challenger trophy
-
త్రిష ఆల్రౌండ్ షో
డెహ్రాడూన్: జాతీయ సీనియర్ చాలెంజర్ ట్రోఫీలో తెలంగాణ ఆల్రౌండర్ గొంగడి త్రిష (137 బంతుల్లో 93; 15 ఫోర్లు, 1 సిక్స్) సత్తా చాటింది. టీమ్ ‘డి’కి ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిష... టీమ్ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఎర్రబంతితో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ మ్యాచ్లో బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ‘డి’ 99 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. త్రిష త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... ధారా గుజ్జర్ (212 బంతుల్లో 103 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగింది. కెప్టెన్ స్నేహ్ రాణా (28; 3 ఫోర్లు), నందిని (32; 5 ఫోర్లు), అమన్జ్యోత్ కౌర్ (34 బంతుల్లో 39 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. అంతకుముందు టీమ్ ‘సి’ 405/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. హసబ్నిస్ (185 బంతుల్లో 169; 20 ఫోర్లు, 6 సిక్స్లు), షఫాలీ వర్మ (104 బంతుల్లో 108; 19 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కారు. టీమ్ ‘డి’ బౌలరల్లో త్రిష, కాశ్వీ గౌతమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... ప్రస్తుతం చేతిలో 5 వికెట్లు ఉన్న టీమ్ ‘డి’... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. ధారా గుజ్జర్తో పాటు అమన్జ్యోత్ కౌర్ క్రీజులో ఉంది. -
గొంగడి త్రిషకు చోటు
న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ మహిళల చాలెంజర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం జట్లను ప్రకటించింది. డెహ్రాడూన్ వేదికగా ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. మూడు రోజుల ఫార్మాట్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తుండగా, ఇందులో 4 జట్లు పాల్గొంటున్నాయి. స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఈ టోర్నీనకి దూరం కాగా... యంగ్ ప్లేయర్లకు అవకాశం దక్కింది. ‘సీనియర్ మహిళల మల్టీ డే చాలెంజర్ ట్రోఫీ కోసం మహిళల సెలెక్షన్ కమిటీ 4 జట్లను ఎంపిక చేసింది. ఎర్రబంతితో జరగనున్న ఈ టోర్నీని డెహ్రాడూన్లోని రెండు వేదికల్లో నిర్వహిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. మిన్ను మణి, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, స్నేహ్ రాణా నాలుగు జట్లకు సారథ్యం వహించనుండగా... భారత మహిళల అండర్–19 జట్టుకు రెండోసారి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఆల్రౌండర్ గొంగడి త్రిషకు టీమ్ ‘డి’లో చోటు దక్కింది. జట్ల వివరాలు టీమ్ ‘ఎ’: మిన్ను మణి (కెప్టెన్), రిచాఘోష్, శిప్రా గిరి, సుభ సతీశ్, శ్వేతా షెహ్రావత్, వృందా దినేశ్, ముక్తా మగ్రే, హెన్రిట్టా పెరీరా, తనూజ కన్వర్, వాసవి పావని, ప్రియా మిశ్రా, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, అనాడీ తగ్డే, ప్రగతి సింగ్. టీమ్ ‘బి’: హర్లీన్ డియోల్ (కెప్టెన్), యస్తిక భాటియా, మమత, ప్రతీక రావల్, ఆయుశ్ సోని, ఆరుశీ గోయల్, కనిక అహూజ, మితా పాల్, శ్రీ చరణి, మమత పాస్వాన్, ప్రేమ రావత్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అక్షర, టిటాస్ సాధు. టీమ్ ‘సి’: జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), ఉమా ఛెత్రి, రియా చౌదరి, షఫాలీ వర్మ, త్రిప్తి సింగ్, తనుశ్రీ సర్కార్, తేజల్ హసబ్నిస్, సుశ్రీ దివ్యదర్శిని, సుచి ఉపాధ్యాయ, రాజేశ్వరి గైక్వాడ్, శరణ్య గద్వాల్, జోషిత, శబ్నమ్, సైమా ఠాకూర్, గరిమా యాదవ్. టీమ్ ‘డి’: స్నేహ్ రాణా (కెప్టెన్), నందిని కశ్యప్, శివంగి యాదవ్, గొంగడి త్రిష, జిన్సీ జార్జ్, రాఘవి, ధార గుజ్జర్, సంస్కృతి గుప్తా, యమున రాణా, వైష్ణవి శర్మ, కీర్తన, అమన్జ్యోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, మనాలీ దక్షిణి, మోనిక పటేల్. -
భారత జట్లలో కల్పన, అంజలి, అరుంధతి
ముంబై: సీనియర్ మహిళల టి20 చాలెంజర్ ట్రోఫీలో పాల్గొనే భారత ‘ఎ’... ‘బి’... ‘సి’ జట్లను సోమవారం ప్రకటించారు. ఈ టోర్నీ జనవరి 4 నుంచి 11 వరకు కటక్లో జరుగుతుంది. భారత ‘బి’ జట్టులో ఆంధ్ర అమ్మాయిలు రావి కల్పన, అంజలి శర్వాణిలకు స్థానం లభించగా... భారత ‘సి’ జట్టులో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి ఎంపికైంది. భారత ‘ఎ’ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్... ‘బి’ జట్టుకు స్మృతి మంధాన... ‘సి’ జట్టుకు వేద కృష్ణమూర్తి సారథ్యం వహిస్తారు. -
యువీకి అవకాశం దక్కేనా!
చెన్నై: జట్టులో స్థానం కోల్పోయాక... ఫ్రాన్స్ వెళ్లి ఫిట్నెస్ శిక్షణ తీసుకున్న యువరాజ్ సింగ్... ఆ తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున, చాలెంజర్ ట్రోఫీలో ‘బ్లూ’ జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. తిరిగి టీమిండియా జట్టులోకి ఎంపిక కావడమే లక్ష్యంగా పోరాడాడు. మరి యువీ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో సోమవారం తేలనుంది. ఆస్ట్రేలియాతో ఏకైక టి20, తొలి మూడు వన్డేల కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు నేడు సెలక్టర్లు సమావేశం కానున్నారు. జింబాబ్వే పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకున్న ధోని, ఇతర క్రికెటర్లు మళ్లీ జట్టులోకి రానున్నారు. సెహ్వాగ్, గంభీర్, జహీర్లకు మరోసారి మొండిచెయ్యి తప్పకపోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో మార్పులు లేకుండా, అదనంగా యువరాజ్ ఒక్కడిని జట్టుతో చేర్చే అవకాశం ఉంది. ఒకవేళ 16 మంది కాకుండా... 15 మందితోనే జట్టును ఎంపిక చేస్తే యువరాజ్ కోసం... మురళీ విజయ్, దినేశ్ కార్తీక్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. ఇర్ఫాన్ పఠాన్ గాయం కారణంగా అందుబాటులో లేని కారణంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోటాలో అభిషేక్ నాయర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
చాలెంజర్ ట్రోఫీ విజేత ‘బ్లూ’
ఇండోర్: భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి లభించిన సువర్ణావకాశాన్ని గంభీర్, సెహ్వాగ్ వృథా చేసుకున్నారు. చాలెంజర్ ట్రోఫీలో పేలవ ఆటతీరుతో విఫలమయ్యారు. మరోవైపు యువరాజ్ సింగ్ కూడా నిరాశపరిచినా... ఇండియా బ్లూ జట్టు చాలెంజర్ ట్రోఫీని గెలుచుకుంది. భువనేశ్వర్ కుమార్ (4/39) ప్రతిభతో ఆదివారం జరిగిన ఫైనల్లో బ్లూ జట్టు 50 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్లూ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మనీష్ పాండే (78 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. హైదరాబాదీ ఆటగాడు అక్షత్ రెడ్డి (22), కెప్టెన్ యువరాజ్ సింగ్ (29) విఫలమయ్యారు. ఢిల్లీ జట్టు 44.4 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. గంభీర్ (4), ఉన్ముక్త్ చంద్ (6), విరాట్ కోహ్లి (23), సెహ్వాగ్ (5) విఫలం కావడంతో... 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇక కోలుకోలేకపోయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు.