటున కనీసం 10 పనిదినాలు కూడా కల్పించలేని వారిని వెంటనే తొలగించాలని, ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ పనిదినాల కల్పన పనితీరును 2018, జూలై 1 నుంచి 2019 జూన్ 30 మధ్య పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అసంతృప్తి.. ప్రభుత్వ నిర్ణయంపై ఫీల్డ్ అసిస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి పనుల కల్పన విషయంలో పంచాయతీల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. చిన్న పంచాయతీల్లో 50ఐ100 కార్డులు మాత్రమే ఉంటాయని, ఆయా కుటుంబాలకు సగటున ఏటా 30 పనిదినాల కల్పన అంత కష్టమేమీ కాదంటున్నారు. అలాగే 1000 జాబ్కార్డులున్న గ్రామాలు, వాటి హ్యామ్లెట్లలోని అన్ని కుటుంబాలకు సగటున 30 పనిదినాలు కల్పించడం అంత సులువైన కాదని చెబుతున్నారు. గత 14ఏళ్లుగా గ్రామాల్లో చాలా చేశామని, ఇప్పుడు కొత్తగా చేయడానికి పనులు కూడా లేవని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో 30 పనిదినాల ప్రాతిపదికన తమను విభజించడం సరైంది కాదని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిగొండ శ్యామలయ్య వ్యాఖ్యానించారు. ఈ సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే సమ్మెకు నోటీసు ఇచ్చామని, సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడి ఉందని, 11న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను రద్దు చేయకపోతే ఈనెల 12 నుంచి విధులు బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెకు దిగిపోతామని హెచ్చరించారు. ఫీల్డ్ అసిస్టెంట్లపై వస్తున్న విమర్శలివే... గత 14 ఏళ్లుగా గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పనితీరు విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే వేతనానికి తోడు కొన్ని నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సంపాదిస్తున్నారని, పని దినాల కల్పనలో పేదలను తమ ఇళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత పనులు చక్కబెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్న వారికి, సన్నిహితులు, బంధువులకు పని కల్పించేలా వారి పేర్లను మస్టర్లలో రాస్తున్నారని, కొన్ని చోట్ల పని చేయకుండానే మస్టర్లను రాస్తున్నారని ప్రభుత్వం నిర్ధారించింది. ముఖ్యంగా గ్రామాల్లోని పేదలను, రాజకీయ నాయకులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆయా గ్రామాలను ఓ రకంగా శాసించే స్థాయికి కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చేరిపోయారనే తీవ్ర ఆరోపణలు కూడా వారిపై ఉన్నాయి. -
ధర్మయుద్ధ మహాసభ వర్గీకరణకు తొలి అడుగుకావాలి
కర్నూలు సీక్యాంప్: ఎమ్మార్పీఎస్ నాయకులు ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహిస్తున్న ధర్మయుద్ధ మహాసభ ఎస్సీవర్గీకరణ సాధనకు తొలి అడుగు కావాలని జిల్లా దళిత సంఘాల అధ్యక్షులు, నాయకులు అన్నారు. సీక్యాంప్లోని డ్రైవర్స్అసోసియేషన్ కార్యాలయంలో గురువారం అన్ని దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. రాయలసీమ మాదిగ దండోర అధ్యక్షుడు అనంతరత్నం మాదిగ, ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముపాలెం శ్రీనివాస్, నేషనల్ టూరిజం బోర్డ్ సభ్యుడు మూలింటి సుదర్శనం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వర్గీకరణ కోసం అన్ని దళిత సంఘాలు ఒక్కతాటిపైకి రావడం శుభపరిణామమన్నారు. ధర్మయుద్ధ మహాసభ ద్వారా కేంద్రానికి హెచ్చరిక చేయాలని సూచించారు.