కరువును కూడా హెలికాప్టర్ల లోంచి చూస్తారట
నాలుగు రోజుల్లోనే కరువును జయించామని చెబుతున్నారు
కరువు వచ్చినట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరూ చెప్పలేదట
మీ కంప్యూటర్లు పనిచేయడం లేదా, కోర్ డాష్బోర్డు ఏమైంది
కంప్యూటర్లను నొక్కడానికి మీకు చేతులు రావడం లేదా
కరువు కోరల్లో అనంతపురం.. 5 లక్షల మంది వలసలు
కరువు నివారణ చర్యలు చేపట్టడంలో చంద్రబాబు విఫలం
అనంతపురం రైతు మహాధర్నాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అనంతపురం
నాలుగు రోజుల్లోనే అనంతపురం జిల్లాలో కరువును జయించేసినట్లు చంద్రబాబు ప్రకటించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరవును కూడా హెలికాప్టర్ల లోంచి చూసిన ముఖ్యమంత్రి మన ఖర్మ కొద్దీ ఈయనొక్కరేనని విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహా రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
మిట్ట మధ్యాహ్నం, ఎండలు కూడా తీక్షణంగా ఉన్నాయి
కరవుతో కడుపు కాలుతోంది.. అయినా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ సాకులు వెతుక్కోవట్లేదు
మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆత్మీయతకు ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను
కరువు తాండవిస్తోంది.. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు
మరో 3 లక్షల ఎకరాలు మిగిలిన పంటలు వేశారు
వేరుశనగ పంటలో 90 శాతం ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది
రాయలసీమ నాలుగు జిల్లాల్లో దాదాపు 21.50లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారు
17 లక్షలకు పైగా ఎకరాల్లో పంట ఎండిపోయింది
జూన్లో వర్షాలు పడ్డాయి కాబట్టి ఈసారైనా బయట పడగలమని అనుకున్నాం
అందుకే మామూలు కన్నా ఎక్కువగా ఈసారి పంట వేశాం
జూలైలో చాలీచాలని వర్షాలు పడ్డాయి. అక్కడి నుంచి ఆగస్టు చివరివరకు ఒక్క బొట్టు కూడా వర్షం పడలేదు
వేరుశనగ ఊటలు దిగినప్పుడు వర్షాలు పడితే తప్ప వేరుశనగ బతకదు
దాంతో 90 శాతం పంట నష్టపోవాల్సి వచ్చింది
ఇంతటి దారుణంగా పరిస్థితులుంటే చంద్రబాబు ఆగస్టు 28న పుట్టపర్తి, కదిరి వచ్చారు
కరువుందా.. నాకు తెలీదే, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరూ చెప్పలేదని అంటారు
మామూలుగా అయితే తనకు కంప్యూటర్ ఉందని, అందులో ఒక బటన్ నొక్కితే కోర్ డాష్ బోర్డులో ప్రతిరోజూ ఎక్కడ ఎంత వర్షం పడిందో కూడా తనకు తెలుస్తుందని ఊదరగొడతాడు
నీ కోర్ డాష్ బోర్డు పనిచేయడం లేదా, కంప్యూటర్లు పనిచేయడం లేదా.. వాటిని నొక్కడానికి నీ చేతులు రావట్లేదా
ఆగస్టు 6, 15 తేదీలలో కూడా ఆయన మన జిల్లాకు వచ్చి రెండు మీటింగులు పెట్టాడు
ఒక్క ఎకరా పంట కూడా ఎండనివ్వబోనని ఆయన అన్నాడు
మళ్లీ తర్వాత కరువు ఉందని ఎవరూ తనకు చెప్పలేదని అంటాడు
వెంటనే ఆయన రెయిన్ గన్ పేరుతో ఒక సినిమా తీయడం మొదలుపెట్టాడు
ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి వరకు నాలుగు రోజుల్లో కరువును జయించేశాం అన్నాడు
కరువును తరిమికొట్టేశాం అని కూడా చెప్పాడు
4 లక్షల ఎకరాలకు నాలుగు రోజుల్లో రెయిన్గన్లతో నీరిచ్చామని చంద్రబాబు అంటాడు
నోరు తెరిస్తే ఇంత అబద్ధాలు ఆడుతున్న ఈ వ్యక్తికి నిజంగా రెయిన్ గన్ అంటే ఏంటో తెలుసా అని అనుమానం వచ్చింది
ఎందుకంటే రెయిన్ గన్లు ఇప్పుడు ఈయన కొత్తగా కనిపెట్టినవి కావు.. ఎప్పటినుంచో ఉన్నాయి
ఒక ఎకరాకు 25 వేల లీటర్ల ట్యాంకరుతో ఒకసారి రెయిన్ గన్తో తడిపితే.. 5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అవుతుంది
అది పడిపోయిన పేషెంటుకు కేవలం వెంటిలేటర్ పెట్టినట్లు మాత్రమే అవుతుంది
కనీసం 28 మిల్లీమీటర్ల తడి ఉంటే దాన్ని పదును అని గ్రామీణ భాషలో అంటారు
గ్రామాల్లో ఉన్నవన్నీ 4వేలు, 5 వేల లీటర్ల ట్యాంకర్లే ఉన్నాయి
ఎకరాకు కనీసం 25 నుంచి 30 ట్యాంకర్లతో నీళ్లిస్తే పదును అంటారు
చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 4 రోజుల్లో 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడట
అంటే 25 నుంచి 30 లక్షల ట్యాంకర్లతో నీళ్లు ఇచ్చినట్లు చెప్పాడు
మన అనంతపురం కాదు కదా.. పక్కన తమిళనాడు, కర్ణాటక కలుపుకొన్నా కూడా ఇన్ని ట్యాంకర్లు లేవు
ఆ సంగతి మీకు, నాకు అందరికీ తెలుసు
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువై, సిగ్గు లేకుండా నాలుగు రోజుల్లో నాలుగు లక్షల ఎకరాలు కాపాడానని చెబుతారు
రాయచోటి నియోజకవర్గం మాధవరంలో రమణయ్య అనే టీడీపీ మాజీ సర్పంచి పొలంలో రెయిన్ గన్ను చంద్రబాబు ప్రారంభించారు
అదే పొలం ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి ఉంది.
జిల్లాకు వచ్చేటపుడు ప్రతి ఎకరాలోనూ ఇదే పరిస్థితి.. పంటలు ఎండిపోయాయి
అయినా చంద్రబాబుకు మాత్రం ఈ జిల్లాలో కరువు కనిపించదు, ఆయనకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి అంతకన్నా కనపడదు
4 లక్షల ఎకరాలను కాపాడారని, అందువల్ల 59 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కాపాడామని ప్రత్తిపాటి పుల్లారావు అంటారు
ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికే ఆ డ్రామాలు ఆడుతున్నారా అని అడుగుతున్నా
సెప్టెంబర్ 21న కొల్లు రవీంద్ర మన జిల్లాకు వచ్చి.. ప్రెస్ మీట్ పెడతారు
జిల్లాలో 90 శాతం పంట ఎండిపోయిన విషయాన్ని తాను ఆమోదిస్తున్నానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అంటాడు
మంత్రులు చెప్పినట్లు 90 శాతం పంట ఎండిన విషయం నిజమా.. పంటలు కాపాడిన విషయం నిజమా
ఈ జిల్లాలో 25 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది
నెల్లూరులో 52 శాతం, చిత్తూరులో 23 శాతం తక్కువ వర్షపాతం ఉంది. దాదాపుగా రాష్ట్రంలో 250 మండలాల్లో కరువు తాండవిస్తోంది
కరువు రావడం ఎవరి చేతుల్లోనూ ఉండదు.. కానీ కరువు వచ్చినపుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా స్పందించాలో సీఎం చేతుల్లోనే ఉంటుంది
ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. గతంలో కరువు వచ్చినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా పట్టించుకున్నారో గుర్తుతెచ్చుకోండి
జిల్లాలో చంద్రబాబు పుణ్యాన రైతులంతా అలమటించి ఆత్మహత్యలు చేసుకునేవారు
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు పోవాలంటే తానేం చేయాలి, కేంద్రం చేత ఏం చేయించాలని ఆలోచనలు చేశారు
ఆ ఆలోచనల నుంచి పుట్టిన తొలి సంతకమే.. ఉచిత విద్యుత్
బోరు వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతులకు అది తోడుగా నిలబడింది
తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తోచలేదు, పైగా రైతులను పోలీసు స్టేషన్లలో పెట్టారు
వైఎస్ రాజశేఖరరెడ్డి 1100 కోట్ల రైతుల విద్యుత్ బకాయిలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు
అంతటితో ఆగకుండా.. కేంద్రం దగ్గరకు వెళ్లి ఇక్కడ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో జయతి ఘోష్ నివేదిక చూపించారు
రైతు ఆత్మహత్యలను నివారించడానికి ఒక విధానం రూపొందించాలని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు
చంద్రబాబు మాదిరిగా అర్జీ ఇచ్చి ఊరుకోలేదు.. కేంద్రం మీద ఒత్తిడి తేవడంతో కేంద్రం ఒక కమిటీని నియమించింది
రాష్ట్రంలోనే కాక దేశంలో 2001 నుంచి 2004 వరకు కరువు వల్ల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని అధ్యయనం చేసింది
దేశం మొత్తమ్మీద 31 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని కేంద్రం ఆమోదించింది. వాటిలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 16 జిల్లాలు వచ్చాయి
ఆ ప్యాకేజి వచ్చి తర్వాత ఏళ్ల తరబడి రైతులంతా కట్టాల్సిన వడ్డీలను పూర్తిగా మాఫీ చేశారు
దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు రుణాలు రెన్యువల్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది
అందరికీ మళ్లీ కొత్త రుణాలివ్వాలని రాజశేఖరరెడ్డి కృషివల్ల కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
కరువు శాశ్వతంగా పోవాలంటే పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని హంద్రీ నీవా, గాలేరు నగరి, వెలిగొండ, పోలవరం లాంటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు
తొమ్మిదేళ్లలో హంద్రీ నీవాకు 13 కోట్లు, గాలేరు నగరికి 17 కోట్లు, వెలిగొండ ప్రాజెక్టు మీద 13.5 కోట్లు, పులిచింతల మీద కేవలం 24 కోట్లు ఖర్చుపెట్టారు. ఇక పోలవరం ప్రాజెక్టు మీద కేవలం 7 కోట్లు ఖర్చుపెట్టాడు.
ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ దాదాపు 80 శాతం వరకు పూర్తయ్యాయంటే అది రాజశేఖరరెడ్డి చలవే
కరువు వచ్చినపుడు రైతులకు తోడుగా ఉండాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచించాలి
కనీస మద్దతు ధర ఉంటేనే రైతు తన కాళ్ల మీద నిలబడగలడని ఆలోచించి అమలుచేశారు. వరి మద్దతు ధర 1030కి వెళ్లింది
ఐదేళ్లలో విత్తనాల ధరలను నేలకు తెచ్చారు
పత్తి విత్తనాలు రేట్లు 1800 నుంచి 650 రూపాయలకు తగ్గించారు
రైతులకు తోడుగా ఉండాలంటే కరువు వచ్చినపుడు ఇన్పుట్ సబ్సిడీ, పంటబీమా ఉండాలని తలపెట్టి అవన్నీ ఇచ్చి రైతులను ఆదుకున్నారు
కరువు వచ్చినపుడు తినడానికి తిండి ఉండదు కాబట్టి జనం వలసలు వెళ్లే పరిస్థితి ఉంటుంది. అనంతపురం జిల్లా నుంచి దాదాపు 5 లక్షల మంది వలస వెళ్తారు
దాన్ని నివారించడానికి ఉపాధి హామీ పథకంలో 90 శాతం కూలీల కాంపొనెంట్ పెట్టారు
ఇప్పుడు ఆ పథకం అంతా సిమెంటు రోడ్ల నిర్మాణం లాంటి పనులు చేస్తున్నారు.. దాంతో వలసలు మళ్లీ మొదలయ్యాయి
ఇప్పుడు కరువు వరుసగా వచ్చింది. మూడో సంవత్సరం కూడా వచ్చింది. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారో చూడాలి
కరువొస్తే కనీసం ఆ విషయాన్ని గుర్తించి, ఒప్పుకొని రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటబీమా ఇవ్వాలని ఆలోచించాల్సి ఉండగా.. కరువు వచ్చినట్లే తనకు తెలియదని, చెప్పలేదని అంటారు
పైగా ఇదే చంద్రబాబు.. నాలుగు రోజుల్లోనే కరువును జయించేశామని ప్రకటనలు ఇచ్చేస్తాడు
ముఖ్యమంత్రుల మధ్య తేడా ఏంటో ఇక్కడే అర్థమవుతుంది
చంద్రబాబు 2013-14లో ఎన్నికల ప్రచారంలో కరువు గురించి ఊదరగొట్టాడు
సీఎం అయిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా ఎగనామం పెట్టాడు
కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లను కూడా వేరేవాటికి వాడుకున్నాడు
2014-15లో 692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని కూడా కొంతవరకు ఎగ్గొట్టాడు
రైతుల నోట్లో పూర్తిగా మట్టికొట్టాడు
కనీసం తగ్గించిన దాన్నయినా ఇచ్చాడా అంటే అదీలేదు..
కరువు, తుఫాను వచ్చి రైతులు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ తగ్గించి లెక్కలు కట్టాడు
ఇంతవరకు 990 కోట్ల ఇన్పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు
ఆయన ముఖ్యమంత్రి అయ్యి రెండున్నరేళ్లయింది. ఈ రెండున్నరేళ్లలో ఒక్కసారైనా క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చిందా
ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే, రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ఎగువన తెలంగాణ రాష్ట్రం కృష్ణా నుంచి పాలమూరు - రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకెళ్లిపోతుంటే అడిగే పరిస్థితి లేదు
గోదావరి మీద కూడా కేసీఆర్ దాదాపు69వేల క్యూసెక్కులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో తన్నుకుపోతున్నా అడిగే పరిస్థితి లేదు
వర్షం వల్ల శనగకాయ పండకపోవడం ఒక ఖర్మయితే, నకిలీ విత్తనాలతో పండకపోవడం మరో ఖర్మ
వేరుశనగతో పాటు పత్తి, మిరప అన్నింటిలోనూ నకిలీ విత్తనాలే
కరువుతో 5 లక్షల మంది వలసలు పోతుంటే, ఉపాధి హామీ సొమ్ములో 97 శాతం కూలీలకు కేటాయించాల్సిన వ్యక్తి.. ఆ డబ్బును కూడా మళ్లిస్తున్నారు
మొన్ననే ఖరీఫ్లో కర్నూలులో ఉల్లి చవగ్గా అమ్మలేమని రైతులు రోడ్లమీద పారేసి వెళ్తుంటే.. ఆ రైతులను పోలీసులతో కొట్టించాడు
ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్నమాటలు గుర్తుతెచ్చుకోవాలి
బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు.. మరి ఆ బంగారం వచ్చిందా?
పైగా.. ఆ వేలాన్ని వేలం వేస్తున్నారు..దాంతో ఆ బంగారాన్ని విడిపించుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు
రైతు రుణాలన్నింటినీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు.. మరి రుణమాఫీతో కనీసం మీ వడ్డీలైనా తీరాయా.. జరగలేదు
ఎన్నికల్లో చెప్పిన హామీలను కూడా రెండున్నరేళ్లలో ఆయన నెరవేర్చలేదు
2015లో ఖరీఫ్ నుంచి హంద్రీనీవా నీరు ఇస్తామని చెప్పావా లేదా, పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పారా లేదా
శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. 870 అడుగులకు పైగా నీళ్లున్నాయి. ప్రకాశం బ్యారేజి నుంచి కూడా 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైన విషయం వాస్తవమా కాదా?
శ్రీశైలంలో నీళ్లుండగా హంద్రీ నీవాకు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదు, మెయిన్ కెనాల్ ఉన్నా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు
ఎందుకు చేయలేకున్నాడంటే.. అందుకు హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలి
6 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలంటే మహా అయితే వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చవుతుంది
దీనిపై దృష్టిపెట్టకుండా కమీషన్ల మీదే దృష్టిపెడుతున్నారు
రైతులకు తోడుగా ఉండాలని, అండగా ఉండాలని, రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు కనీసం 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలని, డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ డిమాండు లేఖను కలెక్టర్కు ఇస్తాం
ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి కరువును చూస్తారని ఆశిస్తున్నాం.
కరువు వచ్చినపుడు పొలాల్లోకి వెళ్లాలి తప్ప ఏరియల్ సర్వేలు కావు
వరదలు వచ్చినపుడు హెలికాప్టర్లు ఎక్కడం చూశాము గానీ, మా ఖర్మకొద్దీ కరువును కూడా హెలికాప్టర్లలోంచి చూసింది ఈ చంద్రబాబు ఒక్కరినే
గట్టిగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం
ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, సెలవు తీసుకుంటున్నా