cattle slaughter
-
ఎద్దు మాంసం అమ్ముతున్నారని..
భోపాల్ : ఎద్దు మాంసం అమ్ముతున్నారనే నెపంతో ఇద్దరిని తీవ్రంగా కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలోని అమ్ఘర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి బాదేరా పోలీసు స్టేషన్ పరిధిలో రియాజ్(45), షకీల్ (33)లు తమ ఊరికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలో కొంతమంది గ్రామస్తులు వీరికి ఎదురయ్యారు. రియాజ్, షకీల్ వద్ద ఎద్దు మాంసం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు వారు మాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రియాజ్ మృతి చెందాడు. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న షకీల్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. సంఘటనా స్థలంలో ఒక ఎద్దు కళేబరంతో పాటు మూటకట్టి ఉంచిన మాంసాన్ని పోలీసులు గుర్తించారు. కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
గోమాంస నిషేధంపై గందరగోళం
-
గోమాంస నిషేధంపై గందరగోళం
పశువులను కబేళాలకు తరలించకుండా నిరోధించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మంటకలుపుతోందని మండిపడుతున్నాయి. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ వివరణ ఇస్తూ ఆహారం కోసం జంతువులను హతమార్చడాన్ని నిషేధించలేదని, జంతువులను హింస నుంచి రక్షించే చట్టం కిందనే ఆంక్షలు తీసుకొచ్చామని, అందుకని సమైక్య స్ఫూర్తిని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు. పశుమాంసం క్రయ, విక్రయాలపై, కబేళాలకు పశువుల అమ్మకాలపై నిషేధం విధిస్తూ చట్టాలు తెచ్చే హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఉంది. అందుకే బీజేపీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోమాంస నిషేధ చట్టాలను తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ గోమాంస విక్రయాలను నిరోధించేందుకు కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే (ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ యాక్ట్) చట్టాన్ని ఆశ్రయించింది. ఆ చట్టంలో 22వ నిబంధన కింద పశువుల సంతలో పశువులను వ్యవసాయ అవసరాల కోసమే తీసుకుంటున్నట్లు కొనుగోలు, విక్రయదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఆంక్షలు తీసుకొచ్చారు. అదే చట్టంలోని 11వ సెక్షన్ (ఈ) నిబంధన ప్రకారం అనవసరంగా హింసించనంత కాలం ఆహారం కోసం జంతువులను చంపడం తప్పు కాదని కూడా ఉంది. చట్టం ఇంత స్పష్టంగా జంతువులను ఆహారం కోసం చంపవచ్చని చెబుతుండగా, కబేళాలకు తరలించరాదనే నిబంధన ఎలా చెల్లుతుంది? చట్టం పశుపక్ష్యాదులన్నింటినీ కలిపి జంతువులుగా పరిగణిస్తే, కొత్తగా విధించిన ఆంక్షల్లో పశువులను మాత్రమే పేర్కొన్నారు. ఇదీ ఎంతవరకు సబబు? దేశవ్యాప్తంగా గోమాంసం నిషేధించాలనే ఆరెస్సెస్ డిమాండ్ను అమలు చేయడానికి కేంద్రం అతి తెలివిగా వ్యవహరించడమే ఈ గందరోగోళానికి కారణం. గోమాంసం నిషేధం, కబేళాల నిషేధం రాష్ట్రాల పరిధిలోని అంశం కావంతో కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే చట్టం నిబంధనలను ఆశ్రయించింది. ఆ చట్టం కింద పశుమాంసం క్రయవిక్రయాలను గానీ, కబేళాలను గానీ నిషేధించే హక్కు లేకపోవడం వల్ల కేంద్రం మధ్యేమార్గాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్రమే గోమాంసాన్ని నిషేధించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిషేధం వల్ల వచ్చే పర్యవసనాలను కూడా పరిశీలించాలి. దేశంలో గోమాంసం, దాని సంబంధిత పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న నాలుగైదు కోట్ల మంది రోడ్డున పడతారని ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయి. యూపీలో మాంసం పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల ఏడాదికి 56 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. -
పశు ‘వధ’కు చెక్
-
‘వధ’కు చెక్
⇒ సంతల్లో ఆవు, గేదె, ఎద్దు, ఒంటెల్ని కబేళాలకు అమ్మకూడదు, కొనకూడదు ⇒ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం ♦ కేవలం వ్యవసాయ అవసరాల కోసమే పశువుల క్రయవిక్రయాలు ♦ ఆ మేరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే అనుమతి ♦ విక్రయాలపై పశువుల సంత కమిటీల నిరంతర పర్యవేక్షణ ♦ దూడలు, వట్టిపోయిన పశువుల విక్రయంపై నిషేధం న్యూఢిల్లీ సంతల్లో పశువులను కొని కబేళాలకు తరలించడం ఇక కుదరదు! కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే సంతల్లో పశువుల క్రయవిక్రయాలు సాగాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల క్రయవిక్రయాలపై పలు నిబంధనలు విధిస్తూ కేంద్ర పర్యావరణ శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దేశ వ్యాప్తంగా జంతు మాంస పరిశ్రమపై పెను ప్రభావం చూపే ఈ నోటిఫికేషన్ ప్రకారం.. పశువుల విక్రయం సమయంలో తాను వ్యవసాయ దారుడినని రుజువు చేసుకునేలా కొనుగోలు దారుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ‘దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లలో కబేళాల కోసం ఆవులు (వయసులో ఉన్నవి, దూడలు సహా), గేదెలు, ఎద్దులు, ఒంటెల్ని అమ్మడం, కొనడం నిషేధం. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం–2017(పశువుల సంతల నియంత్రణ)లోని నిబంధనల మేరకు ఈ ఆదేశాల్ని జారీ చేస్తున్నాం. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయి’ అని పర్యావరణ శాఖ స్పష్టంచేసింది. పశువధపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎలాంటి నిషేధం విధించక పోయినా.. తాజా నిబంధనలు మాత్రం ఆ స్థాయిలో పశు వర్తకులకు నష్టం కలించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొనడం అంత ఈజీ కాదు.. కేంద్ర పర్యావరణ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. కేవలం వ్యవసాయ అవసరాల కోసమే పశువుల్ని అమ్ముతున్నామని, కబేళాల కోసం కాదని స్పష్టం చేస్తూ అమ్మకందారు సంతకం చేసిన లిఖితపూర్వక ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. తన పేరు, చిరునామా సహా ఇతర వివరాల్ని స్పష్టంగా పేర్కొనాలి. ఫొటో ధ్రువీకరణ పత్రం కాపీని కూడా జత చేయాలి. పశువుల కొనుగోలుదారులు కూడా వాటిని కబేళాలకు తరలించేందుకు కాదంటూ హామీ పత్రం సమర్పించాలి. పశువుల కొనుగోలు వ్యవసాయ అవసరాల కోసమేనని, కబేళాల కోసం కాదని పశువుల సంత నిర్వహణ కమిటీలు ధ్రువీకరించాలి. కొనుగోలుదారుడు తీసుకొచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించి అతను వ్యవసాయదారుడేనని కమిటీలు నిర్ధారించుకోవాలి. మరికొన్ని నిబంధనలు 1. పశువుల సంత నిర్వహణ కమిటీ పశు విక్రయాలకు సంబంధించిన రికార్డులు నిర్వహించాలి. దాదాపు ఆరు నెలల రికార్డులు అందుబాటులో ఉంచాలి. 2. అనుమతి లేకుండా పశువుల కొనుగోలుదారులు వేరే రాష్ట్రంలో వాటిని విక్రయించకూడదు. 3. వయసులో ఉన్న పశువు, ఎలాంటి ప్రయోజనం లేని పశువులు సంతకు రాలేదన్న విషయాన్ని పశువుల సంత కమిటీకి చెందిన సభ్య కార్యదర్శి నిర్ధారించుకోవాలి. 4. పశువు విక్రయానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఐదు కాపీల్ని.. స్థానిక రెవెన్యూ అధికారి, పశు వైద్యుడు, పశువుల మార్కెట్ కమిటీకి సమర్పించాలి. కొనుగోలుదారుడు, అమ్మకందారుడు తమ వద్ద ఒక్కో కాపీని ఉంచుకోవాలి. జంతు మాంసం పరిశ్రమకు దెబ్బే.. కేంద్రం నిర్ణయంతో దేశంలోని రూ.