ప్రొఫెసర్ సాంబరెడ్డికి తెలంగాణ సైన్స్ ఎక్సలెన్స్ పురస్కారం
హ్యూస్టన్ : అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలంగాణ మహాసభల్లో ప్రొఫెసర్ దూదిపాల సాంబ రెడ్డికి ప్రతిష్టాత్మక 'తెలంగాణ సైన్స్ ఎక్సలెన్స్ పురష్కారం' ప్రదానం చేశారు. అమెరికాలో హ్యూస్టన్ మహానగరంలో జూన్ 29 నుండి జులై 2 వరకు జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో జరగిన ద్వితీయ తెలంగాణ ప్రపంచ మహాసభలల్లో టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. సాంబ రెడ్డిని 'తెలంగాణ మహాసభల' బృందం తెలుగు సంప్రదాయాలతో ఘనంగా సత్కరించింది.
శాస్త్ర సాంకేతిక రంగంలో నిస్వార్ధంగా గత 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్ సాంబ రెడ్డి చేసిన పరిశోధనలకు, సేవ నిరతకు గుర్తింపుగా ఈ విశిష్ట పురష్కారాన్ని ఇస్తున్నట్లు మహాసభల నాయకత్వ బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని పాల పిట్ట సావెనీర్లో కూడా విడుదల చేశారు. వేల మందితో కిక్కిరిసిన ఈ మహాసభలకు అమెరికా అన్ని రాష్ట్రాలనుండి తెలుగు ప్రవాసులు, ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్తో పాటు ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చారు. తెలంగాణ మహాసభల ఎగ్జిక్యూటివ్, కన్వెన్షన్ బృంద నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగిన ప్రారంభ డిన్నర్ వేడుక సభలో మఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ జితేందర్ రెడ్డి, సత్కారాన్ని డా. సాంబ రెడ్డికి అందజేశారు. 'తెలంగాణ సైన్స్ పురస్కారం' ఇంతచిన్న వయసులోనే అందుకోవడం అదృష్టంగా భావిన్నాను. ఒక తెలంగాణ బిడ్డగా ఇంతటి గౌరవవం నాకు ఇవ్వడానికి సహకరించిన వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ముందుముందు మరెన్నో శాస్త్ర విజయాలు సాధించి తెలంగాణ గడ్డకి, మనభారతీయులందరి కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా నావంతు కృషి చేస్తా. ఈ అవార్డును నా మాతృ మూర్తుల జ్ఞాపకంగా వారికీ అంకితం చేస్తున్నా' అని డా. సాంబ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా తెలంగాణ మహాసభల ఆర్గనైజర్లు కరుణాకర్ మాధవారపు (చైర్మన్), సత్యనారాయణ రెడ్డి కందిమల్ల (ప్రెసిడెంట్), శ్రీధర్ కాంచనకుంట్ల (డైరెక్టర్), వినోద్ కుకునూర్ (ప్రెసిడెంట్-ఎలెక్ట్), బంగారెడ్డి ఆలూరి (కన్వీనర్), జగపతి రెడ్డి వీరటి (కోఆర్డినేటర్), డా. రాజేందర్ అపారసు (అవార్డు చైర్), బోర్డు మెంబర్లు, కన్వెన్షన్ సభ్యులు, కన్వెన్షన్ కమిటి చైర్మన్లు, తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హ్యూస్టన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ హ్యూస్టన్ సభ్యులలతోపాటూ పలువురు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో డా. సాంబ రెడ్డి జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో ఆరు బంగారు పతకాలతో పట్ట భద్రులయ్యారు. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీలో పీహెడీ చేసి, అత్యధిక శాస్త్ర అధ్యయనాలు ప్రచురించి లింకా రికార్డు సృష్టించారు. అయన కనిపెట్టిన ఎన్నో ఫార్మసిటికల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిపొందాయి. డా. సాంబ రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎమ్ విశ్వవిద్యాలయం వైద్య శాస్త్ర ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. అమెరికాలోని అత్యంత ప్రసిద్ధిచెందిన శాస్త్ర సంస్థలైన ఏఏఏఎస్ (అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ సైన్స్), ఏఏపీఎస్ (అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫార్మాస్యూటికల్ సొసైటీ), ఏఈఎస్ (అమెరికన్ ఎపిలెప్సీ సొసైటీ ) నుంచి "ఫెల్లో" (శాశ్వత సభ్యత్వము) అనే అతి కొద్దీ శాస్త్రవేత్తలకిచ్చే ముఖ్యమైన పురస్కారాలు అందుకున్న మొట్ట మొదటి తెలుగు భారతీయుడు. ఫార్మసీ మెడికల్ రంగాల్లో 180 పేపర్స్, డజన్ కు పైగా మెడికల్ పుస్తకాలు రచించిన ఆయన ఇంటెర్నేషనల్ సైన్స్ పండిత డాక్టర్లలో ఒక అసామాన్యుడుగా ప్రసిద్ధి పొందారు. ఆయన గత 24 సంవత్సరాల నుండి మెదడు జబ్బులపై అధ్యాయనం చేస్తున్నారు. ఫీట్స్ వ్యాధికి ఓ మెడిసిన్ కూడా కనిపెట్టారు. మెదడులోని ఉత్ప్రేరకాలు, సరఫరా వ్యవస్థ విధానంలో ఎన్నో పరిశోధనలు చేసి, ఎపిలెప్సీ రోగ నిర్మూలనం కోసం 'న్యూరో కోడ్' కనిపెట్టి చరిత్ర సృష్టించారు. మెదడు దెబ్బల నుంచి న్యూరోలాజికల్ జబ్బులు రాకుండా ఒక కొత్త 'ఏపిజెనెటిక్' చికిత్స విధానాన్నిఇటీవలే ప్రకటించారు. ఈ మెడికల్ విధానాలు విశ్వవ్యాప్తంగా ఎన్నో వేల మంది న్యూరోలాజికల్ రోగులకు ఉపయోగపడుతున్నాయి. ఫిట్స్, తల దెబ్బలు, న్యూరోటాక్సిసిటీ, ఇతర మెదడు జబ్బులకు కొత్త మందులు కనిపెట్టి న్యూరోలాజికల్ రోగులకు అధునాతన చికిత్స అందిస్తూ, వారి జబ్బుల నియంత్రణకు సహాయం చేయడమే తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు.
2012, 2013, 2014 లో వరుసగా అమెరికాలోని ప్రముఖ తెలుగు అసోసియేషన్స్ 'నాటా', 'తానా', 'ఆటా' సంస్థల నుంచి రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డు సాధించి, హ్యాట్రిక్ సృష్టించిన ఏకైక తెలుగు ప్రవాస భారతీయుడిగా నిలిచారు. శాస్త్రవేత్తగా బిజీగా ఉంటూనే సామజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు.