coal project
-
ఆస్ట్రేలియాలో ‘అదానీ’కి ఎదురుదెబ్బ
బొగ్గు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను కొట్టివేసిన కోర్టు మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో తలపెట్టిన కార్మైఖేల్ బొగ్గు గనుల ప్రాజెక్టు విషయంలో మైనింగ్ దిగ్గజం అదాని గ్రూప్నకు ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఈ ప్రాజెక్టుకు లభించిన పర్యావరణ అనుమతులను ఆస్ట్రేలియా కోర్టు పక్కన పెట్టింది. దాదాపు 16.5 బిలియన్ డాలర్ల ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు, స్థానికులు కేసు దాఖలు చేయడంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గెలిలీ బేసిన్లోని అరుదైన జీవజాలం యకా స్కింక్, ఆర్నమెంటల్ స్నేక్లకు ఈ ప్రాజెక్టుతో హాని కలుగుతుందన్న విషయాన్ని పర్యావరణ మంత్రి గ్రెగ్ హంట్ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు ఆరోపించారు. దీనికి ఇచ్చిన అనుమతులకు చట్టబద్ధత లేదన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్టుకు అనుమతులను మంత్రి పునఃసమీక్షించాల్సి ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సూ హిగిన్సన్ పేర్కొన్నారు. మరోవైపు, ఇది చట్టపరమైన సాంకేతిక సమస్య మాత్రమేనని, త్వరలోనే పరిష్కారం కాగలదని అదాని గ్రూప్ తెలిపింది. అటు ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్తో చేతులు కలిపినట్లు వస్తున్న వార్తల దరిమిలా అదాని గ్రూప్ షేరు వరుసగా రెండో రోజూ పెరిగింది. బుధవారం బీఎస్ఈలో సుమారు 5 శాతం పెరిగి రూ. 98.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9.11 శాతం ఎగిసి రూ. 103 స్థాయిని కూడా తాకింది. -
మోదీ ఆప్తుడికి చుక్కెదురు
సిడ్నీ: ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన భారత పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీకి ఆస్ట్రేలియాలో చుక్కెదురైంది. క్వీన్స్లాండ్స్లోని క్లర్మాంట్కు సమీపంలో ఆయన కంపెనీ ప్రారంభించిన భారీ బొగ్గు వెలికితీత ప్రాజెక్టును స్థానిక కోర్టు తాత్కాలికంగా నిషేధించింది. అదానీ సంస్థ నిర్వహిస్తున్న పనులు.. జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయన్న పర్యావరణవేత్తల వాదనతో కోర్టు ఏకీభవించింది. పూర్తి వివరాలు.. కార్మిచాయెల్ కోల్మైన్, రైల్ అండ్ పోర్ట్ ప్రాజెక్టు పేరుతో ఉత్తర గెలిలీ బేసిన్ (క్వీన్స్లాండ్ రాష్ట్రం)లో అదానీ గ్రూపు భారీ ప్రాజెక్టును చేపట్టింది. 12.2 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు ఆస్ట్రేలియా చరిత్రలో అతి పెద్ద కోల్ మైన్ ప్రాజెక్టు కావడం విశేషం. బేసిన్ చూట్టూరా దాదాపు 160 నుంచి 400 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును విస్తరిస్తారు. అయితే సరిగ్గా అదే ప్రాంతం ప్రపంచంలోనే అరుదైన జీవవైవిధ్యం కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా పేరుపొందింది. కానీ ఎలాగోలా అనుమతులు వచ్చాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాగా, మొదటినుంచి ఈ ప్రాజెక్టును జీవనాశినిగా పేర్కొంటున్న పర్యావరణ వేత్తలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. వీరి ఆందోళనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించారు. నిజానికి కోర్టు కూడా ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపకపోయినప్పటికీ జీవవైవిధ్యం విషయంలో మాత్రం స్పందించింది. పర్యావరణ పరిరక్షకు తగిన చర్యలు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని, అప్పటివరకు అదానీ గ్రూప్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం తీర్పు వెలువరించింది. ఆరువారాల వ్యవధిలోగా పర్యావరణహిత కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.