లక్ష కోట్ల విలువైన జంతు మాంసం, దాని అనుబంధ ఉత్పత్తుల మార్కెట్లపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఆ మార్కెట్లకు అవసరమైన 90 శాతం ముడిసరుకు పశువుల సంతల నుంచే సరఫరా అవుతోంది. ఈ కొత్త నిబంధనలు పశువుల సంతల్లో ఎక్కువ లావాదేవీలు జరిపే ముస్లిం వర్తకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న, ఉపయోగం లేని పశువుల అమ్మకంతో వచ్చే ఆదాయం మార్గం కోల్పోవడం వల్ల రైతులు కూడా ప్రభావితం అవుతారని భావిస్తున్నారు. పశువుల వర్తకుల్లో ఎక్కువ శాతం పేదలు, నిరక్షరాస్యులేనని, కొత్త నిబంధనలతో ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం, కార్యాలయాల చుట్టూ తిరగడం తలకు మించిన భారమేనన్నది కొందరు నిపుణుల అంచనా. జంతు సంక్షేమం కోసమే..: పర్యావరణ శాఖ జంతు సంక్షేమం కోసమే ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర పర్యావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం పశువుల బహిరంగ మార్కెట్లలో.. పాడి, వ్యవసాయ అవసరాలతో పాటు, కబేళాల కోసం పశువుల్ని విక్రయిస్తున్నారని, అనేక మంది అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉండడంతో.. ఏ ప్రయోజనం కోసం అమ్ముతున్నారో తెలియడం లేదని కేంద్ర జంతు సంక్షేమ విభాగం లీగల్ సబ్ కమిటీ మాజీ సభ్యుడు ఎన్జీ జయసింహ అన్నారు. వ్యవసాయ అవసరాల కోసం పశువులు ఉపయోగపడడం లేదన్నారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని సమర్థించారు. పశువుల సంతలపై నియంత్రణ కోసమే: హర్షవర్ధన్ పశువుల సంతలు, గోమాంస విక్రయాలపై నియంత్రణ కోసమేనని కొనుగోలు, అమ్మకంపై ఆంక్షలు విధించామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. జిల్లా స్థాయిలో పశువుల సంతల పర్యవేక్షణ కమిటీలు, స్థానిక పశువుల సంతల కమిటీల కోసమే ఈ నిబంధనలు జారీ చేశామని, అయితే పశువుల్ని కబేళాలకు తరలించేందుకు తీసుకురాలేదని కొనుగోలు, అమ్మకందారుల హామీ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ నియంత్రణను, జంతుహింస నియంత్రణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే ఈ నిబంధనలు జారీచేశామని చెప్పారు. -
దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పశువధపై సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న వేళ మోదీ సర్కారు మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా పశువధను నిషేధిస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం ఓ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే పశువులపై హింస నిరోధక చట్టంలోనూ సవరణలతో పాటు ప్రతి మార్కెట్ యార్డ్లో పశు మార్కెట్ కమిటీలు ఏర్పాటుకు ఆదేశించింది. ఈ పశువధ నిషేధ జాబితాలో ఆవులు, ఎద్దులు, దున్నలు, ఒంటెలు ఉన్నాయి. ఏటా భారత్ నుంచి ఎగుమతి అవుతున్న పశుమాంసం విలువ అక్షరాల రూ.లక్ష కోట్లు. అలాగే ఎగుమతి అవుతున్న మాంసంలో 90శాతం మార్కెట్లలో కొన్న పశువుల నుంచే. దేశంలో అతి పెద్ద పశుమాంసం ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా కాగా తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కాగా కేంద్రం తాజా నిర్ణయంతో పశు మాంసం ఎగుమతి, లెదర్ మార్కెట్పై భారీ ప్రభావం చూపనుంది. సాధారణంగా వ్యవసాయానికి పనికిరాని పశువులతో పాటు, ఒట్టిపోయిన పశువులను రైతులు కబేళాలకు విక్రయిస్తుంటారు. అయితే తాజా నిర్ణయంతో పశువులను కబేళాలకు విక్రయించడానికి వీల్లేదు. మరో మూడు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అమల్లోకి రానుంది. అయితే ఈ మూడు నెలల్లో పశువులున్న అందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయనున్నారు. అలాగే పశువును కొనాలంటే స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి అనుమతి తప్పనిసరి కానుంది. అంతేకాకుండా కబేళాకు విక్రయించబోమని లేదా వాటిని ఏ మత విశ్వాసాలకు అనుగుణంగా బలి ఇవ్వబోనన్న కొనేవారు లిఖితపూర్వక హామీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గోశాలలు, ఇతర పశుసంరక్షణ శాలలు తమ దగ్గర ఉన్న పశువులను దత్తతకు ఇచ్చే ముందు కూడా వాటిని పశువధ శాలలకు అమ్మడం లేదని రాసివ్వాల్సి ఉంటుంది. మరోవైపు వెటర్నరీ అధికారులు ఈ మూడు నెలల్లో ప్రతి పశువుకు మార్కింగ్ చేయనున్నారు. -
దేశవ్యాప్తంగా పశువధపై నిషేధం